శారద కాండ్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శారద కాండ్రు (శారద కథలు) అనేది తెలంగాణకు చెందిన ఒక కళారూపం. వారు ఒక్క తెలంగాణాలో తప్ప కోస్తా ఆంధ్ర లోనూ, రాయలసీమ లోనూ ఎక్కడా కనిపించరు. అయితే తెలంగాణాలో కూడా వరంగల్ తాలూకా లో వీరు కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం తొండ్లాయి గ్రామానికి చెందిన సిరిశాల అనే ఇంటి పేరు గలవారు ప్రముఖులు. వీరిలో సిరిశాల నర్సింహా అనే కళాకారుడు ముఖ్యమైన వ్యక్తి. నిజానికి బుర్రకథ వాయిద్యాలకూ, సారద కథకుల వాయిద్యానికీ పెద్ద వ్యత్యాసం ఎమీ కనిపించదు. బుర్రకథలో మాదిరే వీరూ డక్కీలు ఉపయోగిస్తారు. వీరు ఉపయోగించే తంబురానే శారద అంటారు. వీరు శారదాంబను తలచుకుంటూ కథలు చెబుతారు. అందువల్ల వీరికి శారద కాండ్రు అనే పేరు వచ్చింది..

అసలు వీరెవరు?[మార్చు]

మున్నూరు, ముతరాసి మొదలైన తెలుగు కులాల నుంచి పుట్టిన ఒక జాతి ఈ శారద కాండ్రనీ భిక్షకుల్జాతుల్లో వీరే ఎక్కువ మంది వున్నారనీ పూర్వం ఈ జాతి వారికి ఎటువంటి పేరుండేదో తెలియజెప్ప చారిత్రకాధారాలు ఏమీ లేవనీ, వీరికి పేరు ఇటీవలే వచ్చి వుండ వచ్చుననీ, ముఖ్యంగా జానపద గేయాల్లో శారద పాటలు పాడేవారు ఈ జాతి వారే పాడుతున్నారనీ, ఇతర జానపద గేయాలలో కంటే, ఈ శారద పాటల్లోనే సాహిత్య ప్రతిభ అధికంగా వుంటుందనీ,

ఓ భారతీ కరుణామతి
భళి శారద కరుణానిధి

అనే వంత పాటలు పాడటం వల్ల, వీరికీ పేరు వచ్చిందేమో తెలియదని డా: రామరాజు గారు, తమ గేయ సాహిత్యంలో ఉదహరించారు.

శారదంటే[మార్చు]

శారదను భుజంమీద ధరించిన కథకుడు............... ఎడమ చేతి బొటన వ్రేలుకు ఆందెలు ధరించి, భుజంపైన తంబురాను కుడిచేతితో మీటుతాడు. దీనినే వారు శారద అని పిలుస్తారు. శారద అంటే సరస్వతి అనే పేరు సర్వ సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అదే పేరును ఈ భిక్షకులు తంబురాకు శారద అనే పేరు పెట్టుకున్నారు. అందు వల్లనే వారు కథా ప్రారంభంలో శారదా దేవినే స్తోత్రం చేస్తారు. పురుషుడు కథ చెపితే, అతని భార్య వంత పాడుతూ డక్కీ కొడుతుంది. ఒకోసారి ఇద్దరు కథ చెపుతారు. అయితే వీరిలో బహు భార్యాత్వం వుండడం వల్ల, ఇద్దరు భార్యలు వంతలుగానే వుంటారు. అందువల్లే వీరు ఇద్దరు భార్యలను చేసుకోవడం కూడా కద్దు. వీరి కథల్లో స్త్రీ వంతల్లాగా, జంగం కథల్లో గానీ, బుర్రకథ ల్లో గానీ స్త్రీలు వంతలుగా కనిపించరు. శారద కథకులు బహు భార్యాత్వం వల్ల, ఎవరి కుటుంబానికి వారే దళంగా ఏర్పడి జీవిస్తున్నారు. వివిధ వరుసల్లో జంగం కథలు, బుర్ర కథలు సాగినట్లు, శారద కథలు వుండవు. ఒకే వరుసలో ఆయా ఘట్టాల ననుసరించి సన్ని వేశాలను పండిస్తూ ఒకే వరుసలో కథను సాగిస్తారు. వీరు శారద వరుసల్లో వున్న పాటల్నే కాక ఎన్నో రకాల కథలు చెపుతారు.

