పెనుగొండ కోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెనుకొండ కోట

పెనుకొండ కోట శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ మండలం, పెనుకొండలో ఉంది. ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 36 కి. మీ. దూరంలో ఉంది.పెనుకొండ విజయనగర రాజుల రెండవ రాజధానిగా వెలుగొందింది.[1] పెనుకొండ శతృదుర్భేద్యమైన దుర్గం. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న గిరి దుర్గాలలో ప్రఖ్యాతి గాంచింది. శాసనాల్లో దీనిని 'పెనుకొండ ఘనగిరి' గా లిఖించినట్లు తెలుస్తుంది.[2]

చరిత్ర[మార్చు]

పెనుకొండ కోట గురించి వివరణ.

ఈ కోటను మొదటగా హోయసలలు పాలించారు.[3] వారు జైన మతస్తులు ఐనందున అక్కడ జైన మతం బాగా అభివృద్ధి చెందినది. ఆకాలంలో పెనుకొండ అనేక జైన దేవాలయాలు అభివృద్ధి చెందాయి. ఇప్పటికి ఈ ప్రాంతం జైన మతస్తులకు అత్యంత ప్రాదాన్యమైంది. ఆ తర్వాతి కాలంలో చాళుక్యులు , విజయనగర రాజులు, నవాబులు, టిప్పు సుల్తాన్ పరిపాలించారు. చివరగా బ్రిటిష్ వారి వశమైంది. కృష్ణదేవరాయల కాలంలో పెనుగొండ వారి రాజ్యానికి రెండవ రాజధానిగా వర్థిల్లింది.[1] అదేవిదంగా వారికి ఇది వేసవి విడిదిగా కూడా సేవ లందించింది.విజయనగర సామ్రాజ్యం కృష్ణదేవరాయల తర్వాత వేంకటపతి రాయలు ఈ కోటను తన ఆదీనములోనికి తెచ్చుకొన్నాడు. అతడు రాయ దళవాయి కోనేటి నాయుడుని ఈ ప్రాంతానికి పాలకునిగా నియమించాడు. వారి వంశస్తులైన కోనేటి నాయుడు పెనుకొండతోబాటు రాయదుర్గ, కుందుర్పి కోటలను కూడా సుమారు 17 సంవత్సరాల పాటు పరిపాలించాడు. అతని తరువాత వెంకటపతి నాయుడు, పెద తిమ్మప్ప నాయుడు, కోనేతి నాయుడు, రాజగోపాల నాయుడు, తిమ్మప్ప నాయుడు మొదలగు వారు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.

సంపద[మార్చు]

విజయనగర రాజ్య పతనానంతరం విజయనగరం నుండు ఆనేక ఏనుగులు, గుర్రాల పై విజయనగర సంపదను తరలించి పెనుకొండలోను, చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కోటలో దాచారని చారిత్రిక ఆధారాలున్నాని. అందుచేత పెనుగొండ కోటలో ముష్కరులు గుప్త నిధులకొరకు అనేక సార్లు త్రవ్వకాలు నిధిని తస్కరించారని కథనాలున్నాయి. ఇటీవలి కాలంలోను ఇటువంటి సంఘటనలు జరిగినట్టు వార్తలు వచ్చాయి.

విశేషాలు[మార్చు]

పెనుకొండ కోట బుక్కరాయుడు కట్టించిన ఈ కోటలో ఎన్నో పురాతన శాసనాలు ఉన్నాయి. ఇందులోని కట్టడాలు శత్రుదుర్బేద్యంగా ఉంటాయి. యెర్రమంచి గేటులో 1575లో నిర్మించిన 11 అడుగుల ఆంజనేయుని విగ్రహం ఉంది. విజయనగరపు రాజులు యుధ్ధానికి వెళ్ళేముందు ఇక్కడే పూజలు జరిపేవారట. పెనుకొండలో 365 దేవాలయాలు ఉన్నాయి.[3] వీటిని కృష్ణదేవరాయలు నిర్మించాడు.

ఈ దుర్గ ప్రశస్తి గురించి ఒక గేయం[మార్చు]

దుర్గ ప్రశస్తి గురించి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గేయాన్ని వ్రాసి,1941లో పెనుకొండలో జరిగిన రాయలసీమ మహాసభల్లో స్వయంగా అతనే ఆలపించాడని తెలుస్తుంది.


చనిన నాళుల తెనుగు కత్తులు
సానవెట్టిన బండ ఈ పెనుగొండ కొండ

రంధ్రముల ప్రహరించు శత్రుల, రక్తధారల త్రావి త్రేచిన
ఆంధ్ర కన్నడ రాజ్యలక్ష్ముల కరితి నీలపు దండ ఈ పెనుగొండ కొండ

వెరపులెరుగని బిరుదు నడకల, విజయనగరపు రాచకొడుకులు
పొరలబోయగ కరడుకట్టిన పచ్చినెత్తురు కొండ ఈ పెనుగొండ కొండ

తిరుమలేంద్రుని కీర్తి తేనెలు, బెరసి దించిన కాపుకవనపు
నిరుపమ ద్రాక్షారసంబులు నిండి తొలికెడు కుండ ఈ పెనుగొండ కొండ

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "రాయల కీర్తి పతాక పెనుకొండ". www.andhrajyothy.com. 2019-04-17. Archived from the original on 2019-11-12. Retrieved 2019-10-20.
  2. "మీకు తెలుసా?". Sakshi. 2017-05-09. Archived from the original on 2019-10-20. Retrieved 2019-10-20.
  3. 3.0 3.1 "పెనుకొండ కోటలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో తెలుసా..?". Namaste (in ఇంగ్లీష్). Archived from the original on 2019-10-20. Retrieved 2019-10-20.

వెలుపలి లంకెలు[మార్చు]