చాళుక్యులు
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
చాళుక్యులు దక్షిణభారత దేశాన్ని క్రీ.శ. 6- 12 శతాబ్ధాల మధ్య పరిపాలించిన రాజులు. ముఖ్యంగా వీరు భారత దేశంలోని కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించారు. క్రీ.శ. 2వ శతాబ్దమునాటి ఇక్ష్వాకుల శాసనములో "కండచిలికి రెమ్మనక" అనువాడు ఇక్ష్వాకుల సామంతుడని ఉన్నది. ఇక్ష్వాకుల పతనము తర్వాత పల్లవుల ధాటికి తాళలేక వీరు కర్ణాటప్రాంతానికి వెళ్ళారు. దుర్గా ప్రసాద్ మరియు అడ్లూరి గారి అభిప్రాయములను బట్టి చాళుక్యుల పూర్వీకులు ఆంధ్రులే[1][2]. రెండవ పులకేశి మారుటూరు శాసనములో 'చాళుక్య విషయము' ప్రసక్తి గలదు. ఈ చాళుక్య విషయము ప్రస్తుత రాయలసీమలోని కడప-కర్నూలు ప్రాంతము. కర్ణాట దేశమందలి బాదామినేలుతున్న కదంబులనోడించి చాళుక్యులు ఒక మహా సామ్రాజ్యము స్థాపించారు.
చాళుక్యులు తెలంగాణముగుండా తిరిగి ఆంధ్రదేశము ప్రవేశించి వేములవాడ చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, చాళుక్య చోళులు మున్నగు శాఖలుగా పరిపాలన చేశారు.
విషయ సూచిక |
[మార్చు] పూర్వ చాళుక్యులు
- ప్రధాన వ్యాసం: తూర్పు చాళుక్యులు
పూర్వ (తూర్పు) చాళుక్యులు బాదామి పశ్చిమ చాళుక్య వంశమునుండి చీలిన ఒక శాఖకు చెందినవారు. వీరికి మూలపురుషుడు పశ్చిమ చాళుక్య రాజులలో ప్రసిద్ధుడయిన ఇమ్మడి సత్యాశ్రయ పులకేశి పెద్ద తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుడు. పులకేశి క్రీ.శ. 617 మరియు 624ల లో కళింగ, వేంగీ దేశములు (దుర్జయులను) జయించి వానిపై తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనుని పాలకునిగా నియమించాడు. కుబ్జవిష్ణువర్ధనుని పరిపాలనాకాలము క్రీ. శ. 624-641. క్రీ. శ. 631వరకు అన్న పులకేశికి ప్రతినిధిగా పాలించాడు. అప్పటివరకు కృష్ణానదికి దక్షిణమునందలి తీరాంధ్రదేశమంతయూ పల్లవుల ఆధీనములోనుండెను. క్రీ. శ. 630లో పల్లవ రాజు మొదటి మహేంద్రవర్మ మరణించాడు. అదే అదనుగా పులకేసి కమ్మనాడు ఆక్రమించి వేంగీ రాజ్యాధిపత్యాన్ని కుబ్జవిష్ణువర్ధనునికి ఇచ్చాడు. కీ. శ. 631 తరువాత పులకేశి మూడుపర్యాయాలు పల్లవ రాజ్యాన్ని అతలాకుతలము చేశాడు. అయితే క్రీ. శ.641లో పల్లవ రాజు మొదటి నరసింహవర్మ బాదామి ముట్టడి చేసి పులకేశిని వధించాడు. అన్నకు సహాయము చేయుటకై వెడలి కుబ్జవిష్ణువర్ధనుడు కూడ మరణించాడని చారిత్రకుల అభిప్రాయము.
కుబ్జవిష్ణువర్ధనుడు అసమానపరాక్రమశాలి. విష్ణుభక్తుడు. విషమసిద్ధి మరియు మకరధ్వజ అను బిరుదాంకితుడు. రాణి అయ్యణ మహాదేవి. ఇతనికి జయసింహవల్లభుడు, ఇంద్రభట్టారకుడు అను ఇద్దరు కుమారులు. వీరు ఒకరితర్వాత ఒకరు సింహాసనము అధిష్ఠించారు.
