తలుపుదగ్గర పాటలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇవి ముఖ్యముగా తలుపు దగ్గర ముఖా ముఖి జరిగిన సంవాదాలు పాటల రూపంలో ఉంటాయి. అందుకే వీటిని తలుపుదగ్గర పాటలు అంటారు. కొన్ని పద్యాలలో ఉన్నా గణవిభాజనకి లొంగవు కనుక వీటిని పాటలనే అంటారు.

సత్యభామ వాకిట శ్రీకృష్ణుడు నిలిచి తలుపు తీయమంటాడు. ఆమె ఖండిత నాయిక అయి చక్కని దేహము నలిపెక్కినదేమోయి అనీ చిక్కని గోరులు కొనలు వంగెనేమొయి అనీ నిలవదీస్తుంది. ఏవో కొంటి సమాధానలు చెబుతాడు స్వామి.

ఇంకో పాటలో సీతారాములకు తలుపు దగ్గర సంవాదము. అయితే సీత ఖండితనాయిక కాదు. ఆఅమ్మకు ఆఅయ్య సంగతంతా బాగా తెలుసును. కనక ఏదో వినోదానికి మాత్రమే అడ్డు ప్రశ్నలు వేస్తుంది. ఈ పాటలో చివ్వర ధరణిలో శ్రీహరి దాసుల బ్రోచితే అని కనబడుతుంది.

ఇంకో తలుపుదగ్గర పాట బాలకృష్ణ భామలకు సంవాదము. ఇందులోని భామ ప్రశ్నలలో గడుసుదనము పదునెక్కుతుంది. చీరలు రవికలు చిత్రపటంబులు కొనితెచ్చితివే భామా అని స్వామి అంటే, చీరలు కలిగితే చెలియలవలువలు చేగోని పోదువటోయీ అని అడుగుతుంది. పాముపై పవళించెడి వారికి పరుపులెక్కడివి అనీ, అక్షయముగ గజ అశ్వములుంటే పక్షినెక్కుటనేమోయీ అనీ విప్రుని ధోవతికొంగున యటుకులు విప్పితివటే యేమోయీ అనీ అల్లరి పెడుతతుంది.

ఇంకో తలుపుల పాట పార్వతి పరమేశ్వరుడు ల సంవాదము. వరనవమణి కనకోజ్వల కనకకవాటము దియ్యవెగౌరీ అని మహాఠీవిగా అడుగులు వేస్తూ ప్రారంభించింది. ఇది ఎవడొ ప్రౌఢకవి రచించి ఉంటాడు. "శఖిలోచనము, కలపము, చిలుకవజీరు" వంటి పదాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఇంకో తలుపుల పాట శ్రీ వెంకటేశ్వరుడుకి అలమేలుమంగకూ సంవాదము. తన వంటిమీది చిన్నెలన్నింటికీ ఏదో సమాధానాలు చెప్పి, "భామరొనేనే మెరుగననుచు బల్ పామునైన బట్టెనే" అనీ "అతివల నెవ్వరి కలయలేదని అగ్ని నైన మింగినే" అనీ అంటాడు స్వామి. " వాటికంటె ప్రబుద్ధుడవు నీకు వాటివల్ల భయమేమి" అని అడ్డు సవాళ్ళు వేస్తుంది.

మనకింత వరకు లభించిన యక్షగానం లలో కందుకూరి రుద్రకవి (సా.శ. 1580-1620) సుగ్రీవవిజయము ప్రాచీనమైనది. కాని ఇందులో తలుపుదగ్గర పాటలు లేవు. కాని మిగతా యక్షగానంలలో గరుడాచల నాటకము, వల్లాపుర ఉషాపరిణయము, గౌరీశంకరవిలాసము, ఆండాళ్ చరిత్రము మొదలైన వాటిలలో ఈ పాటలు ఉన్నాయి.

తమిళములో యక్షగానములు లేవంటారు. తలుపుతెరిచేపాట ఈ తెలుగురచనలలో ప్రవేశించి చాలా మార్పులు చెందింది. ఈనాడు తెలుగులో తలుపుదగ్గరపాటలు చాలానే ఉన్నాయి. మొదట వీటిని ప్రచురించినవారు శ్రీ నందిరాజు చలపతిరావు గారు. వారు 1921లో ప్రచురించిన స్త్రీల పాటలు ఇవి ఉన్నాయి.

దేవాలయాలలో ఉత్సవ సమయాలలో వీటిని పాడుట పరిపాటి. ఈపాటలు చాలా మట్టుకు పున్నాగ రాగంలో ఉన్నాయి చాలా మట్టుకు. కొన్ని నాథనామక్రియలో ఉన్నాయి. ఈ రెంటికి మూర్ఛన ఒకటే గాని స్వరాలు తేడా ఉంటాయి. కాలక్రమాన ఈ పాటలలో దేవీ దేవరా అదృశ్యులై అన్నా చెల్లిళ్ళు, ముక్తికాంతా జీవులు, తారా చంద్రులు, ఉషా అనిరుద్ధులు, రతీదేవి, మన్మధుడు ప్రవేశించారు.

మూలము[మార్చు]

1954 భారతి మాస పత్రిక ఎడిషన్ 7.