2006 జనవరి 3వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జనవరి 21 2006, శనివారం[మార్చు]

  • ఎంపీల బహిష్కరణ అంశంపై కోర్టు నోటీసులను తీసుకోరాదన్న లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ చటర్జీ నిర్ణయం దురదృష్టకరమని, మాజీ భారత అటార్నీ జనరల్‌, సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది సోలి సొరాబ్జీ అభిప్రాయపడ్డాడు. సుప్రీం నోటీసులను స్పీకర్‌ తీసుకుని, తాను చెప్పదలచుకున్న విషయాన్ని సమాధానంగా రాసి పంపితే బాగుంటుందన్నాడు. పార్లమెంటు, సుప్రీం కోర్టు రెండింటికీ విశేషాధికారాలు ఉన్నాయనడంలో సందేహం లేదు, అయితే తమ అధికార పరిధిపై రెండూ విచక్షణ కలిగి పరస్పరం గౌరవించుకోవాలి, ఏదీ ఎక్కువ కాదు, అలాగని తక్కువా కాదని ఆయన అన్నాడు. స్పీకర్‌ స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీం కోర్టు నోటీసులు స్వీకరించబోననడం సముచితంగా లేదన్నారు.
  • కాంగ్రెసు పార్టీ ప్లీనరీ ప్రారంభం: కాంగ్రెసు పార్టీ 82 వ ప్లీనరీ మొదలైంది. మూడు రోజులపాటు ఇది జరుగుతుంది.

జనవరి 20, శుక్రవారం[మార్చు]

  • నోటీసు పుచ్చుకోను, కోర్టు పిలిచినా వెళ్లను- స్పీకరు: ముడుపులకు ప్రశ్నల వివాదంలో ఎంపీలను బహిష్కరించిన కేసులో సుప్రీం కోర్టు లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు పంపడంతో ఈ అంశంపై స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసు పుచ్చుకోనని, కోర్టు పిలిచినా వెళ్లనని ఆయన తేల్చిచెప్పారు. ఆయన నిర్ణయానికి అఖిలపక్షం మద్దతు పలికింది. అసలు స్పీకర్‌కు నోటీసు పంపి ఉండాల్సింది కాదని అభిప్రాయపడింది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ మాత్రం మిగిలిన పార్టీలతో విభేదించింది. "సుప్రీంకోర్టు పంపిన నోటీసులు ఇంకా నాకు అందలేదు. అవి వచ్చినప్పుడు గౌరవప్రదంగా వెనక్కి పంపుతా" అని ఆయన అన్నాడు.
  • కె.సి.ఆర్, ఉమ భేటీ: రాష్ట్ర పర్యటనకు వచ్చిన భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత ఉమాభారతిని శుక్రవారం కేసీఆర్‌ తన నివాసానికి ఆహ్వానించాడు. "యూపీఏ మంత్రివర్గంలో మీరిద్దరూ సభ్యులు. మీ మాటకే అక్కడ విలువ లేనప్పుడు ఇంకా పదవుల్లో కొనసాగడంలో అర్థం లేదు. తెలంగాణ కోసం ఒత్తిడి తెండి. ససేమిరా అంటే తక్షణం పదవులు వదిలి రండి. తెలంగాణ కోసం ఉద్యమించండి." అని తెరాస అగ్రనేతలు కేసీఆర్‌, నరేంద్రలకు ఉమాభారతి హితవు పలికింది.
  • తెరాస అసమ్మతి శాసన సభ్యులుల బహిరంగ సభ: మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో తెలంగాణ అభివృద్ధి శంఖారావం పేరుతో తెరాస అసమ్మతి శాసన సభ్యులులు భారీ బహిరంగ సభ జరిపారు. జయప్రకాశ్‌రెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు, శారారాణి, ముకుందరెడ్డి ఇందులో పాల్గొన్నారు. "గారడీ విద్యలు... మోసపు మాటలూ ఇంకా ఎన్నాళ్లు? తెలంగాణ కోసం ఇంకా రెండు నెలలు ఎందుకు వేచి ఉండాలి? దమ్ముంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రండి! లేకపోతే మిమ్మల్నే ప్రజలు రాళ్లతో కొట్టే రోజు వస్తుంది. కేసీఆర్‌ ఖబడ్దార్‌" అంటూ వీరు విమర్శించారు. తెలంగాణ నినాదాన్ని అమ్ముకొని సింగపూర్‌, మలేషియాల్లో ఆస్తులు కూడబెడుతున్నారని దుగ్యాల విమర్శించాDu.
  • పోతిరెడ్డిపాడు జి.ఓ. పై నిరసన: అయిదు జిల్లాల ఎన్‌.ఎస్‌.పి. ఆయకట్టు రైతుల భవిష్యత్‌ ప్రశ్నార్థకం చేస్తున్న 'పోతిరెడ్డిపాడు' జి.ఒ.లపై దేశం పార్టీ సమర శంఖం పూరిచింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి మాజీమంత్రి నెట్టెం రఘురాం అధ్యక్షతన జరిగిన పాదయాత్ర ప్రారంభ సభలో మాజీ మంత్రులు కోడెల శివప్రసాద్‌, తుమ్మల నాగేశ్వరరావు, శాసన సభ్యులులు కరణం బలరామ్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నన్నపునేని రాజకుమారి, గుత్తా సుఖేంద్రరెడ్డి, అంబటి బ్రాహ్మణయ్య తదితరులు ప్రసంగిస్తూ పోతిరెడ్డిపాడుపై విడుదలైన అక్రమ జీవోలు ఉపసంహరించుకునేవరకు ఉద్యమం సాగుతుందని అన్నారు. జగ్గయ్యపేట మున్సిపల్‌ కూడలిలో జరిగిన బహిరంగసభ అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి 477 కి.మీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

