ఈమని శివనాగిరెడ్డి
ఈమని శివనాగిరెడ్డి | |
---|---|
![]() ఈమని శివనాగిరెడ్డి | |
జననం | వలివేరు గ్రామం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా | 1955 ఏప్రిల్ 15
వృత్తి | సాంప్రదాయ వాస్తుశిల్పి,చరిత్ర కారుడు,పురాతత్వవేత్త |
క్రియాశీల సంవత్సరాలు | 1978 - Present |
వీటికి ప్రసిద్ధి | హిందూ దేవాలయ వాస్తుశిల్పం, చరిత్ర పరిశోధన |
జీవిత భాగస్వామి | రాజ్యలక్ష్మి |
పిల్లలు | ప్రియంవద, హర్షవర్థని |
తల్లిదండ్రులు | ఈమని అన్నపూర్ణమ్మ, భూషిరెడ్డి |
ఈమని శివనాగిరెడ్డి ప్రముఖ స్థపతి, చరిత్రకారుడు, పురాతత్వవేత్త,[1] రచయిత. అనేక స్థలాల్లో పురావస్తు తవ్వకాల్లో పాల్గొన్నారు. ముంపుకు గురైన ఎన్నో పురాతన ఆలయాలను విడదీసి, ఎగువన పునర్నిర్మించే బాధ్యతలు నిర్వహించారు. చరిత్ర, శాసనాలు, పురాతన స్థలాలు, కట్టడాలు, ఆలయాలు, బౌద్ధ, జైన స్థావరాలపై అనేక పుస్తకాలు రాశారు. మహాబలిపురానికి చెందిన ప్రముఖ స్థపతి పద్మశ్రీ వి. గణపతి స్థపతి ద్వారా ‘వాస్తు శిల్ప వాచస్పతి’ అనే బిరుదును పొందారు.
బాల్యం
[మార్చు]శివనాగిరెడ్డి స్వస్థలం బాపట్ల జిల్లా, తెనాలి సమీపంలోగల వలివేరు. ఈయన 1955, ఏప్రిల్ 15న జన్మించారు.[2] తల్లిదండ్రులు ఈమని అన్నపూర్ణమ్మ, భూషిరెడ్డి. ఇద్దరూ వ్యవసాయ కూలీలు. ఎలాగోలా కష్టపడుతూ తమ కుమారునికి చదువు చెప్పించారు. ఎడ్లపల్లి హైస్కూలులో 1972లో పదో తరగతి పాసయ్యాక తెనాలిలోని విఎస్ఆర్ కాలేజీలో ఎమ్ఈసీలో ఇంటర్లో చేరారు శివనాగిరెడ్డి. అయితే ఇంటర్ మొదటి సంవత్సరం వరకు మాత్రమే చదివి, ఫీజులు చెల్లించడానికి ఆర్థిక స్థోమతలేక చదువుని ఆపేశారు. ఈ క్రమంలో శివనాగిరెడ్డికి 7,8 తరగతుల్లో తెలుగు బోధించిన వేదాల రంగాచార్యులు అనే తెలుగు ఉపాధ్యాయుడు చొరవ చూపించి, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ వాస్తు శిల్ప కళాశాలలో ఉచిత వసతితో చదువుకునే అవకాశాన్ని కల్పించారు. అక్కడే 1973-77 వరకూ నాలుగేళ్ళ పాటు శిల్పాలు చెక్కడం, ఆలయాలను నిర్మించడంలో కఠోర శిక్షణ పొంది డిప్లొమా పూర్తిచేస్తూ, మరోవైపు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో దూరవిద్య ద్వారా బికామ్ డిగ్రీ పాసయ్యారు. 1977-78లో జీవనభృతి కోసం టిటిడిలో ఆరు రూపాయల వేతనానికి దినసరి శిల్ప కార్మికుడిగా చేరారు.
