సలేశ్వరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సలేశ్వరం

సలేశ్వరం (Saleshwaram) తెలంగాణలోని ఒక యత్రా స్థలం. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యత్రాస్థలం. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత చైత్ర పౌర్ణమికి మొదలవుతుంది. అడవిలో 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి వుంటుంది. ఇందులో 20 కిలోమీటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలొమిటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు.

ఉనికి[మార్చు]

ఇది తెలంగాణ రాష్ట్రంలోని మాహబూబ్ నగర్ జిల్లాలో నల్లమల అడవులలో ఉంది. హైదరాబాదు నుండి శ్రీశైలం వెళ్ళే రహదారిలొ 150 కిలోమీటరు రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో ఉంది. ఆటవీ శాఖ వారి అనుమతితో ఆ దారెంబడి పది కిలోమీటర్ల దూరం వెళ్ల గానే రోడ్డు ప్రక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనబడుతుంది.

సలేశ్వరం కొండల దృశ్యం

చరిత్ర[మార్చు]

అక్కడి పకృతి అందాలకు ముగ్దుడైన నిజాం వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అదిప్పుడు శిథిలావస్థలో ఉంది. ఆ ప్రదేశానికి ఫరాహబాద్ అనిపేరు. అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం. అంతకు ముందు దాని పేరు' పుల్ల చెలమల'. 1973 లో 'ప్రాజెక్ట్ టైగర్' పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. అది భారతదేశంలోనే అతి పెద్ద పులుల సరక్షణా కేంద్రం. నిజాం విడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి. అక్కడ రెండు పొడవైన ఎత్తైన రెండు గుట్టలు ఒకదాని కొకటి సమాంతరంగా వుంటాయి. మధ్యలో ఒక లోతైన లోయ లోనికి ఆ జలదార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా అర కిలోమీటరు దిగి తరువాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమ వైపున వున్న గుట్టపైన కిలోమీటరు దూరం నడవాలి. ఆ గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టాల మధ్య లోయ లోనికి దిగాలి. ఆ దారిలొ ఎన్నే గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరుకుంటాం. గుండం నుండి పారే నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితే ఇక కైలాసానికే. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది. గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే ప్రధాన దైవ మైన లింగమయ్య స్వామి లింగం ఉంది. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు. క్రింద గుహలో కూడా లింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, -గంగమ్మ విగ్రహాలున్నాయి.

జాతర[మార్చు]

సలేశ్వరం జాతర సంవత్సరాని కొక సారి చైత్ర పౌర్ణమికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులపాటూ జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతుంది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు "వత్తన్నం వత్తన్నం లింగమయ్యో" అంటు వస్తారు. వెళ్లేటప్పుడు "పోతున్నం పోతున్నం లింగమయ్యొ" అని అరుస్తూ నడుస్తుంటారు.[1]

కరోనా కారణంగా రెండేళ్లు సలేశ్వరం యాత్ర నిలిపివేయడంతో 2022లో బ్రహ్మోత్సవాల సందర్భంగా లింగమయ్య దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే సలేశ్వరం చేరుకోవాలని అటవీశాఖ అధికారులు భక్తులకు ఆంక్షలు విధించడం గమనార్హం.[2]

చారిత్రక ఆధారాలు[మార్చు]

