మారేమండ రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మారేమండ రామారావు గారు చరిత్ర పరిశోధకులు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన 1906 నవంబరు 26 న జన్మించారు (పరాభవ మార్గశిర శుద్ధ తయోదశినాడు).పశ్చిమ గోదావరిజిల్లా పట్టిసీమ సమీపంలోనున్న పోలవరం సమీపంలో జన్మించారు.తల్లి లక్ష్మీభాయమ్మ; తండ్రి వేంకటకృష్ణారావు గారు.రామారావుగారు 1925లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయ్యేవరకు రాజమహేంద్రవరంలో విద్యాసముపార్జన గావించారు.వారు బి.ఏ.ఆనర్సు మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో చదివి 1928లో డిగ్రీ సంపాదించారు.1928-31 మధ్య ఆచార్య శ్రీ.కె.ఏ.నీలకంఠశాస్త్రి గారి పర్యవేక్షణ క్రింద మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన గావించారు.ఓరుగల్లు ను పాలించిన కాకతీయులు (Kakatiyas of Warangal) అను వారి పరిశోధనా గ్రంధానికి పి.హెచ్.డి పట్టం వచ్చింది.మద్రాసు విశ్వవిద్యాలయంలో చారిత్రక విషయంపై పరిశోధన గావించి పి.హెచ్.డి పట్టాన్ని గైకొన్న ప్రధమాంధ్రులు శ్రీ నేలటూరి వేంకటరమణయ్య గారు ద్వితీయులు శ్రీ రామారావుగారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో విద్యార్థి దశలోనే చరిత్ర పరిశోధనా రంగంలో ప్రవేశించి గాఢాధ్యయనం చేసారు. ప్రముఖ పరిశోధకుల వద్ద శిక్షణ పొందారు. గుంటూరు హిందూ కాలేజీలో హిస్టరీ అధ్యాపకునిగా కొద్దికాలం పనిచేశారు. "శాతవాహన చరిత్ర" అంశాంతో ప్రారంభమైన కాలక్రమంలో "ఆంధ్ర చరిత్ర"[1]కు సంబంధించి అన్ని కోణాలలోనూ పరిశోధనా పటిమను వృద్ధి చేసుకున్నారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి), నిజాం కళాశాల (హైదరాబాదు) లలో చరిత్ర అధ్యాపకునిగా ఉంటూ అనేక మంది పరిశోధక విద్యార్థులకు మార్గదశకత్వం యిచ్చారు. స్వయంగా పరిశోధనలు చేసి, తమ కృషికి మెరుగులు పెట్టి వెలువరించిన "కాకతీయ సంచిక" ప్రసిద్ధి పొందింది[2]. సమకాలికంగా లభ్యమైన శాసనాలూ, ఇతర సాధన సంపత్తి ఆధారంతో సుదీర్ఘమైన ఉపోధ్ఘాతంతో రాసిన ఈ గ్రంథం ఎంతోమందిని ఆకర్షించింది. కొంతమందిని వికర్షించింది. చర్చోపచర్చలకు ఆలవాలమైంది.

రామారావుగారు 1932 నుండి 1935 వరకు గద్వాల సంస్థానంలో ఉండి ఆ సంస్థాన చరిత్రపై పరిశోధన గావించి ఒక గ్రంధాన్ని వ్రాశారు.అది గ్రంధరూపంలో వెలువడకపోయినా దానిలోని ప్రధానాంశాలు ఆంధ్రేతిహాస పరిశొధకమండలి పత్రికలో ప్రకటింప బడ్డాయి. రామారావుగారు 1935 జూన్ నుండి 1949 జనవరి వరకు గుంటూరు హిందూ కళాశాలలో చరిత్రోపన్యాసకులుగా పనిచేశారు.1949 జనవరిలో వారు హైదరాబాదులోని నిజాం కళాశాలలో ఉపన్యాసకులుగా ప్రవేశించి తరువాత రీడరు, ప్రొఫసెరు పదవులనుకూడా నిర్వహించారు.1959 ఆగష్టులో వారు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయములో చరిత్ర శాఖాధ్యక్షులుగా నియమించబడ్డారు.వారా పదవిని మంచి సామర్ధ్యంతో 7సం.నిర్వహించి 1966 నవంబరులో ఉద్యోగ విరమణం గావించారు.కాని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు వారిని 1967 జనవరిలో గుంటూరు హిందూ కళాశాలలో ప్రొఫెసర్ గా నియమించారు.1973 అక్టోబర్ 26వ తేదీన వారు దివంగతలయ్యేవరకు ఆపదవిని నిర్వహిస్తూనే ఉన్నారు.

