అష్టభాషి బహిరీ గోపాలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అష్టభాషి బహిరీ గోపాలరావు మహబూబ్ నగర్ జిల్లా లోని ప్రసిద్ధక్షేత్రం శ్రీరంగాపూర్ నిర్మాత. సా.శ. 1676 ప్రాంతానికి చెందినవాడు. వనపర్తి సంస్థానంనకు పూర్వపు రాజధాని అయిన సూగూరు సంస్థానం స్థాపకులు వీర కృష్ణారెడ్డికి మునిమడు.ఇతని మేనల్లుడే బిజ్జుల తిమ్మభూపాలుడు. ఇతనికి మొదట సంతానం లేకపోవడం వలన బంధువుల బిడ్డ వెంకటరెడ్డిని దత్తత తీసుకున్నాడు. తదనంతరం ఇతనికి కుమార బహిరీ గోపాలరావు జన్మించినా, దత్త పుత్రుడు వెంకటరెడ్డినే తదనంతరం సూగూరు సంస్థానానికి వారసుడిగా ప్రకటించాడు. ఇతడు శత్రువులపైన బహిరీ పక్షి (Sparrowhawk) వలె పడి వారిని హతమొనర్చొచుండుట వలన ఇతనికి గోల్కొండ నవాబులులచే 'బహిరీ' అని కితాబు పొందాడు..బహిరీ అనగా పార్సీ భాషలో డేగజాతి పక్షి అని అర్ధము.

సాహిత్య కృషి[మార్చు]

అష్టభాషి బహిరీ గోపాలరావుగా ప్రసిద్ధి చెందిన జనుంపల్లి గోపాలరావు[1] గొప్ప పండితుడు. ఎనిమిది భాషలలో విద్వాంసుడు. కావుననే అష్టభాషల గోపాలరావుగా సుప్రసిద్ధుడు. తిరుపతి, కంచి, శ్రీరంగం మొదలగు క్షేత్రాలను దర్శించి, అక్కడి కవులను సత్కరించి సూగూరుకు తీసుకవచ్చాడు. స్వయంగా తానే రామచంద్రోదయం అను శ్లేష కావ్యాన్ని, శృంగార మంజరీ అను భాణాన్ని సంస్కృతంలో రచించాడు.[2]..ఈతని తండ్రి వెంకటరెడ్డి, ఆయనపేర నిర్మించిన వెంకటాపురం గ్రామములో కోదందరామస్వామి ఆలయం కట్టించి నాడు.ఆ దేవుని పేరనే గోపాలరావు 'రామచంద్రోదయః' అను యమక కావ్యము సంస్కృతమునందు అతి జటిలముగా వ్రాసి, అది అర్ధమగుటకు దానికి 'విజ్ఞేయార్ధ దర్పణము' అను వ్యాఖ్యానము కూడా వ్రాసెను.తనది జనుంపల్లి వంశమని రాంచంద్రోదయ యమక కావ్యము వ్రాసినానని, అది మిక్కిలి భవ్యకావ్యమని, దాని అర్ధము సులభముగా తెలియని మందాత్ములకు అనుగ్రహించుటకు తానే దానికి వ్యాఖ్య వ్రాసినాని తన పద్యములో విన్నవించుకున్నాడు. తన శృంగార మంజరీ భాణము ఇది దృశ్య కావ్యము.ఇది అతి సరళ శైలిలో లతిలలితముగా వ్రాయబడింది. ఆ భాణము తన కులదైవమైన శ్రీ రంగనాయక స్వామి వసంతోత్సవ వర్ణన వివరించబడింది. వీటిని సా.శ.1895 సంవత్సరములో అప్పటి వనపర్తి రాజు రెండవ రామేశ్వరరావు, వనపర్తిలో తాను స్థాపించిన 'బ్రహ్మ విద్యా విలాస ముద్రాక్షశాల'యందు ముద్రించి ప్రచురించెను.అప్పటి ఆస్థాన విద్వాంసులైన ఆచార్ల రంగాచార్లు-చేట్లూరు కంఠీవార్ల సంపాదకత్వములో ఈ రెండు సంస్కృతకృతులను ఆ రాజు ముద్రించెను. అవి శిథిలమైన తరువాత ఆ వమ్శపు మూడవ రామేశ్వరరావు గారు తెలుగు-సంస్కృతములో పునర్ముద్రణ చేయించారు.

మూలాలు[మార్చు]

  1. పాలమూరు సాహితీ వైభవం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 32
  2. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12 వ సంపుటం, కడపటిరాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1968, పుట-33