వారు చెప్పే కథలు[మార్చు]

బాలనాగమ్మ ........ రాములమ్మ ..... ఎరుకల నాంచారి ..... చిన్నమ్మ మొదలైన కరుణ రస ప్రపూరిత మైన కథలతో పాటు 18 వ శతాబ్దంలో తెలంగాణా ప్రాంతాల్ని దద్దరిల్ల చేసిన సర్వాయి పాపడు కథనూ, అలాగే రెడ్డి వీరులకూ, వెలమ వీరులకూ చెరువు నీళ్ళ తగాదాలో వైరుధ్యాలు పెరిగి .... కొండల్రాయుని తండ్రిని చంపిన వారి మీద పగ తీర్చు కోవడానికి యుద్ధానికి సిద్ధమైన పౌరుష వంతు డైన కొండల్రాయుని సాహసోపేతుడైన వీరుని కథనూ, ఈ కోవకే చెందిన సదాసివ రెడ్డి, రాజా రామేశ్వరరావు..... గద్వాల సోమానాద్రి కథనూ, చారిత్రక కథలైన, బొబ్బిలి, పల్నాటి యుద్ధానికి సంబంధించిన వీరరస గాథల్నీ చెపుతారు.వీరు వరంగల్లు తాలూకాలో వున్న వెంకటరావుల పల్లి చుట్టు ప్రక్కల గ్రామాలలో ఎక్కువ మంది ఉన్నారు. శారద కాండ్రందరూ శైవ మతానికి సంబంధించిన వారే. వీరు మాంసాహారులైన జంగమ జాతికి చెందిన వారనే ప్రతీతి కూడా ఉంది. . .... ఎల్లమ్మ ........ పోచమ్మ.............. మొదలైన ప్రసిద్ధ దేవతల్ని దైవాలుగా పూజిస్తారు. వీరికి గురువులు జంగాలే. వీరు శైవ మతానికి సంబంధిన వారైనా వీరు లింగాలను ధరించరు.

శారద రామాయణం[మార్చు]

ఇన్నీ చారిత్రక గాథల్ని వీరరస గాథల్నీ, కరుణ రస గాథల్నీ, అద్భుతంగా వాల్మీకి రామాయణాన్ని అనుసరించి ఒక కవి, పుత్రకామేష్టి నుండి, పాదుకా పట్టాభి షేకం వరకూ, శారద వరుసలకు అనుగుణంగా వ్రాసిన శారద రామాయాణాన్నీ ఎంతో భక్తి శ్రద్ధలతో చెపుతారు.......... ఇదే కథను, ఆంధ్ర దేశంలో పగటి వేషాలు ధరించే వారు. రోజు కొక వేషం చొప్పున రోజుల తరబడి వేషాలు ధరించే పగటి వేషధారులు, శుభ సూచకంగా భక్తి భావంతో, శారద రామాయణాన్ని అలాపించి గ్రామస్తుల వద్ద డబ్బునూ, వస్గ్త్రాలనూ, ధాన్యాన్నీ దానాలుగా సంపాదిస్తారు. అయితే వీరు శారద కాండ్ర వరుసలో ఈ రామాయాణాన్ని చెప్పరు. మూల కథను తీసుకుని క్లుప్తంగా వివరిస్తారు. శారద కాండ్రు ఈ కళా రూపాన్ని జోవనోపాధి కోసమే ఉపయోగించు కున్నారు. అయినా ఇదొక చక్కని జానపద బాణీ. రోజు రోజుకీ ఈ కథలకు ఆదరణ తగ్గి పోతూ ఉంది.

మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]