పత్రికా సంపాదకులుగా రామారావుగారు మంచి కీర్తి నార్జించారు.వారు 1945 నుండి 1949 వరకు గుంటూరు నుండి జర్నల్ ఆఫ్ ఆంధ్రాహిష్టరీ అండ్ కల్చర్ అను పత్రికను 1951 నుండి 1953 వరకు హైదరాబాదునుండి జర్నల్ ఆఫ్ దక్కన్ హిష్టరీ అను పత్రికనూ నడిపారు.


మన రాష్ట్ర చరిత్రకు ఆధారభూతంగా నిలిచిన ప్రధాన సాసనాలను మూడు సంపుటములుగా మలిచారు. ప్రాచీన చాళుక్యుల దేవాలయాలు, శ్రీశైల దేవాలయాలు, ఆంధ్రలోని ముఖ్యమైన దేవాలయాలు, విష్ణుకుండినుల నాడాలు, శాతవాహనుల నాణాలు, బంగారు, వెండి నాణేలు మొదలగునవి ఆంధ్ర గ్రంథ రచనలు. ఆయన అనేక తెలుగు వ్యాసరచనలు చేసారు.

గుంటూరులో "ఆంధ్రేతిహాస పరిశోధక మండలి"ని స్థాపించి దాని పక్షాన "ఆంధ్ర చరిత్ర సంస్కృతి" త్రైమాసిక పత్రికను కొంతకాలం నిర్వహించారు. రాష్టంలోని అతి ప్రాధాన్యత గల భౌద్ధ క్షేత్రాలకు సంబంధించి ఒక ప్రత్యేక సావనీరును విడుదలచేసారు. మన రాష్ట్ర చరిత్ర పరిశోధకులలో అగ్రగామిగా నిలిచిన ఆయన అక్టోబరు 26 1973 న మరణించారు.

పరిశోధకునిగా[మార్చు]

తెలుగు భాషకు సంబధించి, తెలుగు వాజ్మయ ప్రయోజనముల గూర్చి పెక్కు చారిత్రిక పరిసోధనలు జరిపినారు. వీరు మద్రాసు విశ్వవిద్యాలయమునందు డాక్టరు బిరుదు పొందినారు. వీరు ఆంధ్రకాకతీయరాజుల చరిత్రను గూర్చి చాలా పరిశోధనలు గావించారు. 'కాకతీయ సంచిక'కు వీరు సంపాదకులుగా కొంతకాలముండిరి. గద్వాలు సంస్థానము చరిత్రను గూర్చి కూడా వ్రాసినట్లు తెలియుచున్నది. మారేమండ రామారావు గారు, 1932 ఏప్రిల్ నెలలో వరంగల్ పట్టణంలో జరిగిన కాకతీయ ఉత్సవాలలో ప్రముఖ పండితులూ, చారిత్రిక పరిశోధకులూ రాసిన ప్రసంగ వ్యాసాలన్నింటినీ కాకతీయ సంచిక పేరుతో వారి సంపాదకత్వంలో, ఆంధ్రేతిహాస పరిశోధక మండలి రాజమహేంద్రవరంలో ముద్రణ చేయించారు. దాన్ని ఇటీవలే రాష్ట్ర పురావస్తు శాఖవారు పునర్ముద్రణ చేయించారు. కేవలం 100 రూపాయలకే లభ్యమవుతున్నది.


రచనలు[మార్చు]

మూలాలు[మార్చు]

  • 1973 భారతి మాస పత్రిక.
  1. Inscriptions of Aņdhradēśa ... Compiled and edited by Dr. M. Rama Rao
  2. "Journal of the Andhra Historical Research Society > Volume IX, Issue 3, 1935 > Publications of the Andhra Historical Research Society. Kakatiya Sanchika in (Telugu)". Archived from the original on 2015-10-11. Retrieved 2015-08-08.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "bibilography" (PDF). shodhganga.inflibnet.ac.in/. Retrieved 8 August 2015.
  4. డిజిటలు లైబ్రరీలో గ్రంథ ప్రతి

ఇతర లింకులు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: