తెన్నేటి సూరి
తెన్నేటి సూరి | |
---|---|
![]() తెలుగు రచయిత | |
జననం | 1911 |
మరణం | అక్టోబరు 16 1958 |
వృత్తి | రచయిత |
తెన్నేటి సూరి (1911 - 1958 అక్టోబరు 16) తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత, నాటకకర్త. ఛంఘిజ్ ఖాన్ నవలా రచయితగా సుప్రసిద్ధుడు. భారతి, ఆంధ్రపత్రికలలో 1945-1957లలో పత్రికా రచయితగా పనిచేశాడు. చారిత్రక నవలైన 'చంఘీజ్ఖాన్' మొదట ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురితమైంది. 13 శతాబ్దాల మధ్యగల ఆసియా ఖండ చరిత్రలో గర్వకారకుడైన మహాపురుషుడు చంఘీజ్ఖాన్ విదేశీ చరిత్రకారులు అతనిని ఒక సైతానుగా, అధికార దుర్మదాంధుడుగాను, నియంత గాను, నరరూప రాక్షసునిగాను చిత్రించారు. తెన్నేటి సూరి ఎన్నో శ్రమల కోర్చి యథార్థ చరిత్రను వెలికితీసి, ప్రాచ్య, పాశ్చాత్య గ్రంథాలను ఔపోసనపట్టి ఎంతో దక్షతతో ఈ నవలను తీర్చిదిద్దాడు. ఆయనకు గల పరిపాలనా దక్షతను, శక్తి సామర్థ్యాలను, తనకింది అధికారుల పట్ల చూపిన ప్రేమాదరాలను చక్కగా వివరించారు.[1]
జననం[మార్చు]
సూరి 1911లో కృష్ణా జిల్లా తెన్నేరులో వెంకట లక్ష్మమ్మ, తండ్రి తిరుమలరావు దంపతులకు జన్మించాడు.[2] పుట్టిన ఊళ్లోనే ప్రాథమిక విద్య పూర్తిచేసి, పై చదువులకి బందరు వెళ్లాడు. అక్కడే సాహిత్య రచనా వ్యాసంగానికి అంకురార్పణ జరిగింది. కొందరు పత్రికాధిపతులతో పరిచయం ఏర్పడింది. వారి మద్దతుతో ఓ ప్రెస్ లో ఉగ్యోగం లభించింది. ఈ పని చేస్తూనే ఆయా పత్రికలకి వ్యాసాలు రాయడం మొదలు పెట్టాడు.
ఈ సందర్భంలో సూరికి కాంగ్రెస్ నాయకులూ, కమ్యూనిస్టు మేథావులూ పరిచయమయ్యారు. "సాహిత్యం పజల కోసం" అనే వాతావరణంలో సూరి కొత్తగా రచన ప్రారంభించాడు. లిఖిత పత్రికలో రాసిన రచనలకు భిన్నంగా, తమ కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా రచన ప్రారంభించాడు. పైగా ఒక్క సూరి తప్ప ఇంట్లో అందరూ కాంగ్రెస్ వాదులు.
ప్రజానాట్య మండలి ఎన్నో పాటలు, కళారూపాల ద్వారా ఫాసిస్టు వ్యతిరేక ప్రచారం చేసింది. అందుకు సూరి తన వంతు సహకారాన్ని అందించాడు. ఎన్నో పాటలు రాసి వారికి అందించాడు.
