అల్లం రాజయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లం రాజయ్య
అల్లం రాజయ్య
జననంఅల్లం రాజయ్య
(1952-06-05) 1952 జూన్ 5 (వయసు 71)
గాజులపల్లె, మంథని తాలుకా, కరీంనగర్ జిల్లా
ఇతర పేర్లుఅల్లం రాజయ్య
మతంహిందూ

అల్లం రాజయ్య తెలుగు కథా రచయిత.[1]

బాల్యం - విద్యాభ్యాసం[మార్చు]

అల్లం రాజయ్య అల్లం నర్సయ్య బుచ్చమ్మ దంపతులకు కరీంనగర్ జిల్లా మంథని తాలుకా గాజులపల్లె గ్రామంలో జన్మించారు. ఇతనికి ఇద్దరు తమ్ముల్లు అల్లం వీరయ్య (టీచర్, పాటల రచయిత), అల్లం నారాయణ (సీనియర్‌ జర్నలిస్ట్‌, నమస్తే తెలంగాణ దినపత్రిక మాజీ ఎడిటర్‌, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ తొలి చైర్మన్‌). ఈయన రైతు కుటుంబానికి చెందినవాడు. ఆకాలంలో ధనిక, పేద వివక్ష ఉండేది. ఈయన తండ్రి ఊరిలో పెద్దమనుష్యులలో ఒకరైనందున గ్రామంలోని అనేక తగవులు పరిష్కారానికి ఈయన యింటికి ప్రజలు వచ్చేవారు. అక్కడ జరిగే పంచాయితీల సారాంశమంతా పేదప్రజల్ని ఎలా అణిచిపెట్టాలన్నదే. ఇవన్నీ చూసిన ఆయనకు తమతో పాటు పొలాలలో పనిచేసే మనుషులపట్ల వివక్ష అంతా అన్యాయమైందనే భావన కలిగేది.

ఆయన 1965 ప్రాంతంలో వారి అమ్మమ్మ గారి యింటివద్ద ఉండి ఐదవ తరగతి పూర్తిచేసారు. తర్వాత మంధని పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. క్లాసులలో మొదలుకుని అన్ని చోట్లా ఒక కులాన్ని, మరొక కులం వాళ్లు వివక్షగా చూసేవారు. పాఠశాలలో గ్రామీణ ప్రాంత విద్యార్థుల పట్ల పట్టణ విద్యార్థులు వివక్షతో చూసేవారు. దాంతో హైస్కూల్లో రెండు గ్రూపులుగా ఏర్పడి అస్తిత్వాల కోసం కొట్లాటలు జరుగుతూ ఉండేవి. అప్పటి భయంకరమైన భూస్వామ్య సమాజాల్లో మనుషుల మధ్య వివక్ష, హింస, దోపిడీ అన్నీ బాగా ఉన్న వ్యవస్థ అది. ఆ క్రమంలో విద్యార్థి నాయకుడిగా ఎదిగిన ఆయన జూనియర్ కాలేజీ నిర్మాణం కోసం పిల్లలందర్నీ పోగుచేసి చుట్టు పక్కల గ్రామాలన్నీ తిరిగి కర్రల్ని సంపాదించి స్వయంగా పాటుపడ్డారు.1969 లో చివరి హెచ్ ఎస్సీలో స్కూల్లో జనరల్ సెక్రటరీగా అగ్ర కులాలకు వ్యతిరేకంగా నిలబడి గెలిచారు. చదువు పూర్తయిన తరువాత ఆయన సహజంగా ఉద్యోగార్థియై ఉద్యోగాలలో ఎవరు ఉంటున్నారో పరిశీలించారు. ఆ కాలంలో సహజంగా అన్ని ఉద్యోగాలలోనూ ఆంధ్ర ప్రాంతం వారే ఉండే వారు. అప్పట్లోనే నేను ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో బాగా ఉధృతంగా పాల్గొన్నారు. అందువల్ల ఆయన చదువు కూడా ఒక సంవత్సరం పోయింది. కేవలం విద్యార్థి ఉద్యమం కావడం వల్ల అప్పట్లో ఉద్యమం పూర్తిగా నిలబడలేకపోయింది. అది కొంత హింసాత్మకంగా మారింది కూడా.

