మిషన్ కాకతీయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిషన్ కాకతీయ
మన ఊరు మన చెరువు
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపనమొదటి దశ (మార్చి 12- జూలై 11, 2015)
వెబ్ సైటుఅధికారిక వెబ్ సైట్
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

మిషన్ కాకతీయ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు, కాలువలు నీటితో కళకళలాడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ (మన ఊరు, మన చెరువు) ను ప్రారంభించింది. వేల ఏండ్లపాటు తెలంగాణను సస్యశ్యామలం చేసి, కొన్ని దశాబ్దాలుగా పూడుకుపోయిన దాదాపు 46 వేలకుపైగా (సుమారు 12,000 గొలుసుకట్టు) చెరువులను మళ్ళీ పునరుద్ధరించడమే మిషన్ కాకతీయ ప్రధాన లక్ష్యం.[1] ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 46,531 చెరువులు, సరస్సులలో 265 టిఎంసి నీటిని నిల్వచేయడం కోసం ఇది రూపొందింది.[2] 2014 జూన్‌లో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి కార్యక్రమం ఇది. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి పూడిక తొలగించడానికి ట్యాంకులు, సరస్సులను తవ్వారు. ఆయకట్టు ప్రాంతంలో గృహ వ్యవసాయ ఆదాయం కూడా 78.50% పెరిగింది.

ఈ పథకం తొలిదశలో 5 నుంచి 10 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన చెరువుల పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం 20 శాతం చొప్పున 2023 వరకు నాలుగుదశల్లో 9,155 కోట్ల రూపాయలతో 27,627 చెరువులు పునరుద్ధరించబడ్డాయి. కట్టల బలోపేతం, పూడికతీయడం, తూముల పునర్నిర్మాణం, అలుగుల మరమ్మతులు తదితర పనులు పూర్తిచేయబడ్డాయి. తద్వారా ఆయా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరగడంతో గ్రామాల్లో భూగర్భజలాల మట్టం కూడా పెరిగింది.[3]

చరిత్ర[మార్చు]

తెలంగాణలో వ్యవసాయం పూర్తిగా చెరువులపైనే ఆధారపడి ఉండేది. నిజాం పాలన వరకు తెలంగాణ ప్రాంతంలో ట్యాంకులలో 244 టీఎంసీల సామర్థ్యం ఉండేవి. 1956లో 70,000 ట్యాంకుల కింద సాగునీరు (ఆయకట్టు) దాదాపు 25 లక్షల ఎకరాలు ఉండేది. 2014 నాటికి 46,531 ట్యాంకులు మిగిలి ఉన్నాయి, వాటిలో దాదాపు సగం ఎండిపోయాయి. రైతులు సాగునీటి బావులపై ఆధారపడటం ప్రారంభించారు. నీటి మట్టం తగ్గడంతో బావులు ఎండిపోవడంతో రైతులు బోర్‌వెల్‌లు తవ్వడం ప్రారంభించారు. అవి కూడా భూమి, భూగర్భజలాలు లేకపోవడంతో ఎండిపోయాయి.

ప్రారంభం[మార్చు]

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2015, మార్చి 12న కామారెడ్డి జిల్లా, సదాశివనగర్‌ లోని పాత చెరువులో మిషన్ కాకతీయ పథకానికి శంకుస్థాపన చేసాడు.[4] తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజులు ఈ ప్రాంతంలో ఎన్నో కాలువలు తవ్వించారు. వారి గుర్తుగా ఈ ప్రాజెక్టుకు మిషన్ కాకతీయ అని పేరు పెట్టారు.

ఈ కార్యక్రమాన్ని 2015 డిసెంబరు మూడవ వారంలో ప్రారంభించారు. ఐదేళ్లలో 2,00,000 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలోని 46,531 చెరువులను మిషన్ కాకతీయ ప్రాజెక్టులో భాగంగా పునరుద్ధరించారు. అన్ని చెరువులను 250 ~ 270 టిఎంసిల కన్నా ఎక్కువ నీటి సామర్థ్యన్ని కలిగివుండేలా పునరుద్ధరించడం ద్వారా వ్యవసాయం, నీటిపారుదల, పశువులు, మంచినీటి అవసరాలకు నీటిని అందుబాటులోకి తెచ్చారు.