ఉద్యోగం
[మార్చు]శిల్పకళాశాలలో డిప్లొమా చేస్తున్న సమయంలోనే శిల్పాలు చెక్కడం, ఆలయ నిర్మాణ శిక్షణ పొందడం వంటివాటిలో నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు. శిల్పకళలపై డిప్లొమాలో అన్ని విభాగాల్లోనూ ప్రథమునిగా ఉత్తీర్ణుడయ్యారు. ఆయన ప్రతిభని గుర్తించిన రాష్ట్ర దేవాదాయశాఖ కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల్లోని శ్రీశైలం నీటిముంపు ప్రాంత దేవాలయాల తరలింపు కార్యక్రమంలో సహాయ స్థపతిగా ఉద్యోగాన్నిచ్చింది. అలా 1978లో మహబూబ్గనర్ జిల్లా అలంపూర్ నుంచి శివనాగిరెడ్డి ఉద్యోగప్రస్థానం మొదలైంది. పురాతన నిర్మాణాలకి పునరుజ్జీవనాన్నిస్తూ తాను చదువుకున్నది ఆలయనిర్మాణం ప్రధానవృత్తిగా అవకాశం రావడం ఎంతగానో మేలు చేసింది. మునిగిపోతున్న ప్రాంతాల్లో పురాతన ఆలయాలు, వాటిపై శిల్పకళ, ఆలయాలని విడదీయడం, ప్లాన్లు తయారీ, తరలింపు వంటి కార్యాచరణలో శివనాగిరెడ్డి నిమగ్నమైపోయారు. అలంపూర్లో కృష్ణా-తుంగభద్రల సంగమంలోని కూడలి సంగమేశ్వరం సమీపంలోని గొందిమల్ల, చాగుటూరు, ఉప్పలపాడు, అలంపూరులోని పిచ్చుకగుళ్ళు, బుగ్గ రామేశ్వరాలయం, పోగలూరు, మార మునగాల దేవాలయాలు, కొల్లాపూర్ తాలూకాలోని మల్లేశ్వరం, మంచాలకట్ట, రామతీర్థం, జటప్రోలు, ఈర్లదిన్నె, సోమశిల, చిన్నమారూరులలోని చాళుక్య, రాష్ట్రకూట, కందూరి చోళ, కళ్యాణి చాళుక్య, కాకతీయ, విజయనగర రాజులు కట్టించిన ఆలయాలను విడదీసి, ఎగువన పునర్నిర్మించే పథకానికి ఎస్.ఎం. గణపతి స్థపతి గారి పర్యవేక్షణలో ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఆలయ నిర్మాణంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన పద్మశ్రీ ఎస్.ఎం. గణపతి స్థపతికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు.[3] శ్రీశైలం జలాశయ నీటి ముంపు దేవాలయాల తరలింపులో భాగంగా కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల్లోని 102 గ్రామాల్లో ముంపునకు గురైన దాదాపు 100 దేవాలయాలను ఊడదీసి ఎగువన పునర్నిర్మించే కార్యక్రమంలో పద్మశ్రీ ఎ. వేలు, డా. బి. సుబ్రమణి, ఇంకా అనేక తమిళ స్థపతులతో కలిసి పాల్గొన్న ఘనతను దక్కించుకొన్న శివనాగిరెడ్డి ఆలయ జీర్ణోద్ధరణ, నిర్మాణంలో సహాయకునిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
పురావస్తు శాఖ
[మార్చు]స్థపతిగా దేవాదాయశాఖలో పనిచేస్తున్న శివనాగిరెడ్డి 1981లో రాష్ట్ర పురావస్తుశాఖలో ఉద్యోగిగా చేరారు. ఒక పక్క పురాతన స్థలాల్లో తవ్వకాల్లో పాల్గొంటూ, మరోపక్క పురావస్తుశాస్త్రం, భారతీయ సంస్కృతి, లిపి అధ్యయన శాస్త్రాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా ఎంఏ డిగ్రీ ('ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కల్చర్ అండ్ ఆర్కియాలజీ' - ప్రాచీన భారత చరిత్ర, సంఅకృతి, పురావస్తు శాస్త్రం) పూర్తి చేసారు. 