Jump to content

భద్రాచలం

Coordinates: 17°40′N 80°53′E / 17.67°N 80.88°E / 17.67; 80.88
వికీపీడియా నుండి
భద్రాచలం
భద్రాద్రి
A View of Bhadrachalam Gopuram.JPG
భద్రాచలం is located in Telangana
భద్రాచలం
భద్రాచలం
భద్రాచలం is located in India
భద్రాచలం
భద్రాచలం
Coordinates: 17°40′N 80°53′E / 17.67°N 80.88°E / 17.67; 80.88
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ప్రభుత్వం
 • సంస్థపురపాలకసంఘం
విస్తీర్ణం
 • మొత్తం
12.00 కి.మీ2 (4.63 చ. మై)
ఎత్తు
50 మీ (160 అ.)
జనాభా
 (2011)[2]
 • మొత్తం
50,087
 • స్థానంతెలంగాణలో 40వ పట్టణం
 • సాంద్రత7,121/కి.మీ2 (18,440/చ. మై.)
భాషలు
 • అధికారికతెలుగు
కాల మండలంUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
507111
టెలిఫోన్ కోడ్08743
Sex ratio1:1 /
కొత్తగూడెం నుండి దూరం40 kilometres (25 mi)
హైదరాబాదు నుండి దూరం325 kilometres (202 mi)
Websitehttps://www.telanganatourism.gov.in

భద్రాచలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం లోని రెవెన్యూ గ్రామం,[3] జనగణన పట్టణం. ఇక్కడ భక్త రామదాసు నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము వలన పుణ్యక్షేత్రం. ఇది గోదావరి నది దక్షిణ తీరాన ఉంది. దీనిని భద్రాద్రి, శ్రీరామ దివ్యక్షేత్రం అనే పేర్లుతో కూడా పిలుస్తారుఇది పూర్వపు జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, పేరొందింది. జిల్లాలోని పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కి.మీ., మణుగూరు 35 కి.మీ., కొత్తగూడెం 40 కి.మీ. దూరంలోను ఉన్నాయి. భద్రాచలం తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్ని పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి. భద్రాచలం రెవెన్యూ డివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగంగా ఉండేది. అంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై, కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయంలో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనం చేయటం జరిగింది. తెలంగాణ ఉద్యమం తీవ్రముగా ఉన్న రోజులలో ఇది వివాదాస్పదం అయ్యింది. భద్రాచలం లో 2025 వ సంవత్సరంలో గిరిజన ప్రదర్శనశాల ఐటిడిఎ సమీపం లో కట్టించారు.

భద్రాచలంలో 2025 సంవత్సరంలో గిరిజనుల (ట్రైబల్) మ్యూజియమ్ నిర్మాణం పూర్తై ఉపాధి మరియు ఆకర్షణార్థం గా ప్రజలకు తెరచారు. ఈ ట్రైబల్ మ్యూజియం భద్రాద్రి కొత్తగూడెం (భద్రాచలం) జిల్లా లోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ITDA) ప్రాంగణంలో ఉన్నది. [4]

భద్రాచలం పట్టణం

[మార్చు]

భద్రాచలం గ్రామ పంచాయితీ 1962లో మద్రాసు గ్రామ పంచాయితీ చట్టం క్రింద ఏర్పడింది. తరువాత 26.07.2001న వచ్చిన ప్రభుత్వం చట్టం GOMs.No.245 (PR & RD) ప్రకారం ఇది ఒక పట్టణంగా గుర్తించబడింది. G.O.Ms.No.118 (PR & RD) తేది. 08.04.2002న, ప్రకారం ఈ పట్టణం పేరు "శ్రీరామ దివ్య క్షేత్రం" అని మార్చబడింది.[5] హర్షభద్రాచలం టౌన్షిప్ గా తరువాత మునిసిపాలిటిగా ఎదిగినప్పటికీ 1/70 ఆక్ట్ అనుసరించి మరల దీనిని గ్రామపంచాయితీగా మార్చుట జరిగింది.

