వేముల మోహనరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేముల మోహనరావు రంగస్థల కళాకారుడు. అతను తన నటనతో అఖిలాంధ్ర ప్రేక్షక లోకంచే జేజేలు పలికించుకుంటున్న విలక్షణ నటునిగా గుర్తింపు పొందాడు.. ఏ పాత్రలో నటించినా ఇట్టే ఒదిగిపోయి నటించటమే కాక అతను చేసిన ఏపాత్రనైనా ఆయనకన్నా మరెవ్వరూ అంత బాగా చేయలేరని, నటనలో సహజత్వం ఆయన సొత్తు అని నాటక మేధావి పిఠాపురం బాబి గారిచే ప్రశంసలు అందుకున్న విలక్షణ నటుడు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

అతను 1948 నవంబరు 28గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకర్రు గ్రామంలో వేముల అచ్చయ్య, సులోచన దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు. అతని బాల్యము, విద్యాభ్యాసం అంతా చందోలు, నిడుబ్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గడిచింది. 8వ తరగతి నుంచి 10వ తరగతి తెనాలి తాలూకా ఉన్నత పాఠశాల బ్రాంచిలో జరిగింది. అతను 8వ తరగతిలో వుండగా సీనియర్ విభాగంలో జరిగిన పాటల పోటీలో ప్రథమ బహుమతి, ‘‘ఏరువాక’’ సంగీత నృత్యరూపకంలో రైతు పాత్ర పోషించటంతో నటనకు అంకురారోపణ జరిగింది. ఆతర్వాత స్కూలులో జరిగే పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనటం బహుమతులు పొందటం జరిగింది. అటుపై పి.యు.సి.లో చేరేనిమిత్తం ఒంగోలు సి.యస్.ఆర్.శర్మ కాలేజీలో విద్యాభ్యాసం కొనసాగింది. ఆరోజుల్లో పేరు పొందిన ఊలా జోసెఫ్, దేవరపల్లి ప్రసాద్, టి.కృష్ణ, ఎం.వి.ఎస్.హరనాథరావు వంటి వారి నటనను చూసి ముగ్ధులై తానూ నటించాలని భావించాడు. అనుకున్నదే తడవుగా నెత్తురుకూడు, ఊబి వంటి నాటికల ప్రదర్శనతో నటునిగా కొనసాగాడు. అటుపై డిగ్రీ చదివే నిమిత్తం గుంటూరులోని హిందూ కాలేజీలో చేరటం జరిగింది. ఈ సందర్భంలో గాలివాన నాటకం, ప్రతిధ్వనులు నాటిక, చీకటి తెరలు వంటి ఎన్నో నాటకాల్లో ప్రథాన పాత్రలు పోషించి ప్రేక్షకులను సమ్మోహన పరిచారు. నటనంటే వేమల మోహనరావుదే అంటూ జేజేలు కొట్టించారు.

నాటక రంగ ప్రస్థానం[మార్చు]

