భూకైలాస్ (1958 సినిమా)

వికీపీడియా నుండి
(భూకైలాస్ (1958 సినిమా)‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

‌ఇదే పేరుగల మరొక సినిమా కోసం భూకైలాస్ (1940 సినిమా) చూడండి.

‌భూకైలాస్
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.శంకర్
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం నందమూరి తారక రామారావు,
అక్కినేని నాగేశ్వరరావు,
జమున
సంగీతం ఆర్.సుదర్శనం,
ఆర్.గోవర్ధనం
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎం. ఎల్. వసంతకుమారి
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ ఏ.వీ.ఎం.ప్రొడక్షన్స్
భాష తెలుగు

తెలుగు సినిమా వైభవాన్ని చాటి చెప్పిన పలు నిర్మాణ సంస్థల్లో ఎ.వి.ఎం సంస్థ ఎన్నదగినది. ఆ సంస్థ నుండి ‘భక్తప్రహ్లాద’, ‘రాము’, ‘నోము’ వంటి ఎన్నో అత్యుత్తమ చిత్రాలు వచ్చాయి. ఎ.వి.ఎం. సంస్థ నిర్మించిన ఎన్నో ఆణిముత్యాల్లో అజరామరంగా నిలిచిపోయిన పౌరాణిక చిత్రం 1958లో విడుదలైన ‘భూకైలాస్‌’. నిజానికి అంతకుముందే ‘భూకైలాస్‌’ అనే నాటకం ఆధారంగా ఏ.వి.మొయ్యప్పన్‌ తెలుగులో ‘భూకైలాస్‌’ (1940) చిత్రాన్ని నిర్మించారు. అయితే, అందులో కొందరు మినహా దర్శకనిర్మాతల దగ్గర నుంచి నటీనటుల వరకు పలువురు కన్నడ, తమిళ పరిశ్రమకు చెందిన వారే కావడం గమనార్హం. ఆ తర్వాత ఇదే కథను ఎ.వి.ఎం. సంస్థ 1958లో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నిర్మించింది. ఆయా భాషలకు చెందిన మేటి నటీనటులతో మూడు భాషల్లో నిర్మించిన ‘భూకైలాస్‌’ చిత్రం అన్ని భాషల్లోనూ విజయవంతం కావడం విశేషం.

పాత్రలు:పాత్రధారులు[మార్చు]

  • రావణాసురుడు = ఎన్‌.టి.రామారావు
  • నారదుడు = అక్కినేని నాగేశ్వరరావు
  • మండోదరి = జమున
  • మయాసురుడు (మండోదరి తండ్రి) = ఎస్‌.వి.రంగారావు
  • కేకసి (రావణుని తల్లి) = హేమలత
  • పరమశివుడు = నాగభూషణం
  • పార్వతీదేవి = బి.సరోజాదేవి

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

పరమశివుని భక్తుడైన రావణాసురుడు ఓ రోజు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శపథం చేసి తపస్సుకు వెళ్తాడు. లంకాధిపతి రావణాసురుడు గొప్ప శివ భక్తుడు. మహాశివుడి ఆత్మలింగాన్ని సాధించి, అమరత్వం పొందాలని రావణాసురుడికి కోరిక కలిగింది. ఆత్మ లింగం కోసం మహాశివుడిని రావణుడు భక్తిశ్రద్ధలతో ప్రార్థించాడు. రావణుడి తపస్సును మెచ్చుకున్న మహాశివుడు ఆయనకు ప్రత్యక్షమై, ఏం వరం కావాలని అడిగాడు. అదే సమయంలో వైకుంఠంలో శ్రీ మహా విష్ణువు వద్దకు నారద ముని వెళ్లాడు. రావణుడి మనసును మార్చాలని మహావిష్ణువును ప్రార్థించాడు.

రావణాసురుడి ఆలోచనను శ్రీ మహా విష్ణువు మార్చడంతో రావణాసురుడు మహాశివుని ఆత్మ లింగాన్ని అడగడానికి బదులు పార్వతీ దేవిని అడిగాడు. వెంటనే మహా శివుడు అంగీకరించి పార్వతీ దేవిని రావణాసురుడికి ఇచ్చేశాడు. పార్వతీ దేవితో సహా రావణాసురుడు తన లంకా పట్టణానికి తిరిగి ప్రయాణమయ్యాడు. ఆ దారిలో నారద ముని రావణాసురుడికి కనిపించాడు. మహాశివుడు నిజమైన పార్వతీ దేవిని ఇవ్వలేదని, మహాకాళిని ఇచ్చాడని రావణాసురుడికి నారదుడు చెప్పాడు. అసలు పార్వతీ దేవి పాతాళంలో ఉందని తెలిపాడు. ఆ సమయంలో పార్వతీ దేవి కాళికా అవతారంలో రావణాసురుడికి దర్శనమిచ్చింది. వెంటనే రావణాసురుడు పార్వతీ దేవిని విడిచిపెట్టేశాడు.