భద్రాచలంలోని ప్రధాన విద్యాసంస్థలు

[మార్చు]
  • కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)
  • తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల
  • ప్రభుత్వ జూనియర్ కళాశాల
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల
  • త్రివేణి జూనియర్ కళాశాల
  • మదర్ థెరిసా డిగ్రీ కళాశాల
  • గవర్నమెంట్ పి. జి కళాశాల
  • మారుతి నర్సింగ్ కళాశాల
  • భద్రాచలం పబ్లిక్ పాఠశాల
  • శ్రీ సరస్వతి ఒకేశనల్ నర్సింగ్ జూనియర్ కళాశాల
  • డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్ కళాశాల
  • ఎ ల్ .ఎఫ్ జూనియర్ కళాశాల
  • ఎల్.ఎఫ్ ప్రాథమిక పాఠశాల
  • యూత్ ట్రైనింగ్ సెంటర్ (ytc) ఐ.టి.డి.ఎ రోడ్
  • ఎస్ టి అన్నాస్ వున్నత పాఠశాల
  • శ్రీ చైతన్య పాఠశాల
  • సి. బి.ఎస్ .సి పాఠశాల
  • శ్రీ విద్యా పాఠశాల

గణాంక వివరాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 89,048 - పురుషులు 44,029 - స్త్రీలు 45,019.

రామాలయ ప్రశస్తి

[మార్చు]
భద్రాచలంలో ఒక మండపం
భద్రాచల దేవస్థానx వద్ద రామదాసు విగ్రహం

పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడుకి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధంగా వరం పొందాడని అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాతి కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం (భద్ర + అచలం) అని పేరు స్థిరపడింది.

గ్రామ చరిత్ర

[మార్చు]
భద్రాచలం దేవస్థానం
భద్రాచల దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణుల మూల విగ్రహాలు

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు ఆయా గ్రామాలను. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను, ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలతోపాటు అన్ని గ్రామాలు, భద్రాచలం మండలం లోని భద్రాచలం పట్టణం తప్ప అన్ని గ్రామాలు, బూర్గంపాడు మండలం లోని సీతారామనగర్, శ్రీధర-వేలేరు, గుంపనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట, పెద్ద రావిగూడెం ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర - జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను 2014 మే 29న గెజిట్-లో ప్రచురించారు.[6]

పురాణ గాథ

[మార్చు]

భద్రాచలం దండకారణ్యంగా ప్రసిద్ధి చెందిన అడవిప్రాంతం. శ్రీరాముడు తన భార్య సీతాదేవి, తమ్ములు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడితో కలిసి వనవాస కాలంలో ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ నివసిస్తున్న భరద్వాజ మహర్షిని దర్శించి, ఆయన సూచనల మేరకు నేటి భద్రాచలానికి సమీపంలోని పంచవటి ప్రాంతంలో వర్ణశాల నిర్మించుకుని అక్కడ నివసించసాగాడు.

ఒకసారి గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద రాయిపై శ్రీరాముడు, సీతాదేవి కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. అది వారికి రోజూ సుఖాసనంలా మారిపోయింది. అలా ఒక రోజు ఆ రాయిని చూస్తూ, సీతాదేవి—ఇంతకుముందు రాతిరూపంలో ఉన్న అహల్యను మీరు కరుణించారు కదా, అలాగే ఈ రాతి మీద కూడా కరుణ చూపకూడదా? అని శ్రీరాముణ్ని అడిగింది. దానికి శ్రీరాముడు—ఈ రాయి కాలక్రమంలో నాకు మరింత ప్రీతికరమైన ఒక మహత్తర జన్మను పొందుతుంది—అని సమాధానం చెప్పారు.

హిమవంతుని తర్వాత అత్యంత శ్రేష్ఠుడైన పర్వతరాజు మేరువు. అతనికి సంతానం లేకపోవడంతో బ్రహ్మదేవుని కఠిన తపస్సుతో ప్రార్థించాడు. బ్రహ్మదేవుని వరప్రసాదంతో అతనికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి భద్రుడు అని పేరు పెట్టి, వశిష్ట మహర్షి వద్ద సమస్త విద్యలు నేర్పించాడు. భద్రుడు చిన్న వయస్సులోనే శ్రీరామునిపై అపారమైన భక్తితో, నిరంతరం ఆయన నామస్మరణలో నిమగ్నమై ఉండేవాడు.