జనవరి 19 2006, గురువారం[మార్చు]

  • సహారా ఎయిర్‌లైన్స్ అమ్మకం: రూ.2,300 కోట్లు చెల్లించి సహారాను జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలు చేసింది. దీంతో దేశీయ మార్కెట్‌లో జెట్ వాటా 45 శాతానికి పెరుగుతుంది. కొత్తగా 27 విమానాలు, 22 పార్కింగ్ బేలు దాని చేతికొస్తాయి. భారత విమానయాన రంగంలోనే ఈ ఒప్పందం అతిపెద్దది.
  • ఎస్సీల వర్గీకరణ: ఎస్సీల వర్గీకరణపై రాష్ట్రప్రభుత్వం హామీ ఇవ్వాల్సిందేనని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) తేల్చిచెప్పింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేత సానుకూల ప్రకటన చేయించాలని డిమాండ్ చేసింది. జాతీయ పార్టీలైన సీపీఎం, సీపీఐ, భారతీయ జనతా పార్టీలు వర్గీకరణకు అనుకూల ప్రకటన చేసినా కాంగ్రెస్ నుంచి స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. మాలల నేతల ఒత్తిడికి లొంగే ఆ పార్టీ వెనుకాడుతోందని ఆరోపించారు.

జనవరి 18 2006, బుధవారం[మార్చు]

  • 1000 కోట్ల రూపాయల అవినీతి: సాగునీటి ప్రాజెక్టుల్లో 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించిన సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, మొత్తం ప్రభుత్వంలోనే అవినీతి ఉందంటూ ధ్వజమెత్తాడు. ప్రభుత్వం తనకు పంపిన లీగల్ నోటీసును బుధవారమే చూశానని తెలిపాడు. ఒక్క సాగునీటి శాఖలోనే కాదు. అన్ని శాఖల్లోనూ అవినీతి ఉంది. సాగునీటి ప్రాజెక్టుల్లో వెయ్యికోట్ల అవినీతి జరిగిందని ఇప్పుడే కాదు... ఇంతకుముందూ చెప్పాను. కొన్ని పత్రికల్లో వ్యాసాలూ రాశాను. వోక్స్‌వ్యాగన్, దేవాదాయ భూముల కుంభకోణం నుంచి... మొన్నటి ఉపాధ్యాయుల బదిలీల వరకూ అవినీతిమయమే అని రాఘవులు పేర్కొన్నాడు. పలు విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తమను భయపెట్టి, బెదిరించి, నోరు మూయించేందుకేనని ప్రభుత్వం లీగల్ నోటీసు పంపిందని ఆరోపించాడు.
  • ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువన్న చందంగా తెరాస అధినేత కేసీఆర్ వ్యవహరిస్తున్నారని సీపీఎం శాసనసభా పక్షనేత నోముల నర్సింహయ్య పేర్కొన్నారు. సమస్యల విషయంలో తమకు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్న ప్రాంతీయ విభేదాలు లేవని నోముల అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులుపై కేసీఆర్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. వామపక్షాలతో కయ్యం పెట్టుకున్న వాళ్లంతా భూస్థాపితం అయ్యారన్న విషయం కేసీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు.
  • ఎన్టీఆర్ జాతీయ అవార్డును పునరుద్ధరించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. భారత చలనచిత్ర రంగంలో విశిష్ట సేవలు చేసినవాళ్లకి ప్రతిష్ఠాత్మకమైన ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. అవార్డు గ్రహీతలకు రూ. 5 లక్షలు నగదు అందించి సత్కరిస్తారు. 2003, 2004, 2005 సంవత్సరాలకు సంబంధించిన ఎన్టీఆర్ జాతీయ అవార్డులను 2006 నవంబరు 1న, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందించాలని తీర్మానించారు.

