వేమూరి శారదాంబ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేమూరి (దాసు) శారదాంబ
(1881-1899)

జననం 1881 మే 3
అల్లూరు గ్రామం, ముదినేపల్లి మండలం, కృష్ణాజిల్లా
ఆంధ్రప్రదేశ్
మరణం 1899 డిసెంబరు 26
ఏలూరు, కృష్ణాజిల్లా
ఆంధ్రప్రదేశ్
వృత్తి రచయిత్రి, వైణికురాలు, కవయిత్రి, స్త్రీవాది
భార్య/భర్త వేమూరి రామచంద్రరావు
తల్లితండ్రులు జానకమ్మ (తల్లి)
దాసు శ్రీరాములు (తండ్రి)
సంతానం దుర్గాంబ (కుమార్తె )
పార్ధసారథి (కుమారుడు)

వేమూరి శారదాంబ, (1881 మే 3 - 1899 డిసెంబరు 26) - 19వ శతాభ్ధములో పిన్న వయసు లోనే సంస్కృతాంద్రములనభ్యసించి, సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యత సాధించిన మహిళ వేమూరి (దాసు) శారదాంబ. ఈమె విద్యా విహీనులుగా ఉన్న సాటిమహిళల దుర్భర స్థితిగతులను వెలిబుచ్చి, స్త్రీలకు విద్యాబోధన అవసరమని ఉద్యమం ఆరంభించి, అభ్యుదయ ధృక్పదముతో రచనలు చేసింది. స్త్రీలపైగల వివక్షత ఎక్కువుగా ఉన్నకాలం లోనే అభ్యుదయ భావాలు ఉన్న ఆమె తండ్రి మహాకవి దాసు శ్రీరాములు ప్రోత్సాహముతో ఆమె సంస్కృతాంధ్ర విద్యనభ్యసించింది. అంతేగాక సంగీత సాహిత్యాలలో బాల్యములోనే అతీతమైన ప్రవీణ్యత సాధించింది. చిననాటనే పితృ పరిరక్షణలో సంగీత కచేరీలు చేసి గాయకురాలుగా గుర్తింపు పొందింది. ఆమె తన 19 వ ఏటనే పిన్నవయసులో మరణించింది.

జీవిత విశేషాలు[మార్చు]

1881 మే నెల 3 తారీకున ఇప్పటి కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలంలోని అల్లూరు గ్రామంలో జానకమ్మ-దాసు శ్రీరాములు దంపతులకు, ఆరుగురు కుమారుల తరువాత దాసు శారదాంబ జన్మించింది. విజయవాడలో 19 వ శతాబ్దాంతరములో వాణీప్రెస్ అనే ప్రచురణాలయమును స్థాపించిన దాసు కేశవరావు, న్యాయవాదులైన దాసు నారాయణరావు, దాసు మాధవరావు, దాసు గోవిందరావు, దాసు విష్ణు రావు, దాసు మధుసూదనరావులకు ఆమె సోదరీమణి. ఆమె తండ్రి దాసు శ్రీరాములు (1846-1908) వృత్తిరీత్యా ఏలూరులో న్యాయవాదేగాక, జ్యోతిష్య శాస్త్రపారంగతుడు, సంగీత సాహిత్యాలలో పండితుడు, 'దేవీభాగవతము' మొదలైన కావ్యాలు రచించి మహాకవిగా ప్రసిద్ధిచెందాడు. సంఘ సంస్కరణాభిలాషి. అభ్యుదయ దృష్టితో స్త్రీలకు విద్యాభ్యాసం అవసరమని ప్రచారము చేయుటయేగాక ఆనాటి సమాజంలో అటువంటి ఉల్లంఘన వల్ల కలుగు లోకనిందలకు లెక్కచేయక, తన కుమార్తెకు స్వయముగా విద్యాభ్యాసం చేసి చూపి సంఘసంస్కరణకు మార్గదర్శకుడైయ్యాడు. ఏలూరులో సంగీత పాఠశాలకూడా నెలకొల్పాడు. రాజమహేంద్రవరములోని సంఘ సంస్కరణకర్త కందుకూరి వీరేశలింగం పంతులు, విజయనగరంలోని మహాకవి గురజాడ అప్పారావు ఇతనికి సమకాలీకులు.

