హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముత్తయ్య భాగవతార్
జననం
హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్

(1877-11-15)1877 నవంబరు 15
హరికేశనల్లూరు, తిరునల్వేలి, తమిళనాడు, భారతదేశం
మరణం1945 జూన్ 30(1945-06-30) (వయసు 67)
జాతీయతభారతీయుడు
వృత్తికర్ణాటక సంగీత స్వరకర్త

ముత్తయ్య భాగవతార్‌గా పిలువబడే హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్ 20వ శతాబ్దపు కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు. ఇతడు 20 రాగాలను కూడా సృష్టించాడు.

ప్రారంభ జీవితం[మార్చు]

ముత్తయ్య 1877, నవంబరు 15న తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాకు చెందిన హరికేశనల్లూరు అనే కుగ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి కళాపోషకుడు కావడంతో ఇతనికి చిన్ననాటనే సంగీతంలో పరిచయం ఏర్పడింది. ఇతనికి ఆరు ఏళ్ళవయసులో ఇతని తండ్రి మరణించాడు. దానితో ఇతని మేనమామ ఎం.లక్ష్మణసూరి ఇతడిని పోషించాడు. ఇతడు సంస్కృతము, వేదము అభ్యసించాడు. కాని ఇతనికి సంగీతం పట్ల అభిమానం పెరిగి సరైన గురువును అన్వేషిస్తూ తన స్వగ్రామాన్ని వదిలి దేశాలు తిరిగాడు. చివరకు తిరువారూరులో పదినైదుమండప సాంబశివ అయ్యర్ అనే గురువు ఇతడి ప్రతిభను గుర్తించి ఇతడికి సంగీతాన్ని నేర్పించాడు. సాంబశివ అయ్యర్ సంగీత కళానిధి టి.ఎస్.సబేశ అయ్యర్ తండ్రి. ముత్తయ్య సాంబశివ అయ్యర్ వద్ద 9 సంవత్సరాలు గురుకుల పద్ధతిలో అభ్యసించి హరికథా విద్వాంసుడైనాడు.

స్వరకల్పన[మార్చు]

ఇతడు 400లకు పైగా కీర్తనలకు రాగాలను సమకూర్చాడు. వీటిలో అనేక "వర్ణాలు", "కృతులు", "తిల్లానాలు" ఉన్నాయి. ఈ కీర్తనలన్నీ సర్వ దేవతలకు సంబంధించింది కావడం విశేషం. ఇతడు తెలుగు, తమిళ, సంస్కృత, కన్నడ భాషలలో సంగీతాన్ని సమకూర్చాడు.

ఇతడు స్వరపరచిన కీర్తనల వలన నేటికీ విజయ సరస్వతి, కర్ణరంజని, బుధమనోహరి, నిరోష్ట, షణ్ముఖప్రియ, మోహనకళ్యాణి వంటి రాగాలు వాటి ఉనికిని కోల్పోకుండా ఉన్నాయి.

1934లో ఇతడు తమిళనాడు టాకీస్‌ నిర్మించిన లవకుశ సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ఇతడు 63 పాటలను సమకూర్చాడు. దానితో ఈ సినిమా పేరును "సంగీత లవకుశ"గా మార్చారు.

సంగీత కళ[మార్చు]

ఇతడు గోటువాద్యంలోను, మృదంగంలోను అపారమైన నైపుణ్యాన్ని కలిగివున్నాడు. ఇతడు "సంగీత కల్పద్రుమం" అనే ఉద్గ్రంథాన్ని రచించాడు. సంగీతశాస్త్రానికి సంబంధించి అనేక ప్రసంగాలు చేశాడు. 1943లో కేరళ విశ్వవిద్యాలయం ఇతనికి డి.లిట్., పట్టా ప్రదానం చేయడంతో భారతదేశంలో సంగీతంలో మొట్టమొదటి డాక్టరేట్ పట్టాను పొందిన వ్యక్తిగా పేరుగడించాడు. 1939లో త్రివేండ్రంలో స్థాపించిన స్వాతి తిరునాళ్ సంగీత అకాడమీకి ఇతడు మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించాడు. ఇతడు సంస్కృతంలో "త్యాగరాజ విజయం" అనే కావ్యాన్ని రచించాడు. తిరువనంతపురం దేవాలయంలో పూజాసమయంలో నాదస్వరాన్ని వినిపించే సాంప్రదాయాన్ని ఇతడే ప్రవేశపెట్టాడు.