ఎనిమిదో తరగతి నుంచీ ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. వారి మేనత్త, ఆయన ఇండ్లల్లో ఓరల్ ట్రెడిషన్లో చాలా కథలు చెప్పేవారు. అంతే కాకుండా గ్రామాలలో జానపద కళాకారులు చెప్పే కథల్ని బాగా వినే వాళ్లు. ఎనిమిదవ తరగతిలో లైబ్రరీకి మొదటిసారి వెళ్లారు. లైబ్రరీ ఎంతగా ఇష్టమైందంటే దాదాపు హెచ్ ఎస్సీకి వచ్చే సరికి నేను లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివేసారు. అక్కడే రష్యన్ సాహిత్యం, రవీంద్రనాథ్ టాగూర్, బంకించంద్ర, ప్రేం చంద్ ఇలా భారతీయ సాహిత్య కారులే కాకుండా, ప్రపంచ సాహిత్య కారులందరూ రాసిన సాహిత్యాన్ని చదివేసారాయన. ఆయన చలం రచనలతో బాగా ప్రభావితమయ్యారు.రాజకీయాలు, సాహిత్యమూ మధ్య చదువు వెనక పడిపోయింది.

1970 లలో వరంగల్లో కాలేజీలో చేరారు. చేరాక పునరాలోచన మొదలయ్యిందానకు. చదువైన సంవత్సరం తర్వాత కొంత గందరగోళ పరిస్థితినించి బయటికి వెళ్లాలనిపించి వ్యవసాయం చేసారు. మళ్లీ అక్కడా గిట్టుబాటు ధరలు లేకపోవడం, గ్రామాల్లో ఉండే సంక్షోభం వల్ల మళ్లా బయటికి వెళ్లిపోయారు. ఆనాటి గ్రామీణ సంక్షోభం, బయటి నుంచి వచ్చిన నాగరికతకు చెందిన కొత్తఆలోచనలు, గత జీవితంలోని పరిస్థితుల నించి వరంగల్ కు వెళ్లారు. అక్కడ సాహితీ మిత్రులు కలిసారు. కరీంనగర్ చుట్టు పక్కల పేద ప్రజలకు ఏదైనా న్యాయం జరిగేదుందా అని నిరంతరం ఆలోచన చేసేవారు. ఆయన చదివిన సాహిత్యంలో ఇతర ప్రాంతాలలో ఉన్న హాయైన జీవితం తెలంగాణా ప్రాంతంలో ఎందుకు లేదనే ప్రశ్న ఆయనను వెంటాడేది. 73 ప్రాంతంలో ఒక పక్క ఉద్యమ జీవితంతో బాటూ వివాహ జీవితం ప్రారంభమైంది. వెనువెంటనే ఆయన ఉద్యోగం వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రయత్నంలో భాగంగా నాకు 1975 లో అదిలాబాద్లో ఉద్యోగం రావడంతో ఆయన ప్రస్థానం కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ కు మారింది.

రచయితగా[మార్చు]

ఎమర్జెన్సీ సమయంలో గ్రామాలకు వెళ్ళి, ప్రజల్ని కొంత ఉత్తేజితుల్ని చేసేవారు. పత్రికలకు కరపత్రాలను మొదట రాసేవారు. వారి ఊరికి పి.వి. నరసింహారావు వచ్చినపుడు ఆ సభలో ఉన్న ఒక హరిజనుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అన్యాయాల గురించి అడిగిన ప్రశ్నలకు స్పందించి ఆయన మొట్టమొదట “ఎదురు తిరిగితే” కథని యథాతథంగా పేర్లు కూడా మార్చకుండా రాసేరు. ఆ కథలో గ్రామీణ దోపిడీ, అణిచివేత, అసంబద్ధ సంబంధాలు, గ్రామీణ వ్యవస్థకు సంబంధించి ఒక పరిపూర్ణ చిత్రం అది. తర్వాత “క్రాంతి ” అనే పత్రికను కొద్దిరోజులు నడిపారు. ఇక కరీంనగర్ లో మిత్రులందరితో కలిసి “విద్యుల్లత” అనే పత్రికను ప్రారంభించారు.

