వరంగల్
వికీపీడియా నుండి
| ?వరంగల్ ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 12,846 కి.మీ² (4,960 చ.మై) |
| ముఖ్య పట్టణము | వరంగల్ |
| ప్రాంతం | తెలంగాణ |
| జనాభా • జనసాంద్రత • పట్టణ • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
3,221,000 (2001) • 252/కి.మీ² (653/చ.మై) • 620000 • 1637000 • 1593000 • 58.41 • 70.01 • 46.54 |
అక్షాంశరేఖాంశాలు: వరంగల్ (వరంగల్లు , పూర్వము ఓరుగల్లు,ఏకశిలా నగరము) దక్షిణ భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం లో ఒక జిల్లా. ఇది రాష్ట్ర రాజధాని అగు హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మి దూరంలో ఉన్నది. వరంగల్ జిల్లా కు ముఖ్య పట్టణం - వరంగల్. కాకతీయ విశ్వవిద్యాలయము కాకతీయ మెడికల్ కాలేజి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (పూర్వపు రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్), కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, మొదలైన ప్రముఖ విద్యా సంస్థలు వరంగల్లులో ఉన్నాయి.
విషయ సూచిక |
[మార్చు] వరంగల్ జిల్లా
వరంగల్ జిల్లా 12,846 చ.కి.మీ.లలో వ్యాపించి 32,31,174 (2001 లెక్కలు) జనాభా కలిగి ఉంది. బొగ్గు మరియు గ్రానైటు గనులకు (నలుపు, బ్రౌను రకాలు) జిల్లా ప్రాముఖ్యత చెందింది. వరి, మిరప, పత్తి మరియు పొగాకు పంటలు విరివిగా పండుతాయి.
[మార్చు] చరిత్ర
క్రీ.శ. 12 - 14 శతాబ్దాలలో పరిపాలించిన కాకతీయుల రాజ్యానికి వరంగల్ రాజధాని. కాకతీయులు నిర్మించిన ఎన్నో కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. నాలుగు వైపులా శిలా ద్వారాలు కలిగిన పెద్ద కోట (వరంగల్ కోట), స్వయంభూ దేవాలయము, రామప్ప దేవాలయము మొదలైనవి వీటిలో కొన్ని. కాకతీయుల పాలనా దక్షత గురించి ఇటలీ యాత్రికుడు మార్కోపోలో తన రచనలలో రాసాడు. కాకతీయులలో ప్రముఖ పాలకులు గణపతిదేవ చక్రవర్తి, రుద్రమ దేవి, ప్రతాపరుద్రుడు.
14 వ శతాబ్దంలో ఢిల్లీ తుగ్లక్ సుల్తానుల చేతిలో ఓడిపోవడంతో కాకతీయుల పరిపాలన అంతమయింది. తరువాత అది ముసునూరి నాయకులు, రేచెర్ల నాయకులు, బహమనీ సుల్తానులు, గోల్కొండను పాలించిన దక్కను సుల్తానుల పాలన లోకి వచ్చింది. మొగలు చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను 1687 లో ఆక్రమించినపుడు అది మొగలు సామ్రాజ్యంలో భాగమయింది. తరువాత 1724లో ఈ సామ్రాజ్యం లోని దక్షిణ ప్రాంతం విడివడి హైదరాబాదు రాజ్యం ఏర్పడినపుడు వరంగల్లు ఆ రాజ్యంలో భాగమైంది. 1948లో వరంగల్లుతో సహా హైదరాబాదు భారత దేశంలో కలిసి పోయింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా హైదరాబాదు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది.
పురావస్తు శాఖవారు ఈ మధ్యకాలంలో చారిత్రాత్మక కట్టడం అయిన వేయి స్తంభముల దేవాలయాన్ని మరమత్తు చేయడానికి పూనుకొన్నారు. అయితే వారు జరిపిన త్రవ్వకాలలో ఒక విస్మయం చెందే విషయం బయటపడినది. ఉత్తరం దిక్కుగా ఉన్న ఆలయం క్రింద ఒక నీటితొ నిండిన బావి బయటపడినది. ఉపరితలం నుండి సుమారు 3-4 మీటర్ల లోతున ఈ బావి ఉంది. అంతేకాకుండా కట్టడం క్రింద అనగా పునాది క్రింద మొత్తం ఇసుకతో ఉండడం మరొక విషయం. ఆకాలం నాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. ఇలా పునాది క్రింద మొత్తం ఇసుకతో కట్టడానికి భూకంపాలనుండి రక్షించడానికి అని కొంతమంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఈ విషయం మీద పురావస్తు శాఖ ఇంకా తన పరిశోధన కొనసాగిస్తుంది.