ఒక రోజు నారద మహర్షి భద్రుని ఇంటికి వచ్చాడు. అతి చిన్న వయస్సులోనే అతి గొప్ప భక్తి, వైరాగ్య లక్షణాలు కలిగిన ఆ బాలుడిని చూసి నారదుడు ఆశ్చర్యపోయాడు. తన దివ్యదృష్టితో పరిశీలించగా, ఇంతకు ముందు రాయి రూపంలో ఉన్నవాడే ఇప్పుడు పర్వతరాజు కుమారుడిగా జన్మించిన భద్రుడని తెలుసుకున్నాడు. వెంటనే అతనికి రామతారక మంత్రాన్ని ఉపదేశించాడు.

దీంతో భద్రుడు గోదావరి నది ఒడ్డున, గతజన్మలో తాను రాయిగా ఉన్న అదే ప్రదేశానికి చేరుకుని, రామతారక మంత్ర జపంతో ఘోరమైన తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చిన శ్రీరాముడు ప్రత్యక్షమై, కోరుకున్న వరం అడగమన్నారు.

అప్పుడు భద్రుడు—శ్రీరాముని పాదసేవ తప్ప నాకు మరే కోరిక లేదు. మీరు ఎల్లప్పుడూ నా శిరస్సుపై నివసిస్తూ ఉండేలా వరం ఇవ్వండి—అని ప్రార్థించాడు. శ్రీరాముడు అతని కోరికను అంగీకరించి, తాను సీతాదేవితో, తమ్ములతో కలిసి భద్రుని శిరస్సుపై నివసిస్తానని వరం ఇచ్చాడు.

పర్వతరాజు కుమారుడైన భద్రుడు ఒక చిన్న కొండగా రూపాంతరం చెంది, తన శిరస్సుపై శ్రీ సీతారామచంద్రులను మోస్తూ ఉండటంతో, ఆ ప్రాంతానికి భద్రాచలం (భద్రుని కొండ) అనే నామం ఏర్పడింది.

ఒకప్పుడు నాగలోకానికి రాజు అయిన ఆది శేషుడు రాక్షసుల వలన గొప్ప బాధలు ఎదుర్కొనవలసి వచ్చింది. ఆయన గోదావరి నది ఒడ్డుకు వచ్చి, ఒక అగ్నిగుండం రగిల్చి, హోమంచేసి, పరమ శివుని గూర్చి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఒక శూలాన్ని ప్రసాదించాడు. ఆ శూలం ధరించి ఆదిశేషుడు రాక్షసులను సంహరించాడు. ఆయన హోమంచేసిన చోట ఒక చిన్న గుంట ఏర్పడి ఒక కొలనుగా మారింది. దానికి శేష తీర్థమని పేరు వచ్చింది. హోమం చేసిన గుంట వల్ల ఏర్పడింది గనుక ఆ కొలనులో నీళ్లు వేడిగా వుంటాయి. అందుకే దీనిని ఉష్ణుగుండం అని గూడ అంటారు. భద్రాచలం అనే వూరుకు కొంచెం దూరంగా ఈ శేష తీర్ధం ఉంది.[7]

శ్రీ సీతారాములు వనవాస కాలంలో ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు, శబరి అనే ఒకామె, ఈ అడవిలో దొరికే మధురమైన ఫలాలను వారికి యిచ్చి, స్వయంగా దగ్గరే కూచుని తినిపించింది. దానికి ఎంతో సంతోషించిన శ్రీరాముడు చరిత్రలో ఆమెపేరు శాశ్వతంగా వుండిపోయేటట్లు వరం యిచ్చాడు. ఆమె ఒక నది రూపంగా మారి ఇక్కడ ప్రవహిస్తూ, ఇప్పటికి శ్రీరాముని కొలుచుకుంటూ ఉంది. భద్రాచలం వూరుకు సుమారు ముప్పయి కి.మీ. దూరంలో వున్న ఈ శబరినది. ఇక్కడి నుంచి ప్రవహించుకుంటూ కొంత దూరం సాగిపోయి గోదావరి నదిలో కలుస్తుంది.