ఆయన మిత్రులు “బద్లా” అనే కథా సంపుటి వేసారు. అది ఆ తర్వాత బాన్ అయ్యింది. అందుకోసం ఆయననొక కథను అడిగారు. అప్పటికే ఆయన కథ రాసినా అందులో చేర్చే సాహసం చెయ్యలేదు. నిజానికి పదోతరగతి నుంచి డైరీలు, కవితలు, కథలు రాసేవారాయన. “ముగింపులు-ముందడుగులు” అని నవల కూడా రాసేరు. అదంతా గాంధీ ప్రభావంతో రాసిన అహింసా రాతలు. అవన్నీ ఎక్కడా ప్రింట్ చేయించలేదు. కాలక్రమంలో అన్నీ ఎటో పోయాయి. అయితే అలా ఆయనకు రచన అలవాటు అయ్యింది. అయితే తెలంగాణా ప్రాంతపు ప్రత్యేకత అప్పటికి ఆయన రచనల్లోకి అడుగుపెట్టలేదు. మొట్ట మొదటగా “ఎదురు తిరిగితే”తో సిసలైన కథా ప్రస్థానం ప్రారంభమైంది.

కథలు[మార్చు]

  • సిరీస్ ఆఫ్ స్టోరీస్ :అందులో మొదటిది మహదేవుని కల- ఉత్పత్తి విధానంలో ఉత్పత్తికి, వ్యక్తిగత ఆస్తికి వచ్చిన సంఘర్షణకు రూపం ఆ కథ.
  • మనిషి లోపలి విధ్వంసం : వ్యవసాయాధార భారతీయ సమాజంలో ఉత్పత్తి విధానం మనిషి లోపల విధ్వంసానికి ఎలా కారకమవుతుందో చిత్రించారు.
  • మధ్యవర్తులు :చదువు భూమి పుత్రుల్ని వేరుచేసి, మరలా వాళ్లనే వాహికలుగా చేసుకుని కింది సెక్షన్లని దోపిడీ చెయ్యించడం.
  • నీల, కమల : ఈ కథలు స్త్రీల సమస్యలకు సంబంధించినవి. అత్యంత అమానవీయ, అప్రజాస్వామికంగా మహిళల్ని చూడడానికి వ్యతిరేకంగా రాసినవి.
  • ప్రత్యర్థులు :రాజకీయ నాయకులకు సంబంధించినది. ఒక సమాజంలో ఎందుకు ఒక వ్యక్తి భూస్వామి గానూ, మరొక వ్యక్తి దోపిడీకి గురవుతూ కనిపిస్తాడు.
  • అతడు : ఇలాంటి అమానవీయ సమాజంలో నేడు అన్ని రకాల వైరుధ్యాలను అర్థం చేసుకుని, పరిష్కరించి, ప్రజలను ముందుకు తీసుకుపోయే కార్మిక వర్గ పార్టీ గురించి రాసినది.
  • కార్మిక కథలు : బొగ్గు గనులకు సంబంధించిన కథలు అనేకం రాసేరు.

ఆయనకు ఉద్యోగం, ఉద్యమం, వ్యక్తిగతం, రచన..ఇలా నాలుగు జీవితాలుండేవి. అన్నీ సమతూకంగా చూసుకుంటూ క్రమంగా రాసిన కథలన్నీ మొదట ప్రజా తంత్ర లో, తర్వాత ఎక్కువగా సృజన, అరుణ తార, ఆంధ్ర జ్యోతి లాంటి అన్ని పత్రికలలో అచ్చయినాయి.

నవలలు[మార్చు]

  • కొలిమి అంటుకున్నది
  • ఊరు
  • అగ్ని కణం
  • కొమరం భీం
  • వసంత గీతం

విరసం తో అనుబంధం[మార్చు]

రైతు కూలీ సంఘాల ఏర్పాటు, విరసంలో సభ్యత్వం తీసుకున్నారు. అందులో భాగంగా ఆయన తెలంగాణా, రాయలసీమ, కోస్తా ఆంధ్ర జిల్లాలన్నిటితో పాటు, ఇతర రాష్ట్రాలలో కూడా తిరుగుతూ ఉండేవారు. విరసంలో ఆయన ఎప్పుడూ సభ్యుడిగానే ఉన్నాను. ఆయన ప్రధానంగా రచయిత. సమాజంలోని మార్పులని రికార్డు చేసేవారాయన. అందుకే ఆయనెప్పుడూ నాయకత్వ సమస్యలకు పోలేదు. ఆ జిల్లాలకు సంబంధించిన అనేక కథలు అంటే రైతుకూలీ సంఘాలు, ఉద్యమాలు-మారేదశలు, సంఘాల్లో వచ్చే సమస్యలు వీటికి సంబంధించిన కథలు రాసేరు.

మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]