మూసీ నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1895లో మూసీ నది దృశ్యం

మూసీ నది కృష్ణా నది ఉపనది. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాదు నగరం మధ్యనుండి ప్రవహిస్తూ చారిత్రక పాత నగరాన్ని, కొత్త ప్రాంతం నుండి వేరుచేస్తూ ఉంటుంది. పూర్వము ఈ నదిని ముచుకుందా నది అని పిలిచేవారు.[1] హైదరాబాదు యొక్క త్రాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ యొక్క ఉపనదిపై హుస్సేన్ సాగర్ సరస్సు నిర్మించబడింది.

మూసీనది హైదరాబాదు నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన రంగారెడ్డి జిల్లా, వికారాబాదు వద్ద అనంతగిరి కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా, వాడపల్లి (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాదు గుండా ప్రవహిస్తుంది. నగరాన్ని దాటిన తర్వాత మూసీలో చిన్నమూసీ నది, అలేరు నదులు కలుపుకొని దక్షిణపు దిశగా మలుపు తిరుగుతుంది. మూసీలో ఆలేరు కలిసేచోట సూర్యాపేట వద్ద 1963లో పెద్ద జలాశయాన్ని నిర్మించారు. ఆ తరువాత పాలేరు నదిని కలుపుకొని వజీరాబాదు వద్ద కృష్ణానదిలో కలిసేటప్పటికి 200 అడుగుల ఎత్తుకు దిగుతుంది. మూసీ నది యొక్క బేసిన్ వైశాల్యము 4,329 చదరపు మైళ్ళు. ఇది మొత్తం కృష్ణానది యొక్క బేసిన్ వైశాల్యములో 4.35%[2] సాధారణంగా చిన్న వాగులాగా ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు బీభత్సము, అత్యంత జననష్టము కలిగించిన చరిత్ర ఉంది.

మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నాయి. వీటిలో పురానా పుల్ (పాత వంతెన) అత్యంత పురాతనమైనది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీ వంశస్తుడైన ఇబ్రహీం కుతుబ్ షా 1578 లో నిర్మించాడు[3]. ఈ వంతెన ఇప్పటికీ వాడుకలో ఉంది. నయా పుల్ (కొత్త వంతెన) వంతెన హైకోర్టు సమీపములో అఫ్జల్ గంజ్ వద్ద ఉంది. ఇవికాక ఇతర వంతెనలు డబీర్‌పూరా, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, నాగోల్, ఉప్పల్ కలాన్ వద్ద ఉన్నాయి. విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి 7, వరంగల్ వెళ్ళే జాతీయ రహదారి 202 ఈ నది యొక్క ఉత్తర, దక్షిణపు ఒడ్డుల వెంట సాగుతాయి.

చాదర్‌ఘాట్ వద్ద మూసీనది దృశ్యం. ఈ చిత్రం నిజాం కాలంనాటి ఛాదర్‌ఘాట్ పాతవంతెన నుండి తూర్పు వైపుకు తీయబడింది. నుండి తీయబడింది. చిత్రంలో దగ్గరగా కనిపిస్తున్నది చాదర్‌ఘాట్ ప్రాంతంలో 1990వ దశకంలో కట్టిన వంతెన. దూరంగా కనిపిస్తున్నది మలక్‌పేట నుండి కాచీగూడవైపు వెళ్ళే రైలుమార్గంలో మూసీపై ఉన్న రైలు వంతెన. పాత వంతెనను ఉత్తరంవైపు వెళ్ళే వాహనాలకు, కొత్తవంతెనను దక్షిణం వైపు వెళ్ళే వాహనాలకు ఉపయోగిస్తున్నారు

వరదలు[మార్చు]

20వ శతాబ్దపు తొలి దశాబ్దాల వరకు మూసీ నది తరచూ వరదలకు గురై హైదరాబాదు నగరాన్ని ముంచెత్తి నాశనం చేసేది. 1830లో యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ ప్రాంతాన్ని సందర్శించి తన కాశీయాత్ర చరిత్రలో మూసీ గురించి, దాని వరదల గురించి వ్రాసుకున్నాడు. ఆయన 1829లో మూసీనదికి గొప్ప వరదలు వచ్చాయని వ్రాశారు. ఢిల్లీ దర్వాజా వద్ద ఆంగ్లేయులు నిర్మించిన వారధిని ఆ వరద ప్రవాహం పగలగొట్టి, బేగంబజారులో కొన్ని వీధులను ముంచి పోయిందని వ్రాశాడు.[4] 1908 సెప్టెంబరు 28, మంగళవారము నాడు ఒక్కరోజులో 17 అంగుళాల వర్షం నమోదయ్యింది. ఈ భారీ వర్షము ధాటికి మూసీనది పొంగి వరదై హైదరాబాదు నగరమంతా పారింది. అఫ్జల్ గంజ్ వద్ద నీటిమట్టము 11 అడుగుల ఎత్తుకు చేరింది. మరికొన్ని ప్రాంతాలలో అంతకంటే ఎత్తుకు కూడా చేరింది. ఈ వరదలు హైదరాబాదు నగర జనజీవనాన్ని స్తంభింపజేసి అపార ఆస్తినష్టం కలుగజేసింది. జంటనగరాల అభివృద్ధిలో ఆధునిక శకం 1908లో ఈ వరదల తర్వాతనే ప్రారంభమైంది. దీనితో అంచెల వారిగా ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి అనివార్యమైంది.

