బ్రహ్మంగారి కాలజ్ఞానం

వికీపీడియా నుండి
(కాలజ్ఞాన తత్వాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బ్రహ్మంగారి కాలజ్ఞానం తాళపత్ర గ్రంథంలో ఒక తాళపత్రం - సిద్ధయ్య మఠం

బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి (1608-1693), భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పినవారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం.. ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలానే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయ పరచుకుంటారు.

బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నదీ తీరప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి. అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు. గాంధి మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచింపబడింది. ఆంగ్లేయ, మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక, రాజకీయ పరిణామాలు సూచింప బడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు, వింతలూ, చోద్యాలు, బాబాల రాక వలన అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురికావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి. ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదేపదే పునరుద్ఘాటించాడు. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు సూచింపబడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమే.

కాలజ్ఞానం[మార్చు]

బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పగా బనగానపల్లె నివాసి శిష్యుడు అన్నాజయ్య తాటాకుల మీద రాశాడనడానికి కాలజ్ఞానంలో సూచనలున్నాయి. [1]

'సిద్దాద్రి నామ సంవత్సర మందు
బనగానపల్లెలో పరగంగ నిలిచి' కా. త. పు. 6

'నిర్మాణము చేసి ఇల యేడాశ్వాసములు
కాలజ్ఞాన పత్రిక కలయంగ బలికి' కా. త. పు. 3.

'శ్రీ వీరప్పయ్యగారు అన్నా జయ్యతో భూత భవిష్యత్ వర్తమానములు చెప్పిన క్రమము' కాల. పు. 1 (వచనం)

కాలజ్ఞానంలో గోవింద వాక్యాలు, జీవైక్యబోధ, వచన కాలజ్ఞానం, ద్విపద కాలజ్ఞానం, సౌజన్య పత్రికలు అనే విభాగాలున్నాయి. వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని వివిధ శైలులను ఉపయోగించి కూర్చారు, అందులో వచనం, ద్విపద, పద్యాలు, శ్లోకాల రూపంలో వున్నాయి. [2] మౌఖికంగా ప్రచారంలోవున్నవి గేయరూపంలో వున్నాయి.[3]

కాలజ్ఞానం తాళపత్ర గ్రంథాలు (ప్రామాణిక ప్రతులు)[మార్చు]

బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమల్లయపల్లెలో బ్రహ్మం గారి సమాధిదగ్గర చెక్క పెట్టెలో, ముడుమాల గ్రామంలో సిద్ధయ్యమఠంలో గర్భగుడిలో బ్రహ్మంగారి పాదుకల చెంత చెక్క పెట్టెలో, కడప జిల్లా నగరిపాటిలో రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉండి ఈ మూడు ప్రతులూ నిత్య పూజలందు కొంటున్నాయి.

“భూత భవిష్యత్ వర్తమాన కాలానకున్నూ నానా దేశాలకున్నూ వ్రాయించినది మూడు లక్షల ముప్పై రెండు వేల గ్రంథము 1” అనే కాలజ్ఞాన వచనం ద్వారా కాలజ్ఞానంలోని శ్లోకాలసంఖ్య 332000 అని తెలుస్తుంది. లభించే కాలజ్ఞానం మొదట చెప్పిన బృహత్ గ్రంథానికి సంక్షిప్తరూపమనీ “ఈ గ్రంథమంతా వ్రాయకూడదు కలగుమాత్రం వ్రాయించి మీ సమీపానకు పంపించినాము.” (కాల. పు. 71) అనే కాలజ్ఞాన వచనంద్వారా తెలుస్తున్నది. కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలన్నీ ఇప్పటికీ బనగానపల్లె చింతచెట్టు పాతరలో ఉన్నాయని అంటారు. బ్రహంగారి పెద్దకుమారుడు మఠాధ్యక్షుడుగా ఉన్న కాలంలో రంగరాజు అనే భక్తుడు మూడు గ్రంథాలను మాత్రం వెలికితీశాడు. రంగరాజు జన్మించక ముందు బ్రహ్మం గారు రంగరాజు తండ్రికి ఇచ్చిన రాగిశాసనంలో బ్రహ్మం గారి మనుమరాలు ఈశ్వరమ్మకూ రంగరాజుకూ వివాహం చేయాలని బ్రహ్మంగారు నిర్ణయించినట్లున్నందున రంగరాజు కందిమల్లయపల్లె వచ్చి ఈశ్వరమ్మను తనకిచ్చి వివాహం చేయవలసిందని అడిగాడు. బ్రహ్మంగారు ఏవిషయాన్నయినా కాలజ్ఞానంలో నిక్షేపిస్తాడు. కాలజ్ఞానంలో ఆధారం చూపించమని బ్రహ్మంగారి కుమారులు అడిగారు. అప్పుడు బనగానిపల్లె వెళ్లి చింతచెట్టు పాతర తెరచి మూడు గ్రంథాలను మాత్రం రంగరాజు బయటకు తీయగలిగాడు. దానిలో ఆధారాలు దొరకక రంగరాజు నగరిపాటిలో అగ్ని ప్రవేశం చేశాడు. ఆ స్థలంలో ఒకమఠం నిర్మించారు. ఆ తాళపత్ర గ్రంథాలను అక్కడే భద్రపరచారు.[4]

వచన కాలజ్ఞానం[మార్చు]

