గుర్రంకొండ కోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుర్రంకొండ ఏరియల్ వ్యూ, వైయస్ఆర్ జిల్లా

గుర్రంకొండ కోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలానికి చెందిన గుర్రంకొండ గ్రామంలో ఉన్న కోట.[1]

గుర్రంకొండకోట కడప, బెంగళూరు రహదారిలో ఉంది. గుర్రంకొండ కోట ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. శత్రుదుర్భేద్యమైన ఈ కోటను గోల్కొండ సుల్తానులు కట్టించారు. నిర్మాణశైలి మొత్తం మహమ్మదీయ శైలిలో ఉంది. ఈ కోట 500 అడుగుల ఎత్తున ఒక గొప్ప కొండ పై ఉంది. టిప్పూసుల్తాను ఇక్కడ నాణేలను ముద్రించేందుకు ఒక టంకశాలను కూడా ఏర్పాటుచేశాడు. ఈ కోటలో గల 'రంగిన్ మహల్' చూపరులకు ఆకట్టుకుంటుంది. గుర్రం కొండ దుర్గానికి పడమర వైపున ఉన్న మక్బరా (పవిత్ర సమాధి) దుర్గం మొత్తం మీద సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నవాబు ఉపయోగించే గుర్రపు బగ్గీ కోసం నిర్మించిన పోర్టికో నేటికీ దృఢంగా, చెక్కు చెదరకుండా ఉంది.[2]

గుర్రంకొండ కోట[మార్చు]

రంగిన్ మహల్, గుర్రంకొండ (నిర్మాణం 1898)

గుర్రంకొండ గిరిదుర్గం. గుర్రంకొండ కోట శత్రుదుర్భేద్యమైన ఈ కోటను చోళులు, చాళుక్యులు, రాయలు ఆ తర్వాత మహమ్మదీయులు టిప్పుసుల్తాన్ కడప నవాబులు పరిపాలించారు.రాయల కాలంలోను ఆ తర్వాత టిప్పు సుల్తాన్ కాలంలో ఉన్నతస్థితిలో ఉన్నది. ఈ కోట 500 అడుగుల ఎత్తున ఒక గొప్పకొండపై ఉంది. మూడువైపులా కొండ దాదాపు నిలువుగా ఉండి ఎక్కడానికి వీలులేకుండా ఉంది. నాలుగోవైపు కూడా ఏటవాలుగా ఉండి దుర్భేద్యంగా ఉంది. కోటలో నలభైకి పైగా మసీదులు ఉండేవి. కానీ అవి శిధిలమైనవి. పర్షియాలోని కిర్మాన్ నుండి వచ్చిన హజ్రత్ షా కమాల్ అనే సూఫీ సంతు ఇక్కడ స్థిరపడి స్థానికులకు ఇస్లాం మతాన్ని బోధించి ప్రాంతంలోని చుట్టుపక్కల గ్రామాలకు ఇస్లాం మతాన్ని వ్యాపింపజేశాడు. ఈ కోట 18వ శతాబ్దపు చివరలో కొన్నాళ్లు టిప్పూసుల్తాను ఆధీనంలో ఉంది. టిప్పూసుల్తాను ఇక్కడ నాణేలను ముద్రించేందుకు ఒక టంకశాలను కూడా ఏర్పాటుచేశాడు.[3] ఆ తరువాత కడప నవాబుల పాలనలోకి వచ్చింది. ఇచ్చట గల కోట చాలా ప్రసిద్ధమైంది. ఈ కోటలో గల 'రంగిన్ మహల్' చూపరులకు ఆకట్టుకుంటుంది.

మక్బరా (ఖండ్రిగ)[మార్చు]

