థామస్ మన్రో
సర్ థామస్ మన్రో (27 మే, 1761-6 జూలై, 1827), స్కాట్లాండ్ కు చెందిన యోధుడు మరియు అధికారి. ఈయన తండ్రి అలెగ్జాండర్ మన్రో గ్లాస్గో నగరంలో పేరుపొందిన వ్యాపారి. అలెగ్జాండర్ మన్రో అమెరికాలోని వలస ప్రాంతమైన వర్జీనియాతో వ్యాపారం సాగించేవాడు.[1] ఈయన తల్లి మార్గరెట్ స్కార్క్, ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో శరీరనిర్మాణ శాస్త్రంలో ప్రొఫెసరైన విలియం స్టార్క్ సోదరి.[2][3]
థామస్ గ్లాస్గో విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. ఇతడు 1789 సంవత్సరంలో మద్రాసు పదాతి దళంలో కాడెట్ గా చేరాడు.
ఇతడు హైదర్ ఆలీ తోను (1780-1783) తరువాత టిప్పు సుల్తాన్ తోను (1790-1792) తలపడ్డాడు. టిప్పు సుల్తాన్ పతనం తరువాత రాయలసీమ ప్రధాన కలక్టర్ గా నియమించబడ్డాడు. మన్రో తన సైన్యంతో 1800-1807 మధ్య కాలంలో తిరుగుబాటుదారులను నిర్ధాక్షిణ్యంగా అణచివేశాడు.
థామస్ మన్రో రైతుల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించాడు. రైత్వారీ విధానం ప్రవేశపెట్టి తరతరాల నుండి పాలెగాండ్ర దోపిడీకి గురై అనేక ఇబ్బందుల పాలైన రైతులను ఆదుకున్నాడు. క్రీ.శ. 1804లో కడప జిల్లాకు వరదలు వచ్చినప్పుడు చెరువులను, కాలువలను సకాలంలో మరమ్మత్తు చేయించి పుష్కలంగా పంటలు పండే ఏర్పాటుచేశాడు. 1807లో మన్రో తన పదవికి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగివెళ్ళాడు.
మన్రో 1820 జూన్ 8 వ తేదీన మద్రాసు గవర్నరుగా తిరిగివచ్చాడు. అతడు పాలించిన ఏడు సంవత్సరాలు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషిచేశాడు. ఇతడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ కలరా వ్యాధి సోకి 1827, జూలై 6వ తేదీన మరణించాడు.
బ్రిటిష్ పాలనలో చిత్తూరు కలెక్టర్గా పనిచేసిన సర్ థామస్ మన్రో పెద్ద వెండి గంగాళాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కి కానుకగా ఇచ్చాడు. దీనినే మన్రో గంగాళం అంటారు. నేటికీ స్వామివారికి దీనిలోనే నైవేద్యం పెడతారు.