శాతవాహనులు
క్రీ.శ.150లో శాతవాహన సామ్రాజ్య విస్తృతి |
|
| అధికార భాషలు | ప్రాకృతం (ఆది-మరాఠి) సంస్కృతం తెలుగు |
| రాజధానులు | పుణె వద్ద ఉన్న జున్నార్ మరియు గుంటూరు సమీపాన కల ధరణికోట/ అమరావతి |
| ప్రభుత్వం | రాచరికం |
| శాతవాహనులకు ముందు పాలించినవారు | మౌర్యులు |
| శాతవాహనుల తర్వాత పాలించినవారు | ఇక్ష్వాకులు, కాదంబులు |
శాతవాహనులు దక్షిణ మరియు మధ్య భారతదేశం ను కోటిలింగాల, ధరణికోట మరియు జున్నార్ ల నుండి పరిపాలించారు. శాతవానుల తొలి రాజధాని తెలంగాణ ప్రాంతంలోని కోటిలింగాల.[1] వీరి పరిపాలన క్రీ.పూ. 230 సం. నుండి మొదలై సుమారు 450 సంవత్సరాలు కొనసాగింది. వీరి జనరంజక పరిపాలన వీరికి శాంతికాముకులుగా పేరు తెచ్చింది.
విషయ సూచిక |
పుట్టుక [మార్చు]
ఆంధ్ర అన్న పదం మొట్టమొదటగా క్రీ.పూ 8వ శతాబ్దములో ఐతరేయ బ్రాహ్మణం లో పేర్కొనబడినది. పురాణాలలో మరియు వారి నాణేలపై ఈ వంశము ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులు, శాతకర్ణులు మరియు శాతవాహనులని అనేక పేర్లతో పేర్కొనబడింది. గ్రీకు రాయబారి, యాత్రికుడు మెగస్తనీస్ వ్రాసిన ఇండికాలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. ఈయన ఆంధ్రులు లక్ష పదాతిదళం, వెయ్యి యేనుగులు మరియు 30 దుర్భేధ్యమైన దుర్గాలు కలిగి ఉన్నారని పేర్కొన్నాడు.
- "Next come the Andarae, a still more powerful race, which possesses numerous villages, and thirty towns defended by walls and towers, and which supplies its king with an army of 100,000 infantry, 2,000 cavalry, and 1,000 elephants." Plin. Hist. Nat. VI. 21. 8-23. 11., quoting Megasthenes[2]
.
ఆంధ్రులు మధ్య ఆసియా నుండి తరచూ దండయాత్రలు ఎదుర్కొంటూ, శక్తివంతమైన విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వీరి సైనిక శక్తితో పాటు, వ్యాపార దక్షత మరియు నావికా కౌశలానికి చరిత్రలో మొట్టమొదటి సారిగా ఆగ్నేయ ఆసియాలో భారత కాలనీలు స్థాపించడమే తార్కాణం. మౌర్య వంశ సామంతులుగా రాజకీయజీవితం ప్రారంభించిన శాతవాహనులు క్రీ.పూ. 232లో అశోకు ని మరణము తర్వాత స్వాతంత్ర్యము ప్రకటించుకొన్నారు. 'ఆంధ్ర' యొక్క ప్రస్తావన అల్ బెరూని (1030) వ్రాతలలో కూడా ఉన్నది. ఈయన దక్షిణ భారతదేశం లో మాట్లాడే భాష "ఆంధ్రి" అని వ్రాశాడు. ఈయన గ్రంథం కితాబుల్ హింద్ ఆనాటి ఆంధ్రదేశములోని కొన్ని ఆచారవ్యవహారాలను, సాంప్రదాయాలను వర్ణిస్తుంది. వీరు బ్రాహ్మణులని చారిత్రిక ఆధారాల వల్ల తెలిసినది.ముఖ్యముగా వారి బిరుదులు "ఏక బ్రాహ్మణ","క్షత్రియ దర్పమాన మర్దన" ఆ ఆధారాలని స్పష్టము చేసి వారిని బ్రాహ్మణులుగా నిరూపిస్తున్నాయని చరిత్రకారుల అభిప్రాయము.