గుర్రం కొండకు 3 కిమీల దూరంలో మక్బరా (ఖండ్రిగ) గ్రామం ఉంది. ఈ మక్బరాలోనే టిప్పు సుల్తాన్‌ మేనమామ, గుర్రం కొండ దుర్గం నవాబు అయిన మీర్‌ రజా అలీఖాన్‌ సమాధి ఉంది. ఈ సమాధి వలనే ఈ గ్రామానికి మక్బరా (సమాధి) అనే పేరు వచ్చింది. సమాధిపై ఉన్న పారశీక శాసనంలో ఈయన మరణించిన సంవత్సరం 1780గా సూచించబడింది. ఈ మక్బరా అరబిక్‌ శైలిలో రెండు అంతస్తులతో ఉంటుంది. మొదటి అంతస్తులో ఇతని కుటుంబ సభ్యుల సమాధులు వుండగా.. రెండవ అంతస్తులో అలీఖాన్‌ సమాధి ఉంది. రెండవ అంతస్తులో సమాధి ఉన్న గుంబజ్‌ (గుమ్మటం) నిర్మాణం పూర్తిగా బీజాపూర్‌ లోని గోల్‌ గుంబజ్‌ను పోలి వుండటమే కాకుండా గోల్‌ గుంబజ్‌ తరువాత స్థానాన్ని ఈ సమాధి ఆక్రమించి, రెండవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ ప్రదేశాలన్నీ పురావస్తుశాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి.

కోట నిర్మాణం[మార్చు]

విజయనగర సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు విజయనగర పాలకులు గుర్రం కొండ దుర్గాన్ని నిర్మించారు. అయితే హైదర్‌ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్‌ మహారాష్ట్ర నుండి ఈ ప్రాంతాన్ని తన వశం చేసుకున్నాడు. దాదాపు నాలుగు వందల సంవత్సరాల కిందట నిర్మింపబడి, చరిత్ర ప్రసిద్ధి గాంచి, శత్రుదుర్భేద్యమైన ఈ కోటను ఆ తరువాత గోల్కొండ సుల్తానుల హయాంలో పునర్నిర్మించారు. నిర్మాణశైలి మొత్తం మహమ్మదీయ శైలిలో ఉంటుంది. ఈ కోట 500 అడుగుల ఎత్తున ఒక గొప్ప కొండపై ఉంది. మూడువైపులా కొండ దాదాపు నిలువుగా ఉండి ఎక్కడానికి వీలులేకుండా ఉంటుంది. నాలు గోవైపు కూడా ఏటవాలుగా ఉండి దుర్భేద్యంగా ఉంది. కోటలో నల భైకి పైగా మసీదులు ఉండేవి. కానీ కాలక్రమేణా అవి శిథిలమైనవి. పర్షియాలోని కిర్మాన్‌ నుండి వచ్చిన హజ్రత్‌ షా కమాల్‌ అనే సూఫీ సంతు ఇక్కడ స్థిరపడి స్థానికులకు ఇస్లాం మతాన్ని బోధించి ప్రాంతం లోని చుట్టుపక్కల గ్రామాలకు ఇస్లాం మతాన్ని వ్యాపింపజేశాడు.ఈ కోట 18వ శతాబ్దం చివరలో టిప్పు సుల్తాన్‌ ఆధీనంలో ఉన్న కాలంలో.. ఆయన ఇక్కడ నాణేలను ముద్రించేందుకు ఒక టంకశాలను కూడా ఏర్పాటుచేశాడు. ఆ తరువాత కడప నవాబుల పాలనలోకి వచ్చింది. ఇక్కడి కోట చాలా ప్రసిద్ధమైనది. ఈ కోటలో గల ‘రంగినీ మహల్‌’ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

కోట విశేషాలు[మార్చు]