అసలు పార్వతీ దేవి కోసం వెతుకుతూ రావణాసురుడు పాతాళానికి వెళ్లాడు. అక్కడ మండోదరిని పార్వతీ దేవిగా భావించి ఆమెను వివాహం చేసుకున్నాడు. మండోదరిని తీసుకుని రావణాసురుడు లంకా పట్టణానికి తిరిగి వచ్చాడు. అక్కడ రావణాసురుడి తల్లి మహాశివుడి ఆత్మలింగం తెచ్చావా? అని అడిగింది. తాను మోసపోయానని రావణాసురుడికి అర్థమైంది ఎలాగైనా ఆత్మలింగాన్ని సాధించాలని రావణాసురుడికి పట్టుదల పెరిగింది.

రావణాసురుడు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా భక్తిశ్రద్ధలతో మళ్లీ తపస్సు చేశాడు. ఆయన తపస్సును మెచ్చుకున్న మహాశివుడు ప్రసన్నుడయ్యాడు. మళ్లీ ప్రత్యక్షమై ఏం వరం కావాలని రావణాసురుడిని అడిగాడు. తనకు ఆత్మ లింగం ఇవ్వాలని రావణాసురుడు మహాశివుని ప్రార్థించాడు. ఆయన కోరిన వరం ఇచ్చేందుకు మహాశివుడు అంగీకరించి, ఓ షరతు విధించాడు.

ఆత్మలింగాన్ని ఇస్తూ, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదని మహాశివుడు చెప్పాడు. ఆత్మలింగాన్ని నేలపై పెడితే దానిలోని అన్ని శక్తులు మళ్లీ తనకే వచ్చేస్తాయని మహాశివుడు చెప్పాడు. రావణాసురుడు సంతోషంగా ఆత్మలింగాన్ని తీసుకుని లంకా పట్టణానికి బయల్దేరాడు.

ఆత్మలింగాన్ని రావణాసురుడు తీసుకొస్తున్నట్లు నారద మునికి తెలిసింది. దాని శక్తితో రావణాసురుడికి అమరత్వం వస్తే భూ మండలాన్ని సర్వనాశనం చేస్తాడని భావించాడు. వెంటనే గణేశుడిని ఆశ్రయించాడు. ఆత్మలింగం లంకకు చేరకుండా అడ్డుకోవాలని ప్రార్థించాడు. రావణాసురుడు ప్రతి రోజూ క్రమం తప్పకుండా సంధ్యావందనం చేస్తాడని గణేశుడికి తెలుసు. రావణాసురుడు సంధ్యావందనం చేసే సమయంలోనే ఆయన నుంచి ఆత్మలింగాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రణాళిక రచించాడు.

రావణాసురుడు ఆత్మలింగంతో గోకర్ణమును సమీపిస్తున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నట్లుగా కనిపించేలా మహావిష్ణువు చేశాడు. దీంతో రావణాసురుడు సంధ్యావందనం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. కానీ చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని ఎక్కడ ఉంచాలో తెలియక తికమక పడ్డాడు. చేతిలో ఆత్మలింగం ఉంటుండగా సంధ్యావందనం చేయడం సాధ్యం కాదని ఆందోళన చెందుతున్నాడు. దీనిని ఆసరాగా చేసుకుని గణేశుడు బ్రహ్మచారి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. బ్రాహ్మణ బాలుడి రూపంలో ఉన్న గణేశుడిని రావణాసురుడు పిలిచి, తాను సంధ్యావందనం చేసే వరకు ఆత్మలింగాన్ని పట్టుకోవాలని కోరాడు. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదని తెలిపాడు. ఆత్మలింగాన్ని పట్టుకోవడానికి గణేశుడు ఓ షరతు విధించాడు. తాను మూడుసార్లు పిలుస్తానని, ఆ లోగా వచ్చి, ఆత్మలింగాన్ని తీసుకోకపోతే నేలపై పెట్టేస్తానని చెప్పాడు. దానికి రావణాసురుడు అంగీకరించాడు.