పనుల అప్పగింత[మార్చు]

నీటిపారుదల శాఖ పునర్నిర్మాణంలో భాగంగా ఈ శాఖ పరిధిలో ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటనెన్స్‌ (ఓఅండ్‌ఎం) విభాగాన్ని ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ను నియమించి ప్రాజెక్టులు, పంప్‌లు, కాల్వలు, చెరువులు, తూముల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. ఓఅండ్‌ఎం వారు ప్రతి సీజన్‌ ప్రారంభంలోనే తూములు, షెట్టర్లు, ప్రాజెక్టుల గేట్లను చెక్‌ చేయడం, గ్రీసింగ్‌ తదితర చర్యలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. డీఈ రూ.5 లక్షలు, ఈఈ రూ.25 లక్షలు, ఎస్‌ఈ రూ.55 లక్షలు, చీఫ్‌ ఇంజినీర్‌ రూ.కోటి వరకు సత్వర పనులకు కోసం వెచ్చించే అధికారం ఇచ్చారు. ఫలితంగా చెరువులకు ఎక్కడయినా గండి పడినా వెంటనే ఇంజినీర్లు తమ ఆర్థిక అధికారాలను వినియోగించి మరమ్మతు పనులు సత్వరమే పూర్తి చేస్తున్నారు. సంవత్సరానికి దాదాపు 280 కోట్ల రూపాయల వరకు ఓఅండ్‌ఎం పనులకు ప్రభుత్వం వెచ్చిస్తోంది.[3]

ప్రాజెక్టు[మార్చు]

ఈ ప్రాజెక్ట్ ఐదు దశల్లో చేపట్టబడింది:

  • మొదటి దశ - 8003 ట్యాంకులు
  • రెండవ దశ - 8927 ట్యాంకులు
  • మూడవ దశ - 5886 ట్యాంకులు
  • నాలుగవ దశ - 6000 ట్యాంకులు
  • ఐదవ దశ - మిగిలిన, కొత్త ట్యాంకుల సృష్టి

పెద్ద చెరువులు, సరస్సులు ఎత్తైన ఆయకట్టుతో ముందుగా ప్రారంభించబడ్డాయి. 2018 మార్చి నాటికి 27,713 సరస్సుల పనులు పూర్తయ్యాయి, ₹8700 కోట్లు ఖర్చు చేసి, స్థిరీకరించి 20 లక్షల ఎకరాలకు నీటిని అందించారు.

మట్టిపోషకాల వాడకం[మార్చు]

మట్టి పోషకాలు అధికంగా ఉన్న సిల్ట్ లేదా మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకున్నారు. చెరువలు నుంచి తవ్విన దాదాపు 7 కోట్ల ట్రాక్టర్ల సిల్ట్‌ను రైతులు వినియోగించుకున్నారు.

విజయాలు[మార్చు]

గొట్టపు బావి నీటికి బదులుగా ఉపరితల నీటిని ఉపయోగించడం ద్వారా నాణ్యతలో గణనీయమైన మార్పు వచ్చింది. 2.88 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు స్థిరీకరించబడింది, ప్రాజెక్ట్ పూర్తయ్యే నాటికి 12 లక్షల ఎకరాలకు చేరుకుంటుంది. భూగర్భ జలాలు 6.9% నుంచి 9.2%కి పెరిగాయి. మత్స్యకారుల జీవనోపాధి కూడా మెరుగుపడింది.

వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా గా పిలువబడుతున్న నీటి కార్యకర్త, రాజేంద్ర సింగ్ ఈ సరస్సులను సందర్శించి, 2016లో వరంగల్‌లోని ట్యాంక్ బండ్‌పై తన పుట్టినరోజు జరుపుకున్నారు. తెలంగాణ కవులైన నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహా రెడ్డి, దేశపతి వంటి ప్రసిద్ధులు తమ కవితలలో మిషన్ కాకతీయ ప్రశస్తి ని కొనియాడారు.

