అల్లం శేషగిరిరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అల్లం శేషగిరిరావు (డిసెంబర్ 9, 1934 - జనవరి 3, 2000) ప్రముఖ తెలుగు కథారచయిత.

జీవిత విశేషాలు[మార్చు]

1934, డిసెంబర్ 9 న ఒడిశా (నాటి ఒడిషా) లోని గంజాం జిల్లాలో జన్మించారు. రైల్వేలో పనిచేసి పదవీవిరమణ చేశారు.

సాహితీ ప్రస్థానం[మార్చు]

అల్లం శేషగిరిరావు తొలి కథ "మృగయా వినోదం అను పులి ఛాన్స్" 1967లో ఆంధ్రజ్యోతిలో అచ్చయింది. తెలుగు సాహిత్యంలో అరుదైన వేట కథల ద్వారా ఆయన కథకుల్లో ప్రముఖ స్థానాన్ని పొందారు. "మంచి ముత్యాలు", "అరణ్యఘోష" కథాసంపుటాలు ప్రచురించారు. మనిషి జీవితంలోని వివిధ పార్శ్వాల్ని అన్వేషిస్తూ రాసిన వేట కథలు-చీకటి, పులిచెరువులో పిట్టల వేట, డెత్ ఆఫ్ ఎ మాన్ ఈటర్, మృగతృష్ణ, వఱడు ప్రాచుర్యం పొంది ఎన్నో ఉత్తమకథల సంపుటాల్లో పునర్ముద్రణ పొందాయి.

ఇతివృత్తాలు[మార్చు]

శేషగిరిరావు కథల్లో చాలావరకూ అడవి, వేట నేపథ్యంగా ఉంటాయి. వివిధ రకాలైన వేట పద్ధతులు, అడవి జంతువుల ప్రవర్తన, అడవిలోని స్థితిగతులు వంటి అంతగా ప్రాచుర్యంలో లేని అంశాలతో కథను అల్లడంతో పాఠకుడు వీటిని ఆమూలాగ్రం ఆసక్తితో చదువుతాడు. ఐతే ఎంత సూక్ష్మమైన వేట వివరాలు పొందుపరిచినా విషయాన్ని మాత్రం మనిషిలో జంతుప్రకృతి, సహజ భయాలు, విపరీత పరిస్థితుల్లో అనూహ్యంగా మరిపోయే మనుషుల లక్షణాలు వంటి వాటిపై కేంద్రీకరించి వేటలోని అంశాలను ఉపమానాలుగా స్వీకరించడంతో కథలకు లోతు పెరిగింది. కాబోయే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థంచేసుకునే క్రమంలో తల్లిదండ్రులు వేటకు పంపగా జంటలోని పక్షిని కాల్చిచంపిన తర్వాత ఏం జరిగింది (పులి చెరువులో పిట్టల వేట), మానవ ప్రకృతిలోని స్వార్థపరత్వానికి వఱడు అన్న జంతువుకు పెట్టిన ముడి ఎలా సార్థకమైంది (వఱడు), తనకు కావాల్సిన పేరు కోసం ఒక మనిషిని బలిపెట్టేందుకు సిద్ధం అయ్యే వ్యక్తికే చివరకు తిప్పికొట్టడం (డెత్ ఆఫ్ ఎ మానీటర్" తదితర కథల్లో ప్రధాన ఇతివృత్తంతో వేటలోని అంశాలు కథల్లో చిత్రించారు.

మరణం[మార్చు]

పదవీవిరమణ అనంతరం విశాఖపట్టణంలో నివసిస్తూ 2000, జనవరి 3 నాడు మరణించారు.