నాగార్జున కొండలో బయట పడిన ఇక్ష్యాకుల నాటి అనగా సా.శ. 260 నాటి శాసనాలలో చుళదమ్మగిరి గురించిన ప్రస్తావన ఉంది. ఆ గిరిపై అనాడు శ్రీ లంక నుండి వచ్చిన బౌద్ద బిక్షవులు కొరకు అరామాలు, విహారాలు కట్టించారట. ఆ చుళ దమ్మగిరి ఈ సలేశ్వరమే నని నమ్మకం. కారణం అక్కడ ఇక్ష్యాకుల కాలపు కట్టడాలు ఉన్నాయి. లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం 16"/10"/3" గా ఉన్నాయి. అలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనే ఉండేది. . "సుళ" తెలుగులో "సుల" అవుతుంది కాబట్టి బౌద్ద క్షేత్రం శైవ క్షేత్ర్తంగా మార్పు చెందాక సులేస్వరంగా ......చివరగా సులేశ్వరంగా మారి వుంటుంది. ఇక్ష్యాకుల నిర్మాణాలకు అధనంగా విష్ణు కుండినుల సా.శ.. 360 ---370 కాలపు నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీరి ఇటుకల పరిమాణసం 10'"/ 10"/3" . దిగువ గుహలోని గర్బగుడి ముఖ ద్వారం పైన విష్ణు కుండినుల చిహ్నమగు పూలకుండి శిలాఫలకం ఉంది. ద్వారా బందంపై గడప మధ్యన గంగమ్మ విగ్రహం ఉంది. ద్వారం ముందర కుడి పక్కన సుమారు రెండున్నర అడుగుల ఎత్తున నల్లసరపు మీసాల వీరభద్రుని విగ్రహం నాలుగు చేతులలలో నాలుగు ఆయుధాలు ఉన్నాయి. కుడి చేతిలో గొడ్డలి, కత్తి, ఒక ఎడమ చేతిలో ఢమరుకం ఎడమ చేయి కిందికి వాలి ఒక ఆయుధాన్ని పట్టుకుని ఉంది. బీరభద్రుని కింద కుడి వైపున పబ్బతి పట్టు కున్న కిరీటం లేని వినాయాకుని ప్రతిమ ఉండగా ఎడమ వైపున స్త్రీమూర్తి ఉంది. ద్వారానికి ఎడమ వైపున విడిగా రెండు గంగమ్మ విగ్రహాలున్నాయి. ఇవే పాతవిగా కనబడుతున్నాయి. ఈ విగ్రహాల ముందు ఒకనాటి స్థిర నివాసాన్ని సూచించే విసురు రాయి ఉంది. గుడికి ఎడమ వై పున గల అరాతి గోడకి బ్రంహీ లిపిలో ఒక శాసనం చెక్కబడి ఉంది. కుడివైపున గల గోడమీద ఒక ప్రాచీన తెలుగు శాసనం కూడా ఉంది. ఈ రెండూ విష్ణు కుండినుల శాసనాలుగా తోస్తున్నాయి. వీటిని చరిత్ర కారులు చదివి వివరిస్తే విక్ష్ణుకుండినుల జన్మస్థానాన్ని కచ్చితంగా నిర్ణయించ వచ్చు. స్థల మహాత్యం అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్ర మహాత్యం కావ్యాలలో సలేశ్వరాన్ని రుద్ర కుండంగా, దీనికి ఈశాన్యాన గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణు కుండంగా, పశ్చిమాన గల లొద్ది అనగా గుండాన్ని బ్రంహ కుండంగా పేరొన్నారు. విష్ణు కుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతపు పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్ర కారుడు బి.ఎన్ శాస్త్రి నిరూపించారు. సా.శ. పదమూడవ శతాబ్దాంత కాలం నాటి మల్లికార్హ్జున పండితారాద్య చరిత్రలో, శ్రీపర్వత క్షేత్ర మహాత్యంలో కూడా ఈ సలేశ్వర విశేషాలను పాల్కురి సోమనాధుడు విశేషంగా వర్ణించాడు. 17 వ శతాబ్దాంతంలో మహారాష్ట్రకు చెందిన చత్రపతి శివాజి కూడా ఇక్కడ అశ్రయం పొందినట్లు స్థానిక చరిత్ర వలన తెలుస్తుంది.

ప్రకృతి[మార్చు]

సలేశ్వరం లోయ సుమారు రెండు కిలో మీటర్ల పొడవుండి మనకు అమెరికా లోని గ్రాండ్ క్యానన్ను గుర్తు చేస్తుంది. గ్రాండ్ కానన్ అందాలను చాలమంది మెకన్నాస్ గోల్డ్ సినిమాలో చూసి వుంటారు. సలేశ్వరం లోని తూర్పు గుట్ట పొడువునా స్పష్టమైన దారులు ఉన్నాయి. అవి జంతువులు నీటి కోశం వెళ్లే మార్గాలని స్థానిక గిరిజనులు చెప్తారు. పడమటి గుట్టలో ఎన్నో గుహలున్నాయి. అవన్నీ కాలానుగుణంగా ఒకప్పుడు ఆది మానవులకు, ఆ తరువాత అబౌద్ద బిక్షవులకు, ఆపైన మునులకు, ఋషులకు స్థావరాలుగా వుండేవని అక్కడి ఆధారాలను బట్టి తెలుస్తుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, చరిత్ర పరిశోధకులకు చాల బాగా నచ్చే ప్రదేశం ఇది.[3]

సూచికలు[మార్చు]

  1. Telugu, TV9 (2022-04-14). "Saleshwaram Festival: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భక్తులకు శుభవార్త.. రేపటి నుంచే సలేశ్వరం జాతర." TV9 Telugu. Retrieved 2022-04-14.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "ఆంక్షల నడుమ.. సలేశ్వరం యాత్ర షురూ". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-16. Retrieved 2022-04-16.
  3. (మూలం: ఆదివారం; ఆంధ్ర జ్యోతి: 29 మే నెల 2011)
"https://te.wikipedia.org/w/index.php?title=సలేశ్వరం&oldid=4194761" నుండి వెలికితీశారు