శ్రీ వేంకటేశ్వరా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన సతీ సుకన్య సినిమా 1959, జనవరి 30న విడుదలైంది.చంద్రమోహన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో అమరనాథ్,కృష్ణకుమారి, కాంతారావు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు అందించారు .
భృగుమహర్షి, పులోమి దంపతుల పుత్రుడు చ్యవనుడు. మహా తపశ్శాలి. శర్వాతి మహారాజు (మిక్కిలినేని), మహారాణి (రమాదేవి)ల కుమార్తె సుకన్య (కృష్ణకుమారి). తల్లిదండ్రులు, చెలులతో వన విహారానికి వెళ్తుంది. అలా వన విహారంలో ఆమె విసిరిన పూమాల ఓ పుట్టపై పడుతుంది. దాన్ని తీయబోయి, అందులోనుంచి వచ్చే వింతకాంతులు చూసి ఓ పుల్లతో చిదిమివేస్తుంది. దాంతో ప్రకృతిలో ప్రళయ కంపనలు వస్తాయి. ఆ పుట్టలోని చ్యవనుడు (అమర్నాథ్) అంధుడు కావడం జరుగుతుంది. మహర్షి ఆగ్రహాన్ని శాంతింపచేసి, అతనికి పరిచర్య చేయటానికి నారద మహర్షి (పద్మనాభం) సూచనపై శర్వాతి తన కుమార్తె సుకన్యనిచ్చి అతనికి వివాహం చేస్తాడు. సుకన్య అనుకూలవతియైన ఇల్లాలిగా పతికి సేవ చేస్తుంటుంది. దేవ వైద్యులు, సంధ్యాదేవి పుత్రులు అయిన అశ్వనీ కుమారులు (కాంతారావు) తమకు యజ్ఞ్ఫలం అర్హతలేదని దేవేంద్రుడు సభలో నిరాకరించటంతో, నారదుని సలహాతో సుకన్యను ఆశ్రయించి ఆమెను సోదరిగా భావించి, ఆమె భర్త చ్యవనునికి యవ్వనం ప్రసాదిస్తారు. సుకన్య చ్యవనులు ఆనందంగా దాంపత్య జీవితం గడుతుంటారు. దేవేంద్రుడు కోపంతో విద్యాధరుని పంపి, చ్యవనుడిగా మార్చి అతడు మరణించినట్టు సృష్టిస్తాడు. చ్యవన మహర్షి శిష్యుడు మార్గాన్వేషి (రమణారెడ్డి) అంత్యక్రియలు జరుపుతాడు. శర్వాతి మహరాజు తన కుమార్తె పర పురుషునితో ఉందని భావించి, ఆమెను, చ్యవనుని కారాగారంలో బంధిస్తాడు. జగన్మాత అనుగ్రహంతో సుకన్య అగ్నిపరీక్షలో జయంపొంది, అశ్వనీ దేవతలకోసం భర్త ఆధ్వర్యంలో తలిదండ్రులచే యజ్ఞం చేయిస్తుంది. జగన్మాత అనుగ్రహంతో దేవేంద్రుడు కల్పించిన ఆటంకాలను ఎదుర్కొని, యజ్ఞాన్ని పూర్తిచేయించి, అశ్వనీ దేవతలకు యజ్ఞ్ఫలం అందించటానికి దేవేంద్రుడు కూడా సిద్ధపడటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది[1].