హనుమంతుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హనుమాన్
ఆంజనేయుడు
జననంమారుతి
చైత్ర శుక్ల పూర్ణిమా
కిష్కింధా
నివాస ప్రాంతంకిష్కింధ
ఇతర పేర్లుహనుమ,వాయుపుత్రుడు,అంజనీసుతుడు, బజరంగీ, కేసరీనందన, పవన తనయ
వృత్తిఅష్టసిద్ధులు
వ్యాకరణ పండితుడు
శ్రీరామబంటు
ప్రసిద్ధిశ్రీరామబంటు
తండ్రికేసరి - వాయుదేవుని అనుగ్రహము
తల్లిఅంజనాదేవి
వెబ్‌సైటు
www.kishkindha.org

శ్రీ హనుమంతుని జన్మస్థళము- పంపాక్షేత్ర "కిష్కింధా''

హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి , లేదా విగ్రహం లేని ఊరు అరుదు.

వానర జాతి[మార్చు]

ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది. ఆ వానర జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు. పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం కొనసాగించేవారు. వారిలో కొందరు వేదాలు, పురాణాలు చదువుకొన్న మహా పండితులు కూడా ఉండేవారు. మనషులకు మించిన శక్తి యుక్తులు వారి సొంతం. వారికి ప్రత్యేకత ఏమంటే వెనక ఒక తోక ఉండేది. సభ్యత సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు కూడా ఉండేవాడు. అంటే పేరుకు వానరులయినా మేధలో మనుషులకు తీసిపోని జాతి అది.

హిందూమతంలో ప్రాముఖ్యత[మార్చు]

హిందు మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడిని జయించడం చాల కష్టం అయ్యేది.హిందువులు ఎలా ఉండాలో ధర్మాన్ని ఎలా రక్షించాలి అని హిందూ ధర్మానికి ప్రతీక హనుమంతుడు

వివిధ గాధలు[మార్చు]

హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది.

సూర్యుడినిపండు అని భ్రమపడిన హనుమంతుడు[మార్చు]

హనుమంతునికి బాల్యమున అంజనా దేవి పెట్టిన పేరు ‘సుందర’ .సుందర పేరుకు అర్థము అందమైన.పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. కేసరి అనే అతను చాలా బలవంతుడు. అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉండేవాడు. మాల్యవంతం అక్కడ ఉన్న పర్వతాలు అన్నింటిలోనూ శ్రేష్టమయినది. శంబసాధనుడనే ఒక రాక్షసుడుయజ్ఞయాగాలుకు భంగం చేస్తూ దేవ ఋషులను హింసించేవాడు. దేవ ఋషులుబలవంతుడిగా పేరుబడ్డ కేసరిని పిలిచి శంబసాధనుణ్ణి చంపమని ఆజ్ఞాపిస్తారు. మునులకోరికపై శంబసాధనుడితో యుద్ధం చేసి అతన్ని నిర్జించి దేవ ఋషులకు పీడ తొలిగిస్తాడు. సజ్జన స్వభావం గల అతనికి అంజని అనే భార్య ఉంది. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను. పుట్టుకతోనే దివ్యతేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు.

జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ హనుమ పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునకి అనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేశారు.

ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది.

వజ్ర ఘాతం[మార్చు]

ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుడిని ఇంటి వద్ద వదిలి పెట్టి పళ్ళు తీసుకొని రావడానికై అడవికి వెడుతుంది అతని తల్లి. ఆకలి వేసి మెలుకువ వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరుచేసరికి ఎదురుగా ఎర్రని సూర్య బింబం కనిపిస్తుంది. ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగా భ్రమించి పట్టుకు తినడానికి ఒక్కసారి ఆకాశం పైకి ఎగురుతాడు. రివ్వుమని వాయు మనో వేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ బాలుడిని దేవతలు, మునులు, రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు. మహాశక్తిమంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతనిచుట్టూ చల్లబరుస్తుంది. సూర్యుడు కూడా ఒక్క సారిగా తనవైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడయిన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తరవీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకొన్నాడు. ఆరోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుడ్ఫి పట్టుకోవడానికి రాహువు వేగంగా సమీపిస్తునాడు. అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకువస్తున్న హనుమంతుడు కనిపించాడు. ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెల పోయాడు. ఆంజనేయుడు రాహువుకు మరో రాహువులా కనపడ్డాడు. వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు. ఇంద్రుడు వెంతనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహువుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతూన్న ఆంజనేయుడిని చూసాడు. వేగంగా వెడుతున్న ఆంజనేయుడికి ఐరావతం తెల్లగా ఒక పండులా కనిపించింది. దాన్ని చప్పున అందుకోబోయాడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుడాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహం పైకి విసిరాడు. ఆ వజ్రాయుధఘాతానికి ఆంజనేయుడి ఎడమ చంపకు బాగా నొప్పికలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతం పై పడిపోతాడు. వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది. లోకాలలో గాలి లేకుండా ఉపసమ్హరించాడు. సకల ప్రాణులు ప్రాణవాయువులేక దేహాలు స్థంబించిపోయాయి. దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మ దేవుడికి వివరించారు. బ్రహ్మ అంజనీ దేవి వద్దకు వారిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆమె బాల హనుమంతులు ఒడిలో పెట్టుకొని పెద్దగా ఏడుస్తూ ఉంది. బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు. బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాల హనుమను ఒక్క సారి నిమురగానే అతని శరీరం పై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది. బ్రహ్మ స్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్ర లోంచి లేచినవాడి వలె లేచాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలలోకి పంపించి ప్రాణులను రక్షించాడు. లోకంలో వ్యవస్థ మళ్ళీ సక్రమంగా పని చేయడం జరిగింది.

అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడ్డదికావున హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో నూరోవంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలూ నేర్పిస్తానన్నాడు. వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు. యముడు తన కాలదండం ఇతనిని ఏమీ చేయదని, మృత్యువు లేదని వరం ఇవ్వగా కుబేరుడూ, ఈశానుడూ, విశ్వకర్మ కూడా వరాలిచ్చారు. బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టిపడవేయలేదని మాటిచ్చాడు. శత్రువులకు భయాన్ని, మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామ రూపం ధరించగలవాడని అని దీవించి దేవతలని వెంటపెట్టుకొని తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు.

విద్యాభ్యాసం[మార్చు]

హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు.నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునకిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ కూడా కథ.

హనుమంతుడు మహా శక్తిమంతుడు బలశాలి అయినా సహజ సిద్ధమైన వానర లక్షణాలవల్ల కొంటెపిల్లవాడుగా మారి అల్లరి చేసేవాడు. మునుల నారచీర్యలు చింపివేయడం, అగ్ని హోత్రాలు ఆర్పివేయడం చేస్తూ వారిని విసిగించేవాడు. అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసివస్తుందని అంటారు. అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు ధ్యాస పట్టింది.

గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. సుగ్రీవుడు, అతని అన్న వాలి కిష్కింధలో ఉన్న వానరులు.

ఉద్యోగం[మార్చు]

విద్యముగిసింది. ఇక ఉద్యోగం వెతుక్కోవాలి. అప్పుడు వానరులకు ఋక్షరజనుడు రాజై కిష్కంధను రాజధానిగా చేసుకొని పాలించేవాడు. అతనికిద్దరు కొడుకులు. వాలి సుగ్రీవులు. వాలి రాజైన తరువాత సుగ్రీవునికి ఆంతరంగికుడుగా ఆంజనేయుడు పనికి కుదిరాడు.

వాలి సుగ్రీవులకు వైరం[మార్చు]

వాలి మహాబలసంపన్నుడు. రావణాసురుడంతటి వాడే అతని శక్తి ముందు తలవంచి స్నేహితుడిగా మారిపోయాడు. ఒక సారి మాయవి అనే రాక్షసుడు వాలితో యుద్ధం చేయడానికి వచ్చాడు. ద్వంద్వయుద్ధానికి ఆహ్వానిస్తాడు. వాలి సుగ్రీవులు అతని ముందుకొచ్చారు. వారిని చూడగానే మాయవికి పై ప్రాణాలు పైకే పోయాయి. భయపడి పారిపోయాడు. వాలి అతన్ని వదలక అనుసరించాడు. మాయావి ఒక బిలంలోకి దూరి మాయమయ్యాడు. వాలి సుగ్రీవునితో " నువ్వు ఇక్కడే నాకోసం వేచు ఉండు. వాడెక్కడున్నా సరే. వాడిని చంపి గాని తిరిగిరాను. " అని బిలంలోకి దూరాడు. ఏడాది పాటు ఆ బిలం దగ్గరే గడిపాడు. ఇంతలో రాక్షసుల ఆర్తనాదాలు, ఏరులై పారుతూ రక్తం బిలం నుంచి బయటకు వచ్చింది. సుగ్రీవుడు రాక్షసుల చేతిలో చని పోయాడని భావించి వాలినే జయించిన రాక్షసుడు తిరిగి బయటకు వస్తే తమ జాతి మనుగడకే ప్రమాదమని భావించి బిలాన్ని ఒక పెద్ద రాతితో మూసి విచారిస్తూ కిష్కింధకు పోయి జరిగిన సంగతి చెప్పి వాలికి అంత్యక్రియలు చేసాడు. వానర పెద్దలు సుగ్రీవుడిని రాజు చేసారు. కొన్నాళ్ళకు బిలం ముందు ఉన్నరాయిని కాలితో తన్ని కిష్కింధకు వస్తాడు వాలి. అతనికి జరిగిన సంగతి సుగ్రీవుడు చెప్పబోగా వినక తన్ని చంపడానికి సిధ్ధమవుతాడు వాలి. ఇక అక్కడ ఉంటే ప్రమాదమని భావించి సుగ్రీవుడు అరణ్యాలకు పారిపోతాడు. తన జాడ వాలికి తెలిసినప్పుడల్లా వేరే తావుకు పారిపోయి తల దాచుకొనేవాడు అతనికి కష్టకాలంలో ఉన్న నలుగురు మంత్రులలో హనుమంతుడు ఒకడు.

హనుమంతుడి మంత్రిత్వం[మార్చు]

నిజానికి వాలి కంటే హనుమంతుడు బలవంతుడు. మునుల శాపం వల్ల తన బలం గుర్తురానందువల్ల అతను సుగ్రీవునితో పాటు అడవులలోకి పారిపోవలసి వచ్చింది. ప్రతీ రోజు ప్రాణ భయంతో విలపిస్తూన్న సుగ్రీవుడితో ఒక రోజు ఇలా అన్నాడు" మీ అన్న ఒక సారి దుందుభి అన్న రాక్షసుడిని చంపాడు. వాలి అతన్ని ఎత్తి పడవేయగా ఋష్యశృంగ పర్వతం మీద తపస్సు చేస్తూన్న మతంగ మహర్షి మీద ఆ కళేబరం పడింది. కోపంతో మతంగ ముని ఈ పర్వతనికి వాలి వస్తే తలపగిలిచస్తావని శపించాడు. మీ అన్న అక్కడకు రాడు. మనం అక్కడ ఉండడం ఎంతో క్షేమం" అని హనుమంతుడు సుుగ్రీవునికి చెప్పెను.ఆ సలహా సుుగ్రీవునికి నచ్చింది. హనుమంతుడిని మెచ్చుకొని అక్కడ సుఖంగా ఉండసాగాడు.