భక్త రామదాసు - ఆలయ నిర్మాణం

[మార్చు]

క్రీ.శ. 1620 ప్రాంతంలో, భద్రాచలానికి సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క నివసించేది. ఒక రాత్రి ఆమెకు కలలో శ్రీరాముడు దర్శనమిచ్చి, సమీపంలోని అడవిలో ఫలానా చోట తాను విగ్రహరూపంలో ఉన్నానని తెలిపాడు. మరుసటి రోజు దమ్మక్క ఆ విషయాన్ని గ్రామస్తులకు వివరించి, వారిని వెంటబెట్టుకొని అడవిలోకి వెళ్లి వెతికింది. అక్కడ రాళ్లూ, ఆకుల మధ్య పడి ఉన్న సీతారాముల విగ్రహాలు కనిపించాయి.

గ్రామస్తుల సహాయంతో ఆ విగ్రహాలను దమ్మక్క శుభ్రపరిచి, అక్కడే తాటియాకులతో ఒక చిన్న పాక వేసి, సీతారాములను ప్రతిష్ఠించింది. అప్పటి నుంచి ప్రతిరోజూ తానే స్వామివారి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించేది.

ఒకరోజు దమ్మక్క పనిమీద పొరుగూరికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు పది–పన్నెండేళ్ల వయస్సున్న తన కుమార్తెకు స్వామివారికి పూజచేసి నైవేద్యం పెట్టమని చెప్పింది. ఆ పిల్ల పూజ చేసి నైవేద్యం సమర్పించి, స్వామీ స్వీకరించమని వేడుకుంది. ఎంతోసేపు గడిచినా నైవేద్యం అలాగే ఉండిపోవడంతో, తల్లి తిడుతుందేమోనని భయపడిన ఆ అమాయక ప్రాయపు బాలిక—నైవేద్యం స్వీకరించకపోతే తాను ప్రాణత్యాగం చేస్తానని స్వామితో మొరపెట్టుకుంది. ఆ నిష్కల్మషమైన భక్తికి మెచ్చి శ్రీరాముడు ప్రత్యక్షమై స్వయంగా నైవేద్యం ఆరగించాడు.

కొంతసేపటికి దమ్మక్క తిరిగి వచ్చి నైవేద్యం ఏమయ్యిందని అడగగా, స్వామివారే తిన్నారని ఆ అమ్మాయి చెప్పింది. అలా జరగడం అసాధారణమని భావించిన దమ్మక్క, ఆ పిల్లే తినివేసి అబద్ధం చెబుతుందని అనుకుని ఆమెను శిక్షించబోయింది. అప్పుడు విగ్రహాల నుంచే—నిజంగా నేనే నైవేద్యం స్వీకరించాను—అని స్వామివారి వాక్కు వినిపించింది. ఇన్నాళ్లూ సేవ చేసిన తనకు కలగని భాగ్యం తన అమాయక కుమార్తెకు కలగడం చూసి దమ్మక్క అపారమైన ఆనందంతో ఉప్పొంగిపోయింది.

అదే కాలంలో, అదే ప్రాంతంలోని నేలకొండపల్లి అనే గ్రామంలో కంచర్ల లింగన్న, కామమ్మ దంపతులు నివసించేవారు. వారికి గోపన్న అనే కుమారుడు ఉండేవాడు. దైవభక్తి గల కుటుంబంలో పుట్టిన గోపన్న చిన్ననాటి నుంచే శ్రీరామునిపై అపారమైన భక్తి కలిగి ఉండేవాడు. ఒకసారి ఆ గ్రామానికి సాధుమూర్తి కబీరు వచ్చి, గోపన్న భక్తి, సద్గుణాలను చూసి ఆనందించి అతనికి రామతారక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ రోజు నుంచి గోపన్న నిరంతరం ఆ మంత్రాన్ని జపిస్తూ శ్రీరాముని స్మరిస్తూ జీవించేవాడు.

