పెండ్యాల వరవరరావు

వికీపీడియా నుండి
(వరవరరావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పెండ్యాల వరవరరావు
వి.వి
పుట్టిన తేదీ, స్థలం (1940-11-03) 1940 నవంబరు 3 (వయసు 83)
చిన్నపెండ్యాల, వరంగల్ జిల్లా, తెలంగాణ
వృత్తివిప్లవ రచయిత
భాషతెలుగు
జాతీయతభారతీయుడు

పెండ్యాల వరవర రావు (ఆంగ్లం:Varavara Rao) అందరికీ వి.వి.గా సుపరిచితుడు. ఆయన నవంబర్ 3, 1940లో వరంగల్లు జిల్లా లోని చిన్నపెండ్యాల అనే గ్రామంలో జన్మించాడు. కళాశాలలో చదువుతున్నప్పుడే కవిత్వం, సాహితీ విమర్శలు వ్రాయడం మొదలుపెట్టాడు. ఉద్యోగరీత్యా ఆయన వరంగల్లు లోని సీ.కే.ఎం. కళాశాలలో (1968-98) తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేసాడు. వరవర అంటే శ్రేష్ఠులలో కెల్లా శ్రేష్ఠుడు అని అర్ధం.[1]

సృజన[మార్చు]

నవంబర్ 1966 లో, సాహితీ మిత్రులు (Friends of Literature) స్థాపించి, సృజన అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించాడు. రెండు దశాబ్దాలపాటు ఒక సాహిత్య ఉద్యమంగా వెలువడిన సృజన పూర్తిగా ఒక తరం మీద ప్రభావం చూపింది. 1966 నుండి 1992 వరకు 200 సంపుటులుగా అచ్చు అయిన సృజన, ప్రభుత్వము నుండి ఎన్నోసార్లు నిషేధాన్ని ఎదుర్కొంది. వి.వి. జైల్లో ఉన్న సమయంలో సృజనకి ప్రచురణకర్తగా ఆయన భార్య హేమలత వ్యవహరించింది. ఆమెకు కూడా 1978, 1984లో జైలు జీవితం చవిచూడక తప్పలేదు.

విరసం[మార్చు]

జనవరి 1970లో తోటి కవులతో స్థాపించిన తిరగబడు కవులు కొన్నాళ్లకే విప్లవభావాలుగల మరికొందరు కవులతో చేతులు కలిపి 1970 జూలై 4విప్లవ రచయితల సంఘం (విరసం) గా అవతరించాక, తెలుగు సాహిత్య రంగంలో ఒక విప్లవ కెరటమై ఎగసింది. ఆయన ప్రారంభదశనుండి నేటి వరకు విరసం కార్యనిర్వాహక సభ్యుడుగా ఉన్నాడు. 1984 నుండి 1986 వరకు కార్యదర్శిగా కూడా ఉన్నాడు. 1983లో స్థాపించిన All India League for Revolutionary Culture (AILRC) కి వ్యవస్థాపక కార్యనిర్వాహక సభ్యుడుగా, 1993 వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. విరసం 35 సంవత్సరాలుగా రచయితలు, మేధావులు, విద్యార్థులు, యువకులకు స్ఫూర్తినిస్తూ, వారిని ప్రభావితం చేస్తూ, తెలుగు భాషలో విప్లవోద్యమమై నిలిచింది. వి.వి. విప్లవోద్యమంతో పాటు, సాహిత్య రంగానికి కూడా చాలా దోహదపడ్డాడు.

జైలు జీవితము[మార్చు]

రెండు దశాబ్దాల పాటు ఎన్నో కేసులలో వీరిని నిందితులుగా చేర్చారు. 1980 లలో ఆయన ప్రాణానికి కుడా ముప్పు కలిగింది. మొత్తం మీద 18 కేసులు పెట్టగా, 1973 నుండి దాదాపు 6 సంవత్సరాలు జైల్లోనే గడిపారు. 1985-89 లో రాం నగర్ కుట్ర కేసు, సికింద్రాబాద్ కుట్ర కేసులో, శిక్ష అనుభవించాడు ('one thousand days and nights of solitary confinement'). 1986లో టాడా (TADA) చట్టం కింద మోపబడిన రాం నగర్ కుట్ర కేసు ఇంకా కోర్టులోనే ఉంది. మిగిలిన 17 కేసులలో కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.

రచనలు[మార్చు]

కావ్యము[మార్చు]