అధ్యయనాలు[మార్చు]

వివిధ ప్రభుత్వ సంస్థలు, యుఎస్ ఆధారిత విశ్వవిద్యాలయాలైన మిచిగాన్ విశ్వవిద్యాయలం, చికాగో విశ్వవిద్యాలయం ఈ ప్రాజెక్ట్‌ను అధ్యయనం చేస్తున్నాయి.[5][6]

మిచిగాన్ విశ్వవిద్యాలయ అధ్యయన బృందం భారతీయ రైతులకు పంట దిగుబడిని పెంచడానికి, ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి తక్కువ ఖర్చుతో కూడిన మార్గాన్ని అభివృద్ధి చేస్తోంది. యూనివర్సిటీలోని ఎనిమిది విభాగాలను చెందిన 16 మంది విద్యార్థులతో కూడిన మల్టీ-డిసిప్లినరీ బృందం, 12 నెలలపాటు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని రెండు గ్రామాలలో పనిని విశ్లేషించి కార్యక్రమ ప్రభావం గురించి తెలుసుకుంది.[7] ఎరువుల వినియోగం తగ్గడం, విద్యుత్ వినియోగం తగ్గడం, పంట దిగుబడి పెరగడం వంటివి వారి పరిశోధనల్లో భాగంగా ఉన్నాయి.[8] చికాగో విశ్వవిద్యాలయం వ్యవసాయ, పర్యావరణ, ఆర్థిక ఫలితాలపై దాని ప్రభావాన్ని అంచనా వేస్తోంది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్ కూడా ప్రాజెక్ట్ ప్రభావంపై అధ్యయనం చేసింది. ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యయనం కూడా చేస్తోంది.

అవార్డులు[మార్చు]

  • 2018లో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పవర్‌ నుంచి బెస్ట్‌ ఇరిగేషన్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును అందుకుంది.
  • ఈ మిషన్‌ కాకతీయ పథకం 2021లో జాతీయస్థాయిలో స్కోచ్‌ అవార్డును గెలుచుకుంది. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలోని ఈ గవర్నెన్స్‌ విభాగం ఇంజినీర్లు తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ జాతీయస్థాయిలో గుర్తింపుపొందింది. ఎల్‌ఏఎంఎం పేరిట తయారుచేసిన ఈ సాఫ్ట్‌వేర్‌, మొబైల్‌ యాప్‌తో చెరువుల స్థితిగతులు, నీటినిల్వ, పునరుద్ధరణ పనుల ప్రగతి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. అలాగే వరద నివారణ చర్యలను సమర్థవంతంగా నిర్వహించి నిధులు ఆదా చేయవచ్చు. వర్చువల్‌గా నిర్వహించిన స్కోచ్‌ 75వ సమ్మిట్‌లో ఈ గవర్నెన్స్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రామాంజనేయులు అవార్డు అందుకున్నాడు.[9]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, TELANGANA NEWS. "మిషన్ కాకతీయ పవిత్ర యజ్ఞం". Archived from the original on 22 November 2016. Retrieved 17 December 2016.
  2. "Mission of the program - Mission Kakatiya". missionkakatiya.cgg.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2018. Retrieved 2018-01-19.
  3. 3.0 3.1 telugu, NT News (2023-07-31). "Mission Kakatiya | అద్భుత ఫలితాలిస్తున్న మిషన్‌ కాకతీయ.. భారీ వర్షాల్లోనూ చెక్కుచెదరని చెరువులు". www.ntnews.com. Archived from the original on 2023-08-05. Retrieved 2023-08-05.
  4. "మిషన్ కాకతీయ పథకానికి ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] శంకుస్థాపన". Archived from the original on 2016-03-04. Retrieved 2016-12-17.
  5. Chandrashekhar, B. (5 January 2016). "Mission Kakatiya already showing positive results". The Hindu. Retrieved 20 February 2020.
  6. INDIA, THE HANS (2016-06-01). "Mission Kakatiya wows US varsities". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-11-17.
  7. "Desilting ponds in India benefit farmers, environment". University of Michigan News. 2016-02-09. Retrieved 2021-11-17.
  8. U.S. varsity students’ study on Mission Kakatiya vies for NatGeo award, The Hindu, 2017-09-15
  9. "మిషన్‌ కాకతీయ'కు స్కోచ్‌ అవార్డు". Namasthe Telangana. 2021-11-14. Archived from the original on 2021-11-15. Retrieved 2021-12-23.