కాలక్రమంలో గోపన్న తల్లి–తండ్రులు ఇరువురూ పరమగతించారు. పేదరికంలో ఉన్న గోపన్నకు కుటుంబ పోషణ భారంగా మారింది. అప్పట్లో ఈ ప్రాంతమంతా గోల్కొండ రాజ్యానికి చెందినదిగా ఉండేది. గోల్కొండను పాలించిన మహమ్మదీయ నవాబు అబుల్ హసన్ తానీషా ఆస్థానంలో అక్కన్న, మాదన్న అనే అన్నదమ్ములు మంత్రులుగా ఉండేవారు. వారు గోపన్నకు మేనమామలు. గోపన్న దురవస్థను తెలిసి వారు తానీషాతో సిఫారసు చేయగా, భద్రాచల ప్రాంతానికి గోపన్నను తహసీల్దారుగా నియమించారు.

ఈ సమయంలో శ్రీరామనవమి పర్వదినం సమీపించింది. గోపన్న శ్రీరామభక్తిని తెలిసిన దమ్మక్క అతని వద్దకు వెళ్లి, అడవిలో సీతారాముల విగ్రహాలు లభించిన వృత్తాంతాన్ని తెలిపి, శ్రీరామనవమినాడు స్వామివారి కళ్యాణం జరిపించాలని కోరింది. శ్రీరాముడు గోపన్నకు ఇలవేలుపు కావడంతో, ఆ అవకాశం అతనికి అపారమైన ఆనందాన్ని కలిగించింది. గ్రామస్తులందరినీ కూడగట్టి సీతారామకళ్యాణాన్ని ఘనంగా నిర్వహించాడు.

అయితే తాటియాకుల పాకలో స్వామి నివసించడం గోపన్న హృదయాన్ని కలచివేసింది. వెంటనే ఆలయం నిర్మించాలనే సంకల్పంతో తన వద్ద ఉన్న ధనమంతా ఖర్చు చేశాడు. అది సరిపోకపోవడంతో తాను వసూలు చేసి ఖజానాలో జమ చేయాల్సిన ప్రభుత్వ ధనం—ఆరు లక్షల రూపాయలను ఉపయోగించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు.

ఈ విషయం తెలిసిన నవాబు తానీషా తీవ్రంగా ఆగ్రహించి, అనుమతి లేకుండా ప్రభుత్వ ధనాన్ని వినియోగించినందుకు గోపన్నను గోల్కొండ కోటలో బంధించి, డబ్బు తిరిగి చెల్లించమని ఆదేశించాడు. గోపన్న వద్ద చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో, పద్నాలుగు సంవత్సరాలు జైల్లో అనేక బాధలు అనుభవించాడు.

ఒక రాత్రి రాజుగారి అంతఃపురంలోకి ఇద్దరు యువకులు వచ్చి, ఆరు లక్షల రూపాయలు ఉన్న సంచిని తానీషాకు అప్పగించి—మేము గోపన్నగారి సేవకులం, మా పేర్లు రామన్న, లక్ష్మన్న—అని చెప్పి రసీదు తీసుకొని వెళ్లిపోయారు. మరుసటి రోజు గోపన్నను పిలిపించి ఈ విషయం అడిగితే, తనకు ఏమీ తెలియదని చెప్పాడు. అప్పుడు రామలక్ష్మణులే స్వయంగా వచ్చి గోపన్న ఋణాన్ని తీర్చారని అందరికీ అర్థమైంది.

ఈ సంఘటనతో తానీషా తీవ్రంగా చలించిపోయి, గోపన్న గొప్పతనాన్ని కొనియాడి, అతని పాదాలపై పడి క్షమాపణ కోరాడు. గోపన్నను ఘనంగా సత్కరించి, అనేక కానుకలతో భద్రాచలానికి పంపించాడు. ఆలయానికి విరాళాలు సమర్పించి, ప్రతిరోజూ నిత్యసేవలు జరగటానికి, ప్రతి సంవత్సరం శ్రీరామనవమినాడు సీతారామకళ్యాణం ఘనంగా జరగటానికి ఏర్పాట్లు చేశాడు. ఆ ఆనవాయితీ ఇవాళటికి కూడా కొనసాగుతోంది.

