యుద్ధకాండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యుద్ధకాండ లేదా యుద్ధ కాండము రామాయణం కావ్యంలో ఆరవ విభాగము. భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను కాండములు అంటారు. ఒకో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది. వీటిలో యుద్ధ కాండ ఆరవ కాండము. ఇందులో 131 సర్గలు ఉన్నాయి.


సుందర కాండలో హనుమంతుడు సీత జాడ తెలిసికొని రామునికి చెప్పిన ఘట్టం తరువాత యుద్ధకాండ మొదలవుతుంది. ఇందులో ప్రధాన ఘట్టాలు - రాముడు హనుమంతుని ఆలింగనము చేసుకొనుట, వానర భల్లూక సేనలతో రామలక్ష్మణులు యుద్ధానికి సన్నద్ధులగుట, సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము.

లంకలో యుద్ధం - 1650 కాలంనాటి చిత్రం - (ఉదయపూర్‌)

సంక్షిప్త కథ[మార్చు]

హనుమంతుడు సీతాన్వేషణానంతరం "చూశాను సీతను" అని తన సాగర లంఘనం, లంకా ప్రవేశం, సీతాన్వేషణ, సీతను ఓదార్చుట, రావణునితో సంభాషించుట, లంకను దహనం చేయుట గురించి రామ లక్ష్మణ సుగ్రీవాదులకు వివరించాడు. ఒక్క నెల లోపు రాముని చూడకున్న తాను బ్రతుకనని సీత చెప్పినదన్నాడు.

యుద్ధానికి సిద్ధం[మార్చు]

హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొన్నాడు. విచారిస్తున్న రాముని సుగ్రీవుడు ధైర్యం చెప్పి ఓదార్చాడు. రాముని జయం తప్పదన్నాడు. హనుమంతుడు లంకా నగరం రక్షణా వ్వవస్థను విశదంగా తెలిపాడు. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు.

సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన కోలాహలంగా దక్షిణమునకు పయనమైంది. రాముని ఆజ్ఞపై ఆ వానర సేన జనావాసాలమీద పడకుండా అడవులు, కొండలు, గుట్టలు, నదులు, సరస్సుల మీదుగా నడచింది. రాముని ఆజ్ఞలో నడచిన ఆ సేనకు నీలుడు సేనా నాయకుడు. సుగ్రీవుడు పాలకుడు. హనుమంతుని భుజాలపైన రాముడు, అంగదుని భుజాలపైన లక్ష్మణుడు అధిరోహించారు. జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి, శతబలి, కేసరి, పనసుడు, గజుడు, అర్కుడు, వలీముఖుడు, ప్రజంఘుడు, జంభుడు, రభసుడు వంటి ఎందరో మహా వీరులు ఆ వానర భల్లూక సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు. రామకార్యం సాధించడానికి విక్రమోజ్వలులై ఉల్లాసంగా సాగరతీరము చేరుకొన్న ఆ సేన మరొక సాగరంలా ఉంది. వానర వీరులు ఒక చోట, గోలాంగూల వీరులు ఒకచోట, భల్లూకవీరులు మరొక చోట - ఇలా మూడు భాగాలుగా విడిది చేశారు.

విభీషణ శరణాగతి[మార్చు]

రాముడ్నిశరణు వేడుతున్న విభీషణుడు

అక్కడ లంకలో రావణుడు యుద్ధము విషయమై తనవారితో మంత్రాంగం నెరప సాగాడు. పుర భద్రత కట్టుదిట్టంగా ఉండాలని ఆనతిచ్చాడు. రాక్షస వీరులు రావణుని ప్రతాపాన్ని, తమ శక్తి సామర్ధ్యాలను కీర్తించుకొని, నిర్భయంగా ఉండమన్నారు. ఒక్కొక్కరు తానే రామలక్ష్మణులను కడతేర్చగలమన్నారు. కాని రావణుని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించాడు. రామలక్ష్మణుల క్రోధాగ్నికి లంక భస్మమవ్వడం తథ్యమని, రావణుడు అనాలోచితంగా సీత అనే కాలనాగును తన మెడకు చుట్టుకొన్నాడని నచ్చచెప్పడానికి యత్నించాడు. సీతను రామునకప్పగించి చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోమన్నాడు. మళ్ళీ రావణుని సౌధానికి వెళ్ళి లంకలో అశుభ నిమిత్తాలనేకం ముప్పిరిగొన్నాయని, రానున్న విపత్తునుండి రాక్షసజాతిని కాపాడమని ప్రార్థించాడు.

