నూజివీడు సంస్థానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నూజివీడు కోట ఉత్తర దిక్కు ప్రవేశ మార్గం

నూజివీడు సంస్థానం, ఆంధ్రప్రదేశ్ లోని నూజివీడు ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన సంస్థానం.ఈ సంస్థానం 569 చదరపు మైళ్ల మేర విస్తరించి, 231 గ్రామాలు కలిగి ఉంది. శోభనాద్రి అప్పారావు పాలన తర్వాత తలెత్తిన వారసత్వ కలహాల వళ్ళ, సంస్థానం 1882లో ఆరు జమీందారీలుగా విడిపోయింది. ఈ సంస్థానం నుండి ఏర్పడిన జమీందారీలు - వెంట్రప్రగడ, వుయ్యూరు, మీర్జాపురం, కపిలేశ్వరపురం, తెల్లప్రోలు, మేడూరు.[1]

చరిత్ర[మార్చు]

మేకా వంశీయులకు చెందిన వేంకట రంగయ్యప్పారావు

సంస్థానం ప్రారంభ చరిత్ర[మార్చు]

16వ శతాబ్దంలో విజయప్పారావు బిరుదుగల అప్పన్న గొల్లపల్లి దుర్గం నుండి వేటకై బయలుదేరి పోతుండగా ఒకచోట నూవు చేలల్లో ఒక మేక తోడేలును ఎదిరించుట చూచి ఆశ్చర్యపడి, బంధువులను పిలిపించి, ఆ చేలలోనే సమావేశం ఏర్పరచి, ఆ ప్రదేశం శౌర్యనిలయంగా గుర్తించి, అక్కడ 50 ఎకరాల స్థలంలో నూజివీడు కోటను నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నాడు.నువ్వుచేల ప్రదేశం కావున అప్పుడు దానిని నూజేలవీడుగా నామకరణం చేశారు.కాలక్రమేణా అది నూజివీడుగా ప్రసిద్ధిచెందింది. అప్పటినుండి నూజివీడు మూడు శతాబ్దాల పాటు రాజధానిగా ఉంది. సంస్థానం స్థాపించడానికి కారణమైన శౌర్యంగల మేక కనుక ఈ రాజులకు మేకా అనే ఇంటిపేరు వాడుకలోకి వచ్చినట్లుగా తెసుస్తుంది. ఈ వంశీయులకు చెందిన అప్పన్న నిర్మించాడు. కనుక వారి వంశనామం మేకా అప్పారావుగా స్థిరపడింది. ఈ సంస్థానాధీశులు విప్పర్ల గోత్రజులు, పద్మనాయక రాచ వెలమలు. వీరికి మన్నె వెలమలనీ, వెలమ దొరలనీ వాడుక పేర్లు ఉన్నాయి.

నరసింహ అప్పారావు తిరుగుబాటు[మార్చు]