1941 సంవత్సరంలో 10 వ మఠాధిపతి శ్రీనివాసస్వామి మఠంవద్దగల తాళపత్రగ్రంథాలు, సిద్ధయ్యమఠం వద్దగల తాళపత్రగ్రంథాలు ఆధారంగా కాగితంపై నకలుప్రతి తయారుచేశారు. దానిని ఇతరులు నకలు చేసుకొన్నారు. 1974 సంవత్సరంలో 11 వ మఠాధిపతి తాళపత్రగ్రంథాలను యథాతథంగా ముద్రించారు. దీనిలో 12 ఆశ్వాసాలున్నాయి. కాని ద్విపద కాలజ్ఞానంలో 7 ఆశ్వాసాలున్నాయని చెప్పబడింది. ఎక్కువైన ఆశ్వాసాలు, తాళపత్రగ్రంథాలలోపునరుక్తమైనవిగా (దశమాశ్వాసం ప్రథమాశ్వాసానికి పునరుక్తి, ఏకాదశాశ్వాసం శ్లోకాలరూపంలో వున్నది) కొన్ని ఇతర కాలజ్ఞానాల గురించినవి (నాలుగవ ఆశ్వాసం చీలంపాటి గుండాబట్లు రచించిన కాలజ్ఞానం గురించిన చర్చ, తొమ్మిదవ ఆశ్వాసం సర్వజ్ఞుని కాలజ్ఞానం గురించినది) వున్నాయి. అప్పుడు మిగిలినవి 8 ఆశ్వాసాలుకాగా, వీటిలో కూడా పునరుక్తులున్నాయి.[5]

ద్విపద కాలజ్ఞానం[మార్చు]

తెలుగు సాహిత్యంలో కావ్యరచనకు ద్విపద ఛందాన్ని ఉపయోగించిన తొలికవి పాల్కురికి సోమనాథుడు. అందరికి సులభంగా బోధపడడానికి, గాయయోగ్యమైన ద్విపదను బ్రహ్మంగారు కూడా వాడారు. ద్విపద కాలజ్ఞానం రెండుభాగాలుగా వుంది.

గోవింద వాక్యాలు[మార్చు]

ఇవి 320 పద్యాల రూపంలో వున్నాయి. వీటినే గోవింద వాక్యాలుగా పిలుస్తారు.[6] తొలి పద్యాలు నాలుగు క్రింద ఇవ్వబడినవి.

1. : మేషరాశిలో శని ప్రవేశమైతేను మేలు కొందరికి అయ్యేనిమా

దోషకారులెల్ల ధూళయ్యి పొయ్యేరు ధూమకేతువు మింట బుట్టే నయ

2. :వసుధలో బహుధాన్య వత్సరమందున ఉత్పాతములు బహు గల్లినిమా

ఎమ్మె కర్ములకు చింతలు పుట్టిని దుర్మదించిన నరులు సమసేరయా

3. :కల్లలాడే వార్ని కిరు గానుగలలో మళ్లించి పొర్లించి గూల్చేసుమా

తొల్లి చండికదేవి శనివద్ద జేరింది కలి యుగ మున వింత గ లిగే నయ

4.:ముడుపు వెంకటప్ప ఉత్సాహమయ్యీని ముడుపులు తిరుమలకు నడచేసుమ

కడప వద్దనున్న కమలాపురములోన కప్ప కోడికూత కూసే నయ

జీవైక్యబోధ[మార్చు]

ఇది జీవాత్మ పరమాత్మలో ఐక్యమవటాన్ని తెలియచేస్తుంది. శ్లోకాల రూపంలో వున్నది. [7]

సౌజన్యపత్రికలు[మార్చు]

సౌజన్యపత్రిక అంటే మంచివిషయాన్ని ప్రతిఒక్కరు పరస్పరంగా వ్రాసుకొనే పత్రిక. 1684 లో వ్రాసిన పత్రిక, బ్రహ్మంగారు నివసించినగృహం పుట్టమీద పీఠంలో పూజచేస్తున్నప్పుడు పూజారి రామయ్యకు 1912 లో దొరికింది. రెండవ పత్రిక 1961లో బ్రహ్మంగారి సమాధికి ఉత్తరభాగంలో వారి పాదుకల వద్ద అప్పటి మఠాధిపతి శ్రీనివాసస్వామివారికి దొరికింది. వీటిని పై వాటి సారాంశంగా పరిగణిస్తారు. [8]

కాలజ్ఞాన తత్వాలు[మార్చు]

వ్యావహారిక భాషంలో మౌఖికంగా కొనసాగిన తత్వాలను తొలిగా పరిమి వీరాచార్యులు 19 వశతాబ్ది చరమభాగంలో సేకరించి లిఖితబద్ధంచేశాడు. ఇవి "పోతులూరివీరబ్రహ్మంగారి కాలజ్ఞానతత్వములు" అనే పేరుతో ముద్రించబడ్డాయి.[9]దీనిలో బ్రహ్మంగారు, సిద్ధయ్య, ఆగంటి లక్ష్మప్ప, నాసరయ్య, చలమయ్య, నరసింహదాసు తత్వాలుకూడి వున్నాయి. పరమాత్మ బోధను ప్రధానంగా ఇవి వివరిస్తాయి. ప్రసిద్ధి చెందిన ఒకతత్వం తొలి భాగం క్రిందనీయబడింది.

చెప్పలేదంటనగ బోయేరు నరులార గురుని
చేరి మొక్కితె బ్రతుక నేర్చేరు
చెప్ప లేదంటనగ బోయెరు
తప్పదిదిగో గురుని వాక్యము
తప్పుదోవన బోవువారల
చప్పరించి మ్రింగు శక్తులు ॥చెప్ప॥

మొప్పెతనమున మోసపోయేరు అదిగాక కొందరు
గొప్పతనమున గోసుమీరేరు
ఇప్పుడప్పుడనగ రాదు
ఎప్పుడో ఏవేళనో మరి
గుప్పుగుప్పున దాటిపోయెడు
గుర్రపడుగులు ఏరుపడును ॥చెప్ప॥

తమ తప్పులు తలచకున్నారు తార్కాణమైతే
ఎక్కువతో తెలియనేర్తురు
జోక తోడుత తల్లి పిల్లలు
జోడు బాసి అడవులందు
కాయశోకము జేసి ప్రజలు
కాయ కసరుల నమలి చత్తురు ॥చెప్ప॥