భద్రాచలానికి తిరిగివచ్చిన గోపన్న స్వామివారికి ఉత్సవం చేసి అన్నదానం జరిపించాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ అతని కుమారుడు వంటశాలలోని వేడిగంజిలో పడిపోయి మృతి చెందాడు. గోపన్న ఆ కుమారుని దేహాన్ని స్వామివారి ఎదుట ఉంచి ఆర్తిగా ప్రార్థించగా, శ్రీరాముడు కరుణించి ఆ బాలుడిని జీవించి లేపాడు.

ఇంతవరకు తాను శ్రీరాముని దాసుడనని చెప్పుకున్న గోపన్న, ఆ తరువాత రామభక్తి పరాకాష్ఠకు చేరి, రామదాసు అనే నామంతో ప్రసిద్ధి చెందాడు. ఆయనే భక్తుల హృదయాలలో నిలిచిపోయిన భద్రాచల రామదాసు.[8]

దేవాలయమందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడు.

భద్రాచలం మండలం

[మార్చు]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

మండలకేంద్రమైన భద్రాచలం యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి మహబూబాబాద్, ఇల్లందు మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

భద్రాచలం రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం రోడ్ స్టేషను అతి దగ్గరలోని రైల్వే స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి మూడు (కొల్లాపూర్ ఎక్స్ ప్రెస్, మణుగూరు ఎక్స్ ప్రెస్, కాకతీయ ప్యాసింజర్), మణుగూరు, విజయవాడ నుండి ఒకటి, రామగుండం నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.

గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి. భద్రాచలం కేంద్రంగా జరిగే విహారయాత్రల్లో ఈ జలమార్గం ప్రముఖమైనది.

వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారు భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయం చేరటానికి లిఫ్ట్‌ సౌకర్యం కలదు దక్షిణం వైపు మెట్ల నుంచి ఈ లిఫ్ట్‌ ఆలయ గాలిగోపురం ముందుకు చేరుస్తుంది.

కొన్ని వివరాలు

[మార్చు]

భద్రాచలం పట్టణం పేరును ప్రభుత్వం 2002లో శ్రీరామ దివ్యక్షేత్రం పట్టణంగా మార్చింది. భద్రాచలం రెవెన్యూ మండల జనాభాలో దాదాపు మూడోవంతు గిరిజనులు. వ్యవసాయాధారిత ఆర్థికవ్యవస్థ. పర్యాటకం మరో ప్రధాన ఆర్థిక వనరు. ప్రతీ వర్షాకాలంలోను గోదావరికి వరదలు వచ్చి భద్రాచలం పట్టణపు పల్లపు ప్రాంతాలు జలమయం కావడం సర్వసాధారణంగా ఉండేది. పట్టణ అభివృద్ధిలో భాగంగా నదికి వరదకట్టను నిర్మించిన తరువాత ఈ బెడద బాగా తగ్గింది. ప్రభుత్వ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం (ఐ.టి.డి.ఏ) భద్రాచలంలోనే ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "District Census Handbook - Khammam" (PDF). Census of India. The Registrar General & CensusCommissioner. pp. 14, 40. Retrieved 2 June 2016.
  2. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 26 July 2014.
  3. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived from the original on 2022-01-06. Retrieved 2022-07-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Admin, Site (2025-04-08). "Telangana Governor inaugurates renovated Tribal museum in Bhadrachalam -" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2026-01-22.
  5. "భద్రాచలం అధికారిక వెబ్‌సైటు". Archived from the original on 2009-01-16. Retrieved 2008-07-24.
  6. "THE ANDHRA PRADESH REORGANISATION (AMENDMENT) ORDINANCE, 2014 (NO. 4 OF 2014)" (PDF). Archived from the original (PDF) on 2020-11-28. Retrieved 2019-04-04.
  7. "BHADRACHALAM - TRIP TO INDIA - TRIP ADVISOR - Earnerscube". web.archive.org. 2023-02-11. Archived from the original on 2023-02-11. Retrieved 2024-08-22.
  8. "Badrachalam Temple Accommodation Information | Online Booking Phone Number". Hindu Temples Guide (in ఇంగ్లీష్). Retrieved 2026-01-23.
"https://te.wikipedia.org/w/index.php?title=భద్రాచలం&oldid=4742736" నుండి వెలికితీశారు