రామ లక్ష్మణులతో స్నేహం[మార్చు]

రామ లక్ష్మణులు అడవిలో ఉంటుండగా సీతను రావణుడు అపహరించుకొని లంకకు తీసుకొనిపోతాడు. ఆమె జాడకై వెతుకుతూ వారి ఆ పర్వతాన్ని చేరుకొంటారు. వారిని చూసి వాలి తనకోసం ఇద్దరు వీరులను పంపించాడని భావించి సుగ్రీవుడు హనుమంతుడిని వెళ్ళి సంగతి కనుక్కోమని కోరాడు.

హనుమంతుడు బిక్షువుగా రూపం మార్చుకొని రామలక్ష్మణులకు అతిథి పూజ చేసి " అయ్యా! మీరు మహాపురుషులని చూస్తేనే తెలుస్తూంది ధనుర్ధారులై ఇక్కడ సంచరించడానికి కారణం ఏమిటి? నేను సుగ్రీవుడి మంత్రిని. వానరుడిని. కామరూప విద్య తెలిసినవాడిని కావటాన ఈ రూపంలోకి మారాను." అందుకు రాముడు ప్రేమతో హనుమా అని పిలిచాడు వెంటనే హనుమ రాముడికి పాదాభివందనం చేసి నిజ రూపం ధరిస్తాడు. అప్పుడు రాముడు " చూసావా లక్ష్మణా! మనమే సుగ్రీవుని కలవాలని భావించాం. అతని దూత మన వద్దకు వచ్చాడు. ఇతడి సంభాషణలో ఒక్క అపశ్రుతీ లేదు. మహా వ్యాకరణ పండితుడని తెలుస్తూంది. ఎవరినైనా ఇట్టే మాటలతో ఆకట్టుకోగలడు. " అని మెచ్చుకొని తన వృత్తాంతం అంతా చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుని గురించి చెప్పి వారిద్దరినీ తీసుకొని సుగ్రీవునికి పరిచయం చేసాడు. సీతాన్వేషణలో తాము సాయం అందించటానికి అలాగే వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసే విషయంలో రాముడు సహకరించడానికి ఒప్పందం చేసుకొని అగ్ని సాక్షిగా సుగ్రీవుడు రాముడు స్నేహితులయ్యారు. అనతి కాలంలోనే రాముడు వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసాడు. రాజయిన తరువాత సుగ్రీవుడు భోగాలను రుచి చూసి రాముడికిచ్చిన మాటను మరచిపోగా లక్ష్మణుడు కిష్కింధకు వచ్చి హెచ్చరించాడు. అప్పుడు సుగ్రీవుడు వానర వీరులను చేరపిలిచి ఒకొక్కరినీ ఒకొక్క గుంపుకు నాయకుడిని చేసి ఒకొక్క దిక్కుకు పంపుతూ కొందరు వానర వీరులతో హనుమంతుడిని దక్షిణ దిక్కుకు పంపాడు. నెల రోజుల గడువులో సీత జాడ కనుగొనాలని షరతు విధిస్తాడు.

హనుమంతుడి దళంలో అంగదడుకూడా ఉన్నాడు. అంగదుడు కిష్కింధకు యువరాజు. అలా వెళ్ళిన వారు చెట్టులు పుట్టలు అడవులు కొండలు గాలిస్తూ అలసిపోయారు. సుగ్రీవుడు పెట్టిన గడువు నెల రోజులు ఇట్టే అయిపోయాయి. కానీ వారికి సీత జాడమాత్రం తెలియలేదు. ఆకలిదప్పులతో కదలలేని స్థితికి చేరుకొన్నారు.

స్వయంప్రభా దర్శనం[మార్చు]

అలిసి పోయి ఉన్న వారికి ఒక బిలం, ఆ బిలంలోనుండి వస్తున్న హంసలు మొదలైన పక్షులు కనిపించాయి. పక్షులోస్తున్నాయి గనక నీరు చెట్లు సమృధ్ధిగా ఉండే చోటు అని ఊహించి అంతా బిల మార్గంలో ప్రవేశించి వెళ్లారు. యోజనం పైగా నడిచినా వారికి అక్కడ ఏమీ కనపడక ప్రాణాలు కడగంటే స్థితికి వచ్చారు. అలా దీనంగా ఉన్న వేళ వారికి ఒక అద్భుతమైన పూల గుత్తెలు, విమానాలు, బంగారు సోపానాలు కలిగిన మణిమయ మండపాలు స్వర్ణ వర్ణంతో ఉన్న తాబేళ్ళు చేపలు, నిర్మలమైన నీరు, పళ్ళు ఉన్న స్థలం కనిపించింది. అక్కడ అగ్నిలా ప్రకాశిస్తున్న ఒక తపస్విని ఉంది. హనుమంతుడు ఆమెకు చేతులెత్తి నమస్కరించి తమ వౄత్తాంతం చెప్పుకొన్నాడు. ఆమె వారికి అతిధ్యం ఇచ్చి.తన పేరు స్వయం ప్రభ అని హేమ స్నేహితురాలినని ఇది విశ్వకర్మ నిర్మించిన ప్రదేశమని, ఇక్కడకు వచ్చిన వారు తిరిగి పోలేరని చెప్పి వానరులపై దయతో బిలం దాటించి వారికి పరిసరాల వివరాలు తెలిపి జాగ్రత్తలు చెప్పింది. వారు బయటకు వచ్చి సీతను చెప్పిన గడవులో వెతికి గుర్తించలేందుకు చండశాసనుడైన సుగ్రీవుడు మరణ దండన విధించి తీరుతాడుగనక ఇలా ఆకలి దప్పులతో మరణించడమే మంచిదనిపించింది. వానర మూకను సంపాతి అనే పక్షి గమనించి చాలా కాలానికి తనకు ఆహారం సమృధ్ధిగా దొరికిందని వారితో అని భక్షించడానికి పూనుకొన్నది. అప్పుడు అంగదుడు హనుమతో" చూసావా హనుమా! జటాయువులా మనకు దురదృష్టకరమయిన మరణం రాసిపెట్టి ఉన్నది." అన్నాడు. సంపాతికి జటాయువు సోదరుడు. సంపాతి వారితో" ఓయీ! జటాయువును నీవు ఎరుగుదువా?" అని ఆసక్తిగా అడిగింది. అప్పుడు హనుమ సీతాన్వేషణం దాకా మొత్తం కథను చెప్పాడు. అది విని సంపాతి" నాయనా! జటాయువు నా సోదరుడు. అతని మరణానికి కారణమైన రావణుడిపై వృధ్ధుడనై, సూర్యతాపం వలన రెక్కలు కాలినందున పగ తీర్చుకొనలేను. కానీ నాకు యోజనాల దూరం ఇక్కడనుంచే చూసే శక్తి ఉన్నది. సీత సముద్రానికి ఆవల విషన్నవదనయై లంకానగరంలోని అశోక వృక్షం కింద భర్తకోసం విలపిస్తున్నది. సముద్రాన్ని దాటి వెళ్ళి ఆమెను రక్షించండి " అన్నాడు.