1989-94 మధ్య కాలంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 'ప్రాచీనాంధ్ర దేశంలో కట్టడకళ-సాంకేతికాంశాలు' ('ఎవల్యూషన్ ఆఫ్ బిల్డింగ్ టెక్నాలజీ ఇన్ ఎర్లీ అండ్ మిడైవల్ ఆంధ్ర') అనే అంశంపై పీహెచ్డీ చేశారు. ఇలా ఉన్నత విద్యని సొంతం చేసుకుంటూనే పురావస్తుశాఖలో తన గురుతర బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి పురావస్తుశాఖ సంచాలకుడు డాక్టర్ వివి కృష్ణశాస్త్రి చేపట్టిన తెలంగాణ ప్రాంతంలోని కాకతీయ హెరిటేజ్ ప్రాజెక్టులో కీలకంగా మారారు. జాకారం, నిడికొండ, గొడిశాల, రామానుజపురం, ఘన్పూర్లలోని ఆలయాలను విడదీసి, పునర్నిర్మించారు. ఇనుప యుగపు స్థలాలైన శేరుపల్లి, పిన్నాపురంతో పాటు, చాగటూరు, ఉప్పలపాడు, క్యాతూరు తదితర చారిత్రక తొలియుగపు స్థలాల్లో డా. బి. సుబ్రహ్మణ్యం గారితో కలిసి పురావస్తు తవ్వకాల్లో పాల్గొన్నారు.[2]
సంస్థలు
[మార్చు]వృత్తి, ప్రవృత్తి ఒకటే కావడం శివనాగిరెడ్డికి తగిన గుర్తింపుని తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, పలు విశ్వవిద్యాలయాలు నిర్వహించిన చరిత్ర, పురావస్తు శాస్త్ర సంబంధిత సదస్సుల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1996 నుంచి ఇగ్నోలో పర్యాటక అధ్యయన కోర్స్కు అకడమిక్ కౌన్సెలర్గా పనిచేస్తూ ఆ అనుభవంతో 2003లో 'ఏపీలో పర్యాటకం-వనరులు- అవకాశాలు' అనే పుస్తకాన్ని రాశారు. ఇప్పటికీ దేశంలో ఎక్కడ ఏ సంస్థ అయినా చరిత్ర, పురావస్తుశాస్త్ర సదస్సులు నిర్వహిస్తే అక్కడ శివనాగిరెడ్డి ఉండి తీరాల్సిందే. 2012-2014 మధ్య హైదరాబాద్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్గా ఉన్న సమయంలో మాలక్ష్మి సంస్థల అధినేత యార్లగడ్డ హరిశ్చంద్రప్రసాద్ గారి ఆహ్వానంపై విజయవాడ మొఘల్రాజపురంలోని కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతికి సిఇఓగా శివనాగిరెడ్డి 2015 నుంచి 2020 వరకు బాధ్యతలు నిర్వహించారు. 2021లో డా. తేజస్విని యార్లగడ్డ అధ్యక్షులుగా ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ ఏర్పాటైన తరువాత ఆ సంస్థ సీఈఓగా దేశ వారసత్వ సంపద పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి ఎన్నో అవార్డులు, బిరుదులు పొందాడు.[2]
బౌద్ధ స్థలాల వెలికితీత
[మార్చు]శ్రీకాకుళం జిల్లా దంతపురి, విశాఖ జిల్లా తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ, గోపాలపట్నం తదితర ప్రాంతాల్లోని ప్రాచీన బౌద్ధ క్షేత్రాల తవ్వకాల్లో పాల్గొని విస్తృత పరిశోధనలు చేశారు. ఇటీవలికాలంలో అనేక బౌద్ధ క్షేత్రాలను మొదటిసారిగా కనుగొన్నారు. గుణదల, మొగల్రాజపురం ధనంకొండ, ముస్తాబాదు బౌద్ధ గుహల్ని వెలికితీశారు. అనంతపురం జిల్లా కదిరి దగ్గర శిలాయుగపు చిత్రకళా ప్రదేశాలను కనుగొన్నారు. త్రిపురాంతకం ఒకనాటి బౌద్ధక్షేత్రమని నిర్ధారించారు.
