అదృతి లక్ష్మీబాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అదృతి లక్ష్మీబాయి
భారత శాసనమండలి సభ్యురాలు
In office
1937–1952
ఒడిషా శాసనసభ ఉపసభాపతి
In office
29 మే 1946 – 20 ఫిబ్రవరి 1952
వ్యక్తిగత వివరాలు
జననం12 అక్టోబరు 1899
బరంపురం, గంజాం జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా (ప్రస్తుత ఒడిషా, భారతదేశం)
మరణం27 జనవరి 1986
జాతీయతభారతీయురాలు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెసు
బంధువులువి.వి.గిరి (అన్న)
చదువువైద్యవిద్య, క్రైస్తవ వైద్య కళాశాల, వెల్లూరు

అదృతి లక్ష్మీబాయి (జ. 12 అక్టోబర్ 1899 - మ. 27 జనవరి 1986) భారత స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త, రాజకీయ నాయకురాలు. ఈమె కలకత్తా డయాసియన్ కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీని పొంది, తరువాత వెల్లూరు క్రైస్తవ వైద్య కళాశాలలో వైద్యశాస్త్రం అభ్యసించడానికి చేరింది. ఈమె 1937 మరియు 1946లో బెర్హంపూర్ నియోజకవర్గానికి ఎన్నికయ్యింది. అలాగే 1946లో పూర్వం ఒరిస్సా అని పిలువబడిన ఒడిషా శాసనసభ ఉపసభాపతిగా పనిచేసింది. ఈమె ముఖ్యంగా ఒడిశాలో బాలికలకు ఉచిత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది.

ప్రారంభ జీవితం, విద్య, వైవాహిక జీవితం

[మార్చు]

లక్ష్మీబాయి 12 అక్టోబర్ 1899న బెర్హంపూర్లో, ఒక తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో, వరాహగిరి వెంకట జోగయ్య పంతులు, వరాహగిరి సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. ఆమె భవిష్యత్ భారత రాష్ట్రపతి వి. వి. గిరి చెల్లెలు. లక్ష్మీబాయి తన మాధ్యమిక విద్యను బెర్హంపూర్లో పూర్తి చేసి, తరువాత కాశీలోని థియోసాఫికల్ సొసైటీలో చేరింది. ఈమె కలకత్తాలోని డయాసియన్ కళాశాలలో పట్టభద్రురాలై, వెల్లూరులోని క్రైస్తవ వైద్య కళాశాలలో వైద్యశాస్త్రం అభ్యసించింది. అనారోగ్యం కారణంగా ఈమె వైద్య విద్యను పూర్తి చేయలేకపోయింది, చివరికి ఈమె బెర్హంపూరుకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఈమె రాజమండ్రి చెందిన అదృతి వెంకటేశ్వరరావును వివాహం చేసుకుంది. వివాహం జరిగిన ఒక సంవత్సరం లోనే భర్త మరణించడంతో లక్ష్మీబాయి బెర్హంపూర్ లోని తన పుట్టింటికి తిరిగి వచ్చింది.[1]

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడం

[మార్చు]