ముందు: Bust of king. అశోకుని కాలమునాటి బ్రాహ్మీలిపిలో ప్రాకృతం: శిరి శాతకనీస రానో ... వసితిపుతస.
వెనుక: ఎడమవైపు ఉజ్జయినీ/శాతవాహన చిహ్నం. కుడివైపు ఆరు అర్ధచంద్రాకారపు ఆర్చులతో చైత్యగిరి. క్రింది భాగములో నది. తెలుగు బ్రాహ్మీ లిపిలో: అరహనకు వహిత్తి మకనకు తిరు హతకనికో.
శాతవాహనులు, వాశిష్ఠీపుత్ర శ్రీ పులోమావి (పా. 130-158)తో ప్రారంభించి తమ నాణేలపై రాజుల ముఖచిత్రాలు ముద్రించిన తొలి భారతీయ స్థానిక పాలకులుగా భావిస్తారు. ఈ సాంప్రదాయం వాయువ్యాన పరిపాలించిన ఇండో-గ్రీకు రాజుల నుండి వచ్చింది. శాతవాహన నాణేలు రాజుల కాలక్రమం, భాష మరియు ముఖ కవళికల (గుంగురు జుట్టు, పెద్ద చెవులు, బలమైన పెదవులు) గురించి అనూహ్యమైన ఆధారాలు పొందు పరుస్తున్నవి. వీరు ప్రధానంగా సీసము మరియు రాగి నాణేలు ముద్రించారు; వీరి ముఖచిత్ర వెండి నాణేలు సాధారణంగా పశ్చిమ క్షాత్రప రాజుల నాణేలపై ముద్రించబడినవి. ఈ నాణేలపై ఏనుగులు, సింహాలు, గుర్రాలు మరియు చైత్య స్థూపాల వంటి అనేక సాంప్రదాయక చిహ్నాలు అలంకరించబడి ఉన్నవి. వీటిపై "ఉజ్జయిని చిహ్నం", (ఒక + గుర్తులో నాలుగు అంచుల వద్ద నాలుగు వృత్తాలు) కూడా ఉన్నవి. ఉజ్జైనీ చిహ్నం శాతవాహనుల నాణేలపై ఉండటము వలన ప్రసిద్ధ పౌరాణిక చక్రవర్తి విక్రమాదిత్యుడు, ఎవరి పేరు మీదైతే విక్రమ శకం ప్రారంభమయ్యిందో ఆయన, శాతవాహన చక్రవర్తి అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా లోని ఆలమూరు(ఆలం+ఊరు=యుద్దం జరిగిన ఊరు) దగ్గర శాతవాహనుడు విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన రాజ్యాన్ని స్థాపించాడని జనపదాల లో ఒక కథ వుంది.అంతేకాక గోదావరి జిల్లాల్లో శాతవాహనుడు కుమ్మరి కులస్తుడని ఒక నానుడి.
తొలి పాలకులు [మార్చు]
క్రీ.పూ 230 ప్రాంతములో శాతవాహనులు స్వతంత్ర రాజులైన తర్వాత, వంశ స్థాపకుడైన శిముక మహారాష్ట్ర, మాల్వా మరియు మధ్య ప్రదేశ్ లోని కొంత భాగమును జయించాడు. ఈయన తర్వాత ఈయన సోదరుడు కన్హ (లేదా కృష్ణ) పాలన చేపట్టి రాజ్యాన్ని పశ్చిమాన మరియు దక్షిణాన మరింత విస్తరింప జేశాడు. కన్హ క్రీ.పూ 207 నుండి క్రీ.పూ 189 వరకు పరిపాలించాడు.
కన్హుని వారసుడైన మొదటి శాతకర్ణి ఉత్తర భారతదేశంలో శుంగ వంశము ను ఓడించి, అత్యంత వ్యయముతో అశ్వమేధం తో పాటు అనేక యజ్ఞయాగాదులు జరిపించాడు. ఈయన సమయానికి శాతవాహన వంశము సుస్థిరమై, మహారాష్ట్రలోని ప్రతిష్ఠానపురం (పైఠాన్) రాజధానిగా తన బలాన్ని దక్షిణభారతదేశమంతా వ్యాపించింది. పురాణాలు ఈ వంశానికి చెందిన 30 మంది పాలకుల జాబితా ఇస్తున్నవి. అందులో చాలామంది వాళ్లు ముద్రింప జేసిన నాణేలు మరియు శాసనాల వల్ల కూడా పరిచితులు.