కిష్కింధ కాండ[మార్చు]

సీత గురించి వానరులకు చెబుతున్న సంపాతి

వాలి, సుగ్రీవుల మధ్య ఏర్పడిన వైరము కారణముగా సుగ్రీవుడు తన ఆంతరంగికులైన హనుమదాదులతో సహా ఋష్యమూక పర్వతముపై తలదాచుకొనెను. రావణాసురుడు అపహరించిన సీతను వెదకుచు రామ లక్ష్మణులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. హనుమంతుడు వారివద్దకు వెళ్ళి పరిచయము చేసుకొని, వారిని తన భుజములపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసికొని వెళ్ళి వారికి మైత్రి కూర్చెను.

రాముని చేత వాలి హతుడవగా సుగ్రీవుడు వానర రాజయ్యెను. సీతను వెదకడానికి సుగ్రీవుడు నలుదెసలకు వానర వీరులను పంపెను. అలా వెళ్లినవారిలో, దక్షిణ దిశగా వెళ్లిన అంగదుని నాయకత్వంలోని బృందంలో హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వంటి మహావీరులున్నారు.

వారు దక్షిణ దిశలో అనేక శ్రమలకోర్చి వెళ్ళినా సీత జాడ తెలియరాలేదు. చివరకు స్వయంప్రభ అనే తపస్విని సహాయంతో దక్షిణ సముద్రతీరం చేరుకొన్నారు. ఆ తరువాత ఏమి చేయాలో పాలుపోక హతాశులై ఉన్న వారికి సంపాతి అనే గృధ్రరాజు (జటాయువు అన్న) సీతను రావణాసురుడు లంకలో బంధించి ఉంచాడని చెప్పాడు.

ఇక నూరు యోజనాల విస్తారమున్న సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తతింది. చివరకు జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడనీ, తన శక్తి తనకు తెలియదు గనుక హనుమంతుడు మౌనంగా ఉన్నాడనీ చెప్పాడు. ఆ ఆపదనుండి అందరినీ కాపాడడానికి హనుమంతునకే సాధ్యమని చెప్పాడు.

హనుమంతుడు పర్వకాల సముద్రం లా పొంగిపోయాడు. వంద ఆమడల వారాశిని గోష్పదంలా దాటేస్తాననీ, సీతను చూచి వస్తాననీ అందరికీ ధైర్యం చెప్పి మహేంద్రగిరి పైకెక్కాడు.

సుందర కాండ[మార్చు]

అశోక వనములో సీతను చూచిన హనుమంతుడు

హనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండలో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ విస్తారమైన విశ్వాసం చాలామందిలో ఉంది. సుందరకాండలో అనేక శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలుగా వాడుతారు.

హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.

చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగాలేడు.

రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షం క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.

అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. రెండు నెలలు మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.

వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.

లంక నుండి తిరిగి వస్తున్న హనుమంతుడు

ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.

హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. రెండు నెలలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.

ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుడిని చంపమని ఆజ్ఞపించగా విభీషణుడు అన్న అతిథిగా వచ్చిన వానరుడిని చంపితే పాపం తగుల్తుంది అని చెప్పగా రావణాసురుడు తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై వ్రాలాడు.

"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.

యుద్ధకాండ[మార్చు]

ఇంద్రజిత్తు వేసిన బాణానికి గాయపడ్డ లక్ష్మణుడు

హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను . తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. లంకానగరం స్వరూపాన్ని, భద్రత ఏర్పాట్లను వివరంగా రాముడికి హనుమంతుడు చెప్పాడు.

శరణు జొచ్చిన విభీషణుని మిత్రునిగా ఆదరించమని హనుమంతుడు సలహా ఇచ్చాడు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది.

వానరవీరులకు, రాక్షస సేనకు మధ్య మహాభీకరమైన యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో అనేకమంది రాక్షసులు హనుమంతుని చేతిలో మరణించారు. అలా హనుమ చేత నిహతులైన రాక్షసులలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, దేవాంతకుడు, త్రిశిరుడు, నికుంభుడు వంటి మహావీరులున్నారు.