జయసింహవల్లభుడు క్రీ.శ 641నుండి ముప్పది మూడేండ్లు రాజ్యము చేసినను జరిగిన విశేషాంశములు ఏవీ తెలియరావు. సంతతి లేని కారణమున తమ్ముడు ఇంద్రభట్టారకుడు ఏడు దినములు మాత్రమే రాజ్యమేలాడు. అతని కుమారుడు రెండవ విష్ణువర్ధనుడు క్రీ.శ. 681వరకు తొమ్మిదేండ్లు పాలించాడు. ఇతని వెనుక కొడుకైన మంగి యువరాజు రాజై క్రీ.శ. 705 వరకు ఇరువది ఐదేండ్లు పాలించాడు. ఇతనికి జయసింహుడు, కొక్కిలి విక్రమాదిత్యుడు మరియు విష్ణువర్ధనుడు అను ముగ్గురు కుమారులున్నారు. వీరు ఒకరి తరువాత ఒకరు రాజ్యము చేశారు. ముమ్మడి విష్ణువర్ధనుడు క్రీ.శ. 718 నుండి 752 వరకు పాలనము చేశాడు. ఈతని కాలములో పల్లవ జనపద ప్రజలు తమ రాజుగా నందివర్మ పల్లవమల్లుని ఎన్నుకొనిరి. నందివర్మ అద్వితీయ శక్తి సంపన్నుడు. ఇతని అశ్వమేధయాగ సందర్భమున యాగాశ్వము నెల్లూరు మండలములోని బోయకొట్టములు ప్రవేశించెను. అచట విష్ణువర్ధనుని సామంతుడు పృధ్వీవ్యాఘ్రుడు దానిని బంధించాడు. జరిగిన యుద్ధ ఫలితముగా విష్ణువర్ధనుడు తన రాజ్యములోని దక్షిణసీమ కోల్పోయాడు.
[మార్చు] వేములవాడ చాళుక్యులు
ఇప్పటి కరీంనగరు జిల్లాలోని వేములవాడ రాజధానిగా పాలించిన చాళుక్య రాజవంశమును వేములవాడ చాళుక్యులందురు. తొలుత వీరు ఇందూరు (నిజామాబాద్) ప్రాంతములోని పోదనపురము (బోధన్) నుండి పాలించెడివారు. సాతవాహన సామ్రాజ్యములో అశ్మక రాష్ట్రమునకు ఇది రాజధాని. ఈ ప్రాంతమును సపాదలక్ష, సబ్బినాడు, పోదననాడు అని కూడ అంటారు. సాతవాహనుల తరువాత నాలుగు శతాబ్దముల చరిత్ర తెలియడం లేదు.
రాష్ట్రకూట రాజగు దంతిదుర్గ పోదననాడులో సామంతునిగా వినయాదిత్య యుద్ధమల్లుని (క్రీ. శ. 750-780) నియమించాడు. ఈతడు దంతిదుర్గ దండయాత్రలలో విజయములు సాధించి రాజు మన్ననలు పొందాడు. బాదామి చాళుక్యుల అధికారము కూలద్రోయుటలో యుద్ధమల్లుడు మిక్కిలి తోడ్పడ్డాడు. యుద్ధమల్లుని కుమారుడు మొదటి అరికేసరి (క్రీ. శ. 780-800). ఈతడు గొప్ప విద్వాంసుడు, గజతంత్రము, ధనుర్విద్య, ఆయుర్వేదము మున్నగు విద్యలు నేర్చినవాడు. సమస్తలోకాశ్రయ, త్రిభువనమల్ల, రాజత్రినేత్ర, సాహసరామాది బిరుదులు గలవాడు. ఇతని కొడుకు రెండవ యుద్ధమల్లుడు. ఇతని గురించి విశేషములు తెలియరాలేదు. రెండవ యుద్ధమల్లుని కుమారుడు బద్దెగ మహావీరుడు. రాష్ట్రకూటులకు సాయముగా బద్దెగ, కాకర్త్య గుండన వేంగి పై దాడి చేశారు. బద్దెగ మనుమడు ఇమ్మడి అరికేసరి ఈ వంశములో అందరికంటె గొప్పవాడు. రాష్టకూటులతొ సంబంధములు నెరపి వేంగి, మాన్యఖేటము, కొరవి లలో తన ప్రాబల్యము పెంపు చేశాడు. పసిద్ధ కన్నడ కవి పంప అరికేసరి ఆస్థానములో ఉండి విక్రమార్జునవిజయము అనబడు తొలి కన్నడ కావ్యము రచించాడు. ఇతడు కమ్మనాడుకు చెందిన వాడు.