శకులు, యవనులు మరియు పహ్లవులతో ఘర్షణలు [మార్చు]
క్రీస్తుశకం తొలి శతాబ్దములో మధ్య ఆసియా నుండి శకులు భారతదేశంపై దండెత్తి పశ్చిమ క్షాత్రప వంశాన్ని స్థాపించారు. హాలుని వెనువెంట రాజ్యానికొచ్చిన నలుగురు వారసులు ఎక్కువ కాలం పరిపాలించలేదు. నలుగురు కలిసి మొత్తం పన్నెండు సంవత్సరాలు పాలించారు. ఈ కాలములో శాతవాహనులు మాళవ తో సహా తమ రాజ్యములోని కొన్ని ప్రాంతాలు పశ్చిమ క్షాత్రపులకు కోల్పోయారు.
ఆ తర్వాత కాలములో గౌతమీపుత్ర శాతకర్ణి (శాలివాహనుడు) (పా. 78-106 CE) పశ్చిమ క్షాత్రప పాలకుడు, నహపాణ ను ఓడించి, శాతవాహనులు కోల్పోయిన ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకొని వంశ ప్రతిష్ఠను పునరుద్ధరించాడు. ఈయన గొప్ప హిందూమతాభిమాని. శాలివాహనుడు తన శాసనములలో "శకులు (పశ్చిమ క్షాత్రప), యవనులు (ఇండో-గ్రీకులు) మరియు పల్లవులు (ఇండో-పార్థియన్లు) యొక్క నాశకుడు" అన్న బిరుదు స్వీకరించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి 78లో శక చక్రవర్తి విక్రమాదిత్యను ఓడించి శాలివాహన యుగం లేదా శక యుగానికి నాందిపలికాడు. శాలివాహన యుగాన్ని నేటికీ మరాఠీ ప్రజలు మరియు దక్షిణ భారతీయులు పాటిస్తున్నారు. మహారాష్ట్రలో నేటికీ ప్రజల హృదయాలలో, మరొక గొప్ప మరాఠా యోధుడు శివాజీ చక్రవర్తితో పాటు గౌతమీపుత్ర శాతకర్ణి కి ప్రత్యేక స్థానం కలదు.
గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత ఆయన కుమారుడు వాసిష్టీపుత్ర పులోమావి (పా. 106-130) సింహాననాన్ని అధిష్టించాడు. ఈయన ముఖచిత్ర సహిత నాణేలు ముద్రింపజేసిన తొలి శాతవాహన చక్రవర్తి. ఈయన సోదరుడు వాసిష్టీపుత్ర శాత , పశ్చిమ క్షత్రాప వంశానికి చెందిన మొదటి రుద్రవర్మ యొక్క కుమార్తెను పెళ్ళిచేసుకున్నాడు. అయితే స్వయంగా తన మామ చేతిలో యుద్ధరంగాన ఓడిపోయి శాతవాహనుల ప్రతిష్ఠకు మరియు బలానికి తీరని నష్టం కలుగజేశాడు.
అప్పటి నుండి శ్రీయజ్ఞ శాతకర్ణి (170-199 CE) రాజ్యానికి వచ్చేవరకు శాతవాహనుల పరిస్థితి పెద్దగా మారలేదు. శ్రీయజ్ఞ శాతకర్ణి శకులపై తీవ్ర పోరాటము సాగించి శాతవాహనులు కోల్పోయిన భూభాగాన్ని కొంతవరకు తిరిగి పొందాడు.