అసురసంధ్య, ఆశ్రయ, పరమపధం, దగాపడ్డ తమ్ముళ్ళు వంటి నాటకాలు, అతిధిదేవుళ్ళు, ఆగండి కొంచెం ఆలోచించండి, అడ్రసు లేని మనుషులు, తెరచిరాజు వంటి నాటికలు ‘‘కుప్పలి కళాంజలి’’ సంస్థ ద్వారా పొన్నూరులో ప్రదర్శించారు.  అటుపై పొన్నూరు నుండి గుంటూరుకు మకాం మార్చవలసి వచ్చింది.1979లో కసుకూరుకు చెందిన వెంకటసుబ్బమ్మతో వివాహం జరిగింది.  1976లో ఎస్.ఐ ఉద్యోగానికి ఎంపికైనప్పటికీ, నటన మీదున్న మక్కువతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. నటననే తన వృత్తిగానూ, ప్రవృత్తిగానూ ఎంచుకున్నాడు. సృజన ఆర్ట్స్ పెదకాకాని వారికి బాపట్లకు చెందిన నటుడు, దర్శకుడు కె.ఎస్.టి.సాయిగారి దర్శకత్వంలో సహనం తిరగబడింది, సర్పజాతి నాటికలో ప్రధాన పాత్ర పోషించారు. అటుపై నెచ్చెలి గుంటూరు వారి పంజా, ప్రకటన, కాలజ్ఞానం నాటికలలోనూ పాత్రలు పోషించి తనదైన ముద్ర వేసుకున్నాడు. నాగభైరవపాలెంలో ప్రకటన నాటిక ప్రదర్శన సందర్భంగా బంగారపు ఉంగరాన్ని బహుమతిగా విశిష్ట నటునిగా అవార్డు అందుకున్నాడు. 1981లో గుంటూరు రైల్వే ఇనిస్టిట్యూట్ తరఫున విజయవాడకు చెందిన జి.ఎస్.ఆర్.మూర్తి దర్శకత్వంలో తాళి నాటికలో ప్రతినాయకుని పాత్ర పోషించాడు. 1982 నుంచి శాస్త్రీయం గుంటూరు వారి  డియర్ ఆడియన్స్ సిన్సియర్లీ యువర్స్ నాటకం, దహతి మమ మానసం నాటిక, తర్జని (నాటకం) వరకూ నటించాడు. అటుపై సొంతగా వేమన ఆర్ట్ థియేటర్స్ అనే నాటక సమాజం స్థాపించి సహారా (నాటకం), నీతిచంద్రిక నాటకాలకు దర్శకత్వం వహించాడు. ఒంగోలుకు చెందిన స్పందన ఆర్ట్స్ వారితో నిషిద్ధాక్షరి నాటకంలో బగాది అనే పదినిమిషాల పాత్రద్వారా అఖిలాంధ్ర ప్రేక్షకుల మనసుల్లో ఇప్పటికీ చెరగని ముద్రను వేసుకున్నాడు వేముల. ఎల్.వి.ఆర్.క్రియేషన్స్ వారు నిర్మించిన పుటుక్కుజరజర డుబుక్కుమే, జారుడుమెట్లు నాటికల్లో నటించాడు. అటుపై వేమన ఆర్ట్ థియేటర్స్ ద్వారా డెవిల్స్, కసాగు, గరిమనాభి నాటికలు నిర్మించాడు. ఉషోదయకళానికేతన్ కట్రపాడు సమాజంవారు నిర్మించిన నాటకం పేదవాడులో కీలకమైన పాత్రను పోషించాడు. 2012-13 సంవత్సరంలో నంది నాటకాలకు స్ర్కూటినీ జడ్జిగా నియమించబడ్డారు. పలు నాటక పరిషత్తులకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అటుపై అభిమానుల ప్రోద్భలంతో వేమన ఆర్ట్ థియేటర్స్ పేరును వేముల ఆర్ట్ థియేటర్స్ గా మార్చటం జరిగింది. వేముల ఆర్ట్స్ సమాజం తరఫునవారసులు నాటిక, అహల్య నాటకం నిర్మించి ప్రదర్శిస్తున్నారు. కొత్త రచయితలను, కొత్త నటీనటులను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇచ్చి నాటకరంగానికి విశిష్టమైన సేవలు అందిస్తున్నాడు. ఈయన జీవితంలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సాయిరాఘవ మూవీమేకర్స్, వేముల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన నాటిక ‘‘కొత్తనీరు’’ నాటికతో విజయపథంలో దూసుకుపోతున్నాడు.[1]

నాయకునిగా వేముల[మార్చు]

చవుకునే రోజుల నుండి క్లాసు లీడరుగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాడు. కాలేజీ విద్యార్థిగా కొనసాగుతున్న సమయంలో సెక్షన్ రిప్రజెంటేటివ్ గా బాధ్యతలు తీసుకున్నాడు. అటుపై 1992-94 బహుజన సమాజ్ పార్టీలో గుంటూరు జిల్లా ప్రచార కార్యదర్శి, 1994-2009 వరకూ బి.జె.పిలో కార్యదర్శి, ప్రధానకార్యదర్శి, ఉపాధ్యక్షునిగా పనిచేస్తూ 1996లో బాపట్ల పార్లమెంటు నియోజక వర్గానికి బి.జె.పి.అభ్యర్థిగా పోటీ చేయటం జరిగింది. 2009 తర్వాత క్రియాశీలక రాజకీయ వేత్తగా కొనసాగుతున్నాడు.  2004-2006 వరకు చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంకు గుంటూరు జిల్లాకి డైరెక్టరుగా పనిచేయటం జరిగింది.

మూలాలు[మార్చు]

  1. "నవరస వీక్షణ తోరణం".[permanent dead link]