ఏక సంతాగ్రాహి అయిన శారదాంబ అతి చిన్నవయస్సులోనే పుట్టింట సంగీత విద్వాంసులైన కోమండూరి నరసింహాచారి, ఈమని వెంకటరత్నం వద్ద సంగీతం నేర్చుకుని వీణావాయిద్యములో అశేష ప్రవీణ్యత సంపాదించింది. తండ్రి పర్యవేక్షణలో విద్యాభ్యాసం చేసి సంగీతముతో పాటు సంస్కృతాంధ్రములలో కూడా పాండిత్యం గడించింది. మైసూరు, బెంగుళూరు పట్టణాలలో జరిగిన సంగీత సమ్మేళణములలో వీణా వాయిద్య కచేరీలు చేసింది. ఆనాటి సాంప్రదాయప్రకారం 7వ ఏటనే శారదాంబ వివాహం 1888 మే నెలలో బందరు వాస్తవ్యులు వేమూరి రామచంద్రరావుతో జరిగింది. సంగీత సాహిత్య విద్య అభ్యసించుటవల్ల ఆమె వివాహం బహు ప్రయత్నానంతరం జరిగిందని తెలుస్తోంది. 1888 సంవత్సరములో వివాహామైన తరువాత శారదాంబ-వేమూరి రామచంద్రరావు దంపతులకు మొదటి సంతానం కుమార్తె, దుర్గాంబ, రెండవ సంతానం కుమారుడు పార్ధసారథి. శారదాంబ తన 19వ ఏట, 1899వ సంవత్సరం డిసెంబరు 26న ఏలూరులో కుమారుడైన పార్దసారథిని ప్రసవించి, శారదాంబ పరమదించింది. తన కుమార్తె ఆకాల మరణముతో దుఃఖితుడైన దాసు శ్రీరాములు ఆమె అసాధారణ కవితా సామర్ధ్యమును తలచుకుంటూ, తెలియజేయుచూ రచించిన ఈ రెండు పద్యాలు శ్రీ దేవీ బాగవతము లోనివి.[1]

సీ. తనతొమ్మిదవయేట ననుపమాన ప్రజ్ఞ నింపుగా వీణ వాయింప నేర్చె
తన పదియవయేట సునిశితంబగు బుధ్ధి దాగొల్పె నేకసంతాగ్రహణము
తన చర్దశ శరత్తున ముద్దుముద్దుగా నల్లిబిల్లిగ బద్యముల్లనేర్చె
తనదు పదార్వ వత్సరమున నగ్నజిజ్ఞా వివాహప్రబంధంబు సెప్పే

తే.గీ. తనదు పందొమ్మిదవర్షముననె మర్త్య భావమునుమాని శాశ్వత బ్రహ్మలోక
సిద్ధింగనె శారదాబ నాచిన్నికూత ననుదినంబును మఱువక యాత్మనుంతు

సాహిత్యకృషి[మార్చు]

వివాహనాంతరం మెట్టింటి వారింట సంగీతాభ్యాసానికి అవరోధాలు కలిగినప్పటికినీ భగవత్ప్రార్థన రూపములో సాహిత్య కృషి సాగించింది. ఆమె రచించిన దేవీ స్తుతి కీర్తనలు పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆనాటి స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష, గృహ నిర్బంధం, విద్య, కళలు అభ్యసించుటలో నిరోధం మొదలైన సమస్యల గురించిన అవగాహన ఇంకా స్వీయానుభవం కలిగినదై, స్త్రీల సమస్యలపై అనేక విశ్లేషణాత్మక వ్యాసాలు రాసింది. అవి ఆనాటి పత్రికలు 'జ్ఞానోదయ పత్రిక', 'జనానా పత్రిక'లలో ప్రచురించబడ్డాయి.[2] 1896 సంవత్సరములో తన 16 వ ఏట ఆమె ‘నాగ్నజితీ పరిణయము’ అను ప్రబంధ రచన చేసింది. ఆమె నాగ్నజితీ పరిణయం, మాధవశతకం రెండు పద్యకావ్యాలు రాసింది. నాగ్నజితీ పరిణయం ఆమె సంప్రదాయ పాండిత్యానికి నిదర్శనమైతే, మాధవశతకం ఆమె ఆధునిక దృక్పథానికి అద్దం పడుతుంది.[3] సాంప్రదాయ కవులైన పోతన వంటి వారి వలె ఈమె తమ రచనలను భగవంతునికే అర్పించింది.[2]