ఇంద్రజిత్ శక్తి అనే అస్త్రాన్ని ఉపయోగించగా దానిని అడ్డుకోడానికి ప్రయత్నించి మూర్ఛిల్లిన లక్ష్మణుడుని చూసి రాముడు రథం దిగి లక్షణుడిని లేపడానికి వస్తాడు విష్ణు అవతారం అయిన లక్ష్మణుడు భూమికి అతుక్కుపోయి బరువుగా అవుతాడు రావణుడు లేపడానికి వంగినప్పుడు అప్పుడే స్పృహలోకి వచ్చిన హనుమంతుడు వేగంగా వచ్చి కడుపులో ఒక గుద్దు గుద్దాడు అక్కడే మోకాళ్ళ మీద కూర్చున్నాడు రావణుడు. వెంటనే హనుమంతుడు లక్షణున్ని జాగ్రత్తగా ప్రక్కకు తీసికొని వచ్చాడు. తరువాత రాముడు హనుమంతుని భుజాలమీద ఎక్కి రావణునితో యుద్ధం చేశాడు. కుంభకర్ణుడు కూడా హతమైన తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల చాలా మంది వానరులు హతులయ్యారు. రామ లక్ష్మణులు, మిగిలిన వానరసేన వివశులయ్యారు. వారిని విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది సంజీవని ఓషధులను తీసుకు రమ్మని హనుమను కోరాడు.

జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్ని సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. రామ లక్ష్మణులూ, మిగిలిన వానరులూ సృహలోకి వచ్చారు. విగతులైన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.

తరువాతి యుద్ధంలో లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు. మరునాటి యుద్ధంలో రావణుని శక్తికి లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. రాముడు దుఃఖితుడయ్యాడు. సుషేణుని కోరికపై హనుమంతుడు మరలా హిమాలయాలలో ఉన్న ఓషధుల పర్వతం సంజీవనిని తీసుకొని రాగా ఆ ఓషధులను ప్రయోగించి సుషేణుడు లక్ష్మణుని స్వస్థునిగా చేశాడు.

మరుసటి రోజు రాముడు,రావణుడుల మధ్య పోటాపోటీగా అస్త్రాలు విడిచిన రావణుడు మరణించడం లేదని రాముడు ఆశ్చర్యానికి గురైనప్పుడు రావణుడి సోదరుడు విభీషణుడు రావణుడి మరణం అతని నాభిలో ఉందని చెప్పగా రాముడు అస్త్రాన్ని వదిలినప్పుడు హనుమంతుడు వాయుదేవుడికి స్మరిస్తూ అస్త్రం నాభికి పోవాలని వేడుకుంటాడు అలాగే జరిగి రావణాసురుడు మరణించాడు. యుద్ధానంతరం రాజ్యాభిషిక్తుడైన విభీషణుని ఆజ్ఞతో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతకు విజయ వార్త చెప్పాడు. సీత అగ్ని ప్రవేశానంతరం సీతారామలక్ష్మణులు అయోధ్యకు వచ్చారు. వైభవంగా పట్టాభిషేకం జరిగింది.

17వ శతాబ్దపు చిత్రము. సీతారాములను పూజిస్తున్న హనుమంతుడు.

శ్రీరాముడు సీతకొక నవరత్నాలూ పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది. అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది. సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారంతో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు. తరువాత హనుమంతుడు ఆ దండను పిచ్చి దండలా తుంచి వేసెను. సభలోని వారందరూ ఆశ్చర్యపోయిరి. లక్ష్మణునికి కోపము వచ్చింది. ఆంజనేయా! నీవు ఏమి చేయుచుంటివి అని ప్రశ్నించెను. హనుమంతుడు మాత్రం "శ్రీరాముడు లేని ఈ దండ నాకు అనవసరం" అని పల్కెను. అప్పుడు లక్ష్మణుడు మరింత కోపోద్రిక్తుడై "శ్రీరాముడు నీలో ఉన్నాడా?" అని ప్రశ్నించెను. శ్రీరాముడు మాత్రం అంతా ప్రశాంతంగా గమనించుచుండెను. అప్పుడు హనుమంతుడు తన హృదయమును చీల్చెను. అప్పుడు హనుమంతుని హృదయం నుండి కాంతిమంతంగా సీతారాములు అగు పడిరి. అందరూ ఆశ్చర్యానందాలతో పరవశించిపోయిరి.

వానరుల శక్తి[మార్చు]

సీత లంకలో ప్రాణాలతో క్షేమంగా ఉన్నట్టు తెలిసి ఆనందించి వారు సముద్రాతీరానికి వెళ్ళారు. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం శతయోజనాల విస్తీఈర్ణం ఉన్న మహాసముద్రాన్ని చూడగానే చప్పగా చల్లారిపోయింది. ఈ కడలిని లంఘించి ఆవలి ఒడ్డుకు వెళ్ళడం ఎలా? అని వారు విదారంలో పడ్డారు. అంగదుడు వారితో ఈ సముద్రాన్ని దాటగలవారు మనలో ఎవరు?" అని అడిగాడు. గజుడు పది యోజనాలు, గవాక్షుడు ఇరవై, గవయుడు ముప్ఫై, శరభుడు నలభై, మాదనుడు యాభై, మైందుడు అరవై,ద్వివిదుడు డెభ్భై, సుషేణుడు ఎనభై ఆమడలు ఎగరగలరని తేలింది. జాంబవంతుడు తాను ప్రస్తుతం వృధ్ధుడినికనుక తొంభై ఆమడలవరకు ఎగురగలనన్నాడు. అంగదుడు" నేను నూరుయోజనాలు ఎగిరగలను. కానీ తిరిగిరాగలనా అని సందేహిస్తున్నాను" అన్నడు. అప్పుడు జాంబవంతుడు " రాజా ! నీవు రాజువు గనక ఎవరిననైనా పంపాలే తప్ప వెళ్ళడం పద్ధతికాదు." అన్నాడు. అప్పుడు " ఇప్రాయోపవేశం చేయటమే తప్ప ఇక మనకు మరో మార్గం లేదు " అన్నాడు.