రచనలు
[మార్చు]
చారిత్రక తవ్వకాలు, పరిశోధనలు, సదస్సులకే ఆయన కృషి పరిమితం కాలేదు. ఇప్పటివరకూ 120 కి పైగా పుస్తకాలు రాసి చారిత్రక వారసత్వంపై ప్రజల్లో చైతన్య తీసుకొస్తున్నారు.[4] కేవలం తెలుగులోనే కాదు, అంగ్లంలో కూడా 'ఎవల్యూషన్ ఆఫ్ బిల్డింగ్ టెక్నాలజీ ఇన్ ఆంధ్రా, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్, టెంపుల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...' తదితర ప్రామాణికమైన రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ గ్రంథాలు రాశారు. బౌద్ధంపై ఎన్నో పుస్తకాలు రాశారు. పురావస్తు తవ్వకాలలో లభించిన శాసనాలను వర్గీకరించి, ఆయా కాలానుగుణంగా పుస్తకాలు రూపొందించిన శివనాగిరెడ్డి ప్రస్తుతం 'శాసనభారతి' అనే సమగ్ర సంపుటి నిర్మించారు. భారతి మాసపత్రికలలో ప్రచురించిన 155 శాసనాలను, వాటిపై వ్యాసాలను ఒకచోట చేర్చి, ఈ బృహత్సంపుటాన్ని తీసుకొచ్చారు. వీటితో పాటు 'ముస్లిం పాలకుల తెలుగు శాసనాలు, అశోకుని శాసనాలు' సంపుటాలు వచ్చాయి.[2]
రచనల జాబితా
[మార్చు]- సోమశిల దేవాలయాల చరిత్ర-శాసనాలు (1996)
- శిల్పిన్స్ ఇన్ ఎర్లీ అండ్ మెడైవల్ ఆంధ్ర, త్రివేంద్రం (1997)
- ఎవల్యూషన్ ఆఫ్ బిల్డింగ్ టెక్నాలజీ ఇన్ ఎర్లీ ఎండ్ మిడైవల్ ఆంధ్రప్రదేశ్, 2 వాల్యూములు, న్యూ ఢిల్లీ (1998)
- బుద్ధిస్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ (1998)
- ప్రాచీనాంధ్ర బౌద్ధ శిల్పులు, హైదరాబాదు (2000)
- దంతపురం యాన్ ఎర్లీ బుద్ధిస్ట్ సైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు (2002)
- లోటస్ పెటల్స్ : బుద్ధిస్ట్ సైట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్,హైదరాబాదు (2002)
- ఉదయిని : పానగల్లు ఉత్సవ సంచిక, హైదరాబాదు (2002)
- ఆంధ్రప్రదేశ్లో టూరిజం : వనరులు, అవకాశాలు, హైదరాబాదు (2003)
- కాలచక్ర సాధన, హైదరాబాదు (2006)
- అలంపూర్, హైదరాబాదు (2006)
- బుద్ధిస్ట్ ఆర్కియాలకీ ఇన్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు (2008)
- తెలుగు లిపి, భాషలకు, ఈ శాసనాలే శ్వాసనాళాలు, హైదరాబాదు (2009)
- శ్రీకృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, హైదరాబాదు (2009)
- కొండవీటి రెడ్డిరాజులు, కడప (2010)
- హేండ్బుక్ ఫర్ ఆర్కియలాజికల్ గైడ్స్, హైదరాబాదు (2010)
- ఆంధ్రప్రదేశ్లో పురావస్తు పరిశోధనలు, హైదరాబాదు (2011)
- బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు (2011)
- తెలుగు శిల్పులు, హైదరాబాదు (2012)
- తెలుగువారి దేవాలయాలు, హైదరాబాదు (2012)
- కల్చరల్ కాంటూర్స్ ఆఫ్ హిస్టరీ & ఆర్కియాలజీ 11 వాల్యూములు, ఢిల్లీ (2012)
- బుద్ధుని చివరి రోజులు, హైదరాబాదు (2012)
- ఎన్సిఅక్లోపీడియా ఆఫ్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్, 3 వాల్యూములు, ఢిల్లీ (2012)
- శ్రీ ఉమామహేశ్వర దేవాలయం కూడేరు, హైదరాబాదు (2012)
- శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం, అవనిగడ్డ, హైదరాబాదు (2013)
- బోధిసిరి, ఎ ఫెస్ట్ష్రిఫ్ట్ టు అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఢిల్లీ (2013)
- బుద్ధిస్ట్ హెరిటేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు (2014)
- కాకతీయ కళానిలయం - రామప్ప దేవాలయం, హైదరాబాదు (2014)
- హెరిటేజ్ స్కల్ప్చర్ పార్క్, హైదరాబాదు (2014)
- స్క్రాప్ స్కల్ప్చర్ పార్క్, హైదరాబాదు (2014)
- టెంపుల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు (2014)
- స్కల్ప్చరల్ ఆర్ట్ ఆఫ్ ది తెలుగు పీపుల్, హైదరాబాదు (2014)
- లేపాక్షి దేవాలయం, హైదరాబాదు (2014)
- లేపాక్షి టెంపుల్, హైదరాబాదు (2014)
- మన శిల్పులు, విజయవాడ (2016)
- గౌతమీపుత్ర శాతకర్ణి, విజయవాడ (2016)
- తెలుగు భాష ప్రాచీనత, విజయవాడ (2016)
- తెలుగువారి తొలి తరం చరిత్ర : పురావస్తు పరిశోధనలు, విజయవాడ (2016)
- కొండవీటి వైభవం, విజయవాడ (2016)
- తెలుగువారి వారసత్వం, విజయవాడ (2016)
- ఆంధ్రదేశ చరిత్రలో కొత్త కోణాలు, గుంటూరు (2016)
- హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ : సమ్ న్యూ ఇంటర్ప్రిటేషన్స్, గుంటూరు (2016)
- కృష్ణాతీరం : కృష్ణా పుష్కర సంచిక, విజయవాడ (2017)
- యుద్ధమల్లుని బెజవాడ శాసనాలు, విజయవాడ (2017)
- చరిత్ర శకలాలు, విజయవాడ (2017)
- శ్రీకాకుళం దేవాలయ చరిత్ర, శాసనాలు, విజయవాడ (2017)
- ఆలయ నిర్మాణ శాస్త్రం, తిరుపతి (2017)
- వంచనకు గురైన పంచశీల, హైదరాబాదు (2017)
- ఆంధ్రప్రదేశ్లో బుద్ధ ధాతుపేటికలు, హైదరాబాదు (2017)
- దేశభాషలందు తెలుసులెస్స, విజయవాడ (2017)
- ధర్మచక్ర ప్రవర్తనసుత్త, విజయవాడ (2017)
- ప్రాచీనాంధ్ర బౌద్ధ శిల్పులు, విజయవాడ (2017)
- ఆంధ్రుల సమగ్ర చరిత్ర - సంస్కృతి, హైదరాబాదు (2017)
- ఘంటసాల స్థూపం - తవ్వకాలు, విజయవాడ (2017)
- శాసనపద్యమంజరి, విజయవాడ (2018)
- సోమశిల దేవాలయాల చరిత్ర - శాసనాలు, సోమశిల (2018)
- జలదంకి దేవాలయ చరిత్ర - శాసనాలు, విజయవాడ (2018)
- శ్రీకాకుళం కైఫియత్, విజయవాడ (2018)
- బుద్ధజయంతి ఉత్సవ సంచిక, విజయవాడ (2018)
- టెంపుల్ కన్స్ట్రక్షన్ డ్యూరింగ్ ది విజయనగర పీరియడ్, ఢిల్లీ (2018)
- తెనాలి చారిత్రక వైభవం, విజయవాడ (2018)
- టెంపుల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ (2018)
- కొండపల్లి చారిత్రక వైభవం, విజయవాడ (2019)
- కనకదుర్గ ఆలయ స్థల మహాత్మ్యం, విజయవాడ (2019)
- నెల్లూరు : మారుపేర్లు, విజయవాడ (2019)
- విజయనగర నాణేలు, గుంటూరు (2019)
- కోటప్పకొండ చరిత్ర శాసనాలు, విజయవాడ (2019)
- తెలుగు సవర నిఘంటువు, విజయవాడ (2019)
- సవర పూజపాటలు, విజయవాడ (2019)
- సవర పాటలు, విజయవాడ (2019)
- తెలుగు శిల్పుల చరిత్ర సంస్కృతి, విజయవాడ (2019)
- మల్లంపల్లి సోమశేఖరశర్మ సురవరం ప్రతాపరెడ్డికి రాసిన లేఖలు, విజయవాడ (2019)