కేక వేసియు ప్రాణమిడిచేరు రాకాసి మూకలు
కాక బుట్టి కలువరించేరు.
ఆకాశము ఎర్రనౌను
ఆరు మతము లొక్కటౌను
లోకమందు జనులు అందరు
నీరు నిప్పున మునిగిపోదురు ॥చెప్ప॥

ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తున్నవి[మార్చు]

  1. నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు (విద్యుత్ శక్తి) (నీటీతొ జనరేటరు)
  2. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. (యంత్ర వాహనాలు)
  3. కాశీ పట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది.
  4. ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. (ఇందిరా గాంథి)
  5. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (ఎన్.టి.ఆర్, జయలలిత, తదితరులు. చలన చిత్రాలు)
  6. రాచరికాలు, రాజుల పాలనా నశిస్తాయి. (ప్రజా ప్రభుత్వాలు)
  7. ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు. (విమాన ప్రమాదాలు)
  8. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
  9. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి.
  10. హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు. (మత కలహాలు)
  11. దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. (దొంగతనం)
  12. చిత్రవిచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావుపుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు.
  13. రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి. (శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాలు)
  14. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. (లాల్ బహుద్దూర్ శాస్త్రి)
  15. కపట యోగులు విపరీతంగా పెరిగి పోతారు. వీరివలన ప్రజలంతా మోసపోతారు.
  16. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి
  17. నది గండకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి (నేపాల్ భూకంపము)

జ్ఞానబోధలలో తెలిపిన కాలజ్ఞాన విశేషాలు[మార్చు]

తల్లికి చేసిన జ్ఞానబోధ[మార్చు]

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు, తల్లి పోతులూరి ప్రకృతాంబ. ఆయనను పెంచిన తండ్రి పేరు వీర భోజయాచార్యులు, పెంచిన తల్లి పేరువీరపాపమాంబ. ఆయనకు చిన్న వయస్సులోనే విశేష జ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన మితభాషణం అలవడింది. ఆయన వీర భోజయాచార్యులు మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన ఎనిమిదవ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానభోద చేశాడు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని దానిని వదలమని తల్లికి హితవు చెప్పాడు. శరీరం పాంచభౌతికమని ఆకాశం, గాలి, అగ్ని, పృధ్వి, నీరు అనే అయిదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాలద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని వీటి ద్వారా నేను అనే అహం జనిస్తుందని ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని బుద్ధి జీవుని నడిపిస్తుందనీ బుద్ధిని కర్మ నడిపిస్తుందని దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదనీ, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరాడు.

అచ్చమాంబకు వివరించిన కాలజ్ఞానం[మార్చు]

బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చూసేందుకై తిరుగుతూ బనగానపల్లెకు వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఒకైంటి అరుగు మీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారిన తరువాత ఇంటి యజమానురాలైన అచ్చమ్మ ఆయనను ప్రశ్నించి ఆయన ఏ దైనా పని కోసం వచ్చానని చెప్పటంతో ఆమె ఆయనకు పశువులను కాచే పనిని అప్పగించింది. పశువులను కాచే నిమిత్తం రవ్వలకొండ చేరిన ఆయన అక్కడి ప్రశాంత వాతావరణంచే ఆకర్షించబడి అక్కడే ఉన్న ఒక గుహను నివాసయోగ్యం చేసుకుని కాలజ్ఞానం వ్రాయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో ఆయన గోవులకు ఒకావలయం ఏర్పరిచి దానిని దాట వద్దని ఆజ్ఞాపించడంతో అవి ఆవలయం దాటకుండా మేత మేస్తూ వచ్చాయి. ఒక రోజు ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమాంబ ఆయన ఏకాగ్రతగా వ్రాయడం పశువుల ప్రవర్తన గమనించి ఆయన ఒక జ్ఞాని అని గ్రహించింది. అచ్చమ్మ ఇన్ని రోజులు ఇది గ్రహించకుండా ఆయన చేత సేవలు చేయించుకున్నందుకు మన్నించమని వేడగా ఆయన నాకు దూషణ భూషణలు ఒకటేనని నీవైనా అయినా తల్లి అయినా తనకు ఒకటేనని ప్రంపంచంలోని జీవులన్నీ తనకు ఒకటేనని చెప్పాడు. ఆ తరువాత అచ్చమ్మ తనకు జ్ఞానభోద చేయమని కోరగా ఆమెకు యాగంటిలో జ్ఞానభోద చేసాడు. ఆయన అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తారు.

ఆ సందర్భంలో అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు అడిగింది.

  • అచ్చమ్మ:- పరమాత్మ ఎక్కడ ఉన్నాడు?
    • బ్రహ్మంగారు:- పరమాత్మ నీలో నాలో ఈ పశువులలో అన్నిటా ఆయన ఉనికి ఉంటుంది.
  • అచ్చమ్మ:- ఆయనను ఎలా తెలుసుకోగలం?
    • బ్రహ్మంగారు:- అనేక మార్గాలున్నప్పటికీ భక్తి, ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే పరమాత్మను తలచుకుంటూ గడపడం. ధ్యానమార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవడం.
  • అచ్చమ్మ:- ఆయన స్త్రీయా పురుషుడా?
    • బ్రహ్మంగారు:- ఆయన నిరాకారుడు, నిర్గుణుడు వర్ణనకు అతీతుడు.

ఇలా చెప్పి వీటిని ఏకాగ్రతతో ధ్యానించమని చెప్పి తరువాత కాలజ్ఞానం గురించి చెప్పాడు.