సాంస్కృతిక అభివృద్ధి [మార్చు]
శాతవాహన చక్రవర్తులలో హాలుడు (పా. 20-24), మహారాష్ట్రీ ప్రాకృత కావ్య సంగ్రహం గాహా సత్తసయి (సంస్కృతం: గాథా సప్తశతి) కి గాను ప్రసిద్ధి చెందాడు. అయితే భాషాపరిశీలన ఆధారాల వలన, ఇప్పుడు లభ్యమవుతున్న ప్రతి ఆ తరువాత ఒకటీ రెండు శతాబ్దాలలో తిరగరాయబడినది అని ఋజువైనది.
శాతవాహన సామ్రాజ్యం మరాఠీ భాష కు మూల భాష అయిన మహారాష్ట్రీ భాష యొక్క అభివృద్ధికి దోహదం చేసింది. శాతవాహన చక్రవర్తులలో కెల్లా గొప్పవాడైన శాలివాహనుడు (గౌతమీపుత్ర శాతకర్ణి) ప్రతిష్ఠానపురం (ఇప్పటి పైఠాన్) యొక్క సాంస్కృతిక అభివృద్ధికి కృషిచేశాడని భావిస్తారు. ప్రపంచ ప్రసిద్ధ పైఠానీ చీర శాతవాహన కాలములోనే అభివృద్ధి చెందినది. [3]
శాతవాహనులు ఆనాటి కళలను, కట్టడాలను ప్రోత్సహించారు. వారు కట్టించిన కట్టాడాలు, స్థూపాలు నేటికీ కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలలో చూడవచ్చు. అమరావతి లోని బౌద్ధ స్థూపం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ స్థూపాలలో ఉపయోగించిన చలువరాతి కట్టడాలు, గౌతమ బుద్ధుని శిల్పాలు వారి కళాతృష్ణకు, ఆనాటి పరిస్థితులకు అద్దం పడతాయి. శాతవాహనులు ఆగ్నేయ ఆసియాను ఒక తాటి క్రిందకు తేవడంలో సఫలం అయ్యారు. మహాయాన బౌద్ధం ఆంధ్ర నుంచి ఆగ్నేయ ఆసియాకు వ్యాప్తి చెందడానికి వీరి నౌకాయానం మరియు వీరు చేసిన వర్తక వాణిజ్యాలు ఎంతో దోహదం చేశాయి. ఆంధ్ర శిల్పకళ వీరి ద్వారా ఆగ్నేయ ఆసియా లో కూడా వ్యాప్తి చెందింది.
క్షీణదశ [మార్చు]
శాతవాహనులు తమ శత్రువులను విజయవంతముగా అడ్డుకున్నా, తరచూ జరిగిన సాయుధ ఘర్షణలు మరియు సామంతుల విజృంభణతో చివరకు వంశం క్షీణించింది. రమారమి 220 సం.లో శాతవాహనుల శకం అంతరించింది.
ఆయా రాజవంశాలు శాతవాహనుల ఆధీనములో ఉన్న ప్రాంతాలను తమలో తాము పంచుకున్నాయి.
- రాజ్యం యొక్క వాయువ్య భాగాన్ని యాదవులు ఆక్రమించి ప్రతిష్టానపురం రాజధానిగా శాతవాహనుల తరువాత పాలన సాగించారు.
- దక్షిణ మహారాష్ట్రలో రాష్ట్రకూటులు
- ఉత్తర కర్ణాటకలో వనవాసికి చెందిన కాదంబులు.
- కృష్ణా-గుంటూరు ప్రాంతంలో ఇక్ష్వాకులు (లేదా శ్రీపర్వతీయులు).
శాతవాహన పరిపాలనానంతర సమయములో చిన్న చిన్న రాజ్యాలు వెలిశాయి. వారిలో పేరొందిన రాజులు పల్లవులు. వీరు కాంచీపురం రాజధాని గా పరిపాలన గావించారు. వీరి మొదటి రాజు సింహవర్మ (క్రీ.శ. 275-300).
శాతవాహన రాజుల పౌరాణిక జాబితా[4] [మార్చు]
మత్స్య పురాణం పై ఆధారితమైన ఈ 30 రాజుల జాబితా సమగ్రమైనది.