నగారాభివృద్ధికి ప్రణాళికను తయారుచెయ్యటానికి నియమించబడిన సాంకేతిక నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, వరదల పునరుక్తిని నివారించడానికి, నగరంలో మౌలిక పౌర సౌకర్యాలను మెరుగుపరడానికి కొన్ని సూచనలు చేస్తూ 1909, అక్టోబరు 1న తన నివేదిక సమర్పించాడు. ఏడవ నిజాం 1912లో ఒక నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించాడు. వరదలను నివారించేందుకు ఒక వరద నివారణ వ్యవస్థను కట్టించాడు. 1920లో మూసీ నదిపై ఒక నగరానికి పది మైళ్ళ ఎగువన ఉస్మాన్ సాగర్ ఆనకట్టను కట్టించారు. 1927లో మూసీ ఉపనదైన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో జలాశయము నిర్మించారు. ఈ రెండు జలాశయాలు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడముతో పాటు హైదరాబాదు నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి.

మురికి కాలువ మూసీ[మార్చు]

ఈ దృశ్యంలో నందనవనం ప్రాజెక్టులో భాగంగా నది మధ్యలో నిర్మించిన కాంక్రీటు కాలువను చూడవచ్చు

1980వ దశకము నుండి హైదరాబాదు నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలను మూసీ నదికి నీరును జతచేసే చిన్న చిన్న నాలాల్లో వదలడం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికినీరును మూసీనదిలోకి వదలడంతో మూసీ ఒక మురికి కాలువ స్థాయికి చేరించి. ప్రతిరోజూ జంటనగరాల నుండి వెలువడుతున్న 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలు నదిలో కలుస్తున్నవని అంచనా. ఆ తరువాత 1990వ దశకంలో ఈ మురికినీటిని శుద్ధి పరచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మూసీ నది వెంట అంబర్ పేట ప్రాంతంలో కలుషిత నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించారు. కానీ దీనికి కేవలం 20% నీటినే పరిశుద్ధ పరచగల సామర్థ్యం ఉంది.[5] 2000లలో నగరంలో నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీటు కాలువ ద్వారా ప్రవహింపజేసి ఆ విధంగా సమకూరిన నదీతలాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేసేందుకై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నందనవనం అనే ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. నందనవనం ప్రాజెక్టులో భాగంగా మూసీ నదీగర్భంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించారు. కానీ, మూసీ బచావ్ ఆందోళన్ వంటి సామాజిక సంస్థలు, రాజకీయ ప్రతిపక్షాలు, వామపక్షాల వ్యతిరేకతతో అది సాధ్యం కాలేదు.[6] ఈ మురికివాడల్లో 20 వేల మంది పైగా ప్రజలు ముప్పై ఏళ్లుగా నివసిస్తున్నారని అంచనా.[7]

మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్[మార్చు]

మూసీ ప్రక్షాళనపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తీవ్రంగా పరిగణించడంతో దాని పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ ప్రారంభమైంది. చెక్‌డ్యామ్‌లు నిర్మాణం, బోటింగ్ ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. మూసీ అభివృద్ధి కార్యక్రమాల కోసం మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుచేసింది. మూసీ సుందరీకరణలో భాగంగా నాగోల్‌ సమీపంలో నిర్మించిన వాక్ పాత్ చిత్రాలు..[8]

నదిపై వంతెనలు[మార్చు]

545 కోట్ల‌ రూపాయలతో మూసీ నదిపై 14 బ్రిడ్జిలు నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా ఫతుల్లగూడ, – ఫీర్జాదీగూడ బ్రిడ్జికి, ఉప్పల్ శిల్పారామం వద్ద 5 మూసీ వంతెనలకు (ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌ వద్ద రూ.42 కోట్లతో, ప్రతాప సింగారం-గౌరెల్లి వద్ద రూ.35 కోట్లతో, మంచిరేవుల వద్ద రూ.39కోట్లతో, బుద్వేల్‌ ఐటీ పార్కు-2 సమీపంలో ఈసీపై రూ.32 కోట్లతో, బుద్వేల్‌ ఐటీ పార్కు-1 సమీపంలో ఈసీ నదిపై రూ.20కోట్లతో హెచ్‌ఎండీఏ వంతెనల నిర్మాణాలు) 2023 సెప్టెంబరు 25న రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశాడు.[9] ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, అహ్మద్ బలాల, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్త, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.[10]

మూలాలు[మార్చు]

  1. కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2007-10-23. Retrieved 2008-01-21.
  3. మొహమ్మద్ కులీ కుతుబ్ షా - 2 వ పేజీ
  4. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  5. http://www.rainwaterharvesting.org/hussain_sagar/hussainsagar%202.pdf
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-04-26. Retrieved 2009-08-24.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-02-09. Retrieved 2009-08-24.
  8. "ఆర్కైవ్ నకలు". m.andhrajyothy.com. Archived from the original on 2022-02-28. Retrieved 2022-02-28.
  9. "KTR Laid foundation Stones of Many Bridges : 'హైదరాబాదులో తొమ్మిదిన్నర ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కళ్ల ముందే ఉంది'". ETV Bharat News. 2023-09-25. Archived from the original on 2023-09-28. Retrieved 2023-09-28.
  10. "గోదావరి నీళ్లతో మూసీని నింపుతాం". Sakshi. 2023-09-26. Archived from the original on 2023-09-28. Retrieved 2023-09-28.
"https://te.wikipedia.org/w/index.php?title=మూసీ_నది&oldid=3993053" నుండి వెలికితీశారు