చిత్తజల్లు వరహాలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్తజల్లు వరహాలరావు

సి.వి. అనే పేరుతో ప్రసిద్ధి చెందిన చిత్తజల్లు వరహాలరావు తెలుగు హేతువాది 14.1.1930 /జనవరి 14 1930న గుంటూరు లో జన్మించారు. నాస్తికయుగం మాసపత్రిక సంపాదకవర్గ సభ్యుడుగా పనిచేశారు. ఈ నాస్తిక నాయకుడు మరణ పర్యంతం విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నారు. చిత్తజల్లు వరహాలరావు ఒక సాంఘిక విప్లవకారుడే కాదు. సాంస్కృతిక రథసారధి. నిజాలను నిగ్గు తేల్చిన నిత్య పరిశోధకుడు. శ్రీశ్రీ కవిత్వం యువతరం గుండెలను ఎలా ఉర్రూతలూగించిందో 'సివి' రచనలు విద్యార్థి, యువజనుల లోకపు మస్తిష్కాలకు పట్టిన ఛాందస భావాల దుమ్ము దులిపింది. వారిని అభ్యుదయం వైపు నడిపించింది. శాస్త్రీయ విజ్ఞానం ప్రజల్లో పెంపొందించడానికి ఆయన చేసిన కృషి అనితర సాధ్యం అంటే అందులో అతిశయోక్తి లేదు. మహాకవి శ్రీశ్రీకి ఏకలవ్య శిష్యుడు. ప్రగతిశీల సాంస్కృతిక జ్వాల.దిగంబర కవులకు మార్గదర్శి.సామాజిక విముక్తి జరగనిదే రాజకీయ విముక్తి అసాధ్యం అని చాటిచెప్పిన వైతాళికుడు.ఆధిపత్యాన్ని ప్రశ్నించి తెలుగు కవిత్వాన్ని శూద్రీకరించిన సాంఘిక విప్లవ కవి. 8.11.2017 న మరణించారు.

రాసిన పుస్తకాలు[మార్చు]

సి.వి.భావాలు[మార్చు]