శారదాంబ మరణం తరువాత ఆమె రచనలు రెండు (మాధవ శతకం, నాగ్నజితీ పరిణయం) కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి దృష్టికి రావడం సంభవించింది. ఇంటిపట్టుననే యుండి సాధించిన అఖండ పాండిత్యమును చాటు ఆ పద్యాలను చూసిన శ్రీపాద వారు ఆశ్చర్యపడి వాటిని 1901లో తాము సంకలనం చేయుచున్న కళావతి అను మాస పత్రికలో 'మాధవ శతకము' గా మూడు భాగాలుగా ప్రచురించి కీ.శే. వేమూరి (దాసు) శారదాంబ అపార కవితా కౌశలాన్ని తెలుగునాట వెలుగులోకి తెచ్చాడు.[4] ఆమె రచించిన నాగ్నజితీ పరిణయ కావ్యమును ఎవరు ఎక్కడ ప్రచురించిందీ ఇప్పటికీ తెలియనప్పటికినీ ఆ కావ్యం గూడా బహుశః శాస్త్రిగారే ప్రచురించి యుందురని ఊహించవచ్చు. ఒక శతాబ్దం పైగా (115 ఏండ్లు) కాలం గడచిపోయిన తరువాత మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి ఈ రెండు రచనలనూ 2017-2019 మధ్య కాలంలో పునర్ముద్రణచేసి ప్రచురించారు.[1][1]

నాగ్నజితీ పరిణయం[మార్చు]

వేమూరి శారదాంబ 1896 లో తన 16 వఏట నాగ్నజితీ పరిణయమనే ఒక ప్రబంధ కావ్యమును రచించింది.[5] ఆ ప్రభంధమును ఇప్పటి చెన్నై పట్టణమందలి పార్ధసారథి మందిరములో కూర్చుని రచించింది.[2] అష్టమహిషులు శ్రీకృష్ణుని ఎనిమిది భార్యలని భాగవవత కథలు చెపుతున్నాయి. నాగ్నజితి ఆరవ భార్యగా శ్రీకృష్ణుని పరిణయమాడుట గురించి ఈ కావ్యములో వర్ణించింది. ఈ ప్రబంధ కావ్య రచనలో శారదాంబ శైలి 15వ శతాబ్దపు కవయిత్రి 'మొల్ల' ను అనుసరించి ఉందని పండితులు కొనియాడారు. పండితులు మన్ననలందుకున్న ఆ ప్రబంధ కావ్య రచనా శైలి ఆమె సంస్కృతాంధ్ర పాండిత్యానికు మరొక నిదర్శనం.[2][6]

మాధవశతకం[మార్చు]