- శిముక లేక శిశుక (పా. క్రీ.పూ.230-207). మరియు (271-248 క్రీ.పూ), పరిపాలన 23 సం.
- కృష్ణ (పా. 207-189 BCE), పరిపాలన 18 సం.
- శ్రీ మల్లకర్ణి (లేక శ్రీ శాతకర్ణి), పరిపాలన 10 సం.
- పుర్నోట్సంగ, పరిపాలన 18 సం.
- స్కంధస్తంభి, పరిపాలన 18 సం.
- శాతకర్ణి (క్రీ.పూ.195), పరిపాలన 56 సం.
- లంబోదర, పరిపాలన 18 సం.(పా. క్రీ.పూ.87-67)
బహుశా కణ్వ వంశ సామంతులుగా (క్రీ.పూ. 75-35):
- అపీలక, పరిపాలన 12 సం.
- మేఘస్వాతి (లేక సౌదస), పరిపాలన 18 సం.
- స్వాతి (లేక స్వమి), పరిపాలన 18 సం.
- స్కందస్వాతి, పరిపాలన 7 సం.
- మహేంద్ర శాతకర్ణి (లేక మృగేంద్ర స్వాతికర్ణ, రెండవ శాతకర్ణి), పరిపాలన 8 సం.
- కుంతల శాతకర్ణి (లేక కుంతల స్వాతికర్ణ), పరిపాలన 8 సం.
- స్వాతికర్ణ, పరిపాలన 1 సం.
- పులోమావి (లేక పాటుమావి), పరిపాలన 36 సం.
- రిక్తవర్ణ (లేక అరిస్టకర్మ), పరిపాలన 25 సం.
- హాల (20-24 CE), పరిపాలన 5 సం. గాథాసప్తసతి అనే కావ్యాన్ని రచించాడు.
- మండలక (లేక భావక, పుట్టలక), పరిపాలన 5 సం.
- పురీంద్రసేన, పరిపాలన 5 సం.
- సుందర శాతకర్ణి, పరిపాలన 1 సం.
- కరోక శాతకర్ణి (లేక కరోక స్వాతికర్ణ), పరిపాలన 6 సం.
- శివస్వాతి, పరిపాలన 28 సం.
- గౌతమీపుత్ర శాతకర్ణి, లేక గౌతమీపుత్ర, శాలివాహనుడిగా ప్రసిద్ధి చెందాడు(పా. 25-78 CE), పరిపాలన 21 సం.
- వశిష్టపుత్ర శ్రీపులమావి, లేక పులోమ, పులిమన్ (పా. 78-114 CE), పరిపాలన 28 సం.
- వశిష్టపుత్ర శాతకర్ణి (పా. 130-160), లేక శివశ్రీ పరిపాలన 7 సం.
- శివస్కంద శాతకర్ణి, (157-159), పరిపాలన 7 సం.
- యజ్ఞశ్రీ శాతకర్ణి, (పా. 167-196 CE), పరిపాలన 29 సం.
- విజయ, పరిపాలన 6 సం.
- కంద శ్రీ శాతకర్ణి, పరిపాలన 10 సం.
- పులోమ, 7 సం.
- మాధరీపుత్ర స్వామి శకసేన? (పా. c.190)
బయటి లింకులు [మార్చు]
పాదపీఠికలు [మార్చు]
- ↑ తెలంగాణ చరిత్ర, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 42
- ↑ Source:fragment LVI
- ↑ Marathi Vishwakosh, Government of Maharashtra publication
- ↑ "A Catalogue of Indian coins in the British Museum. Andhras etc...", Rapson
ఇవి కూడా చూడండి [మార్చు]
- శాతవాహన అనంతరీకులు
- గౌతమీపుత్ర శాతకర్ణి
- ఇండో-గ్రీకు సామ్రాజ్యం
- ఇండో-స్కైథియన్ సామ్రాజ్యం
- ఇండో-పార్థియన్ సామ్రాజ్యం
- పశ్చిమ క్షాత్రపులు
- కుషాణులు
- ఆంధ్ర ప్రదేశ్
మూలాలు [మార్చు]
- K.A. Nilakanta Sastri, A History of South India (Madras, 1976).