  • మార్క్సిజం నన్ను మనిషిని చేసింది. గతితార్కిక చారిత్రక భౌతికవాదం ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి అవసరమైన ఒక చట్రాన్ని అందించింది. అంబేద్కర్‌ రచనలు భారత సామాజిక నిర్మాణాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకునేందుకు ఉపకరించాయి. కులం పునాదుల గురించిన అవగాహనను పెంచాయి. నిరంకుశంగా, నిరాటంకంగా కొనసాగుతూన్న అమానవీయ సంస్కృతికి సమాంతరంగా ఒక మానవీయ, ప్రజాస్వామిక పరంపర కొనసాగుతూ వస్తూందన్న వాస్తవాన్ని వివరించాయి. నన్ను నాస్తికుడుగా, హేతువాదిగా దిద్దితీర్చాయి. పెరియార్‌ రచనలు ఆర్యుల అసలు రూపాన్ని ఆవిష్కరించాయి. ద్రవిడ మూలాలను గురించిన చైతన్యాన్ని నాలో పెంచిపోషించాయి.
  • మహాప్రస్థానం నన్ను కవిని చేసింది. నేను శ్రీశ్రీకి ఏకలవ్య శిష్యుణ్ణి. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ. నాకు శ్రీశ్రీతో అనేక విషయాలలో భేదాభిప్రాయం కూడా వుంది. ఆది కాలంలో వేమన, మధ్యకాలంలో తిక్కన, ఆధునిక కాలంలో గురజాడ తన అభిమాన కవులని ప్రకటించాడు శ్రీశ్రీ. వేమన, గురజాడలు ఆయనతో పాటు నాకూ అభిమాన కవులే. అయితే తిక్కనను నేను ఆమోదించనుగాక ఆమోదించను.
  • అంబేద్కర్‌ రాసిన కులనిర్మూలన పుస్తకం చదివాను. ఆ పుస్తకం అనేక రోజులపాటు నాకు నిద్ర లేకుండా చేసింది. ప్రపంచ మానవాళి విముక్తి లక్ష్యంగా మార్క్స్‌, ఏంగెల్స్‌లు రాసిన కమ్యూనిస్టు మేనిఫెస్టోతో పోల్చదగిన పుస్తకం అది. అయితే దీని లక్ష్యం భారత దేశంలో కులనిర్మూలన. మొత్తంగా భారతీయ సమాజాన్ని కేన్సర్‌లా పట్టిపీడిస్తూన్న కులసమస్య బాల్యం నుంచే మానసికంగా నన్ను బాధిస్తూ వచ్చింది. కులసమస్య పరిష్కారం దిశగా తన జీవితాంతం నిజాయితీగా కృషి చేసిన మహామేధావిగా అంబేద్కర్‌ పట్ల నాకు అచంచలమైన గౌరవం వుంది. నేను డిగ్రీ చదువుకుంటూన్న రోజులలో అంబేద్కర్‌ రచనలను ఆమూలాగ్రం చదివాను, అధ్యయనం చేశాను.
  • ఆ రోజుల్లోనే నేను త్రిపురనేని రామస్వామి చౌదరి రచనలు కూడా చదివాను. కవిరాజురచనలు అసాధారణమైనవి. ఆయన తన జీవిత పర్యంతం అవిశ్రాంతంగా పని చేశాడు. ఏటికి ఎదురీదాడు. తమిళనాడులో పెరియార్‌ కూడా అంతే. ఇద్దరూ ఇద్దరే.దక్షిణ భారతదేశం యావత్తూ వీళ్ళిద్దరికీ శాశ్వతంగా రుణపడి వుంటుంది.త్రిపురనేని రచనలే నా ‘సత్యకామ జాబాలి’ కవితా కావ్యానికి ప్రధాన ప్రేరణ.
  • మార్క్స్‌ ఏంగెల్స్‌లు మానవజాతి భవిష్యత్‌ తరాల కోసం కలగన్న ఆదర్శ సమాజానికి పారిస్‌ కమ్యూన్‌ ఒక ప్రతిరూపం, ఒక నమూనా.
  • సమాజంలో విశృంఖల స్వైరవిహారం చేస్తూన్న మూఢవిశ్వాసాలు, దోపిడీ దౌర్జనాలు, ఆకలీ హాహాకారాలకు వ్యతిరేకంగా నిరంతరం రాయటమే పోరాటమని నమ్మి రచనారంగంలోకి దిగినవాణ్ణి.
  • భారతీయ సమాజం ఒక విచిత్రమైన సమాజం. ప్రధానంగా ఇది కులవర్గ సమాజం. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని కులవ్యవస్థ ఇక్కడ బలంగా పాతుకునిపోయివుంది. ఇది పరమ అప్రజాస్వామికమైన ఒక ఆధిపత్య వ్యవస్థ. సామాజిక విప్లవం అనేది జరగకుండా భారత దేశంలో రాజకీయ ఉద్యమం సత్ఫలితాలను ఇవ్వలేదు. మనదైన ఒక సాంస్కృతిక ఉద్యమం మన సమాజానికి ఒక తక్షణావసరం. ప్రపంచంలో సాంస్కృతికంగా విముక్తిని సాధించని ఏ జాతీ రాజకీయ విముక్తిని సాధించలేదు. యూర్‌పలో ప్రొటెస్టాంటినిజం తర్వాతనేగాని పారిశ్రామిక విప్లవం విజయవంతం కాలేదు.
  • ఖమ్మంలో జరిగిన విప్లవ రచయితల సంఘం తొలి మహాసభలలో పుచ్చలపల్లి సుందరయ్యగారిమీద బుర్రకథ నాజర్‌ అతి దారుణమైన ఆరోపణలు చేశాడు.అక్కడికక్కడే, అప్పటికప్పుడే నా అసమ్మతినీ, ఆగ్రహాన్నీ వ్యక్తం చేశాను. నిజానికి నేను ఏనాడూ ఏ కమ్యూనిస్టు పార్టీలోనూ సాంకేతికంగా సభ్యుణ్ణి కాను.కానీ, ఊహ తెలిసినప్పటి నుంచీ మానసికంగా నేను కమ్యూనిస్టునే.
  • పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి,గుంటూరు బాపనయ్య ,మాకినేని బసవపున్నయ్య నాతో సన్నిహితంగా వ్యవహరించడమే కాదు, నా రచనలను క్షుణ్ణంగా చదివి సీరియ్‌సగా నాతో చర్చలు జరిపేవారు.
  • నేను కవిగా మారటానికి కారణభూతమయినదీ మహాప్రస్థానం.శ్రీశ్రీకి ఏకలవ్య శిష్యుడననేది నాకు నేనుగా చేసుకున్న ఒక సెల్ఫ్‌ డిక్లరేషన్‌.తెన్నేటి సూరి ఒక పాటలో చెప్పినట్లు మన కవిని మనం బతికించుకోవాలి, మన కవిని మనం కాపాడుకోవాలి. అది మన అందరి విద్యుక్తధర్మం.
  • అతివాదం,అరాచకం నా వ్యక్తిత్వానికీ, మనస్తత్వానికీ అసలు ఏమాత్రం సరిపడని అంశాలు.బహుశా అందుకే నేను దిగంబర కవితా ఉద్యమానికీ, విరసానికీ దూరంగా ఉండిపోయానేమో అనిపిస్తుంది. నిజానికి దిగంబర కవుల్లో, విరసం సభ్యుల్లో నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. ఉదాహరణకి కె.వి.రమణారెడ్డి, వరవరరావులు నాకు చాలా ఆత్మీయులు. దిగంబర కవుల్లో నగ్నముని, జ్వాలాముఖి నాకు మంచి స్నేహితులు.
  • నాస్తికత్వాన్నీ, హేతువాదాన్నీ నిరంతరం ప్రచారం చేయవలసిన అవసరం మన సమాజానికి ఎంతైనా వుంది. ఒక దశలో నేను, రావిపూడి వెంకటాద్రి, కత్తి పద్మారావు, ఈశ్వరప్రభు వంటివాళ్ళం ఒక ఉద్యమ స్థాయిలో అటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి ప్రయత్నించాం. ఆ పని మరింత పెద్ద యెత్తున జరగవలసిన అవసరం వుంది.
  • గుర్రం జాషువా గారి గబ్బిలం కావ్యంతో సరితూగే రచనలు చేతివేళ్ళమీద లెక్కించదగినన్ని కూడా లేవు, లేవు, లేవు. జాషువా నిస్సందేహంగా ఒక మహాకవి. కవులుగా పెద్దపెద్ద భుజకీర్తులు తగిలించుకున్న వారికి ఇవాళ దిక్కూదివాణం లేదు. కానీ జాషువా పద్యాలు పీడిత ప్రజా సమూహాల నాల్కలమీద పారాడుతూ ఒక తరం నుంచి మరో తరానికి అందుతున్నాయి. భారతీయ సామాజిక వికాసానికి దళిత సాహిత్యం అనివార్యమైన అవసరం. దళిత సాహిత్యవికాసం అనేక రూపాలలో భారతీయ సాహిత్యాలకు మేలు చేస్తుంది.దళిత ఉద్యమ వైతాళికుడు కుసుమ ధర్మన్న కాంట్రిబ్యూషన్‌ గురించి ఒక పుస్తకం రాశాను. అదే నా చిట్టచివరి పుస్తకం.

మూలాలు[మార్చు]