స్త్రీజన సంక్షేమం కోసం భగవంతున్ని ప్రార్థించడం ఈ శతకం ప్రధానాంశం. ఇది భక్తి శతకం గాదు. సాంఘిక శతకమే.[7] శారదాంబ తన చిననాట పదునాలుగేండ్ల వయస్సులో ఈ మాధవ శతకమును రచించింది. ఆనాటికి దేశములో స్త్రీలపై చూపుతున్న వివక్షతకు విద్యారహితలుగానుంచి చేయుచున్న అన్యాయమును మానమని పూరాణేతిహాసములలో విద్యనభ్యసించిన స్త్రీలు, స్త్రీ విద్యకు గల ప్రాముఖ్యతను చాటుతూ అనేక ఐతిహాసిక ఉదాహరణలతో పెద్దలను వేడుకుంటూ 'మాధవా' అను మకుటముతో వ్రాసిన 101 పద్యాలు ఈ శతకములో ఉన్నాయి. అలనాటి స్త్రీలకు విద్యాభ్యాస లేమిచే కలుగుచున్న దుర్భరస్థితి పట్ల వ్యాకులత వ్యక్తముచేయుచూ, విద్యను ప్రసాదింపుమని భగవంతుని ప్రార్థన రూపములో శారదాంబ 'మాధవ శతకము' అనే పద్య గ్రంథం రచించింది.[3] ”ఆ కాలమునాటి స్రీలపై గల వివక్షత ఆమెను చిన్న వయస్సునుండి కలవర పరచిందని తెలుపుటకు నిదర్శనం, ఈ మాధవ శతకము. దేవలోకములో దేవతా స్త్రీలకు విద్యనభ్యసించుటకు ఎట్టి ఆటంకాలు లేనప్పుడు ఈ భూలోకములో ఎందుకని స్త్రీలను గృహ బంధితులగా చేసి విద్యాభ్యాస రహితులుగ నుంచెదరనియూ అంతే కాక విద్యాభ్యాసం చేసినంత మాత్రాన, స్త్రీలు తమ గృహనిర్వాహణ బాధ్యతలు గానీ పాతి వ్రత్యములోగాని ఎట్టి లోపాలు రానివ్వరని చెప్పుటకు ప్రామాణికముగా విద్యావంతులైన దేవతా స్త్రీలు వినయ విధేయతలుగల గొప్ప పతివ్రతలే గదాయని మాధవ శతకము లోని పద్యాల ద్వారా అప్పటి సమాజమున స్త్రీల విద్యావిషయాలలో అవరోధాలు, అభ్యంతరాలు ఉపసంహరించుకోమని ఆమె అభ్యర్థించింది. ఆయా పద్యాలలో శారదాంబ ఉదహరించిన దేవతలలో విద్యలకు దేవతైన సరస్వతితో సహ సీత, లీలావతి, భానుమతి, మొదలగు ఐతిహాసిక విద్యావంతులైన పతివ్రతలను ఉదహరించింది. శారదాంబ కావ్యరూపములో స్త్రీల విద్యాభ్యాసానికి, సామాజికాభ్యంతరాలు దూరముచేయుటకు తన కావ్యములో విద్యాభ్యాసముచేసిన దేవతలు, దేవతా స్త్రీల ప్రామాణిక సాక్షాధారాలు చూపుతూ రచించింది. “స్త్రీల దుస్థితినద్భుతంబుగా బాపి యిద్భువిన్ బన్నుగ నద్భుదుల్ తగినపట్టున విద్యను ముద్దరాండ్రకున్ గ్రన్నన నేరిపించి మరిజ్ఞానము బుట్టగ జేయుమంటూ ప్రార్థించింది.[8]

చ:మునుపటివారలెల్ల తనుముద్దియలం చదివించలేదోకో
 వినయం పతివ్రతాత్వు సువివేకములం జరియించినట్టి యా
 జనకజంజూడరే ,ం జంత్రమతింగనరే యింకెందరో
 యునుపమబుధ్దిగీర్తిలందిరి విధ్యవల్ల మాధవా
 
చ:మునుపటివారలెల్ల తనుముద్దియలం చదివించలేదోకో
వినయం పతివ్రతాత్వు సువివేకములం జరియించినట్టి యా
జనకజంజూడరే ,ం జంత్రమతింగనరే యింకెందరో
యునుపమబుధ్దిగీర్తిలందిరి విధ్యవల్ల మాధవా
 
చ:వినంగమహెశుమడెప్పుడును వీడక గంగశిరంబందునుం
చెనుగడ బ్రహ్మతాను తన జివ్హను పెట్టెనుగా సరస్వతిన్
అనవరతంబు నీహృదయమందున నిలిపితి నీదు కోమలిన్
గననదియేలకో జనులు కారలవైతురు స్త్రీల మాధవా
 
ఉ:పావననామ్ని సద్గణితదెల్పదేబోటికాదె లీ
లావతి భాస్కరార్యునుతరామయ కాదె సరస్వతింగనన్
దేవతయయ్యె విద్యలకు దేజమగ మీరగ భోజుభార్య వి
ద్యావతియైన భానుమతి యారయా నాందుతి కాదె మాధవా

అప్పటి సమాజములో స్త్రీలు నాట్యశాస్త్రమభ్యసించరాదన్న అభిమతం మార్చుటకు మహాభారతములోని ఉత్తరను ఉదహరించింది. ఆ విధముగా శారదాంబ భారత భాగవతాల నుండి పురాణేతిహాసాల నుండి అనేక ప్రమాణికాలు చూపెట్టి స్త్రీల విద్యాభ్యాసముపట్ల అప్పటి సమాజమునకల దురభిప్రాయం దూరముచేయ ప్రయత్నించింది.[4]