హనుమంతునికి ప్రోత్సాహం[మార్చు]

అప్పుడు" యువరాజా! మనలో ఈ వారధిని లంఘించగల వీరుడు హనుమంతుడొకడే" అని పలికి హనుమంతునితో" హనుమా! లే. నూవు అనన్య సామాన్యుదివని గుర్తు చేస్తున్నాను. నీకంటే శక్తిమంతులు ఈ భూమండలం మీద లేరు. వెళ్ళి కార్యం సఫలం చేసుకొనిరా" అని అతని శక్తులు గుర్తుచేసాడు. హనుమంతుడు తన శక్తులు గుర్తుకు రాగా అర్ధరాత్రి ఒక్క సారి హఠాత్తుగా వెలిగిన సూర్యుడిలా ప్రకాశించాడు. తన శక్తులు గుర్తుకురాగా తోకవిదిలించి లేచాడు. వానరులందరూ హనుమంతుడిని స్తుతిస్తుంటే హనుమంతుడు భీకరాకారంతో మహేంద్ర పర్వతంపై కాలు మోపి ఒక్క ఎగురులో వారధి మీదుగా లంకకు దూసుకు పోయాడు.

రామకార్యార్ధియై వెడుతున్న హనుమంతునకు విశ్రాంతినిచ్చేందుకు సముద్రుడు మైనాకపర్వతాన్ని ఆదేశించేడు. మైనాకుడు సముద్రంలోనుండి ఎదిగి హనుమదారికి అడ్డుగా నిలబడి ఆతిధ్యం స్వీకరించమని కోరగా రామకార్యార్ధిని కనుక విశ్రమించనని కృతజ్ఞతలు తెలిపి సెలవుతీసుకొన్నాడు.

హనుమంతుని శక్తిని తెలుసుకోడానికి దేవతలు సురసను పంపారు. ఆమె హనుమంతునికి అడ్డుపడి" నాకెదురైనవారు నా ఆహారమని దేవతలు చెప్పారు. నా ఉదరంలోకి రా" అని నోరుతెరిచింది. హనుమంతుడు తన శరీరం పెంచాడు. సురస కూడా శరీరం పెంచుతూ పోయింది. ఒక్క సారి హనుమంతుడు బొటన వేలంతగా మారి ఆమె ఉద్రంలోకి ప్రవేశించి గభాలున ఆమె నోరుమూసుకొనేలోగా వచ్చేసాడు. హనుమంతుని యుక్తికి మెచ్చి సురస దీవించింది.

సింహిక అనే రాక్షసి హనుమతుడు ఎగురుతుండగా నీటిపై ఉన్న అతని నీడను పట్టి ఆపింది. హనుమంతుడు తన శరీరాన్ని వేగంగా పెంచి ఒక్క సారి తగ్గిచుకొని రాక్షసి కడుపులోకి వెళ్ళి పేగులు చీల్చి బయటకు వచ్చాడు.

లంకిణీ ని సంహరించడం[మార్చు]

లంకను చేరిన హనుమంతుడు తన శరీరాన్ని సూక్ష్మంగా చేసుకొని లంకానగరంలోని కట్టాడాలు, వనాలు చూస్తూ కోటలోకి ప్రవేశించబోగా లంకిణి అడ్డుకొని గుండెలపై చరిచింది. హనుమంతుడు కోపంతో ఎడమ పిడికిలితో ఆమెను కొట్టాడు. ఆమె కిందపడి " మహావీరా! ఒక వానరం నన్ను జయించిన రోజున లంకావైభవం నశిస్తుందన్ని బ్రహ్మ నాకు చెప్పాడు. దానవులకు ఆయువు మూడింది. నీవు స్వేచ్ఛగా వెళ్ళు" అన్నది. లంకా వైభవాన్ని కనులారా తిలకిస్తూ ఆశ్చర్యపోతూన్న హనుమంతుడు రావణ కుంభకర్ణులను సౌందర్యవంతమైన స్త్రీలను రాక్షసులను చూసాడు. అతనికి సీత ఎక్కడా కనపడలేదు. అర్ధరాత్రి పండువెన్నల కురుస్తుండగా కోట బయటకు వచ్చిన హనుమంతుడికి అశోకవనంలో మహాతేజస్సుతో వెలుగుతూన్న స్త్రీమూర్తి కనిపించింది. పోలికలనుబట్టి , ఆమె చీరను చూసి,ఆమె సీతాసాధ్వి అని నిర్దారించుకొన్నాడు. రాక్షస స్త్రీల కాపలాలో ఆమె విషన్నవదనై ఉండడం చూసి విచారించాడు. ఇంతలో తెల్లవారింది. రావణుడు సీత దగ్గరకు వచ్చి రకరకాలుగా ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నిచాడు. ఆమె తిరస్కరించింది. అప్పుదు రావణుడు" రెండు నెలల సమయంలో నీవు మనసుమార్చుకో. లేదా నిన్ను చంపి పలహారంగా వండిస్తాను" అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అంతా సద్దుమణిగాక హనుమ రామ సంకీర్తనం మొదలుపెట్టాడు. సీత లంకలో రామామౄతం విని ఆశ్చర్యపోయింది. హనుమంతుడు రావణుడు పంపిన వాడేమో అనుకొన్నది. హనుమంతుని రమ్మని రకరకాల ప్రశ్నలు వేసింది. హనుమంతుడు చెప్పిన జవాబులు విని తౄప్తిపడ్డాక అంగుళీకాన్ని ఇస్తాడు హనుమంతుడు. తాను కామరూపినని అనుమతిస్తే ముమ్ము భుజాన మోసుకొని లంకను దాటించగలనని చెప్పి తన మహారూపాన్ని చూపిస్తాడు. సీత సంతోషించి నాయనా ! నాభర్త వచ్చి రావణుడిని సంహరించి నన్ను తీసుకువెళ్ళడం యుక్తం. ఆయనకొరకు ఎదురుచూస్తున్నాని చెప్పు" అంటూ చూడామణి గుర్తుగా ఇచ్చి రాముడికి తనకూ మాత్రమే తెలిసిన సంగతులు చెప్పి పంపింది.

