చలసాని ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చలసాని ప్రసాద్ కవి,రచయిత

చలసాని ప్రసాద్ ప్రముఖ కవి,రచయిత, విమర్శకులు. ఆయన విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

చలసాని ప్రసాద్ స్వస్థలం కృష్ణా జిల్లా లోని భట్ల పెనుమర్రు. డిసెంబరు 8 1932 న కృష్ణానదీ తీరంలోని చల్లపల్లి దగ్గరిలో నాదెళ్ళవారి పాలెం లో జన్మించాడు.[2][3] విరసం స్థాపనలో ఆయనది కీలకమైన పాత్ర. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన జైలుకు వెళ్లారు. నమ్మిన విప్లవ సిద్ధాంతానికి కట్టుబడిన ఆయన పలుమార్లు జైలుకు వెళ్లాడు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయనకు మంచి పేరుంది.[4] కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి, కెవిఆర్‌లతో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. పలు గ్రంథాలను ఆయన సంకలనం చేశారు. శ్రీశ్రీ సాహిత్యంపై ఆయనకు ఎనలేని పట్టు ఉంది. సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాల్లో ఆయన ముఖ్యమైన భూమిక పోషించారు. చలసాని ప్రసాద్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విప్లవ సాహిత్యోద్యమంలో ఆయన చివరి శ్వాస వరకు పాల్గొంటూ వచ్చారు. కమ్యూనిస్టు కుటుంబంలో జన్మించిన ఆయన చివరి వరకు కమ్యూనిస్టుగానే కొనసాగాడు.

కమ్యూనిస్ట్ ఉద్యమంలో కీలక పాత్రవహించిన చలసాని ప్రసాద్.. నమ్మిన సిద్ధాంతాలకోసం చాలామందితో విభేదించాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నాడు. ఎమర్జన్సీ కాలంలో చలసాని ప్రసాద్ జైలు శిక్ష అనుభవించాడు. సాహితీ విమర్శకుడుగా ఎందరికో స్ఫూర్తి నిచ్చాడు. విప్లవ రచయితల సంఘం స్థాపనలో శ్రీశ్రీతో కలిసి పనిచేశాడు. ప్రజా ఉద్యమాల అణిచివేతలపై జీవితకాలం పోరాడాడు. ఎన్నోసార్లు జైలు జీవితం గడిపాడు. శ్రీశ్రీ, రంగనాయకమ్మలకు చలసాని అత్యంత సన్నిహితులు.[5]

ఆయన విశాఖపట్నం ఎ.వి.ఎన్ కళాశాల నుంచి రాజనీతి శాస్త్రం అధ్యాపకునిగా పదవీవరమణ చేశాడు. హెచ్.బి.కాలనీ, విశాఖపట్నంలో ని ఆయన గృహంలో అనేక వేల పుస్తకాలు ఉన్నాయి. అందులో ఎక్కడా లభించని అరుదైన పుస్తకాలు ఉన్నాయి. ఆయన అనేక విషయాలలో లోతుల వరకు చర్చించేవాడు.

ఆయన వామపక్ష భావజాలం కలిగి ఉన్నప్పటికీ విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్య సమావేశాలకు ఎప్పుడూ హాజరయ్యేవాడు. ఆయనకు రచలనంటే ఆసక్తి ఎక్కువ.[6]

సాహితీకారునిగా[మార్చు]

సాహిత్య రంగంలో ఆయన కృషి రెండు పాయలుగా సాగింది. సాహిత్యోద్యమాలను నిర్మించడంలో గత అర్ధ శతాబ్దంలో ఆయన కీలక పాత్ర పోషించారు. విరసం వ్యవస్థాపకులలో ప్రధానమైన వారు. ఆయన పేరు ఎవరు ప్రస్తావించినా విరసం ప్రసాద్ అంటారు. విరసం అన్న మాట దాదాపుగా ఆయన ఇంటిపేరై పోయింది. ప్రసాద్ సాహితీ సృజన తక్కువేమీ కాదు. కవిత్వం, వ్యాసాలు రాశారు. అవసరమైనప్పుడల్లా సామాజిక, రాజకీయ అంశాల మీదా రాశారు. అయితే ఉద్యమజీవులందరికి లాగే తన సృజనాత్మక శక్తిని ప్రోది చేసుకుని, పదిల పరచుకుని ఆ రంగంలో కీర్తి సంపాదించాలన్న దుగ్ధ ఆయనకేనాడూ లేదు. 1970లో విరసం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. 1985 నుంచి 88 వరకు మూడేళ్ల పాటు విరసానికి కార్యదర్శి. 1998 నుంచి 2002 వరకు అధ్యక్షులు. అయినా ఆయన సాహిత్యోద్యమంలో తనను తాను కార్యకర్తగానే పరిగణించే వారు. సాహితీ రంగం కూడా ఆయనను అదే దృష్టితో చూసింది. తొమ్మిదో తరతి విద్యార్థిగా ఉన్నప్పుడు 1947 “నవయుగ” సంచికలో “ఓ విద్యార్థి సోదరుడా, సమ్మెయే మన ఆఖరి ఆయుధమోయ్” అన్న పాటతో మొదలు పెట్టి కవిత్వం, సాహిత్య విమర్శ, ముందుమాటలు, సాహిత్య, రాజకీయ అంశాల మీద వ్యాసాలు దండిగానే రాశారు. చాలా కాలంపాటు ఒకటి రెండు అనువాదాలు తప్ప స్వతంత్ర రచనలుగా ప్రచురించడం మీద ఆయన దృష్టి ఎన్నడూ లేదు. 2008లో “సాహిత్య వ్యాసాలు”, 2010లో “చలసాని ప్రసాద్ రచనలు” వెలువడ్డాయి.[2]

మరణం[మార్చు]

ఆయన జూలై 25 2015 శనివారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో విశాఖపట్టణం లోని తన నివాసంలోనే గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అంబులెన్స్ చేరుకునేలోగానే ఆయన మరణించారు.[4]

మూలాలు[మార్చు]

  1. "విరసం నేత చలసాని ప్రసాద్‌ కన్నుమూత". Archived from the original on 2016-03-07. Retrieved 2015-07-25.
  2. 2.0 2.1 "సాహిత్యోపజీవి చలసాని ప్రసాద్". Archived from the original on 2015-07-25. Retrieved 2015-07-25.
  3. Prominent Revolutionary Writer, VIRASAM Founder Chalasani Prasad Passed Away[permanent dead link]
  4. 4.0 4.1 విరసం నేత, ప్రముఖ రచయిత చలసాని ప్రసాద్ కన్నుమూత
  5. చలసాని ప్రసాద్ కన్నుమూత[permanent dead link]
  6. ‘Virasam’ Chalasani Prasad passes away

ఇతర లింకులు[మార్చు]