ఇతని కీర్తనలను ప్రచారంలో తీసుకురావడనికి ఇతని వంశస్థులు హరికేశాంజలి ట్రస్టును నడుపుతున్నారు.

అవార్డులు, గుర్తింపులు[మార్చు]

ఇతడు మైసూరు మహారాజా "కృష్ణరాజ ఒడయార్ IV" వద్ద ఆస్థాన విద్వాంసునిగా నియమించబడ్డాడు. ఇతడు మైసూరులో ఉన్నప్పుడు చాముండీ దేవిని కీర్తిస్తూ 115 కృతులను కన్నడ భాషలో రచించాడు. తరువాత ఇతడు తిరువాంకూరు సంస్థానానికి ఆహ్వానించబడ్డాడు. అక్కడ స్వాతి తిరునాళ్ కృతులను అధ్యయనం చేసి "సంగీత కల్పద్రుమం" అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథం ఇతనికి కేరళ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ను సంపాదించి పెట్టింది[1]. ఇతడు "మద్రాసు సంగీత అకాడమీ" ప్రథమ వార్షిక సమావేశాలకు అధ్యక్షత వహించాడు. 1930లో మద్రాసు సంగీత అకాడమీ ఇతనికి సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రదానం చేసింది.

కీర్తనలు[మార్చు]

ముత్తయ్య భాగవతార్ తెలుగులో స్వరపరచిన కీర్తనల వివరాలు[2]:

