అడయార్ కె.లక్ష్మణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడయార్ కె.లక్ష్మణ్
బాల్య నామంఅడయార్ కె.లక్ష్మణ్
జననం(1933-12-16)1933 డిసెంబరు 16
కుప్పం, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా
మరణం2014 ఆగస్టు 19(2014-08-19) (వయసు 80)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
జాతీయతభారతీయుడు
రంగంభరత నాట్యం,
భారతీయ శాస్త్రీయ సంగీతం
శిక్షణకళాక్షేత్ర
చేసిన పనులుఅలరింపు, పుష్పాంజలి
అవార్డులుపద్మశ్రీ పురస్కారం (1989)
సంగీత నాటక అకాడమీ అవార్డు (1991)

అడయార్ కె.లక్ష్మణ్ (1933 – 2014) [1] ఒక భరతనాట్య కళాకారుడు, నృత్య దర్శకుడు, గురువు.[2][3][4]

ప్రారంభ జీవితం[మార్చు]

ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని కుప్పం పట్టణంలో 1933, డిసెంబరు 16వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి కృష్ణరాజారావు అక్కడ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. రుక్మిణీదేవి అరండేల్ సహాయకుడు పి.డి.దొరస్వామి అయ్యర్ ఇతడు, ఇతడి సోదరుడు రామారావుల అసమానమైన సంగీత ప్రతిభను గుర్తించి వారిని కళాక్షేత్రలో లలితకళల్లో శిక్షణ ఇప్పించడానికి ప్రతిపాదన చేశాడు. ఇతని తండ్రి ఈ ప్రతిపాదనకు సంతోషంగా అంగీకరించాడు.[5]

శిక్షణ[మార్చు]

ఇతడు తన 11వ యేట 1944లో కళాక్షేత్రలో ప్రవేశించాడు. ఇతడు గాత్ర సంగీతం, భరతనాట్యం, నట్టువాంగం, మృదంగాలలో గొప్ప గురువుల వద్ద కఠిన శిక్షను తీసుకున్నాడు. ఇతడు రుక్మిణీదేవి అరండేల్, మైలాపూర్ గౌరి అమ్మ, కె.ఎన్.దండాయుధపాణి పిళ్ళై, ఎస్.శారద, టైగర్ వరదాచారి, బడలూర్ కృష్ణమూర్తిశాస్త్రి, టి.కె.రామస్వామి అయ్యంగార్, మైసూరు వాసుదేవాచార్య, తంజావూర్ రాజగోపాల అయ్యర్, వి.విఠల్, కమలారాణి, కారైక్కూడి ముత్తు అయ్యర్ వంటి మహామహుల శిష్యరికంలో భరతనాట్యం, కర్ణాటక సంగీతం, నట్టువాంగంలలో శిక్షణ పొంది 1954లో వాటిలో డిగ్రీ సంపాదించాడు. తరువాత కూడా కళాక్షేత్రలోనే కొనసాగుతూ భారత ప్రభుత్వం నుండి ఉపకారవేతనాన్ని పొంది 1956లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సంపాదించాడు.

తరువాత ఇతడు మృదంగంలో శిక్షణ పొందాడు. అంబు పణికర్, చందు పణికర్‌ల వద్ద కథాకళి నేర్చుకున్నాడు. ఈ సమయంలో రుక్మిణీదేవి అరండేల్ మేలత్తూర్ భాగవత మేళా సంప్రదాయంలో రూపొందించిన "కుమార సంభవం", "కుట్రల కురువంజి", "సీతా స్వయంవరం", "ఉషా పరిణయం" వంటి నృత్యనాటికలలో నటించాడు.[6]

వృత్త్తి[మార్చు]

ఇతడు మొదట వైజయంతిమాల నడిపిన "నృత్యాలయ"లో నాట్యాచార్యునిగా చేరాడు. అక్కడ 10 సంవత్సరాలకు పైగా పనిచేసి 10 మంది కళాకారులకు రంగప్రవేశం చేయించాడు. "తిరుప్పావై", "అళగర్ కురువంజి", "చండాలిక", "సంగ తమిళ్ మాలై" వంటి నృత్య నాటికల రూపకల్పనలో సహకరించాడు.

అకాడమీ[మార్చు]

1969, ఆగష్టు 29వ తేదీన ఇతడు "భారత చూడామణి అకాడమీ"ని స్థాపించాడు. ఈ అకాడమీ ద్వారా ఇతడు అనేక మందికి శిక్షణనిచ్చి వారిని నాట్య కళాకారులుగా తీర్చిదిద్దాడు. "వరుణపురి కురవంజి", "అచ్చయ్యార్ కురవై" మొదలైన నృత్యనాటికలను రూపొందించాడు. హంసగీతె, సుబ్బశాస్త్రి, ఆనంద తాండవం వంటి సినిమాలలో శాస్త్రీయ నృత్యాలకు నృత్య దర్శకత్వం వహించాడు.[6][7]

అవార్డులు[మార్చు]

ఇతడు భరతనాట్యంలో గురువుగా, కొరియోగ్రాఫర్‌గా, కంపోజర్‌గా, నట్టువనార్‌గా సలిపిన కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలను స్వంతం చేసుకున్నాడు. 1989లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం, 1991లో భరతనాట్యంలో సంగీత నాటక అకాడమీ అవార్డు[8] మొదలైనవి స్వీకరించాడు.

మరణం[మార్చు]

ఇతడు తన 80యేళ్ళ వయసులో చెన్నైలో 2014, ఆగష్టు 19వ తేదీన మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "Dance doyen passes away". The Hindu. 21 August 2014. Retrieved 21 August 2014.
  2. "Singing paeans to a guru". The Hindu. 25 December 2009.
  3. "Adyar K. Lakshman conferred the 'Nadhabrahmam' title". The Hindu. 15 December 2008. Archived from the original on 18 డిసెంబరు 2008. Retrieved 19 ఏప్రిల్ 2021.
  4. "To Sir with love". The Hindu. 17 December 2009.
  5. "A picture of poise". The Hindu. 13 March 2009. Archived from the original on 7 నవంబరు 2012. Retrieved 19 ఏప్రిల్ 2021.
  6. 6.0 6.1 "Inimitable dance guru". The Hindu. 1 December 2003. Archived from the original on 6 డిసెంబరు 2003. Retrieved 19 ఏప్రిల్ 2021.
  7. ""Bharatanatyam growth to be exponential" (Interview)". The Hindu. 13 July 2008. Archived from the original on 2 ఆగస్టు 2008. Retrieved 19 ఏప్రిల్ 2021.
  8. "Sangeet Natak Akademi Puraskar (Akademi Awards)". Sangeet Natak Akademi. Archived from the original on 17 February 2012.

బయటి లింకులు[మార్చు]