ఆస్తానయె షామీరియా

వికీపీడియా నుండి
(ఆస్తాన్-ఎ-షామీరియా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆస్తానయె షామీరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్‌ఆర్ జిల్లా, కడప నగరంలో గల దర్గా. దీనినే షామీరియా దర్గా అని పిలుస్తారు. కడప పట్టణంలోని కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా బుగ్గవంక ఎడమ గట్టు మీద ఈ షామీరియా దర్గా ఉంది.


చరిత్ర[మార్చు]

షామీరియా దర్గాను కడపలో నెలకొల్పింది కమాలుద్దీన్ బాద్ షాహ్. ఇతని పూర్వీకులు పూర్వపు రష్యా (USSR) కు చెందిన బుఖారా (ప్రస్తుతము ఉజ్బెకిస్తాన్లో ఉంది) ప్రాంతానికి చెందినవారు. వీరు ఆఫ్ఘానిస్తాన్ మీదుగా భారతదేశంలోనికి ప్రవేశించారు. ఇప్పటి పాకిస్తాన్కు చెందిన వుఛ్ ప్రాంతం నుంచి గుల్బర్గాకు అటు నుంచి కడపకు వచ్చారు.కమాలుద్దీన్ బాద్ షాహ్ బాల్యం వుఛ్ లో గడిచింది. అప్పటి ఒక సంఘటన - కమాలుద్దీన్ మసీదులో ఆడుకుంటున్నాడు. అక్కడ ఒక శవాన్నుంచుకుని పెద్దలు ప్రార్థన చేస్తున్నారు. కమాలుద్దీన్ ఆ శవాన్ని చూశాడు. 'ఖూమ్ బి ఇజ్ నిల్లాహ్ ' అన్నాడు. 'దేవుని ఆజ్ఞతో లెమ్ము ' అని ఆ వాక్యానికి అర్థం. శవానికి ప్రాణం వచ్చింది. ఆ తర్వాత అతని తండ్రి కొడుకును వారించాడు: "ఇలాంటి మహిమ గల వాక్కులు పలుకవద్దని". తండ్రి కొడుకులు ఇద్దరూ గుల్బర్గా వచ్చారు. కమాలుద్దీన్ బాద్షాహ్ గుల్బర్గా నుంచి కడపకు వచ్చాడు. వీరిని గుల్బర్గా ఖాజా బందా నవాజ్ వంశీకులు అంటారు. తాను నిర్మించుకున్న దర్గాకు తానే పీఠాధిపతి కమాలుద్దీన్ బాద్ షాహ్.అతని వంశం వారే ఆ దర్గాకు పీఠాధిపతులు అవుతున్నారు.

దర్గా పక్కనే మసీదు ఉండేది. ఆ స్థానంలోనే ఇప్పటి కొత్త మసీదు నిర్మించారు. పాత మసీదు కట్టించింది పూర్వ పీఠాధిపతి బేరంగ్ సయ్యద్ మహమ్మద్ హుసేనీ. ఈ మసీదు నిర్మాణం హిజరీ 1230 (సా.శ1810) లో జరిగింది. వైఎస్ఆర్ జిల్లా కలెక్టరుగాను, మద్రాసు గవర్నరుగాను పనిచేసిన మన్రో దొర ఈ మసీదు నిర్మాణానికి ఇనాములు ఇవ్వజూపాడు. పీఠాధిపతి హుసేనీ స్వీకరించలేదు. దర్గా పక్కనే ఉన్న దీవాన్ సాహెబ్ అనే ఫకీరు చెయ్యి చాపాడు. ఆయనకు నెలకు 4 రూ, లు భృతి మన్రో దొర ఏర్పాటు చేశాడు. ఆ భృతి వంశపారంపర్యంగా నడచింది. దర్గాలో పూర్వ పీఠాధిపతులు ముగ్గురు మహనీయుల సమాధులున్నాయి. ఆ మహనీయులు సయ్యద్ మహమ్మద్ హుస్సేనీ, ఖాదిర్ బాద్ షాహ్ అబ్ద్, అబ్దుల్ హఖ్ అలియాస్ షామీర్ బాద్ షాహ్ (ఇతని పేరు మీదే ఇక్కడ ఉరుసు జరుగుతుంది).

ఉత్సవాలు[మార్చు]

ప్రతి సంవత్సరం రంజాన్ ముందటి షాబాన్ మాసంలో 23వ రోజు నుంచి 26వ రోజు దాకా 4 రోజులు ఉరుసు జరుగుతుంది. మొదటి రోజు ధ్యానం, రెండో రోజు ముషాయెరా (కవి సమ్మేళనం), మూడో రోజు తఖారీర్, నాలుగో రోజు ఫకీర్ మేళా ఉంటాయి. పీఠాధిపతులందరూ చదవనేర్చినవారు, వ్రాయనేర్చినవారు. కవిత్వం చెప్పనేర్చినవారు. ప్రస్తుత పీఠాధిపతి నిరక్షరాస్యతను తొలగించడానికి కృషి చేస్తున్నారు. గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ధర్మనిధిని, వైద్యశాలను, ఉచిత ప్రసూతి చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సర్వమత సౌభ్రాతృత్వామే ఇతని ఆశయం.

మూలాలు, వనరులు[మార్చు]

వై.ఎస్.ఆర్. జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి, విద్వాన్ కట్టా నరసింహులు