  • విప్లవ సాహిత్యోద్యమంలో భాగంగా 9 పద్యసంకలనాలు, ఇరాక్ యుద్ధం పై రెండు బుల్లి పస్తకాలు ప్రచురించాడు.
    • చలినెగళ్లు (1968)
    • జీవనది (1970)
    • ఊరేగింపు (1973)
      • 1973 అక్టోబరు నుండి నవంబర్ వరకు MISA చట్టం కింద నిర్బంధించబడి వరంగల్లు జైలులో ఉన్నపుడు వ్రాసిన కవితలు.
    • స్వేచ్ఛ (1977)
      • ఎమర్జెన్సీలో సికింద్రాబాదు కుట్ర కేసు కింద మే 1974-మార్చి 1977 వరకు జైలు నిర్బంధంలో ఉన్నపుడు వ్రాసిన కవితలు.
    • సముద్రం (1983)
    • భవిష్యత్ చిత్రపటం (1986)
      • 1987 లో దీనిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది.1990 లో నిషేధం ఎత్తివేయబడింది.
    • ముక్త కంఠం (1990)
      • టాడా చట్టం కింద రాం నగర్ కుట్ర కేసులో డిసంబరు 1985-మార్చి 1989 వరకు సికింద్రాబాదు జైలులో ఏకాంత నిర్బంధంలో వ్రాసిన కవితలు.
    • ఆ రోజులు (1998)
      • ప్రాణభయంతో విడిచివెళ్లిన వరంగల్లు జ్ఞాపకంలో వ్రాసిన కవితలు.
    • ఉన్నదేదో ఉన్నట్లు (2000)
    • బాగ్దాద్ చంద్రవంక (మార్చి 2003)
      • ఇరాక్ పైన అమెరికా యుద్ధం గురించి.
    • మౌనం యుద్ధ నేరం (ఏప్రిల్ 2003)
      • ఇరాక్ పైన అమెరికా యుద్ధం గురించి.

వచనము[మార్చు]

  • 1983 లో తెలుగులో ఒక పరిశోధన గ్రంథం - తెలంగాణా విముక్తి పోరాటం - తెలుగు నవల - సమాజం, సాహిత్యం ల పరస్పర సంబంధంపై ఒక పరిశీలన (Ph.D. thesis in Telugu;Telangana Liberation Struggle – Telugu Novel – A study into interrelationship of society and literature)
  • ప్రజలమనిషి-ఒక పరిచయం (1978)
  • కల్పనా సాహిత్యం-వస్తువివేచన (జనవరి 2005)
  • డిసెంబరు 1988 నుండి ఏప్రిల్ 1989 వరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్ర ఫ్రభ లలో ప్రచురితమైన వి.వి. వ్రాసిన ‘letters from jail’ స్వేచ్ఛాప్రియులైన ఎంతో మంది రచయితలను ఆకట్టుకుంది. 1989 లో ఈ ఉత్తరాలను సహచరులు అనే సంకలనంగా తెలుగులో ప్రచురించారు.
  • 1990 లో సృజన సంపాదకీయాల (1966-85) సంకలనం ప్రచురింపజేసారు
  • 1990 లో శ్రీశ్రీ మరోప్రస్థానం- టీకాటిప్పణి
  • ముక్తకంఠం
  • 1968-88 లలో ప్రజలపాటగా జానపదాల పరివర్తన అనే అంశం మీద 1991-94 లో పరిశోధన చేసాడు.
  • కన్యాశుల్కం ' నవల ' కాదు...నాటకమే (1993) గురజాడ వ్రాసిన కన్యాశుల్కం గూర్చి ఆంధ్ర ప్రభలో వ్యాసం .

అనువాదాలు[మార్చు]

  • 1985–89 జైలు నిర్బంధంలో ఉండగా వి.వి. ‌గూగీ వ థ్యాంగో వ్రాసిన “Devil on the cross”, “ A Writer’s prison diary – Detained” లను తెలుగులోకి తర్జుమా చేయగా వాటిని 1992, 96 లలో స్వేచ్ఛా సాహితి ప్రచురించింది.
దస్త్రం:VaraVaraRao writing.jpg
రచనలో నిమగ్నమైన వి.వి.

పురస్కారాలు[మార్చు]

శాంతి దూత[మార్చు]

  • జూన్ 2002 లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం CPI-ML (పీపుల్స్ వార్) తో శాంతి చర్చలు జరపాలని తలపెట్టిన సందర్భంలో ఆయన ప్రజాగాయకుడు గద్దర్ తో కలిసి మధ్యవర్తిగా వ్యవహరించాడు. తెలుగుదేశం ప్రభుత్వంతో జరిగిన ఆ శాంతి చర్చల ప్రయత్నం ఆది లోనే విఫలమయింది.
  • మరలా 2004-2005 లో కాంగ్రెసు ప్రభుత్వం పీపుల్స్ వార్ తో శాంతి చర్చలు జరపాలని నిర్ణయించినపుడు ఆయన మరోసారి మధ్యవర్తిగా వ్యవహరించాడు. 2004 లో మొదలయిన చర్చల ప్రయత్నం ఒక విడత చర్చల అనంతరం 2005 ఆగస్టు 18 న CPI (మావోయిస్టు), విరసం, ఇతర ప్రజాసంఘాలపై నిషేధంతో ముగిసింది.

మరలా జైలు[మార్చు]

  • విరసంపై నిషేధం విధించిన 24 గంటలలోనే 2005 ఆగస్టు 19 తెల్లవారు జామున అయిదున్నర గంటల ప్రాంతంలో వరవర రావును మలక్ పేటలోని ఆయన ఇంట్లో అరెస్టు చేసారు.
  • అరెస్టు చేసినప్పటినుండి ఇప్పటివరకు ప్రభుత్వం ఆయనపై మొత్తం 9 కేసులు పెట్టి ఆయన జైలు రిమాండును పొడిగిస్తూనే ఉంది. ప్రస్తుతం (నవంబర్ 15 నాటికి) ఆయనను చంచల్ గూడ జైలులో ఉంచారు

బయటి లింకులు[మార్చు]

నోటులు, మూలాలు[మార్చు]

  1. 'వరవరముని' - శ్రీవైష్ణవం గురుపరంపరలో ఒక ప్రసిద్ధ ఆచార్యుడు