[మార్చు] ఇతర విశేషాలు
- జిల్లాలో ప్రతీ రెండేళ్ళ కొకసారి జరిగే సమ్మక్క-సారక్క జాతరకు 90 లక్షల మందికి పైగా యాత్రికులు వస్తారు. వరంగల్లుకు 90 కి.మీ ల దూరంలో గల మేడారం గ్రామం వద్ద జరిగే ఈ జాతర అధర్మ చట్టాన్ని ఎదిరించి పోరాడిన ఒక తల్లీ, కూతురుల ప్రతిఘటనకు స్మృత్యర్ధం జరుగుతుంది.
- పీపుల్స్వార్ గ్రూపు, (ప్రస్తుత మావోయిస్టుల)కు వరంగల్లు జిల్లా గట్టి స్థావరం.
- వరంగల్లు ఆంధ్ర ప్రదేశ్ లోకెల్లా ఐదవ అతి పెద్ద నగరము.
- రెవిన్యూ డివిజన్లు (5): వరంగల్, మహబూబాబాద్,ములుగు,జనగాం,నర్సంపేట.
- లోక్సభ స్థానాలు (2): వరంగల్, మహబూబాబాద్
- శాసనసభ స్థానాలు (14): వరంగల్ (తూర్పు), వరంగల్ (పశ్చిమ), మహబూబాబాద్, స్టేషన్ ఘనపూర్, ములుగు, పరకాల , వర్ధన్నపేట, డోర్నకల్, పాలకుర్తి, నర్సంపేట, భూపాలపల్లి, జనగాం. [1]
[మార్చు] వరంగల్ మండలాలు
భౌగోళికంగా వరంగల్ జిల్లాను 51 రెవిన్యూ మండలములుగా విభజించినారు. [2]
![]() |
|||||
| సంఖ్య | పేరు | సంఖ్య | పేరు | సంఖ్య | పేరు |
|---|---|---|---|---|---|
| 1 | చేర్యాల | 18 | తొర్రూర్ | 35 | దుగ్గొండి |
| 2 | మద్దూర్ | 19 | నెల్లికుదురు | 36 | గీసుకొండ |
| 3 | నెర్మెట్ట | 20 | నర్సింహులపేట | 37 | ఆత్మకూరు |
| 4 | బచ్చన్నపేట | 21 | మరిపెడ | 38 | శాయంపేట |
| 5 | జనగాం | 22 | డోర్నకల్లు | 39 | పరకాల |
| 6 | లింగాల ఘనాపూర్ | 23 | కురవి | 40 | రేగొండ |
| 7 | రఘునాథపల్లి | 24 | మహబూబాబాద్ | 41 | మొగుళ్ళపల్లి |
| 8 | స్టేషన్ ఘనాపూర్ | 25 | కేసముద్రం | 42 | చిట్యాల |
| 9 | ధర్మసాగర్ | 26 | నెక్కొండ | 43 | భూపాలపల్లి |
| 10 | హసన్పర్తి | 27 | గూడూరు | 44 | ఘనపూర్ |
| 11 | హనుమకొండ | 28 | కొత్తగూడెం | 45 | ములుగు |
| 12 | వర్ధన్నపేట | 29 | ఖానాపూర్ | 46 | వెంకటాపూర్ |
| 13 | జాఫర్గఢ్ | 30 | నర్సంపేట | 47 | గోవిందరావుపేట |
| 14 | పాలకుర్తి | 31 | చెన్నారావుపేట | 48 | తడ్వాయి |
| 15 | దేవరుప్పుల | 32 | పర్వతగిరి | 49 | ఏటూరునాగారం |
| 16 | కొడకండ్ల | 33 | సంగం | 50 | మంగపేట |
| 17 | రాయిపర్తి | 34 | నల్లబెల్లి | 51 | వరంగల్ |
[మార్చు] చూడవలసిన ప్రదేశాలు
- ఓరుగల్లు కోట: ఓరుగల్లు కోట చరిత్ర 13వ శతాబ్ధము నుండి ఉన్నది. ఓరుగల్లు కోట 13 వరంగల్లు పట్టణానికి 2 కి.మి దూరములో ఉన్నది. ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి. చరిత్ర ప్రకారం ఈ కోటకు మూడు ప్రాకారాలు ఉన్నాయి, ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికి కూడా చూడవచ్చు. మెదటి ప్రాకరం మట్టితో చేసినది దీనిని ధరణి కోట అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవ ప్రాకారములో ఉన్నది రాతి కోట గ్రానైటు రాళ్ళతో నిర్మితమైనది. రాటి కోటకు పెద్ద పెద్ద ఏకశిలా రాతి ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులు ఉండి ఏకశిల నిర్మితమైనవి. కోట ద్వారం మీద కీర్తి తోరణాలు ఉన్నాయి (పూర్ణ కుంభం వంటివి). ఈ కీర్తి తోరణాలు ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆధికారిక చిహ్నంగా ఉపయోగిస్తున్నది.