[మార్చు] కళ్యాణి చాళుక్యులు
దక్షిణాపథమును నిరంకుశముగా పాలించి ఆంధ్రదేశమును ప్రభావితము చేసిన గొప్ప రాజవంశము కల్యాణి చాళుక్యులు. వీరు బాదామి చాళుక్యుల కోవకు చెందినవారే. చిరకాలము పశ్చిమ తెలంగాణములో రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి తరువాత స్వతంత్రులయ్యారు. క్రీ.శ. 969లో చివరి రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణ గతించిన పిదప వారి రాజ్యము విచ్చిన్నమయింది. కళ్యాణి చాళుక్యులలో మొదటివాడు రెండవ తైలపుడు (క్రీ.శ. 973-997). ఇతడు ఇరువది ఐదేండ్లు పాలించాడు. పరమారులను, చోళులను, ఘూర్జరులను జయించాడు. తైలపుడు మహాయోధుడు, మంచి పరిపాలకుడు. కన్నడ కవిరత్నత్రయములో ఒకడగు రన్న తైలపుని కొలువులో ఉన్నాడు. తైలప కుమారుడు సత్యాశ్రయుడు. ఇతడు కూడ మహాయోధుడు. చోళులతో వేంగి కొరకు యుద్ధాలు చేశాడు. రాజరాజ చోళుని సామంతుడు శక్తివర్మ చివరకు నెగ్గాడు. పిమ్మట విక్రమాదిత్య, అయ్యన కొలదికాలమే పాలించారు. అయ్యన తమ్ముడు జయసింహుడు వేంగి తిరిగి సాధించుటకు చోళులతో పెక్కు యుద్ధాలు చేశాడు. జైనమతావలంబియగు జయసింహ శైవము స్వీకరించాడు. అప్పటినుండి శైవము కర్ణాటకములో రాజమతమయ్యింది. జయసింహ కుమారుడు మొదటి సోమేశ్వరుడు తండ్రిని మించినవాడు. త్రైలోక్యమల్ల, అహవమల్ల బిరుదులు ధరించాడు. తెలుగు చోళులను, కోట, పరిచ్చేది నాయకులను తన పక్షము చేసుకున్నాడు. ఇతడుకూడ తన ఇరువది ఐదు సంవత్సరముల రాజ్యకాలము చోళులతో యుద్ధములందు గడిపాడు. ఇతనికాలములోనే కాకతీయులు అనుమకొండ విషయమును సామంతులుగా పొందారు. రెండవ సోమేశ్వరుడు, త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు, మూడవ సోమేశ్వరుడు చోళులతో చెసిన యుద్ధములలో వేంగి పలుమార్లు చేతులు మారింది. చివరకు క్రీ.శ. 1133లో వేంగి కళ్యాణి చాళుక్యుల చేజారిపోయింది. చాళుక్యచోళ సామంతులైన వెలనాటి చోళులు చాళుక్యదండనాయకులను జయించి వేంగిని పాలించసాగారు. ఈ విధముగా తెలుగు దేశము నూట యాభై సంవత్సరములు చాళుక్య, చోళులకు యుద్ధరంగమైనది.
[మార్చు] ముదిగొండ చాళుక్యులు
పూర్వ మధ్య యుగమున తెలుగు దేశములో వేంగీ చాళుక్యుల పక్షము వహించి, రాష్ట్రకూటులనెదిర్చి, కాకతీయులను కూడ ప్రతిఘటించిన రాజవంశము ముదిగొండ చాళుక్యులు. ఖమ్మం ప్రాంతములోని ముదిగొండ వీరి రాజధాని. కొరివి, బొట్టు కూడ అప్పుడప్పుడు రాజధానులు. ఈ రాజ్యము ఎనిమిదవ శతాబ్దిలో ప్రారంభమై పన్నెండవ శతాబ్దిలో అంతమయినది. వీరు మానవ్యస గోత్రులు, హారితీ పుత్రులు, వరాహ లాంఛనధారులు. వీరు శాసనములలో అయోధ్య నుండి వచ్చినవారుగా చెప్పుకున్నారు. వీరిలో ముఖ్యులు మూడవ కుసుమాయుధుడు, బొట్టు బేతరాజు మరియు కుసుమాదిత్యుడు.
[మార్చు] చాళుక్య చోళులు
[మార్చు] మూలాలు
- ↑ చాళుక్యుల పూర్వ స్థానము: The History of Andhras, G. Durga Prasad, 1988, Page 86; http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf
- ↑ తెలుగు భాష, సాహిత్యము:Telugu Language and Literature, S. M. R. Adluri, 1998, http://www.engr.mun.ca/~adluri/telugu/language/script/script1d.html