- తెలుగువారి శాసనాలు, మైసూరు (2019)
- కృష్ణాతీర పర్యాటక స్థలాలు, విజయవాడ (2019)
- తెలుగు శిల్పుల వైభవం : వంశ చరిత్ర, శాసనాలు, విజయవాడ (2020)
- కోటప్పకొండ, విజయవాడ (2020)
- గుడిమల్లం పరశురామేశ్వరాలయం, విజయవాడ (2020)
- గోనబుద్దారెడ్డి రంగనాథ రామాయణంపై పరిశోధనలు, విజయవాడ (2020)
- ఆంధ్రమహావిష్ణు దేవాలయ చరిత్ర, విజయవాడ (2020)
- మావూరు కవులూరు, విజయవాడ (2020)
- కనకదుర్గ మల్లేశ్వర దేవాలయ శాసనాలు, విజయవాడ (2020)
- కలింగ ఖారవేల, విజయవాడ (2020)
- బ్రహ్మజాలసుత్త, విజయవాడ (2020)
- బుద్ధును మహాపున్నమి సూత్రం, విజయవాడ (2020)
- ఆసఫ్జాహీ కట్టడాలు, , విజయవాడ
- నాణేల ఆధారంగా తెలంగాణ చరిత్ర, హైదరాబాదు
- తెలంగాణలో బౌద్ధం, హైదరాబాదు
- బుద్ధిస్ట్ ఆర్కియాలజీ ఇన్ తెలంగాణ, హైదరాబాదు
- మీరూ శాసనాలు చదవవచ్చు, హైదరాబాదు
- రాజరాజ నరేంద్రుడు, విజయవాడ
- అలనాటి మేటి తెలంగాణ శాసనాలు, హైదరాబాదు
- తెలంగాణ శిథిలాలు : వ్యథాభరిత కథనాలు, హైదరాబాదు
- తెలంగాణలో ముస్లిం పాలకుల తెలుగు శాసనాలు, హైదరాబాదు
- దక్షిణభారత వీరులు : ముసునూరు ప్రోలయ, కాపయ సోదరులు, హైదరాబాదు
- వందేళ్ళ కింద తిరుమల తిరుపతి, విజయవాడ
- టెంపుల్స్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాదు
- అడుగుజాడల్లో ఆనవాళ్ళు 1, విజయవాడ
- తెలంగాణలో శాతవాహన వారసత్వం, హైదరాబాదు
- ఫామ్స్ ఆఫ్ టూరిజం, హైదరాబాదు
- కాజ గ్రామ చరిత్ర, శాసనాలు, హైదరాబాదు
- ప్రముఖ శాసన పరిశోధకులు పివి పరబ్రహ్మశాస్త్రి, హైదరాబాదు
- ప్రముఖ పురావస్తు పరిశోధకులు రాయప్రోలు సుబ్రహ్మణ్యం, హైదరాబాదు
- బుద్ధవంశం, హైదరాబాదు
- రాచాల గ్రామచరిత్ర, హైదరాబాదు
- తిరుమల తిరుపతి దేవస్థానాల తెలుగు శాసనాలు, తిరుపతి
- ఆలయ నిర్మాణం ప్రాసాదలక్షణం, హైదరాబాదు
- శాసనోపాసన : డా. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి జీవన ప్రస్థానం, హైదరాబాదు
- కొండపల్లి ఫోర్ట్ : ఎ కంపానియన్ గైడ్, హైదరాబాదు
- భారతదేశంలో కరువు కాటకాలు, అవనిగడ్డ (2020)
- ది విక్టోరియా జూబిలీ మ్యూజియం, ఎ కంపానియన్ గైడ్, హైదరాబాదు
- శిల్ప ఆగమ శాస్త్రాల్లో సుధాశిల్పం, తిరుపతి
- రావు బహాదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు పరిశోధక కేంద్రం రాజమండ్రి, హైదరాబాదు (2003)
- శ్రీ రాళ్ళబండి సుబ్బారావు ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాల, రాజమండ్రి, హైదరాబాదు (2003)
- పాములపాడు చరిత్ర, శాసనాలు, సాంస్కృతిక వారసత్వం విజయవాడ (2022)
- ది లెగసీ ఆఫ్ అమరావతి దెన్ అండ్ నౌ, రామచంద్రాపురం (2019)
- వలివేరు దేవాలయాల చరిత్ర - శాసనాలు, హైదరాబాదు (2009)
- శ్రీకాకుళం కైఫియత్, విజయవాడ (2019)
- బోధిసత్వ పార్క్ : జాతక పానెల్స్, విజయపురి (2014)
- ధమ్మ సంగ్రహం, హైదరాబాదు (2001)
- దేవాలయ వాస్తుశిల్ప రీతులు, హైదరాబాదు
- అమరావతి హెరిటేజ్ సెంటర్ అండ్ మ్యూజియం (కాలచక్ర మ్యూజియం), ఎ కంపానియన్ గైడ్, విజయవాడ (2016)