లంకాదహనం[మార్చు]

లంకలో ఎలాంటి శక్తువంతులున్నారో తెలుసుకొంటే రేపు రామ రావణ యుధ్ధంలో ఉపయోగంగా ఉంటుందని భావించి అక్కడ ఉద్యానవనాలు ధ్వంసంచేయప్రారంభించాడు. అది చూసి రాక్షసస్త్రీలు రావణుడికి తెలుపగా రావణుడు తనతో బలసమానులైన కింకర గణాన్ని పంపాడు. వారిని గెద్ద పాములను సమ్హరించినట్టు హనుమంతుడు నిర్జించాడు. తనతో పోరాటానికి వచ్చిన జంబుమాలిని, ఏడుగురు మంత్రిపుత్రులు, విరూపాక్షుడు, యూపాక్షుడు మొదలైనవారు యుధ్ధానికి రాగా వారిని స్వర్గానికి పంపాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి వివశుడు కాగా బంధించి రావణుని యొద్దకు తీసుకెళ్ళారు రాక్షస వీరులు. హనుమంతుడు తాను రామదూతనని సీతను రామునికి అప్పగించకుంటే చావు తప్పదని హెచ్చరిస్తాడు. రావణుడు హనుమంతుని వంధించమనగా దూతను చంపరాదని మరేదైనా శిక్ష విధించవచ్చని విభీషణుడు అన్నాడు. రావణుడు కోతులకు తోక ఎంతో ప్రీతికనుక అ తోకకు నిప్పంటించమనగా లంకా నగరాన్ని అగ్నికి ఆహుతి చేసి సీతకు తిరిగి కనిపించి నమస్కరించి వానరులతో కూడి రాముడిని చేరి" చూసాను సీతను అని చెప్పాడు.

రామ రావణ యుధ్ధం[మార్చు]

రాముడు వానరులతో కడలిపై సేతువు నిర్మించి చేసిన రామ రావణ యుద్ధంలో హనుమంతుడు గొప్ప పాత్ర పోషించాడు. లక్షల మంది దానవులను సమ్హరించడమేగాక లక్ష్మణుడు మూర్చపోగా రాత్రికిరాత్రై ఔషధీ పర్వతం తెచ్చి రక్షించాడు. రావణుడి మరణం తరువాత అయోధ్యకు వెళ్ళి భరతనుకి రాముని రాక ఎరిగించి స్వాగత కార్యక్రమాలు నిర్వహింపచేసించి హనుమంతుడే! శ్రీ రామ పట్టాభిషేక వేళ సీతమ్మతో అమూలూమైన రత్నహారాన్ని ఇవ్వడమే గాక రాముడు తన సోదరులకు కూడా చూపని ప్రేమ చూపి చిరంజీవిత్వాన్ని, రాబోయే కల్పంలో బ్రహ్మ పదవిని కూడా ప్రసాదించాడు. హనుమంతుని జీవనం మనకందరకూ ఆదర్శవంతమైంది.

మహాభారతం[మార్చు]

వున్నాడు

గ్రహ బాధలనుండి విముక్తికోసం[మార్చు]

హనుమంతుడు తన బుద్ధితో జయించాడు

పంచముఖ హనుమాన్ ప్రతిమ

దేవాలయాలు[మార్చు]

శ్రీరాముని దేవాలయంలో సీతారాముల ఎదురుగా చేతులు మోడ్చిన హనుమంతుడు ప్రతిష్ఠింపబడడం సాధారణం. ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనవచ్చును. ఇంకా హనుమంతుని దేవాలయాలు చాలా ఉన్నాయి. వీటిలోనూ సీతారాముల పటమో, విగ్రహాలో, ఆలయాలో ఉండడం సాధారణం. పెద్ద ఆలయాలు మాత్రమే కాక చాలా వూళ్ళలోను, రోడ్లప్రక్కన, చెట్లక్రింద - ఇలా హనుమంతుని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. భయాపహారిగా ఆంజనేయుడు పల్లెలలో హిందువులకు వెన్నంటి ఉండే దేవుడు.