వీరు పనిచేసే ప్రెస్సే సాహిత్య వేదికగా పనిచేసింది. కార్మిక కర్షక కూడలిగా మారింది. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు కాకపోయినా పార్టీ ఆదేశాలకు గౌరవించాడు. పార్టీ నాయకులతో కలసి పనిచేసాడు. మహిళా చైతనం కోసం పాటలు రాసాడు. ఫాసిజాన్ని శక్తిమంతంగా ఖండించాడు. సూరి ప్రత్యేకత ఏమంటే బాల గేయాల రచన. పిల్లల కోసం వారి బాణీల్లో పాటలు రాసేవాడు. కేవలం పాటలే కాదు. "గొడ్లకాడ" అనే నాటకం కూడా రాసి ప్రదర్శించాడు. తెలంగాణా రైతాంగ పోరాటం గురించి ఆంధ్ర ప్రాంతంలో సానుభూతి సంపాదించడం కోసం పాటలు రాసాడు. అందులో పిల్లల పాటలే ఎక్కువ. "సవాలన్న నైజాముకు జవాబెవ్వరు" అనే పాట ఈ నాటికీ ప్రజల వాడుకలో ఉంది. " బాల చంద్రుడెవారూ" అనే పాటలో పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా పౌరుషాగ్ని కీలలు వ్యాపించజేసింది. సూరి రాసిన పాటల్ని బుర్రకథల్లో, ఇతర ప్రదర్శన కళారూపాల్లో ఉపయోగించే వారమని ప్రజాకవి సుద్దాల హనుమంతు చెప్పారు. ఈ రకంగా సూరి తెలంగాణా రైతాంగ పోరాటంలో ఎంతో ప్రభావితుడయ్యాడు. అతని పాటలు ప్రజల నోళ్ళలో నిలిచాయి.
పనిచేస్తున్న ప్రెస్సు మూత పడ్డాక ఆంధ్రపత్రికలో చేరాడు.రచయితగా పత్రికోధ్యోగిగా అధికారుల మన్ననలను పొందాడు. ఆంధ్ర పత్రిక సారస్వతాను బంధం సంపాదకుఇగా ప్రతిభావంతంగా పనిచేసాడు. ఓ వైపు రాత సాహిత్యం పనిచేస్తూ, తెలంగాణా పోరాటానికి నోటి పాటల్ని కంపోజు చేసేవాడు. ఆంధ్ర పత్రిక నైజాంలోకి ప్రవేశించేదికాదు. కానీ ఈ నోటి పాటలు సరిహద్దుల్ని లెక్కచేయకుండా నిరాఘాటంగా వెళ్ళి వ్యాప్తిపొందేవి. మరోవైపు చంఘిల్ ఖాన్. రెండు మహానగరాలు నవలల్ని అనువదించాడు. ఎనో కథలు, గేయాలు రచించాడు. కలంతోనే కాకుండా గళంతో పాడే పాటల రచయితగా అతను చాలా మందికి తెలియదు. ఇప్పటికీ ఆ పాటలు పాడుకునే తెలంగాణా ప్రజలకు వాటి రచయిత తెన్నేటి సూరి అని తెలియదు. ఐనా ఆ పాటలింకా ప్రచారంలో ఉండటం కవి సజీవతని చాటుతున్నాయి.[3]
మరణం[మార్చు]
సూరి 1958, అక్టోబరు 16న మరణించాడు. టీ.బీ అతని భౌతిక శరీరాన్ని తినేసింది. కానీ అతని పాడిన బాణీలు ఆయన్ని సజీవంగా ఉంచాయి.
రచనలు[మార్చు]
కథా సంపుటాలు[మార్చు]
- విప్లవ రేఖలు
- సుబ్బలక్ష్మి
కవితా సంకలనాలు[మార్చు]
- అరుణ రేఖలు
- మహోదయం
నాటికలు[మార్చు]
- నా రాణి
నవలలు[మార్చు]
- చంఘిజ్ ఖాన్
- రెండు మహానగరాలు - ఫ్రెంచి విప్లవాన్ని నేపథ్యంగా తీసుకుని చార్లెస్ డికెన్స్ 1859 లో రాసిన ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ని రెండు మహానగరాలు పేరిట తెలుగులో రాశాడు.[4]
బయటి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ తెలుగు భాషలో నవలా ప్రక్రియ -- Novel in Telugu Literature
- ↑ http://2.bp.blogspot.com/-hu3F7yqTYb8/UIjcRQDp2aI/AAAAAAAAaEw/B7qqVaEIxbY/s1600/tennati+suri+writer.jpg
- ↑ Pruthvi Azad (2015-04-04). "2014 03-28 131848-farmerstruggle2".
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ రెండు మహానగరాలు - నెమలికన్ను