జనవరి 17 2006, మంగళవారం[మార్చు]

శాంతకుమారి
  • తెలంగాణ ద్రోహులను రాళ్ళతో కొట్టండి - కె.సి.ఆర్:ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ద్రోహం తలపెట్టిన వారిని బట్ట లూడే వరకు కొట్టి, ప్రజా బహిష్కారం చేయాలని టిఆర్‌ఎస్‌ అధినేత, కేంద్రమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కార్యకర్తలకు పిలుపు ఇచ్చాడు. మెదక్‌ జిల్లా రామా యంపేటలో మంగళవారం జరిగిన మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించాడు. ఆంధ్రప్రాంతం వారికన్నా ఇంటి దొంగలే ప్రమాదమంటూ, దొంగలు కాబట్టే వారు లెజిస్లేచర్‌ పార్టీ సమావేశా నికి రాలేదని ముగ్గురు శాసన సభ్యులులపై విరుచుకు పడ్డాడు. ద్రోహులు, వెన్నుపోటుదారులను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించరాదని, అలాంటి వారిని రాళ్లతో కొట్టాలన్నాడు. ఉద్యమ ద్రోహులకు ఆ జిల్లా నాయకులే ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలని అన్నాడు. ఆంధ్రజ్యోతి[permanent dead link]
  • గ్రీన్‌కార్డు మోసగాడు నరేంద్ర మందలప అరెస్టు: తప్పుడు ధృవీకరణ పత్రాలు, తప్పుడు వీసాలు, తప్పుడు గ్రీన్‌కార్డులు సృష్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు ఎన్‌ఆర్‌ఐ నరేంద్ర మందలపను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ విభాగం అధికారులు అరెస్టు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈయనకు సంబంధించిన దాదాపు 57 లక్షల డాలర్ల ఆస్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ఆంధ్రజ్యోతి[permanent dead link]
  • నటి శాంతకుమారి మరణం: తెలుగు చిత్ర పరిశ్రమ ఆప్యాయంగా 'అమ్మ' అని పిలుచుకునే అలనాటి నటి శాంతకుమారి మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు చెన్నై లోని స్వగృహంలో మరణించింది. 1920 మే 17ప్రొద్దుటూరులో జన్మించిన శాంతకుమారికి మరణించే నాటికి 86 సంవత్సరాలు. ప్రఖ్యాత దర్శకుడు పి.పుల్లయ్య సతీమణి అయిన శాంతకుమారి 1936లో శశిరేఖా పరిణయం సినిమాతో నట జీవితం ప్రారంభించి వందకు పైగా సినిమాల్లో నటించింది.

జనవరి 16 2006, సోమవారం[మార్చు]

  • తెలంగాణకు ద్రోహం చేస్తే ప్రళయ బీభత్సం:ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్‌ ద్రోహం చేస్తే సహించేది లేదని, ప్రళయ బీభత్సాన్ని సృష్టిస్తామని తెరాస‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు హెచ్చరించాడు. వచ్చేనెలలో యు.పి.ఎలోని భాగస్వామ్య పార్టీలతో కలిసి ప్రత్యేక తెలంగాణపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటామని ప్రకటించాడు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసే వారిని రాళ్ళతో కొట్టాలని ఆయన పిలుపునిచ్చాడు.ఆంధ్రజ్యోతి[permanent dead link]
  • తెలంగాణ అనుమానమే: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లోనూ, కేంద్రంలోనూ ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని తెలంగాణపై కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, రఘువంశ్ ప్రసాద్ సింగ్ సూచనప్రాయంగా వెల్లడించాడు. ప్రత్యేక తెలంగాణపై ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్‌, బిజెపి, డిఎంకె తమ వైఖరులు వెల్లడించలేదని తెలిపాడు. శాసనసభలో తీర్మానం ఆమోదిస్తేనే తెలంగాణ ఏర్పాటు సాధ్య మవుతుందని స్పష్టం చేశాడు.
  • షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణ: షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణను ఒక వర్గమే వ్యతిరేకిస్తోందని, మిగతా అన్నివర్గాలు, రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కూడా సానుకూలంగా ఉన్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కోనేరు రంగారావు వెల్లడించాడు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వద్ద జరిగిన ఒక సమావేశానికి హాజరైన మంత్రి కోనేరు తనను కలసిన విలేఖరులతో మాట్లాడుతూ మాలలకు తాను ఎన్నడూ వ్యతిరేకం కాదన్నాడు. తన అల్లుడు, పెద్దకోడలు, మేనల్లుడి భార్య మాలలేనని తన మనవరాలిని కూడా మాల కులస్తులకే ఇచ్చానని చెప్పాడు. మాల మాదిగల మధ్య ఐక్యత బలపడాలంటే వారి మధ్య బంధుత్వాలు పెరగాలని అంబేద్కర్‌ చెప్పేవారని, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మాల కులస్తులతో తాను బంధుత్వాలు పెంచుకుంటున్నానని మంత్రి వివరించాడు. ఆంధ్రజ్యోతి[permanent dead link]
  • హైదరాబాదులో బిట్స్: ప్రతిష్ఠాత్మకమైన బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నలాజికల్‌ సైన్సెస్‌ (బిట్స్‌) ను రంగారెడ్డి జిల్లా పరిధిలో, హైదరాబాదు నుండి కరీంనగర్‌ వెళ్ళే దారిలో హకీంపేట విమానాశ్రయానికి సమీపంలో షామీర్‌పేటకు దగ్గరలో ఉన్న జవహర్‌నగర్‌వద్ద 200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. 2006 మార్చిలో పనులు ప్రారంభించి 2007 విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ తరగతులను నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.