హనుమంతుని కొన్ని ముఖ్యమైన దేవాలయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

రెండు తెలుగు రాష్ట్రాలు[మార్చు]

తెలంగాణ[మార్చు]

కొండగట్టు ఆంజనేయస్వామి పుణ్య క్షేత్రం తెలంగాణ, ఈ కొండ సంజీవనీ పర్వతం లోని ఒక చిన్న భాగం

ఆంధ్రప్రదేశ్[మార్చు]

  • తణుకుకు దగ్గర గల తీపర్రులో ప్రసన్న ఏకాదశముఖి వీరాంజనేయ స్వామి ఆలయం.
  • హనుమాన్ జంక్షన్: అభయాంజనేయ స్వామి
  • గురవాయిగూడెం: మద్ది వీరాంజనేయ స్వామి
  • విజయవాడ: దాసాంజనేయస్వామి, మాచవరం
  • తిరుమల: కోనేటి గట్టు ఆంజనేయ స్వామి, బేడీ ఆంజనేయస్వామి, జాబాలి తీర్థం
  • రాజమండ్రి, సుందర ఆంజనేయస్వామి దేవాలయం
  • కాకినాడకు దగ్గరలోని మామిడాడ వద్ద గల గండ్రేడు గ్రామంలో పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఉంది.
  • శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవస్థానం - ఎగువ మత్యం, తవణం పల్లి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో ఇది రెండువ 18 అడుగులకల ఏక శిల,
  • భర్తిపూడి, బాపట్ల మండలం, గుంటూరు జిల్లా: ప్రసన్నాంజనేయ స్వామి
  • వెల్లాల సంజీవరాయుడు, కర్నూలు జిల్లా
  • కసాపురం నెట్టెకంటి ఆంజనేయస్వామి, గుంతకల్లు, అనంతపురం జిల్లా
  • వేటపాలెం, ప్రకాశం జిల్లా
  • సింగర కొండ, అద్దంకి, ప్రసన్నాంజనేయ స్వామి

ఇతర రాష్ట్రాలలో[మార్చు]

  • ఉత్తర ప్రదేశ్, వారాణసి: సంకట్ మోచన్ హనుమాన్
  • ప్రసన్న వీరాంజనేయస్వామి మందిరం: మహాలక్ష్మీ లే-అవుట్, బెంగళూరు, కర్ణాటక
  • రామాంజనేయ స్వామి మందిరం - రాగి గుడ్డ, జె.పి.నగర్, బెంగళూరు, కర్ణాటక
  • ఝన్‌కూ -సిమ్లా -హిమాచల్ ప్రదేశ్
  • హనుమాన్ టోక్ - గాంగ్‌టక్ - సిక్కిమ్
  • శ్రీ విశ్వరూప ఆధివ్యాధిహర భక్తాంజనేయ స్వామి మందిరం - చెన్నై
  • శ్రీ విశ్వరూప పంచముఖ ఆంజనేయ స్వామి ఆశ్రమము - చెన్నై
  • మెహందీపూర్ బాలాజీ మందిరం - ధౌసా, రాజస్థాన్
  • యోగాంజనేయస్వామి మందిరం, షోలింగాపూర్, తిరుత్తణి, తమిళనాడు.

విదేశాలలో[మార్చు]

శ్రీలంక 'నువారా ఎలియా'లో హనుమంతుని మందిరం[1]
  • మస్కట్, ఒమన్ - శివాలయంలో ప్రతిష్ఠింపబడిన ఆంజనేయ స్వామి
  • ట్రినిడాడ్, టొబాగో
  • శ్రీలంక - సువారా ఎలియా
  • ఫ్రిస్కో, టెక్సాస్, యు.ఎస్.ఏ - కార్యసిద్ధి ఆంజనేయస్వామి

ప్రార్థనలు[మార్చు]

సంప్రదాయానుసారముగా శ్రీసీతారామ స్తుతి హనుమంతునకు అత్యంత ప్రీతికరమైనది. "యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్". అయితే రక్షణకు, విజయానికి, గ్రహదోష నివారణకు, ఆరోగ్యానికి, మృత్యుభయ విముక్తికి ఆంజనేయుని స్తుతించడం సర్వ సాధారణం.

హనుమంతుని ప్రార్థనలలో ప్రసిద్ధమైనవి

  • ఆంజనేయ దండకం - "శ్రీ ఆంజనేయం ప్రన్నాంజనేయం ప్రబాధివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం ...." అని సాగే ఈ దండకము తెలుగునాట బాగా ప్రసిద్ధమైనది. ముఖ్యంగా పల్లెటూళ్ళలో రాత్రుళ్ళు ఒంటరిగా వెళ్ళేవారు భయవిముక్తికి ఈ దండకం చదువుకోవడం జరుగుతుంది.
  • హనుమాన్ చాలీసా: గోస్వామి తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా భారతదేశమంతటా ప్రసిద్ధమైన ప్రార్థన. ఎమ్.ఎస్.రామారావు దీనికి ఒక తెలుగు సేత వెలువరించాడు.
  • సుందర కాండ - సుందరకాండ పారాయణ కూడా హనుమదారాధనే అంటారు.
  • విభీషణుడు చెప్పిన ఆపదుద్ధారక ఆంజనేయ స్తోత్రం

తెలుగు సాహిత్యం[మార్చు]

తెలుగు సినీ సాహిత్యంలో హనుమంతుని గురించిన పాటలు పద్యాలను వివిధ తెలుగు సినిమాలలో చిత్రీకరించి ప్రజలందరికీ అందించారు. వీరాంజనేయ అనే పేరుతో ఒక సినిమా కూడా రూపొందించారు.

వనరులు[మార్చు]

  • సుందర కాండం - గీతాప్రెస్, గోరఖ్‌పూర్ - తెలుగు అనువాదకులు: ఎమ్.కృష్ణమాచార్యులు, గోలి వేంకటరామయ్య.
  • వాల్మీకి రామాయణం - సరళ సుందర వచనం - కొంపెల్ల వేంకటరామ శాస్త్రి
  • సుందర కాండము - ఎస్.టి.పి.వి.కోనప్పాచార్యులు
  • శ్రీ సీతారాముల దాసుడు - గరిమెళ్ళ సీతారామదాసు
  • సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర వైభవం - కుందా శ్రీనివాసరావు

మూలాలు[మార్చు]


ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]