కాలజ్ఞాన అంశాలు
  • వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి ఔతారు. మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానం ఔతుంది.
  • రాజులు తమ ధర్మాన్ని మరచి విందులూ వినోదాలలో మునిగి ధర్మ భ్రష్టులౌతారు.
  • శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం ఔతారు.
  • పంటలు సరిగా పండక, పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది.
  • బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించటం వలన దేశం కల్లోలితమౌతుంది.
  • చోళమండలం నష్టాలపాలౌతుంది.
  • వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు.
  • ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు. కొండలు మండుతాయి.
  • జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులూ అలాగే చస్తాయి.
  • దుర్మార్గులు రాజులౌతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారు.
  • మతకలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు.
  • అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.
  • నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు.
  • ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు.
  • మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు.
  • పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువౌతాయి.
  • ఒకరి భార్యను ఒకరు వశపరచుకుంటారు. స్త్రీ పురుషులిర్వురూ కామపీడితులౌతారు.
  • వేంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు.
  • ఐదువేల ఏళ్ళ తరువాత కాశీలో గంగ కనిపింకుండా మాయమై పోతుంది.
  • చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమౌతాయి.
  • కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది. అది చూసినవారికి కండ్లు పోతాయి.
  • ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది.
  • ఐదువేల ఏళ్ళ తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి ధ్ర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు.
  • వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.
  • కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి.
  • తూర్పు నుండి పడమరకు ఒక యోజనము ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనపడుతుంది.

అన్నాజయ్యకు జ్ఞానబోధ[మార్చు]

  • ఎంతో మందిమార్బలం ఉన్నా రాజులు సర్వనాశనమైపోతారు. గ్రామాలలో చోరులు పెరిగిపోతారు.
  • పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి.
  • విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు.
  • రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తామ చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.
  • శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలా కూసి మాయమౌతుంది.
  • శ్రీశైలంలో అగ్ని వర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న (నందీశ్వరుడు) రంకెలు వేస్తాడు ఖణ ఖణమని కాలు దువ్వుతాడు.
  • సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది.
  • విషవాయువు కొట్టినప్పుడు శివునికంట నీరు కారుతుంది.
  • గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వానకురుస్తుంది.
  • సూర్యుడు, చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు.
  • నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది.

బనగానపల్లె నవాబుకు జ్ఞానభోద[మార్చు]

బనగానపల్లె నవాబు బ్రహ్మంగారి గురించి విని ఆయన నిజంగా మహిమాన్వితుడో కాదోనని స్వయంగా తెలుసుకోవాలని ఆయనను తన వద్దకు పిలిపించాడు.వారు రాగానే స్వయంగా స్వాగతంచెప్పి ఆయనను ఆసీనులను చేసారు. స్వామివారికి ఫలహారాలు తీసుకురమ్మని సేవకుని ఆజ్ఞాపించాడు.అయినా ఆయనకు మాంసాహారం తీసుకురమ్మని సేవకునికి ముందుగానే సూచన చేసాడు.నవాబు ఆదేశానుసారం సేవకుడు మాంసాహారం నింపిన పళ్ళెరాన్ని బ్రహ్మంగారి ముందు ఉంచాడు.ఆయన పళ్ళెరం పైనున్న వస్త్రాన్ని తొలగిస్తే ఫలహారం స్వీకరిస్తానని చెప్పగా సేవకుడు అలాగే చేసాడు. ఆపళ్ళెంలోని మాంసాహారం పుష్పాలుగా మారటం అక్కడి వారిని ఆశ్చర్యచకితులను చేసింది. ఈ సంఘటనతో నవాబుకు ఆయన మహిమలపై విశ్వాసంకుదిరి ఆయనను పలువిధాల ప్రశంసించారు. ఆ సందర్భంలో బ్రహ్మంగారి నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు. ఆతరువాత నవాబు ఆయనకు డెబ్బై ఎకరాల భూమిని దానంచేసి దానిని మఠం నిర్వహణకు ఉపయోగించవలసినదిగా కోరి ఉచిత మర్యాదలతో సత్కరించి సాగనంపారు.

  • విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి.
  • కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చస్తారు.
  • కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు.
  • బనగానపల్లె నవాబు పాలనకూడా క్రమంగా నాశనమౌతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.

కడపనవాబు కు జ్ఞానబోధ[మార్చు]

అహోబిలం శ్రీలక్ష్మీనృసింహుని దర్శనం చేసుకుని అక్కడి నుండి కడప చేరి నవాబుకు కబురు పంపాడు. వెంటనే నవాబు సపరివారంతో వచ్చి స్వాగతం చెప్పి ఆయనను గౌరవంగా తనవెంట తీసుకు వెళ్ళారు. నవాబు బ్రహ్మంగారి మహిమలు చూడాలని ఆసక్తి కనబరిచాడు. ఆయనను మరుసటి నాటి సభకు రమ్మని ఆహ్వానించాడు. బదులుగా బ్రహ్మంగారు చిరునవ్వుతో "నీ మనసులో కోరిక నాకు అర్ధమైంది. నువ్వు అనుకున్నది నేను చేసి చూపగలను " అన్నాడు. నవాబు తన మనసులోని కోరిక ఆయనకు ఎలా తెలిసిందో తెలియక ఆశ్చర్యపడినా మరుసటి నాటి సభకు ప్రజలను రమ్మని చాటింపు వేయించాడు. మరుసటి నాటి సభలో నవాబు బ్రహ్మంగారితో "స్వామీ! నావద్ద ఒక చూడిగుర్రం ఉంది అది ఆడ గుర్రాన్ని కంటుందో మగ గుర్రాన్ని కంటుందో తెలియచేయండి " అన్నాడు. బ్రహ్మంగారు చిరునవ్వుతో ఆ గుర్రాన్ని తెప్పించమని కోరగా గుర్రాన్ని సేవకులు సభకు గుర్రాన్ని తీసుకు వచ్చారు. దానిని చూసి "దీని గర్భంలో నాలుగు తెలుపు రంగు కాళ్ళు , నొసట చుక్క,పువ్వుల తోక కలిగిన మగ గుర్రం జన్మిస్తుంది" అన్నాడు. ఆ తరువాత నవాబు సందేహం తీరలేదని గ్రహించి "ఆ గుర్రం గర్భంలో ఉన్న శిశువుని చూడటమే నీ ఉద్దేశ్యం అని అర్ధం అయింది. అది చూసే వరకు నాపై నీ సందేహం తీరదు ఔనా" బ్రహ్మంగారు నవాబుతో చెప్పాడు. అంగీకారంగా నవాబు తల ఊపడం చూసి ఆయన గుర్రానికి నలువైపులా తెరను కట్టించి గుర్రం గర్భంలోని శిశువును తీసి నవాబుకు చూపగా అది కచ్చితంగా బ్రహ్మంగారు చెప్పినట్లే ఉండటం చూసిన నవాబు ఆశ్చర్యపడ్డాడు. బ్రహ్మంగారు ఆ శిశువును తిరిగి గుర్రం గర్భంలో ప్రవేశపెట్టి గుర్రాన్ని బ్రతికించాడు. నవాబు తన భవిష్యత్తు చెప్పమని బ్రహ్మంగారిని అడిగాడు. కడప నవాబుకు జ్ఞానబోధ చేసే సమయంలో బ్రహ్మంగారు తాను భవిష్యత్ లో తిరిగి జన్మించి రాబోయే విషయాన్ని సూచించారు.