1771లో నూజివీటి జమీందారైన నరసింహ అప్పారావు చాలా ఖర్చుమనిషిగా పేరొందారు. ఆ కారణంగా చెన్నపట్నంలోని ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పేష్కసు (కప్పం) కూడా సరిగ్గా చెల్లించలేక ఇబ్బందుల్లో పడ్డారు. 1773లో జమీందారీని వశపరుచుకోవడానికి ఒక సైనిక దళాన్ని పంపారు. అప్పుడు ఆయన అధిక వడ్డీ రేట్లకు బందరులోని కొందరు కంపెనీ దొరల వద్దనే కొంతసొమ్ము బదులు తీసుకుని బకాయి కట్టేశారు. 1775లో బందరులో కంపెనీవారి పరిపాలనాసంఘాధ్యక్షునిగా ఉన్న వైట్‌హిల్‌కు, హాడ్జెస్ కీ, మరికొందరు కంపెనీ ఉద్యోగస్తులకు నరసింహ అప్పారావు బాకీ ఉన్నారని తగాదా పెరిగి మూడు సంవత్సరాలు గడిచినా వ్యవహారం ముందుకుసాగలేదు. నరసింహ అప్పారావు వ్యవహారం తేల్చుకునేందుకు మద్రాసు వెళ్ళినా అక్కడ వైట్ హిల్ కి ఉన్న పలుకుబడి వల్ల ఆయన మాట ఎవరూ వినిపించుకోలేదు. కంపెనీ పరిపాలన, న్యాయం వంటివాటిపై పూర్తగా విశ్వాసం కోల్పోయిన అప్పారావు తిరిగుబాటు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాంతో కంపెనీ వారు మేజర్ కాసాను నూజివీడు పంపి జమీందారును బందరు తీసుకువచ్చి అరెస్టు చేశారు. ఆయనను నిర్బంధించిన కారాగారాధికారి హాడ్జెసే కావడంతో ముందుగా ప్రస్తావించుకున్న దొరలందరికీ అప్పారావు, వారు చెప్పేంత ధనం ఇవ్వాల్సిందిగా బాకీ పత్రం నరసింహ అప్పారావుతో వ్రాయించుకున్నారు. అప్పటికే వైట్ హిల్ చేసిన అక్రమాలపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో 1781లో ఆయనను సస్పెండ్ చేశారు. ఈ అవకాశం తీసుకుని అప్పారావు తనకు జరిగిన అన్యాయాన్ని మద్రాసు పరిపాలక సంఘ తాత్కాలిక ముఖ్యాధికారి శాడ్లియర్‌కు అర్జీ పెట్టుకున్నారు. ఆయన దానిని కంపినీ డైరెక్టర్ల కోర్టుకు పంపారు. ఆపైన గవర్నరైన మెకార్‌ట్నీ న్యాయబుద్ధితో నూజివీడు సంస్థాన విషయాన్ని పరిశీలించి కచ్చితంగా వైట్ హిల్ చేసిన అక్రమాల్లో ఇది ఒకటి కావచ్చునని భావించారు. కానీ ఈలోగా కంపెనీ వారు అర్జీపై న్యాయం చేస్తారన్న నమ్మకం కోల్పోయిన నరసింహ అప్పారావు 1783లో కొంత సైన్యాన్ని సమకూర్చుకుని కోటలో ఉండి తిరుగుబాటు చేశారు.[2]
ఆయనపై కంపెనీ సైన్యాన్ని పంపగా నిజాం రాజ్య సరిహద్దు దాటి వెళ్ళిపోయి నూజివీడుపై తనకున్న సైన్యంతో దండయాత్రలు చేస్తూపోయారు. ఆయనను పట్టుకునేందుకు నిజాం ప్రభుత్వంతో కంపెనీ ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూండగా తిరుగుబాటును క్షమిస్తే బాకీ చెల్లించేట్టు ఒప్పందం చేసుకుని జమీందారీ తిరిగిపొందారు. మొదటి కిస్తీ కట్టి రెండవది కట్టలేక మళ్ళీ మారువేషంతో పారిపోయారు. కంపినీ వారు నరసింహ అప్పారావుకు జమీందారీ తీసివేశామని ఆయన కుమారుడు వెంకట నరసింహ అప్పారావును జమీందారును చేశామని 1784లో ప్రకటించారు. నరసింహ అప్పారావు భద్రాచలం అడవుల్లో అనుచరులను చేర్చుకుని ఉంటూ సైన్యంతో వచ్చి గ్రామాలు కొల్లగొడుతూ, గృహదహనాలూ, ఖజానా లూటీలు చేస్తూండడంతో చివరకు కంపెనీవారు ఈ పోరు పడలేక నరసింహ అప్పారావు కొడుకుతో నూజివీటిలో ఉండేందుకు అంగీకరించారు. కుమారుని అసమర్థత వల్ల తండ్రి పరోక్షంగా రాజ్యంలో అధికారం నిలుపుకని, పలుకుబడి నెరపుతూండడంతో నరసింహ అప్పారావును బందరు రప్పించి అక్కడ ఖైదు చేశారు. ఆయనతోపాటుగా వచ్చిన పరివారం కొత్త జమీందారుకు లొంగకు చిన్న రాణీ కుమారుణ్ణి రాజ్యానికి తీసుకురావాలని అల్లర్లు, దౌర్జన్యాలు చేసేవారు. ఒక ప్రభుత్వాధికారి లంచం వ్యవహారంలో జరుగుతున్న కేసులో సాక్ష్యమిచ్చేందుకు మద్రాసు తీసుకురాగా వృద్ధులైన నరసింహ అప్పారావు అక్కడే కొద్ది రోజుల్లో మరణించారు.[2]

జమీందారీ హక్కుల విభజన[మార్చు]

కంపెనీ వారు భూస్వామ్యపు హక్కులను నిర్ణయించి పర్మినెంట్ సెటిల్మెంట్ చేయతలపెట్టినప్పుడు నూజివీడు జమీందారీలో పెద్ద భార్య కుమారునికీ, చిన్న భార్య కుమారులకు నడుమనున్న తగాదాలు పరిష్కరించారు. దానిలో భాగంగా వెంకట నరసింహారావుకు నిడదవోలు పరగణాలు, రామచంద్రఅప్పారావుకు వుయ్యూరు పరగణాలు ఇచ్చారు. తమకు జమీందారీ నుంచి రావలసిన పేష్కషు బకాయిని వదులుకొన్నారు. జమీందారీని ఆ పరిష్కారంపై 1803లో వారికి వశపరిచారు.[2]

సంస్థానాధీశ్వరులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తూమాటి, దోణప్ప. ఆంధ్ర సంస్థానములు : సాహిత్య పోషణ (PDF). విశాఖపట్నం: ఆంధ్రవిశ్వకళా పరిషత్. pp. 197–212. Retrieved 17 November 2014.
  2. 2.0 2.1 2.2 వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలూ-గాథలూ (మొదటి సంపుటం).

ఇవికూడా చూడండి[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]