సింగర కొండ (పుణ్యక్షేత్రం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సింగర కొండ (శింగరకొండ) ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలంలో ఉన్న పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహ స్వామి దేవాలయాలు ప్రఖ్యాతి గాంచినవి. అద్దంకి నుండి 6 కి.మీ. దూరంలో, 670 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవనాసి చెరువు వొడ్డున ఉంది. మొదట్లో సింగన కొండ అని పిలవబడ్డ నరసింహ క్షేత్రం, ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి క్షేత్రం గానే ప్రఖ్యాతి గాంచింది. ఆలయం లోని గరుడ స్తంభంపై గల శాసనం ప్రకారం ఈ ఆలయ పోషకుడు 14 వ శతాబ్దమునకు చెందిన దేవరాయలు అనే రాజు అని తెలుస్తుంది.

స్థల పురాణం[మార్చు]

సీతమ్మ తల్లి కోసం వెతుకుతూ దక్షిణాపధం బయలుదేరిన ఆంజనేయుడు, ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొన్నాడని ఒక నమ్మకం. అందుకే ఇచ్చట ఆంజనేయుడు దక్షిణాముఖుడై కనపడతారు. అద్దంకి తాతాచార్యులు అని గొప్ప భక్తుడు సింగర కొండలో కొండపై గల నరసింహ స్వామి గుడియందు ధ్వజారోహణ చేయుచుండగా, కొండ క్రింద ఒక దివ్యపురుషుడు ఒక ఆంజనేయ విగ్రహమునకు హారతి ఇచ్చుచూ కనబడగా, పరుగు పరుగున క్రిందకు వెళ్ళిన తాతాచార్యుల వారికి పురుషుడు మాయమై, దివ్యకాంతులు వెదజల్లుతూ ఆంజనేయుని విగ్రహం కనపడింది.

పూజలు[మార్చు]

సింగర కొండలో ప్రతి మంగళ వారం, శనివారం విశేష పూజలు జరుగుతాయి. అటులనే, ముఖ్య పండుగలు ఉగాది, శ్రీరామ నవమి, హనుమజ్జయంతి, ముక్కోటి, సంక్రాంతి, బ్రహ్మోత్సవాల తిరునాల్లు ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజులలో లక్షల కొద్దీ భక్తులు వచ్చి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీస్సులు పొందుతారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్ష తమలపాకుల పూజ, కోటి తమలపాకుల పూజ చూచుటకు రెండు కళ్ళూ చాలవు.

నిత్యాన్నదాన పథకం[మార్చు]

స్వామివారిని దర్శించుకొనడానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం ఏర్పాట్లు, 2001- మే నెలలో, 17వతేదీ నాడు, హనుమజ్జయంతి సందర్భంగా మొదలు పెట్టారు. ప్రతి మంగళవారం, శనివారం 150 మంది భక్తులకు, మిగతా రోజులలో 50 మంది భక్తులకు, అన్నప్రసాదవితరణ జరుగుతుంది. [1]

ప్రయాణ మార్గం[మార్చు]

  • దగ్గరలో కల రైల్వే స్టేషను ఒంగోలు.
  • బస్సు స్టాండు అద్దంకి.
  • ఒంగోలు నుంచి: బస్సు ప్రయాణీకులు అద్దంకి వెళ్ళే బస్సు ఎక్కాలి. అద్దంకి నుంచి సింగర కొండకు ప్రతి 30 నిముషాలకు బస్సులు ఉన్నాయి. కారు ద్వారా వెళ్ళు యాత్రీకులు అద్దంకి నుంచి సింగర కొండ మార్గంలో వెళ్లాలి.

సమీప దర్శనీయ ఆలయాలు[మార్చు]

  • అయ్యప్పస్వామి ఆలయం
  • షిర్డీ సాయిబాబా ఆలయం
  • శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం
  • శ్రీ గాయత్రీమాత ఆలయం
  • కొండపైనెలకొనియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం
  • శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం:- శింగరకొండ సమీపంలోని అయ్యప్ప ఆలయం వద్ద, నార్కేటుపల్లి రాష్ట్రీయ రహదారికి దగ్గరిలో, కె.ఆర్.కె.ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా, రెండున్నర సంవత్సరాల క్రితం, రు. 3 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన, 99 అడుగుల ఎత్తయిన అభయాంజనేయస్వామి విగ్రహం నిర్మాణం పూర్తి అయింది. 2014, మే నెల, 19న విగ్రహావిష్కరణ చేసారు. ఇక్కడ 18 నుండి 23 వరకు హనుమజ్జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడ 30,000 మందికి అన్నదానం నిర్వహించారు.[2][1]
  • శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

ఎస్.కె.జె.జె.ఎస్.ఎస్. వృద్ధుల ఆశ్రమం[మార్చు]

ఈ ఆశ్రమం కొండపై నృసింహస్వామివారి ఆలయానికి వెళ్ళే మెట్ల దారిలో ఉంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఈనాడు ప్రకాశం; 2014, మే-20; 16వపేజీ.
  2. ఈనాడు ప్రకాశం; 2014, మార్చి-5; 7వపేజీ.

వెలుపలి లింకులు[మార్చు]