రావణాసురుడు సంధ్యావందనం చేసే సమయంలో గణేశుడు రావణా... రావణా అంటూ మూడుసార్లు పిలిచాడు. రావణాసురుడు ఏకాగ్రతతో ప్రార్థన చేస్తూ, గణేశుడి మాటలను వినిపించుకోలేదు. సంధ్యావందనం పూర్తయిన తర్వాత తిరిగి గణేశుడి వద్దకు రావణాసురుడు వచ్చాడు. అప్పటికే ఆత్మలింగాన్ని గణేశుడు నేలపై పెట్టేశాడు. బాలుడు తనను మోసం చేశాడని రావణాసురుడికి పట్టరాని కోపం వచ్చింది. ఆ ఆత్మలింగాన్ని పైకి తీసి,దానిని పెకిలించేందుకు రావణుడు చేసిన ప్రయత్నం వృథా అవుతుంది. ఆత్మార్పణకు సిధ్ధపడిన రావణాసురిని కైలాసపతి కరుణించి, ఆ ప్రదేశం ‘భూకైలాసం’గా మారుతుందని చెప్పి అనుగ్రహిస్తాడు.

పాటలు[మార్చు]

సముద్రాల రాఘవాచార్య రచనా సామర్థ్యానికి ‘రాముని అవతారం రఘుకుల సోముని అవతారం’ అనే ఒక్క పాట తార్కాణం గా నిలుస్తుంది.(ఈపాటలో భరతుడ్ని ఉద్దేశిస్తూ సాగిన 'కపటనాటకుని పట్టాభిషేకం' అనే పాదం విమర్శలకు గురి అయ్యింది.) ఈ పాటలో రాముని అవతార వైశిష్ట్యాన్ని చూపించారు. ‘దేవదేవ ధవళాచల మందిర’, ‘జయజయమహాదేవా’, ‘తగునా వరమీయా ఈ నీతి దూరునకు..’ వంటి పాటలు ఘంటసాల వెంకటేశ్వరరావు గళంలో జీవం పోసుకున్నాయి. ‘సుందరాంగా అందుకోరా’, ‘మున్నీట పవళించు నాగశయనా’ వంటి పాటలు కూడా ఆణిముత్యాలే. ఆర్‌.సుదర్శనం, ఆర్.గోవర్థనం కలసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని మరపురాని మనోజ్ఞ దృశ్యకావ్యంగా మలచిన ఘనత దర్శకుడు కె.శంకర్‌కు దక్కుతుంది.

పాట రచయిత సంగీతం గాయకులు
తగునా వరమీయా యీ నీతి దూరునకు పరమా పాపునకు సముద్రాల రాఘవాచార్య ఆర్.సుదర్శనం ఆర్.గోవర్ధనం ఘంటసాల
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో సముద్రాల రాఘవాచార్య ఆర్.సుదర్శనం ఆర్.గోవర్ధనం ఘంటసాల
జయజయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రిత మందారా సముద్రాల రాఘవాచార్య ఆర్.సుదర్శనం ఆర్.గోవర్ధనం ఘంటసాల
మున్నీట పవళించు నాగశయనా ఆర్.సుదర్శనం ఆర్.గోవర్ధనం ఎం. ఎల్. వసంతకుమారి
రాముని అవతారం రవికుల సోముని అవతారం సముద్రాల రాఘవాచార్య ఆర్.సుదర్శనం ఆర్.గోవర్ధనం ఘంటసాల
సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా సముద్రాల రాఘవాచార్య ఆర్.సుదర్శనం ఆర్.గోవర్ధనం పి.సుశీల

అగ్ని శిఖలతో ఆడకుమా . ఘంటశాల.రచన: సముద్రాల.

జలధార శ్యామా మంగళ నామా.ఘంటశాల.రచన: సముద్రాల.

ప్రేమలీ విధమా..మన రాగమేగా అనురాగం.ఘంటశాల. సుశీల.రచన: సముద్రాల.

సైకత లింగంభు జలది పాలవు (పద్యం) ఘంటశాల.రచన: సముద్రాల.

నాకనుల ముందొలుకు (పద్యం) ఘంటశాల.రచన: సముద్రాల.

స్వామి దన్యుడనైతి (పద్యం) ఘంటశాల.రచన: సముద్రాల.

విశేషాలు[మార్చు]

  • ఎన్టీఆర్‌ కుమారుడు హరికృష్ణ జననం ‘భూకైలాస్‌’ చిత్ర నిర్మాణం జరుగుతున్న సమయంలోనే జరిగినది
  • సుందరాంగా అందుకోరా పాటలో అప్సరసగా ప్రత్యేక పాత్రలో హిందీ చలనచిత్ర తార హెలెన్ నాట్యము చేసింది.
  • ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శంకర్ ఎన్.టి.రామారావుతో శృంగార రాముడు (1979) లో తీశారు.చిత్రం విజయవంతం కాలేదు.

వనరులు[మార్చు]