పల్లవి రకం రాగం తాళం
అంబా వాణి నన్నాదరించవే కృతి కీరవాణి ఆది
ఇకనే తాళజాలనురా నన్నింతటి శోధన సేయకురా గుహా కృతి గుహరంజని ఆది
ఇది మంచి సమయమురా నన్నేలుకోరా కృతి ఆనందభైరవి ఆది
ఇది వేళ నన్నేల ఈశసుతా నీకు కృతి కోకిలభాషణి సంకీర్ణజాతి రూపక
ఎన్నాళ్ళూ తిరుగుదును ఈ జన్మమెత్తినే కృతి మందారి ఖండచాపు
కలిలో హరి చరణమొకటియే గాక ఇతర మార్గం మరి లేదయ్యా కృతి కాపి ఆది
చలమేల చేసేవు నా సామి చాల నమ్మియున్నానురా కృతి నారాయణ గౌళ ఆది
జగద్గురో దయానిధే శ్రీ శంకర శివాకృతే కృతి అఠాణా రూపక
జనని ఆశ్రిత పాలిని జగజ్జీవ రత్నాంగి కృతి రత్నాంగి రూపక
తారక నామ దశరథ రామా కృతి మాయామాళవగౌళ ఆది
తెలియక నేజేసిన దుడుకెల్ల మాంచరా కృతి హుసేనీ రూపక
తోడు నీడ నీవే సుందర షణ్ముఖా కృతి పున్నాగవరాళి ఆది
త్యాగరాజ సద్గురువని దలచవే ఓ మనసా కృతి హిందోళ రూపక
దర్శనమే జన్మ సాఫల్యము కృతి రక్తిమార్గిని ఆది
దేవకి తనయుని బాగ సేవింపరారే కృతి శంకరాభరణం ఆది
ధీర శిఖామణి దశరథ కులమణి కృతి రీతిగౌళ ఆది
నా పుణ్యము గాదా ఈశా కృతి కీరవాణి ఆది
నిన్ను నమ్మినాను జనని బ్రుహన్నాయకి కృతి అభోగి మిశ్ర ఏక
నిన్ను నెరనమ్మినానురా రామా కృతి దేవమనోహరి ఆది
నీ భజన గానామృతము నిత్యానందమురా కృతి కాంభోజి ఆది
నీ పాదములను నమ్మితిని నిఖిల లోక జనని శ్రీ కాంతిమతి కృతి నటభైరవి ఆది
నీ పాదమే గతియనుచు నిన్నే శరణంటి నిఖిలలోక నాయక కృతి భైరవి ఆది
నీదు మహిమ పొగడ నా తరమా రామా నిత్య సుఖదా కృతి హంసానంది ఆది
నీలాయతాక్షి నీవే జగత్ సాక్షి కృతి విజయశ్రీ ఆది
నీవే ఇటు పరాకు చేసితే నేనెందు పోదురా గుహా కృతి ఖరహరప్రియ ఆది
నేను చేసిన పూజా ఫలము కృతి దేవమనోహరి ఆది
పంకజ లోచనిరా భామా పరమ సుగుణి మణిరా ఈ పడతి కృతి ఆనందభైరవి ఆది
పశుపతి పాదసేవనమే పరమానందము ఓ మనసా కృతి కళ్యాణి ఆది
పశుపతి ప్రియసతి పావని నీవే గతి కృతి పశుపతి ప్రియ రూపక
బంధము సేయరాదు పామరుడైన నాపై కృతి నాగేశ్వరావళి ఆది
బలుమోస మయ్యనురా బాగాయరా సామి కృతి సహన ఖండచాపు
మంచి పణదిరా నిన్ను జూచి మరులు కొన్నదిరా మారుబారి తాళదురా చక్కని సామిగావురా కృతి హిందోళ ఆట
మనమోహనా మానిని నీపై చాల మరులుకొని గాసి యున్నదిరా వర్ణం మోహన ఆట
మనసు కరగి అమృతధార వర్షము వర్షింపు గుహా నీ కృతి మేఘరంజని రూపక
మానము కావలెను తల్లి మహిషాసురమర్ధిని అభి కృతి సహన రూపక
మీనలోచని అంబా వేగ నన్ను బ్రోవవే అంబా కృతి తోడి రూపక
రాజరాజేశ్వరి రాజ పరమేశ్వరి రక్షించవే రాఘవ సోదరి కృతి గరుడధ్వని ఆది
లంబోదర సోదరా నవమణి హారా కృతి కళ్యాణి సంకీర్ణ చాపు
వాగీశ్వరి వాణి సరస్వతి వరదాయకి వనజప వసతి కృతి సరస్వతి ఆది
శక్తి వినాయక సజ్జన తారక సద్గుణ నాయకా బ్రోవుము కృతి శ్రీరంజని ఆది
శరవణభవానంద స్వామి షణ్ముఖా నీదు చరణముల చూపరాదా కృతి కామవర్ధని ఆది, ఖండగతి
శరవణభవా సమయమిదిరా సరగున నన్ను బ్రోవరా కృతి పశుపతిప్రియ ఆది
శోదన సేయకవే అంబా సుముఖీ నీదు బాలుడైన నన్ను కృతి బిలహరి ఆది
శ్రీ మహా గణపతే నిన్నుకోరి సేవించితి కృతి కాంభోజి ఆట
శ్రీ మహాబల శైల వాసిని చాముండేశ్వరి కాపాడుము కృతి శుద్ధ సావేరి రూపక
శ్రీ మహిషాసుర మర్ధిని శ్రితజన పరిపాలిని కృతి హంసగామిని రూపక
శ్రీ రఘువర చిన్మయ రామా క్షేమకరా నన్ను బ్రోవుమా కృతి నాయకి ఆది
శ్రీ రాజమాతంగి చాముండేశ్వరి నారాయణి రక్షించు గౌరి వర్ణం శుద్ధ ధన్యాశి ఆది
శ్రీ శరవణ బహునివినా దైవముగలదా కలిలో కృతి సుమన ప్రియ రూపక
శ్రీ సాంబశివ సద్గురు దివ్య చరణ దాసోహం కృతి గురుప్రియ ఖండచాపు
సన్నుతాంగి శ్రీ చాముండేశ్వరి శతోదరి సాధు జనావనే సారస నయనే వర్ణం వసంత ఆది
సమయమిదే నన్ను బ్రోచుటకు సనకాదినుత షణ్ముఖదేవ కృతి బుధమనోహరి ఆది
సరసిజాక్షా నిన్ను కోరినదిరా సరసగాన నిపుణ శృంగార రసానుభవ సుగుణరా కృతి కళ్యాణి ఆట
సారసాక్షి నీ పద పంకజమున సేవించిన నన్ను బ్రోవ సమయము పరమ మంగళదాయిని కృతి కేదారగౌళ ఆది

మూలాలు[మార్చు]

  1. "D.Litt for Yesudas after Muthia and Semmangudi from Kerala University". The Hindu. Chennai, India. 29 March 2003. Archived from the original on 1 October 2013. Retrieved 18 August 2011.
  2. ముత్తయ్య భాగవతార్ తెలుగులో స్వరపరచిన కీర్తనల వివరాలు

బయటి లింకులు[మార్చు]