  • నేను శ్రీ వీరభోజ్యుడినై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను. కలియుగం 5000 సంవత్సరములు గడిచిన తరువాత దుష్ట శిక్షణ శిష్ట రక్షనార్ధం వస్తాను. నేను వచ్చే ముందు సంభవించే పరిణామాలు విను.
  • ఉప్పుకొడూరులో ఊరచెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించి పోతారు.
  • 14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం.
  • నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు.
  • 5972 ధాతు నామ సంవత్సరాన మాఘ శుద్ధ బుధవారం రోజున పట్ట పగలే 18 పట్టణాలు దోపిడీకి గురౌతాయి.
  • కోటిదూపాటిలో కొచ్చర్లకోటలో కోడి మాట్లాడుతుంది. జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ము దిగమ్రింగి అబద్ధాలాడి బాకీలు ఎగకొడతారు.
  • కోమటి కులంలో 25 గోత్రాలవారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.
  • మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
  • పట్ట పగలు ఆకాశంలోనుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.
  • పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది.
  • బనగాన పల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేపచెట్టుకు చేమంతిపూలు పూస్తాయి.
  • గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగాన పల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు. ఆ తరువాత బనగాన పల్లెను ఇతరరాజులు స్వాధీనపరచుకుంటారు.
  • అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు.
  • గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం ఏలుతారు.
  • మహానంది మరుగున మహిమలు పుడతాయి.
  • నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. మూఢులు మాత్రం నమ్ముతారు.
  • మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగినవారు వస్తారు. వారిని చూసి నేనని భ్రమపడవద్దు. నా రాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లెపెరిగి పట్టణంగా మారుతుంది.
  • కంచి కామాక్షమ్మ కన్నులవెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు.
  • ఆవు కడుపులోని దూడ అదేవిధంగా బయటకు కనిపిస్తుంది.
  • పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.
  • కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడను పేర శైవుడు జన్మించి మతభేదం లేక గుడులూ గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామ దేవతలు ఊగిసలాడతారు.
  • కాశీ, కుంభకోణ, గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గి పోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.
  • ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకూ ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి.
  • పతివ్రతలు పతితలౌతారు. వావి వరసలు పాటించకుండా ప్రవర్తిస్తారు. ఆచారాలన్నీ సమసి పోతాయి.
  • రాయలవారి సింహాసనం కంపిస్తుంది. కురుమ సంతతి రాజులందరినీ జయించి దక్షిణంగా బోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను తరిమి యుద్ధాలు చేసి నర్మదానదిలో కత్తులు కడిగి కాశీకి వచ్చి రాయల తల చూస్తారు. ఈ సమయంలో హస్థినాపురిలో మహామారి అనేశక్తి పుడుతుంది. రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది.
  • శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. మందుమాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి. స్త్రీ పురుషులంతా దురాచార పరులౌతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.
  • ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.
  • వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గి పోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలుతాయి. బెండ్లు మునుగుతాయి. చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది.
  • విజయనగరాన కోటలో రాయల సింహాసనం బయట పడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామంలో రాతి విగ్రహాలు ఊగిసలాడతాయి. అప్పుడు బిజ్జల రాయుని కొలువులో రాయలసింహాసనం బయట పడుతుంది.

ఇలా బ్రహ్మంగారు కడపనవాబుకు కాలజ్ఞానంబోధించి, మంత్ర దీక్ష ఇచ్చి ఆశీర్వదించాడు.

పుష్పగిరి పండితులకు జ్ఞానబోధ[మార్చు]

పుష్పగిరి అగ్రహారంలో పండితుల ముందు బండిఎక్కి వీరబ్రహ్మం పోతుండగా, వారు అహంభావంతో బండిదిగి శరణువేడమంటారు. వీరబ్రహ్మం బండి దిగి, వారిని బ్రహ్మం, పరబ్రహ్మ మంటే తెలపమని, సంధ్యవార్చినంతమాత్రాన, పంచాగం తెలుసుకున్నంతమాత్రాన బ్రహ్మం తెలియదని, చదివినా, చదవకున్నా బ్రహ్మం, పరబ్రహ్మం తెలుసుకోవచ్చని వివరిస్తాడు. [10] ఆతరువాత వారికి కాలజ్ఞాన విశేషాలు చెప్తాడు.

