దుర్గాబాయి దేశ్‌ముఖ్

వికీపీడియా నుండి
(దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దుర్గాబాయి దేశ్‌ముఖ్
దుర్గాబాయి దేశ్‍ముఖ్ చిత్రపటం
జననంజూలై 15, 1909
మరణంమే 9, 1981
వృత్తిన్యాయవాది, సంఘసేవ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఆంధ్ర మహిళా సభ
జీవిత భాగస్వామిసి.డి.దేశ్‌ముఖ్
తల్లిదండ్రులు
  • రామారావు (తండ్రి)
  • కృష్ణవేణమ్మ (తల్లి)

దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 - మే 9, 1981) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఆమె స్థాపించింది. ఆమె భారతదేశ రాజ్యాంగ సభ, భారతదేశ ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్‌పర్సన్‌గా వ్యవహరించింది.[1][2]

జీవిత విశేషాలు[మార్చు]

దుర్గాబాయి దేశ్‌ముఖ్ మద్రాసు ప్రెసిడెన్సి (ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్) లోని రాజమండ్రిలో, 1909 జూలై 15 న మద్య తరగతి దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించింది.[3] 8 ఏండ్ల వయసులో ఆమెకు తన మేనమామ సుబ్బారావుతో వివాహమయింది.[4] తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకింది. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు అంగీకరించారు.[4] బాల్యం నుండి ప్రతిభాపాటవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించింది. బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది. న్యాయశాస్త్రం చదివిన తరువాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించింది.

స్వాతంత్ర్య పోరాటం[మార్చు]

దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తన 12 యేండ్ల వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించింది. ఆమె రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించింది.[5] తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది[6]. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది[7][8]. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కాబడింది[9]. స్వాతంత్ర్య సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఎ, బిఎల్‌, బిఎ ఆనర్స్‌ చేసి న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరుగాంచింది[5][6].

సామాజిక సేవలు[మార్చు]

దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేసింది. ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నపట్నంలో (ప్రస్తుత చెన్నై లో) ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది[10].1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించింది. ఈమె 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు, వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పింది. చెన్నైలో 70మంది కార్యకర్తలతో ఉదయవనం అను పేరుతో సత్యాగ్రహ శిభిరం ఏర్పరిచింది. 1953లో ఆర్థికమంత్రి చింతామణి దేశ్ ముఖ్ తో వివాహం జరిగింది. 1971లో సాక్షారతా భవన్ ని ప్రారంభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.

భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసింది[5]. ఆ సందర్భములో సి.డి.దేశ్‌ముఖ్తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న జరిగింది[3]. ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేసింది. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పనిచేసింది

అవార్డులు[మార్చు]

స్మరణ[మార్చు]

రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండు వద్ద గల స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ విగ్రహం
  • కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది.
  • ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు.
  • ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌గా నామాంతరం చెందింది.

మరణం[మార్చు]

దుర్గాబాయి 1981 మే 9వ తేదీన హైదరాబాదులో మరణించింది.

మూలాలు[మార్చు]

  1. Government of India (1959). Report of the National Committee on Women's Education. New Delhi: Government of India.
  2. 10TV (14 August 2020). "భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు" (in telugu). Archived from the original on 2 సెప్టెంబరు 2021. Retrieved 2 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. 3.0 3.1 Deshmukh, Durgabai (1980). Chintaman and I. Allied. p. 1. I was born on 15 July 1909 in Rajahmundry in the coastal district of East Godavari in Andhra
  4. 4.0 4.1 Forbes, Geraldine; Forbes, Geraldine Hancock (1999). Women in Modern India. Cambridge University Press. ISBN 9780521653770.
  5. 5.0 5.1 5.2 Smith, Bonnie G. (2008-01-01). The Oxford Encyclopedia of Women in World History: 4 Volume Set. Oxford University Press, USA. ISBN 9780195148909.
  6. 6.0 6.1 Rao, P. Rajeswar (1991). The Great Indian Patriots. Mittal Publications. p. 133. ISBN 9788170992806.
  7. Dedicated to cause of women Archived 2003-11-02 at the Wayback Machine, The Hindu. 4 November 2002
  8. Suguna, B. (2009). Women's Movement. Discovery Publishing House. p. 127. ISBN 9788183564250.
  9. Jayapalan, N. (2001). History Of India (from National Movement To Present Day). Atlantic Publishers & Dist. p. 73. ISBN 9788171569175.
  10. [1] Archived 17 జూలై 2007 at the Wayback Machine

బాహ్య లంకెలు[మార్చు]