- వెయ్యి స్థంభాల గుడి: 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల గుడి వరంగల్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున కలదు.
- రామప్ప దేవాలయము : దీనిని రామ లింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు.
- పాకల చెఱువు: 1213 సంవత్సరంలో కాకతీయ రాజు గణపతి దేవుడు 30 చదరపు కి.మీ విస్తీర్ణములో త్రవ్వించాడు. ఈ ప్రదేశము ఇప్పుడు పర్యాటకులకు చాలా నేత్రానందం కలిగిస్తున్నది. ఈ చెఱువు ఒడ్డున పాకాల వన్యప్రాణీ సంరక్షణ కేంద్రం 839 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్నది. ఈ వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి ఏతునగరం సంరక్షణా కేంద్రం అని కూడా పేరు కూడా ఉన్నది. ఇక్కడ దట్టమైన అడవులు మరియు జంతు సంపద ఉన్నది. స్వేఛ్ఛగా తిరుగాడే జింకలు, చిరుతపులులు, హైనాలు, తోడేళ్ళు, గుంట నక్కలు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, నీలగాయి, ముళ్ళపదులు, లంగూర్లు వంటి క్షీరదాలకూ, కొండ చిలువలు, నాగుపాములు, కట్లపాములు, ఉడుములు మరియు మొసళ్ళవంటి సరీసృపాలకు ఈ సంరక్షణా కేంద్రము ఆవాసాన్నిస్తున్నది.
- వన విజ్ఞాన కేంద్రం : వన విజ్ఞాన కేంద్రం అంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ వారి ఆధ్వర్యములో సామాన్య ప్రజానీకానికి వన్య సంరక్షణ గురించి తెలుపడానికి ఏర్పాటు చేయబడినది. ఈ విజ్ఞాన కేంద్రాన్ని ప్రతి రోజు 500 మంది వరకు సందర్శకులు సందర్శిస్తుంటారు. 50 ఎకరాల విస్తీర్ణములో విస్తరించి ఉన్న ఈ విజ్ఞాన కేంద్రం, వరంగల్లు హంటర్ రోడ్డు మీద ఉన్నది.
- కోమరవల్లి : సిద్ధిపేట నుండి సికింద్రబాదు వెళ్ళే మార్గంలో సిద్ధిపేటకు 10 కి.మీ దూరంలో ఉన్న కోమరవల్లి మల్లన్న స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి రైలు సౌకర్యం లేదు. ఇక్కడ జాతర జనవరి నెలలో ప్రారంభమై ఉగాది వరకు జరుగుతుంది. జాతర చివరి వారంలో ఇక్కడ బాణా సంచా కాలుస్తారు దీనిని అగ్ని గుండాలు అని పిలుస్తారు.
- భద్రకాళి దేవాలయము: వరంగల్ నగరం నడిబొడ్డున శ్రీ భద్రకాళి అమ్మవారు కొలువైవున్నారు. శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు. అందమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభయమయంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం. దసరా పండుగ నాడు నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు జరుగును . దసరా పండుగనాడు లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు . వరంగల్ జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాలనుండి కూడా భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
[మార్చు] మూలాలు
- ↑ 2009 నియోజకవర్గాల పునర్విబజన ద్వారా ఏర్పడినవి [1].
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్సైటులో వరంగల్ జిల్లా తాలూకాల వివరాలు. జూలై 28, 2007న సేకరించారు.
[మార్చు] బయటి లింకులు
- వరంగల్ జిల్లా అధికారిక వెబ్సైటు
- కాకతీయ విశ్వవిద్యాలయం
- నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ వరంగల్ - ఒకప్పటి వరంగలు ఆర్.ఈ.సీ
- కాకతీయ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ వరంగల్
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సైటులో వరంగల్ జిల్లా వివరాలు
- కాకతీయ శిలా తోరణము
- శ్రీ భధ్రకాళి అమ్మవారి గుడి వెబ్సైటు
- ఖుష్ మహల్
|
||||||||||||||
|
||||||||||||||||||||||||||

