బి. వి. సుబ్బారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి. వి. సుబ్బారెడ్డి
బి. వి. సుబ్బారెడ్డి

బి.వి.సుబ్బారెడ్డి


ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు
పదవీ కాలం
1962 - 1970
ముందు అయ్యదేవర కాళేశ్వరరావు

వ్యక్తిగత వివరాలు

జననం 1 జూలై 1903
కోయిలకుంట్ల, కర్నూలు జిల్లా
మరణం 7 జూన్ 1974
హైదరాబాద్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సుబ్బమ్మ
సంతానం ఆరుగురు కుమారులు ఒక కుమార్తె
మతం హిందూ

బొల్లవరపు వెంకట సుబ్బారెడ్డి సంక్షిప్తంగా బి.వి.సుబ్బారెడ్డి (జననం: 1903 జూలై 4 - మరణం: 1974 జూన్ 7) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మూడవ సభాపతి.[1]

ప్రారంభ జీవితం[మార్చు]

ఇతను 1903 జూలై 1న కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో జన్మించాడు. ఇతని తండ్రి రామస్వామిరెడ్డి. 1926లో నోబుల్ కళాశాల, మచిలీపట్నం నుండి బి.ఎ.లో పట్టభద్రుడైన తదుపరి ఇతను మద్రాసు విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ లాను అభ్యసించాడు. తరువాత నంద్యాలలో ప్రాక్టిస్ ప్రారంభించి మంచిపేరు సంపాదించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

ఇతను 1938, 1949వ సంవత్సరంలో కర్నూలు జిల్లా బోర్డు అధ్యక్షునిగా పనిచేసాడు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, పలు సార్లు జైలుకు వెళ్ళాడు. ఇతను 1955వ సంవత్సరంలో రెండవ శాసనసభకు, 1962వ సంవత్సరంలో మూడవ శాసనసభకు, 1967వ సంవత్సరంలో నాలుగవ శాసనసభకు, 1972వ సంవత్సరంలో ఐదవ శాసనసభకు వరుసగా ఐదు సార్లు కర్నూలు జిల్లా కోయిలకుంట్ల నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1962వ, 1972వ సంవత్సరాలలో రెండు సార్లు ఇతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. పి.వి. నరసింహారావు మంత్రివర్గంలో ఇతడు 1971 సెప్టెంబరు 30 నుండి 1972 మార్చి 20 వరకు ఉప ముఖ్యమంత్రిగా, ప్రణాళిక, ప్రజా పనుల శాఖామాత్యులుగా పనిచేసాడు. 1972 ఎన్నికల అనంతరం తిరిగి పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో 1972 మార్చి 20 నుండి 1972 డిసెంబరు 30లో రాజీనామా చేసేవరకు ఉపముఖ్యమంత్రిగా, ప్రణాళిక, రోడ్లు, భవనాలు, ఉద్యానవనాలు, ప్రజా పనుల శాఖలను నిర్వహించాడు. ఇతను జలగం వెంగళరావు మంత్రివర్గంలో 1973 డిసెంబరు 10 నుండి 1974 జూన్ 8 వరకు ఉపముఖ్యంత్రిగా పనిచేసి, ప్రణాళిక, వ్యవసాయ శాఖల అమాత్యులుగా పనిచేసాడు.[2] 1965లో సోవియట్ యూనియన్ ను ఇతను అధికారికంగా సందర్శించాడు. 1968వ సంవత్సరంలో బహమాస్ ఐలాండ్ నస్సావ్‌లో జరిగిన కామన్‌వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొన్నాడు. 1970లో లండన్‌లో జరిగిన కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో పాల్గొన్నాడు.

సభాపతిగా[మార్చు]

1963 మార్చి 22న ఇచ్చిన రూలింగులో చట్టసభల కార్యకలాపాలలో పాల్గొనే సభ్యులకు న్యాయస్థానాలతో సహా ఎవరూ ఎటువంటి ఆటంకాలు కల్పించరాదని, శాసనసభసభ్యులు శాసనసభ సమావేశాలకు హాజరు అవటాన్ని అత్యంత ప్రాధాన్యత గల విషయముగా అందరూ పరిగణించాలని ఇతడు చెప్పాడు. శాసనసభ సమావేశ కాలంలో ఎవరైనా సభ్యుడికి శాసనసభలో సమన్లు జారీ చేయడం లేదా స్పీకర్ ద్వారా గానీ శాసనమండలి అధికారుల ద్వారా గానీ అట్టి సమన్లను సభ్యులకు అందజేయవలసిందిగా కోరడం గానీ సభాధిక్కారం కిందకు వస్తుందని రూలింగ్ ఇచ్చాడు ఇతను. [3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (11 October 2021). "దేశస్థాయిలో రేనాటి ఖ్యాతి". Archived from the original on 11 అక్టోబరు 2021. Retrieved 11 October 2021.
  2. Sakshi (15 March 2019). "జిల్లాలో హైట్రిక్‌ వీరులు." Sakshi. Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
  3. 50 వసంతాల ఆంధ్రప్రదేశ్ శాసన సభ. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సచివాలయము. p. 13, 14. Retrieved 30 March 2019.