  • నేను కలియుగం 5,000 సంవత్సరంలో (సా.శ 1898(?)) వీరభోగవసంత రాయలుగా దుష్ట శిక్షణా, శిష్టరక్షణార్ధం భూమిపై అవతరిస్తాను. మార్గశిర మాసంలో దక్షిణభాగంలో ధూమకేతువనే నక్షత్రం ఉదయించి అందరికీ కనపడుతుంది. క్రోధినామ సంవత్సరమున మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో నేను అవతరించే సమయంలో దక్షిణాన ఒక నక్షత్రం పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి.
  • నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులౌతారు.
  • వేదములు అంత్య జాతుల పాలౌతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్థుల పంచన చేరుతారు. విప్రులు విధవా వివాహాలు చేస్తారు. స్వవృత్తి, ధర్మాలు మాని ఇతరులకు బానిస వృత్తి చేస్తారు.
  • బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంటభూములు అమ్ముకుంటారు. నేను వచ్చేసరికి వారికి తిండి గుడ్డ కరువు ఔతాయి. మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంత రాయలుగా ఉద్భవిస్తాను. నాలుగు మూరల ఖడ్గం చేత పట్టి శ్రీశైల పర్వతం మీదకు వచ్చి అక్కడి ధనం అంతా పుణ్యాత్ములైన వారికి దానం చేస్తాను.
  • నేను భూమి మీదకు ఎలా వస్తానో మరొకసారి చెప్తాను వినండి. కేదారి వనంలో నిరాహారినై జపము చేస్తాను. మూడు వరాలు పొంది అక్కడి నుండి విక్రమ నామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకుని తపసు చేసి అక్కడ మహామునులను, మహర్షులను దర్శనం చేసుకుంటాను. అటు నుండి బయలుదేరి శ్రీశైలం మల్లిఖార్జునుని సేవించి దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుంటాను. మహానందిలో రెండు రోజులుండి అక్కడి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమినాటికి నారాయణపురం చేరుకుని అక్కడ కొంతకాలం నివసిస్తాను.
  • నేను తిరిగి వచ్చేసరికి జనులు ధనమధాంధులు, అజ్ఞానులై కొట్టుకు చస్తారు.
  • నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి. పర్వతాలమీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగుల కొడతారు.
  • కాశీదేశంలో కలహాలు చెలరేగుతాయి.
  • నేను వచ్చేసరికి విధవావివాహాలు జరగటం మామూలై పోతుంది.
  • వావి వరసలు లేకుండా వివాహాలు జరుగుతాయి. కుల గోత్రాలు నీతి జాతీ లేని పెళ్ళిళ్ళు జరుగుతాయి. పార్వతీ అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు.
  • అరణ్యంలోనూ భూమిలోనూ ధనం ఉండేను. నేను భూమిపై పెక్కు దృష్టాంతాలు పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమిపై మంటలు పుడతాయి.
  • నాలుగు సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. నూట ఇరవై తిరపతులు పాడయ్యేను.
  • నా రాకకు ముందు అనేక చిత్రములు జరిగేను. శృంగేరి, పుష్పగిరి పీఠములు పంచాననం వారి పాలౌతాయి.
  • ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది.
  • హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి.
  • అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూస్తాయి.
  • నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది.
  • వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి సూర్యమండలం నుండి కొలువు పాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలం, తర్వాత సూర్యనంది చేరుకుంటాను.
  • శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4,999 సంవత్సరాలకు కలిరూపం కొంత నాశనం ఔతుంది.
  • శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ 'గణ గణ'మని గంటలమోత వినబడుతుంది.
  • బ్రమరాంభ దేవాలయంలో ఒక ముసలి 7 రోజులుండి అదృశ్యం అవుతుంది. బ్రమరాంభ మెడలోని మంగళసూత్రాలు తెగి పడిపోతాయి. ఆమె కంట నీరు కారుతుంది. పాలిండ్లనుండి పాలుకారుతాయి.
  • కందనూరి గోపాలుని గుడి ముందు చింతచెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయంలో రెండు పాములు తిరుగుతాయి. వాటిలో పెద్ద పాము శిఖరాన మూడు రోజులుండి అదృశ్యమౌతుంది.
  • సూర్యనందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలుపూచి, కాయలుకాచి, పండ్లు పండి వెనువెంటనే మాయమౌతుంది.
  • శిరువెళ్ళ నరశింహుని దుట గంగిరావిచెట్టు మొలుస్తుంది. బహుధాన్య నామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు.
  • బసవన్న రంకే వేస్తాడు. తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమట పడుతుంది. కంట నీరు, పాలిండ్ల పాలూ కారుతాయి.
  • శాలివాహన శకం 1541న ధూమకేతువు పుడుతుంది. 1555నాటికి వివిధ దేశాలలో జననష్టం కలుగుతుంది.
  • పెమ్మసాని తిమ్మన్న వంశం నిర్వంశమయ్యేను. ఉదయగిరి, నెల్లూరు రూపు మాసి పోయేను. గండికోట, గోలకొండ, ఆదలేని, కందనూరు పట్టణాలు నశించి తురకలు పారిపోతారు. విజయపురంలాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశించేను.
  • స్త్రీల కంట నెత్తురు బిందువులు రాలుతాయి. వడగండ్ల వాన కురుస్తుంది. బాణవర్షం కురుస్తుంది. బావులూ, చెరువులూ, నదుల నీరు ఇంకినా జజ్జేరు నీరు మాత్రం ఇంకిపోదు.

