దోర్భల ప్రభాకరశర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దోర్భల ప్రభాకరశర్మ ప్రముఖ సంస్కృత పండితుడు, సంస్కృత శతావధాని.[1]

జీవిత విశేషాలు[మార్చు]

బాల్యము, విద్యాభ్యాసము[మార్చు]

ఇతడు 1948, అక్టోబర్ 8వ తేదీకి సరియైన సర్వధారి నామ సంవత్సర, ఆశ్వయుజ శుక్ల షష్ఠి నాడు మెదక్ జిల్లా, రామాయంపేటలో అనంతలక్ష్మి, రత్నయ్య దీక్షితులు దంపతులకు జన్మించాడు. బాల్యంలో తండ్రి వద్ద విద్యనభ్యసించి ప్రాథమిక, మాధ్యమిక సంస్కృత విద్యను నిజామాబాద్ జిల్లా లోని ఇందూరు రఘునాథ సంస్కృత పాఠశాలలో చదివాడు. ఇక్కడ తన సోదరుడైన దోర్భల విశ్వనాథశర్మ వద్ద విద్యాభ్యాసం చేశాడు. తరువాత హైదరాబాదులోని వేంకటేశ్వర వేదాంతవర్థినీ సంస్కృత కళాశాలలో చదివి బి.ఒ.ఎల్ పట్టా పొందాడు. అటుపిమ్మట వాల్తేరు లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1979లో ఎం.ఎ.ఉత్తీర్ణుడైనాడు. "న్యాయ వైశేషికయోః ఆత్మతత్త్వ సమీక్షణమ్‌" అనే సిద్ధాంత గ్రంథాన్ని పోచంచెర్ల శ్రీరామమూర్తి పర్యవేక్షణలో సమర్పించి ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. పట్టాను పొందాడు. శాస్త్రుల విఠలశాస్త్రి, కల్యాణ మహారాజు, కోవిల్ కందాడై శఠకోపాచార్యులు, వర్‌ఖేడ్‌కర్ కృష్ణాచార్యులు ఇతనికి సంస్కృతం నేర్పిన గురువులు. రొంపిచెర్ల శ్రీనివాసాచార్యులు, రావూరి వెంకటేశ్వర్లు వద్ద అవధాన విద్యను నేర్చుకున్నాడు.

ఇతడు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠము, సంస్కృత భారతీ, రాష్ట్రీయ సంస్కృత సంస్థానము, శ్రీపురుషోత్తమ ధర్మప్రచార సభ, శ్రీగోదావరి పరిరక్షణ సమితి వంటి సంస్థలకువారి సేవలను అందిస్తున్నారు.శర్మగారు 2023 సంస్కృత భాషా సేవా పురస్కారాన్ని అందుకున్నారు.

ఉద్యోగము[మార్చు]

ఇతడు 1967-68లో నల్లగొండలోని గీతావిజ్ఞాన ఆంధ్ర కళాశాలలో ఉపన్యాసకునిగా పనిచేశాడు. తరువాత పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని వాడ్రేవు జోగాయమ్మ వేద సంస్కృత పాఠశాలలోను, పిమ్మట కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలోను ఉపన్యాసకుడిగా ప్రవేశించి 1995లో పదోన్నతి పొంది ఆ కళాశాల ప్రిన్సిపాల్‌గా 10 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ గావించాడు.

రచనలు[మార్చు]

ఇతడు సుమారు 20 వరకు సంస్కృత నాటకాలు రచించాడు. వీటిలో కొన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయ్యాయి. శ్రీశైలప్రభ మొదలైన పత్రికలలోను, సావినీరులలోను అనేక వ్యాసాలను ప్రకటించాడు. ఇతడు ప్రకటించిన గ్రంథాలు కొన్ని:

  1. గురుభక్తి
  2. పార్వతీ కళ్యాణము
  3. సౌందర్యలహరి
  4. అగ్ని మీడే పురోహితమ్‌
  5. సంస్కృత కవితా మంజరి
  6. జాగృహిత్వం భారతీయ

అవధానాలు[మార్చు]

ఇతడు ఇప్పటి వరకు 50 అష్టావధానాలు, రెండు శతావధానాలు (కొవ్వూరు, రాజమండ్రి లలో) చేశాడు. ఇతడు తెలుగు రాష్ట్రాలలోని కొవ్వూరు, రాజమండ్రి, మంత్రాలయం, తిరుపతి, హైదరాబాదు, వరంగల్లు, రామాయంపేట మొదలైన ప్రదేశాలతో పాటు ఆంధ్రేతరప్రాంతాలైన కాశి, పూణే, లక్నో, ఉజ్జయిని, పాండుచేరి, వదోదర, పూరీ వంటి నగరాలలోను, పట్టణాలలోను సంస్కృత అవధానాలను దిగ్విజయంగా నిర్వహించాడు.

బిరుదులు[మార్చు]

  • గీర్వాణ కవితాలంకార
  • సంస్కృత శతావధాన ప్రభాకర
  • జ్ఞాన సరస్వతి

మూలాలు[మార్చు]

  1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధానవిద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 553–557.