జనవరి 15 2006, ఆదివారం[మార్చు]

  • తెరాస శాసనసభాపక్ష సమావేశం: హైదరాబాదులో జరిగిన తెరాస శాసనసభాపక్ష సమావేశం వాగ్వివాదాలతో హోరెత్తిపోయింది. అగ్రనేతలు కె.సి.ఆర్, నరేంద్రలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసమ్మతి శాసన సభ్యులులు దుగ్యాల శ్రీనివాసరావు, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, బండారు శారారాణిలు ఈ భేటీకి హాజరు కాలేదు. దీనిపై అధిష్ఠానం ఆగ్రహించింది. వారు శాసన సభ్యులు పదవులకు, పార్టీకి రాజీనామా చేయాల్సిందిగా తీర్మానించాలన్న ప్రతిపాదన తెచ్చింది. అయితే దీనిపై తీవ్ర విభేదాలు తలెత్తాయి. వాడివేడి చర్చ జరిగింది. ఇద్దరు అసమ్మతి శాసన సభ్యులులు వాకౌట్ చేశారు. చివరికి సమావేశానికి హాజరుకాని ముగ్గురు శాసన సభ్యులులూ తెలంగాణ ఉద్యమ ద్రోహులని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించాడు. అసమ్మతి నాయకుడిగా ఇంతకాలం వ్యవహరించిన మందాడితో పాటు కంభంపాటి లక్ష్మారెడ్డి కూడా అధిష్ఠానంతో గళం కలిపారు.
  • కె.సి.ఆర్ ఇలా అన్నాడు: "మీరు ఉద్యమ ద్రోహులు. తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతుల్లో పావులయ్యారు. అందుకే... శాసనసభా పక్ష భేటీ కోసం నానాయాగీ చేసి, ఇప్పుడు ముఖం చాటేశారు. పార్టీ పైనా, అధ్యక్షుడినైన నా పైనా, చివరికి నేటి భేటీపైనా నీలాపనిందలు వేశారు. మీకే చీమూ నెత్తురూ ఉంటే... తెలంగాణ బిడ్డలైతే... పార్టీకీ, శాసనసభ సభ్యత్వానికీ రాజీనామా చేసి మళ్లీ గెలవండి"
  • శారారాణి ఇలా అంది:తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు తనను తెలంగాణ ద్రోహిగా అభివర్ణించడం పట్ల ఆ పార్టీ శాసన సభ్యులు శారారాణి ఇలా అంది.. "ఇంకా బుద్ధి రాలేదా? మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పారు. సహకార ఎన్నికల్లో నామరూపాల్లేకుండా చేశారు. అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ అన్నావు. కేంద్రంలో మంత్రిపదవుల్లో ఊరేగుతున్నావు. ప్రజల్ని మభ్యపెడుతున్నావు. నీదే అసలు సిసలు ద్రోహం. ముందు నువ్వు రాజీనామా చెయ్యాలి. ఎంపీగాను, కేంద్ర మంత్రి పదవికీ రెండింటికీ చేయాలి. ఆనక మళ్లీ పోటీ చేసి గెలువు. ఆ తర్వాత మేం చేస్తాం. రాజీనామా చేసి గెలుస్తాం.
  • అక్కినేని నాగేశ్వరరావు అవార్డు: అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏర్పాటైన ప్రతిష్ఠాత్మక అవార్డును ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా దేవానంద్కు ప్రదానం చేసారు. అవార్డు కింద రూ.3 లక్షల నగదు బహుమతిని ఆయనకు అందజేశారు.