- కొండపల్లి చరిత్ర, విజయవాడ (2018)
- తెలుగు భాష సాహిత్యం, సంస్కృతులపై బౌద్ధమత ప్రభావం, హైదరాబాదు (2024)
పురస్కారాలు
[మార్చు]- డా. ఆర్. సుబ్రహ్మణ్యం శతాబ్ది పురస్కారం (4 జూలై 2022)
- ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారి భాషా పురస్కారం
- ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి బి.ఎన్. శాస్త్రి ధర్మనిధి పురస్కారం
- దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు పురస్కారం
- మండలి వెంకటకృష్ణారావు చరిత్ర పురస్కారం [5]
- పోలవరపు కోటేశ్వరరావు సాహితీ పురస్కారం [6]
- సురవరం ప్రతాపరెడ్డి స్మారక సాహితీ పురస్కారం [7]
- అక్కినేని నాగేశ్వరరావు అంతర్జాతీయ వినూత్నరత్న పురస్కారం
- నటశేఖర కృష్ణ జీవిత సాఫల్య పురస్కారం
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అత్యున్నత కళారత్న (హంస) పురస్కారం
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా పురస్కారం
- 2023: శిల్పకళ విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం - ప్రతిభా పురస్కారం (2021)[8]
- కవిసంధ్య ప్రతిభా పురస్కారం [9]
మూలాలు
[మార్చు]- ↑ "'పాలమూరు'కు 800 ఏళ్ల చరిత్ర". Sakshi. 2021-07-18. Archived from the original on 2021-07-17. Retrieved 2023-08-22.
- ↑ 2.0 2.1 2.2 2.3 కొచ్చెర్లకోట, డాక్టర్ శ్రీలేఖ (2018-06-30). "వాస్తు శిల్ప వాచస్పతి". andhrabhoomi.net. Archived from the original on 2020-08-12. Retrieved 2023-08-22.
- ↑ "ఆయన లేడు... బుద్ధుడున్నాడు! - ఈమని శివనాగిరెడ్డి". www.andhrajyothy.com. 2017-04-08. Archived from the original on 2017-04-09. Retrieved 2023-08-22.
- ↑ "Books authored by Emani Sivanagi Reddy". www.exoticindiaart.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-22.
- ↑ "వైభవంగా మండలి వెంకటకృష్ణారావు స్మారకోత్సవం". Telugu News International - TNILIVE. 27 September 2019. Retrieved 10 April 2025.
- ↑ Bharat, E. T. V. (13 November 2021). "Golden Jubilee: 21న కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవం". ETV Bharat News. Retrieved 10 April 2025.
- ↑ "ప్రతాపరెడ్డి స్మారక పురస్కారాల ప్రదానం రేపు". web.archive.org. 7 July 2022. Archived from the original on 7 జూలై 2022. Retrieved 10 April 2025.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Velugu, V6 (2023-08-31). "12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు". V6 Velugu. Archived from the original on 2023-08-31. Retrieved 2023-09-13.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "అభ్యుదయ భావకుడు నగ్నముని". Andhrajyothy Telugu News. 31 October 2021. Retrieved 10 April 2025.