భర్త మరణం తరువాత, లక్ష్మీబాయి మహాత్మా గాంధీ నుండి ప్రేరణ పొంది, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంది. అప్పటికే చాలా మంది ఈమె కుటుంబ సభ్యులు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ వంటి జాతీయ నాయకులు బెర్హంపూర్ జిల్లా సందర్శనల సమయంలో జోగయ్య పంతులు నివాసంలోనే బస చేసేవారు. విదేశీ వస్తువులను బహిష్కరించడం, మద్యం దుకాణాలను ముట్టడించడం వంటి కార్యకలాపాలలో ఈమె పాల్గొంది. ఈ కార్యకలాపాలలో ఆమె పాల్గొనడం, 18 జనవరి 1932న ఈమె తొలి అరెస్టుకు దారితీసింది. ఛత్రపూర్ కోర్టు ఈమెకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు 700 భారతీయ రూపాయల జరిమానా విధించింది. తరువాత ఈమెను వెల్లూరు సెంట్రల్ జైలుకు బదిలీ అయ్యి, ఒకటిన్నర సంవత్సరాల జైలు శిక్ష అనుభవించింది.[1] 1935లో ఈమె గంజాంలోని కులాడాలో జరిగిన రైతు మహాసభ అధ్యక్షురాలిగా పనిచేసింది. ఈమె ఖాదీ ఉద్యమంలో ప్రముఖ కార్యకర్తగా పనిచేసి, పేదలకు ఖాదీని ఉచితంగా పంపిణీ చేసింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ఈమె చురుకుగా పాల్గొన్నది. భారతదేశం స్వాతంత్ర్యం సాధించినప్పుడు, ఆమె కటక్ లోని జైలులో శిక్ష అనుభవిస్తోంది. అక్కడ స్వరాజ్ ఉద్యమ సమయంలో అనేక మంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఖైదు చేయబడ్డారు.[1][2]

తరువాత రాజకీయాలలో పాల్గొనడం

[మార్చు]

లక్ష్మీబాయి 1930 నుండి 1940 వరకు ఒడిశాలో భారత జాతీయ కాంగ్రెస్ క్రియాశీలక సభ్యురాలిగా పనిచేసింది. ఆమె గంజాం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలిగా, బెర్హంపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించింది. లక్ష్మీబాయి 1937లో మొదటి సార్వత్రిక ఎన్నికలలో బెర్హంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఒడిశా శాసనసభకు ఎన్నికై, 1953 వరకు ఎమ్మెల్యేగా కొనసాగింది.[1] 1946 మే 29 నుండి 1952 ఫిబ్రవరి 20 వరకు, ఆమె ఒడిశా శాసనసభలో ఉపసభాపతి, సభాపతి పదవులను నిర్వహించింది.[1][2][3]

మహిళా సాధికారత

[మార్చు]

కేరళలో జరిగిన ఉపసభాపతుల జాతీయ సమావేశంలో లక్ష్మీబాయి సమర్పించిన విద్యా విధానాన్ని విమర్శనాత్మకంగా ప్రశంసించారు. మహిళల సాధికారతపై తనకున్న ఆసక్తితో ఈమె ఒడిశాలో బాలికలకు ఉచిత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం, ఆ ప్రాంతంలోని బాలికల పనితీరును మెరుగుపరిచింది. ఒడిశాలో, ఆమె ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కమిటీకి సలహాదారుగా, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలిగా, కస్తూర్బా స్మారక నిధి యొక్క స్థానిక శాఖకు అధ్యక్షురాలిగా పనిచేసింది. పేద విద్యార్థులకు సహాయం చేయడానికి ఆమె గంజాం జిల్లా, బౌధ్ జిల్లా, ఫుల్బానీ జిల్లాలను పర్యటించి, జయ మంగళం ఆశ్రమంలో బాలికలకు ధనసహాయం చేసింది.[1]

అదృతి లక్ష్మీబాయి, 1986, జనవరి 27న మరణించింది[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Dasarathi Bhuyan (August 2010). "Participation of Women of Ganjam District in the Freedom Movement of India" (PDF). Orissa Review: 19–20. Retrieved 18 November 2018.
  2. 2.0 2.1 "British-era jail in Cuttack wallows in neglect". The New Indian Express. 15 August 2018. Retrieved 2018-12-03.
  3. "Brief History of Odisha Legislative Assembly Since 1937: SECOND PRE-INDEPENDENT ASSEMBLY THE LINK ASSEMBLY - 1946". Odisha Legislative Assembly. Archived from the original on 25 November 2015. Retrieved 28 February 2023.
  4. "Adruti Laxmibai". amritmahotsav.nic.in. Retrieved 24 September 2024.