ఇందలి ముందుమాట, పీఠికలలో శారదాంబ అఖండ కవితాశైలి ఘనంగా వర్ణించబడింది. స్త్రీల పట్లగల వివక్షతకు వాపోయి వారి దుర్భర స్థితిగతులు మెరుగు పరచుటకు విద్యాభ్యాసం అనివార్యమని ఘోషించి ఆనాటి పరిస్థితులకెదురీది మెట్టింటివారి నిరుత్సాహక వాతావారణమునుకూడ భరించి, భగవత్ప్రార్థనా రూపములో 'మాధవా' అను సంబోధనా మకుటముతో 101 పద్యాలు గల మాధవ శతకమునూ, నాగ్నజీతి పరిణయము అను కావ్య ప్రబంధమునూ సాహసించి రచించి తన కవితా కౌశలమును చాటిన శారదాంబగారు చిరస్మరణీయులు.[8][9]

బయటి లంకెలు[మార్చు]

  1. శారదాంబ, దాసు (వేమూరి). మాధవ శతకము. Hyderabad: Mahakavi Dasu Sriramulu Smaraka Samithi, 2nd Printing: 2019. 68p.
  2. శారదాంబ, దాసు (వేమూరి). నాగ్నజితి పరిణయం. Hyderabad: Mahakavi Dasu Sriramulu Smaraka Samithi, 2nd Printing: 2019. 124p.
  3. Atchuta Rao, Dasu,editor. వేమూరి (దాసు) శారదాంబ గారు; జీవితం, సాహితీ వైభవం. 114p.
  4. అభ్యుదయ కవయిత్రి వేమూరి (దాసు)శారదాంబ - 140వ జయంతి సభ*3/5, Monday@7PM (KBS Sarma - Telugu Radham)  Youtube Link

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 శారదాంబ, వేమూరి (1979). "కళ్యాణ వీణ: ఉన్నం జ్యోతి వాసు". నాగ్నజితి పరిణయం. హైదరాబాద్: మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి. pp. 64–105.
  2. 2.0 2.1 2.2 2.3 "Vemuri Saradamba" Dr. Dasu Achuta Rao(2015) Triveni July-September 2015 pp 25-27
  3. 3.0 3.1 "వేమూరి శారదాంబ 'మాధవ శతకం'" కాత్యాయనీ విద్మహే (2017) సంస్కరణోద్యమ భావజాలానికి , మహిళా ఉద్యమ ఆకాంక్షలకు లంకె నవతెలంగాణా సోపతి ఆదివారం 24 డిసెంబరు 2017. 16,17
  4. 4.0 4.1 "మాధవ శతకము(స్త్రీ క్షేమార్ధక భగవత్ర్పార్ధన పద్యములు) రచయిత్రి వేమూరి(దాసు) శారదాంబ" (2019). pp1-61 మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి
  5. "నాగ్నజితీ పరిణయము" (2019), pp1-116. మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి
  6. Subbarao, Madiraju (2009). "Late Smt Vemuri Saradamba, D/o Mahakavi Dasu Sreeramulu". Yendaro Mahanubhavulu (in English). pp. 79–80.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  7. శారదాంబ, వేమూరి (2019). "సమీక్ష : బేతవోలు రామబ్రహ్మం". మాధవశతకము. హైదరాబాద్: మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి. pp. 44–45.
  8. 8.0 8.1 అలనాటి అభ్యుదయవాది, స్త్రీ విద్యాహితైషిః శ్రీమతి వేమూరి శారదాంబ డా.దాసు అచ్యుతరావు(2015) కిరణసాహితి మాసపత్రిక 28,29. మే 2015
  9. "స్త్రీ జనక్షేమార్ధి శ్రీమతి వేమూరి శారదాంబ" డా. దాసు అచ్యుతరావు(2014) వార్త, హైదరాబాదు శుక్రవారం డిసెంబరు 26, 2014


  1. "దస్త్రం:అభిజ్నానశాకుంతలము.pdf - వికీసోర్స్" (PDF). te.wikisource.org. Retrieved 2023-03-19.