పంచాననం (విశ్వబ్రాహ్మణులు) వారికి జ్ఞానబోధ[మార్చు]

  • మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకు వస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు.
  • నేను వచ్చేసరికి బ్రాహ్మణులు వర్ణసంకర వృత్తులు చేస్తూ తమ వైభవం కోల్పోతారు. ఏ కులంవారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్దులూ యోగులూ జన్మించిన ఆ బ్రాహ్మణ కులం పూర్తిగా వర్ణసంకరమౌతుంది.
  • ఆనాటికి ప్రజలలో దుర్బుద్ధులు అధికమౌతాయి.
  • కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది.
  • రాజాధిరాజులు అణిగి ఉంటారు. శూద్రులు వలాసాలను అనుభవిస్తూ రాజుల హోదాలో ఉంటారు. వారి ఇంట ధనలక్ష్మీ నాట్యమాడుతుంది. నా భక్తులైన వారికి నేనప్పుడే దర్శనమిస్తాను. కానివారి నెత్తురు భూమి మీద పారుతుంది. దుర్మార్గుల రక్తంతో భూమి తడుస్తుంది. భూభారం కొంత తగ్గుతుంది.
  • చీమలుండు బెజ్జాల చోరులు దూరుతారు. స్త్రీలందరూ చెడుతలపుతో ఉంటారు. అందువలన చోరులు ప్రత్యేకంగా కనపడరు. బిలం నుండి మహానంది పర్వతం విడిచి వెళుతుంది. గడగ్ లక్ష్మీపురం, రాయచూర్, చంద్రగిరి అలిపేది, అరవరాజ్యం, వెలిగోడు, ఓరుగల్లు, గోలుకొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలననేంద్రియములు, ఆయుధాలచేత బాణముల వల్ల నశిస్తారు.

కర్నూలు నవాబుకు జ్ఞానబోధ[మార్చు]

  • క్రోధనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీరభోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశనకరమైన గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది.
  • చండిపూర్, అలంపూర్ స్థలములలో ఉత్పాతములు పుడతాయి. ఆ ప్రాంతంలో పాలెగాళ్ళు తమలో తాము కలహించుకుని చెడి భ్రష్టులై పోతారు.
  • నలు దిక్కులయందు దివ్యమైన నక్షత్రాలుపుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి.
  • అమావాస్య రోజున పున్నమి చంద్రుని చూసిన జనులు నశిస్తారు. నిజమని నా మహిమను తలచుకుంటారు.కార్తీక శుద్ధ ద్వాదశినాటికి విష్ణుభక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది.
  • తూర్పున శిరసు పడమర తోకగా ఇరువది బారల ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన ముప్పై రోజుల వరకు అందరికి కనిపిస్తుంది. ఆకాశం ఎర్రపడుతుంది. ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్ధాలు పుడతాయి.
  • ఈశ్వరమ్మని రంగరాజుకు ఇచ్చి వివాహం చేసే నాటికి నవరత్న మండపాలతో పన్నెండామడల పట్నం ఔతుంది. నా భక్తులు యావన్మంది ఇక్కడకు వచ్చి కల్యాణం చూస్తారు. అదే మీకు నిదర్శనం. ఈ కాలజ్ఞానం విని నవాబు బ్రహ్మంగారికి అనేక బహుమతులిచ్చి సత్కరించాడు.

పుత్రుడు గోవిందాచార్యులకు జ్ఞానబోధ[మార్చు]

బ్రహ్మంగారు తన పుత్రుడు గోవిందాచారిని పిలిచి "నాయనా నేను వచ్చి 175 సంవత్సరాలు గడిచాయి. ఇప్పటి వరకూ కలియుగంలోని సామాన్య ప్రజల మనసుని జ్ఞానంవైపు మళ్ళించి పరబ్రహ్మ ఉపాసకులుగా మార్చగలిగాను. ఇకపై ఈ బాధ్యత నీది. వీరిని ఎలా మార్చుకుంటావో నీ ఇష్టం. నేను జీవ సమాధిలోకి ప్రవేశిస్తాను. నీకొక రహస్యం తెలియచేస్తున్నాను. నీ గర్భవాసంలో పరమేశ్వరియే జన్మిస్తుంది. ఆమె భూత, వర్తమాన, భవిష్యత్ చెప్పగలిగిన మహాజ్ఞాని. ఇక్కడి మూఢులకు అజ్ఞానం తొలగించి జ్ఞానదీపం వెలిగిస్తుంది. ఆమె మహిమలు చూపిస్తుంది. ఆమె వాక్కులు ఫలిస్తాయి. చివరికామె నావలె సమాధి నిష్టను పొందుతుంది. ఆమెకు నావలె మఠములుంటాయి. ఆమెకు నావలె పూజలుంటాయి. ఆ మహాదేవిని ఈశ్వరమ్మ అని పిలుచుకోవాలి. ఇక సిద్ధుడు ఈశ్వరాంశ సంభూతుడు. అతడు క్షత్రియుల ఇంట పుట్టి గోహత్య చేసి మహమ్మదీయుల ఇంట జన్మించాడు. ఆ గోహత్య పరిహారార్ధం నా శిష్యుడయ్యాడు. అతడు ఈ లోకాన్ని విసర్జించిన జ్ఞానయోగి. అతడికి అద్వైత విషయంలో ఆసక్తి కలిగి సిద్ధిని పొందాడు. అందుకే అతనికి సిద్ధుడని నామకరణం చేసి నా ప్రధమ శిష్యున్ని చేసి అన్ని విషయాలను తెలియచేసాను." అని ముగించాడు.

భార్య గోవిందమ్మకు జ్ఞానబోధ[మార్చు]

వైశాఖ శుద్ధ దశమి అభిజిత్ లగ్నం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సమాధి కాలం నిర్ణయించాడు. ఇది విని విలపిస్తున్న గోవిందమ్మను పిలిచి "నాకు మరణం లేదు నీకు వైధవ్యంలేదు. నీవు సుమంగళిగా జీవించు. నేను సమాధినుండి వీరభోజ వసంతరాయలుగా వచ్చి నాభక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను వచ్చే వరకు ఏమేమి జరుగుతాయో నీకు జ్ఞానబోధ చేస్తాను" అని బ్రహ్మంగారు చెప్పాడు.

  • బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది.
  • మాహాలక్ష్మమ్మ నృత్యంచేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది.
  • కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపుడక తాకుతుంది.
  • కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది.
  • కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది.
  • అచ్చమ్మ వంశం సర్వనాశనమై వారి వంశం అంతరించి పోతుంది.
  • నారాయణమ్మ వంశస్థులు మఠాధిపతులౌతారు. నీవు ఇకనైనా ఈ బ్రాంతిని విడిచిపెట్టు. అనిచెప్పి గోవిందమ్మ దుఃఖాన్ని పోగొట్టాడు.

సిద్ధయ్యకు జ్ఞానబోధ, గతజన్మ వృత్తాంతం[మార్చు]

ఒకరోజు సిద్ధయ్య బ్రహ్మంగారితో "స్వామీ! మీరు గతంలో త్రేతా, ద్వాపర యుగంలో కూడా జన్మించానని చెప్పారు. మీ పూర్వ జన్మ వృత్తాంతం నాకు వివరిస్తారా?" అని అడిగాడు. బదులుగా బ్రహ్మంగారు "నా గతజన్మల గురించిన వివరములు రహస్యములే అయినా, నీకు మాత్రం వివరించగలను. అని తన పూర్వ జన్మల గురించి చెప్పడం ప్రారంభించారు.

"బ్రహ్మలోకంలో నేను భైరవుడనే పేరుతో అనేక బ్రహ్మ కల్పాలు రాజ్యపాలన చేసాను. ఆ తరువాత వెండి కొండ మీదకు వెళ్ళి 54 బ్రహ్మ కల్పాలు రాజ్యపాలన చేశాను. అప్పుడే మూడు యోజనాల పొడవైన సింహాసనమును నిర్మించి 290 బ్రహ్మ కల్పాలు విష్ణు సేవ చేసాను. నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు 'పంచవిద ముక్తి' అనే వరం ఇచ్చాడు. ఆ తరువాత సిద్ధాంత శిరోమణి ఆనందాశ్రితువు ఆశ్రమం వద్ద అన్ని విద్యలు అభ్యసించి మూడేళ్ళ తరువాత అనేక యోగశాస్త్ర విద్యలను నేర్చుకున్నాను. 12,000 గ్రంధములు పఠించి అందులోని అన్ని మర్మములు గ్రహించాను. వీటి ఫలితంగా నేను అకాలమృత్యువును జయించే శక్తిని సంపాదించాను. ఆ తరువాత నా యోగబలం వలన దివ్య శరీరం ధరించి మూడు వేల బ్రహ్మకల్పాలు చిరంజీవిగా ఉన్నాను. ఆతరువాత నా అవతారముల గురించి వివరముగా తెలుపుతున్నాను విను. మొదట అవతారమెత్తి ఆనందాశ్రితులకు శిష్యుడిగా 99,662 బ్రహ్మ కల్పాలు ఉన్నాను, మూడవ అవతారంలో 1,09,00,000 బ్రహ్మ కల్పాలు ఉన్నాను. నాల్గవ అవతారములో 1,00,01,317 కల్పాలు ఉన్నాను. అయిదో అవతారంలో 4కోట్ల పద్నాలుగు లక్షల 55 వేల బ్రహ్మకల్పాలు ఉన్నాను. ఆరవ అవతారంలో ఆరు వందల బ్రహ్మ కల్పాలు ఉన్నాను. ఏడవ అవతారంలో 27,63,03,400 బ్రహ్మ కల్పాలు జీవించాను. ఎనిమిదో అవతారంలో 22,60,000 బ్రహ్మ కల్పాలు ఉన్నాను. పదవ అవతారంలో కనిగిరిలో ఉన్నాను ఆ జన్మలో 70 లక్షల బ్రహ్మ కల్పాలు జీవించాను. ఇప్పుడు బనగానపల్లెలో వీరప్పయాచార్యుడనై 125 సంవత్సరములు తపస్సు చేశాను. వీరబ్రహ్మేంద్ర స్వామిగా మొత్తం 175 సంవత్సరములు జీవించి జీవసమాధి పొందుతాను."

  • నేను చనిపోయేలోగానే హరిహరరాయలు మొదలు రామరాయల వరకు చరిత్ర అంతమౌతుంది.
  • ఆ తరువాతి కాలంలో ఈ అఖండం మహమ్మదీయుల వశమౌతుంది.
  • శ్వేతముఖులు భరతఖండాన్ని పాలిస్తారు.
  • పల్నాటిసీమలో నరులు పచ్చి ఆకులు తిని జీవిస్తారు.
  • మొగలాయి రాజ్యాన ఒక నది పొంగి చేలు నాశనమైన రీతిగా జనాన్ని నశింపజేస్తుంది.
  • వ్యభిచార వృత్తి అంతరించి పోతుంది. ఆ వృత్తిలోని వారు వివాహం చేసుకుని కాపురం చేస్తారు.
  • గురువులు ఆడంబరంగా జీవిస్తారు.
  • కుటుంబంలో సఖ్యత ఉండదు. తల్లి, తండ్రి, పిల్లల మధ్య వాత్సల్యాలు ఉండవు. ఒకరిని ఒకరు మీద ఒకరికి నమ్మకం నశిస్తుంది.
  • నారాకకు ముందు నా భక్తులు వారి శక్త్యానుసారం నా ధర్మ పాలనకు అంకురార్పణ చేస్తారు. అని సిద్ధయ్యకు బ్రహ్మంగారు వివరించాడు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. కన్నెగంటి, p.33
  2. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కాలజ్ఞానం. బ్రహ్మంగారి మఠం.
  3. కన్నెగంటి, p.2
  4. కన్నెగంటి, pp.65-66
  5. కన్నెగంటి, p.75
  6. కన్నెగంటి, p.131
  7. కన్నెగంటి, p.106
  8. కన్నెగంటి, pp.105-106
  9. కన్నెగంటి, p.133
  10. తెలకపల్లి రవి (October 2019). "తత్వాల కాలజ్ఞాని(రూపకం)" (PDF). సాహిత్య ప్రస్థానం: 15–17.

ఉపయుక్త గ్రంథాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]