సందర్శకులకు మొదటగా... తొలి ప్రహరీగోడ, దాని తరువాత కందకం కనిపిస్తాయి. దుర్గానికి తూర్పు వైపున ఉన్న ఏనుగుల చెరువు (హాతీ తలాబ్‌) లోంచి ఈ కందకంలోకి నీటిని నింపి శత్రు సైన్యాల ముట్టడి నుండి దుర్గాన్ని రక్షించుకునేవారట. కందకం దాటితే రెండవ ప్రహరీ గోడ, దానిలోపలే దుర్గం ఉంది. ఈ దుర్గం అతి ఎత్తయిన కొండ (గుర్రం కొండ) కు చుట్టూ నిర్మింపబడింది. కొండపైకి వెళ్లడానికి ఒకే ఒక మార్గం ఉంది. మిగిలిన మూడువైపులా రాకపోకలు సాగించడానికి వీలులేకుండా సహజసిద్ధమైన ఏర్పాట్లున్నాయి. ఉత్తరం వైపు మినహా మిగిలిన మూడు వైపులా కొండ ఏకశిలారూపంలో నిట్టనిలువనా ఉండడంతో మానవమాత్రులెవ్వరూ ఈ మూడు వైపుల నుండి కొండపైకి ఎక్కడానికి వీలుపడదు. కొండపైకి వెళ్లడానికి ఉత్తరం వైపు విశాలమైన రాతి మెట్లు నిర్మించారు.మెట్ల మీదుగా పైకి వెళితే మధ్యలోనే ప్రధాన ద్వారం దాటాలి. 25 అడుగుల ఎత్తులో రాతితో నిర్మింపబడిన ప్రధాన ద్వారంపై కనిపించే శంఖు, విష్ణుచక్రాల గుర్తులను బట్టి మొదట ఈ దుర్గాన్ని హిందూరాజులు నిర్మించారన్న విషయం తెలుస్తోంది. కొండకు దిగువ భాగంలో నవాబు నివాస మందిరమైన రంగినీ మహల్‌ (రంగ మహల్‌) సందర్శకులను విశేషంగా ఆకట్టుకుం టోంది. రంగినీ మహల్‌ ముఖ భాగం వైపు నుండి చూస్తే రెండు అంతస్తులతోనూ ఉండి సందర్శకులను ఆశ్చర్యచకి తులను చేస్తోంది. పై అంతస్తులో ఒక విశాలమైన హాలు, రెండు అలంకరణ గదులు, ఆరు స్నానపు గదులు నిర్మించి ఉన్నాయి. ఆనాటి భవన నిర్మాణ చతురతకు ఇదో నిదర్శనం. అయితే నేడు రంగినీ మహల్‌ ఎదురుగా ఉన్న అనేక పెద్ద భవనాలు పూర్తిగా కూలిపోయి శిథిలాలమయంగా ఉంది. ఓ పక్కగా గల వంటగది పైకప్పు కూలిపోయి మొండి గోడలతో వుండగా, నవాబు ఉపయోగించే గుర్రపు బగ్గీ కోసం నిర్మించిన పోర్టికో నేటికీ దృఢంగా, చెక్కు చెదరకుండా ఉంది.

రాచరిక వ్యవస్థకు నిలువుటద్దం[మార్చు]

గుర్రం కొండ ఆ రోజుల్లో ఒక బలమైన దుర్గానికి కేంద్రమై, ఓ వెలుగు వెలిగింది. రెండు వందల సంవత్సరాలపాటు రాచరిక పాలనా వ్యవస్థకు కేంద్రంగా, జాగీరుగా, వ్యాపార వాణిజ్యాలకు, జమిందార్ల నిలయంగా ఉండేది. గుర్రం కొండ చరిత్రను ఒకసారి అవలోకిస్తే గుర్రం కొండ దుర్గానికి సంబంధించి తద్వారా దానితో ముడిపడి ఉన్న ఇతర పెద్ద సామ్రాజ్యాల చరిత్రకు సంబంధించిన అనేక విషయాలు పర్యాటకుల స్మృతిపథంలో మెదులుతాయి.

వెల్లివిరిసిన మతసామరస్యం[మార్చు]

కోట లోపల నిర్మింపబడిన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి, వినాయక ఆలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, రెండు మసీదులు, మూడు దర్గాలు ఉండడం నాటి మతసామరస్యానికి, హిందూ, ముస్లిం ఐక్యతను చాటిచెబుతోంది. నెయ్యి గది, వైద్యశాల, ధాన్యపు గదులు అన్నీ నేడు శిథిలావస్థలో ఉన్నాయి. గుర్రం కొండ దుర్గానికి పడమర వైపున ఉన్న మక్బరా (పవిత్ర సమాధి) దుర్గం మొత్తం మీద సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

మూలాలు[మార్చు]

  1. Mohammad (2015-06-10). "తెలుగు రాష్ట్రాలలో చారిత్రక కట్టడాలు !!". telugu.nativeplanet.com. Retrieved 2022-04-28.
  2. తెలుగు నేటివ్ ప్లానెట్. "అంధ ప్రదేశ్ , తెలంగాణ లలో ప్రసిద్ధ కోటలు". telugu.nativeplanet.com. Archived from the original on 12 November 2016. Retrieved 3 March 2017.
  3. Henderson, John R. (1989). The coins of Haidar Alī and Tīpū Sultān (in ఇంగ్లీష్). Asian Educational Services. ISBN 978-81-206-0502-2.