మరునాడు రావణుడు మంత్రగృహంలో కొలువుతీరినపుడు సకల అమాత్య బంధుగణంతో పాటు కుంభకర్ణుడు కూడా ఉన్నాడు. రావణుడు పొరపాటు చేశాడని, అయినా తాను విజృంభించి అతని కార్యం సిద్ధింపజేస్తానని కుంభకర్ణుడు అన్నాడు. మళ్ళీ విభీషణుడు హితవు చెప్పబోగా ఇంద్రజిత్తు, రావణుడు అతనిని నిందించారు. తనకు ఆప్తులైన నలుగురు రాక్షసులతోకలిసి విభీషణుడు అన్నగారి సెలవు తీసికొని ఆకాశానికి ఎగిరి, సాగరముదాటి, రాముని శరణు జొచ్చాడు. అతనిని నమ్మవద్దని కపివీరులన్నారు. విభీషణుడు సౌమ్యుడని, నమ్మదగినవాడని హనుమంతుడు చెప్పాడు. శరణుకోరిన సకల భూతాలకు అభయం ఇవ్వడం తన వ్రతమని చెప్పి రాముడు విభీషణునకు ఆశ్రయమిచ్చాడు. రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, ప్రహస్తుడు వంటి మహాయోధుల పరాక్రమాన్ని, లంకా నగరం పటిష్ఠతను విభీషణుడు వివరించాడు. సపుత్ర బాంధవంగా రావణుడిని చంపిగాని తాను అయోధ్యకు మరలనని రాముడు తన తమ్ములు ముగ్గురిమీదా ఒట్టుపెట్టి చెప్పాడు. కానున్న లంకాధిపతిగా విభీషణునికి సాగరజలాలతో అభిషిక్తుని చేయించాడు రాముడు.

సాగరంపై వారధి[మార్చు]

సముద్రంపై బాణం ఎక్కుపెట్టిన రాముడు (రాజా రవివర్మ చిత్రం)

తమ మధ్య వైరం ఏమీ లేదు గనుక రామునికి సాయం చేయవద్దని రావణుడు సుగ్రీవునికి శుకుడనే దూత ద్వారా దౌత్యం పంపాడు. అందుకు సుగ్రీవుడు - "రావణా! నాకు నువ్వు చేసిన సాయం లేదుగనుక నాకు ప్రియుడవు కావు. రామునికి విరోధివి గనుక నాకు కూడా విరోధివే. రాముని కోపానికి గురైనందున నిన్ను రక్షించే శక్తి ముల్లోకాలలోనూ లేదు" అని సమాధానం పంపాడు. సముద్ర తరణానికి మార్గం ఏమిటని హనుమంతుడు, సుగ్రీవుడు విభీషణుని అడిగారు. రాముడు సముద్రుని సాయం కోసం అర్ధించాలని విభీషణుడు సలహా ఇచ్చాడు. సముద్రుని సహాయం కోరి రాముడు మూడు రాత్రులు నియమంగా దీక్ష వహించినా సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. కోపించి రాముడు సముద్రాన్ని ఎండగట్టేస్తానని ధనుస్సు ఎక్కుపెట్టాడు. సముద్రుడు వచ్చి, వినయంగా నమస్కరించి, తన స్వభావాన్ని త్యజింపలేనని మనవి చేశాడు. విశ్వకర్మ కొడుకైన నలుని ప్రజ్ఞతో వారధిని నిర్మింపవచ్చునని తెలిపాడు. సముద్రుని కోరికపై రాముడు తన అస్త్రాన్ని ద్రుమకుల్యంలోని దస్యులపై విడిచిపెట్టాడు.

సముద్రంపై వంతెనను నిర్మిస్తున్న వానరులు

ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము నలుని పర్యవేక్షణలో ప్రారంభమైనది. మొదటి రోజు 14 ఆమడలు, రెండవ రోజు 20 ఆమడలు, మూడవ రోజు 21 ఆమడలు, నాలుగవ రోజు 22 ఆమడలు, ఆయిదవరోజు 23 ఆమడలు - ఇలా అయిదు దినములలో 100 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు గల వారధి నిర్మించారు. విభీషణుడు ఒక ప్రక్క వారధికి రక్షణగా నిలిచాడు. వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. నీలుని నాయకత్వంలో ఆ సేన మరో సాగరంలా ఉండి, రామకార్యానికి సన్నద్ధమై ఉంది. దుంపలు, ఫలాలు, జలం పుష్కలంగా ఉన్నచోట విడిది చేశారు.

త్రికూట పర్వతం పైన లంకా పట్టణం సంకల్పమాత్రాన విశ్వకర్మ నిర్మించినట్లు వైభనంగా ఉంది. ఆ శోభను గమనించి రాముడు ఆశ్చర్య పోయాడు. భూమి రక్తంతో తడిసిపోయేంత యుద్ధం నిశ్చయమని రామునికి శకునాలు తోచాయి. తన సేనను జాగరూకతతో ఉండమని వ్యూహనిర్దేశనం చేశాడు. తరువాత తమకు బందీగా ఉన్న శుకుడు అనే దూతను విడుదల చేయించాడు.

భల్లూక వానర వీర సేన[మార్చు]

కపి సేనతో లంకను ముట్టడించడానికి సన్నద్ధుడౌతున్నరాముడు (స్మిత్‌సోనియన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ప్రాచీన చిత్రం.)

రావణుడి చారులైన శుక సారణులు రామ, లక్ష్మణ, సుగ్రీవ, జాంబవంత, హనుమంతాది వీరుల పరాక్రమాన్ని రావణునికి వివరించారు. వానరసేన ఎంత ఉందో లెక్కపెట్టడం అసాధ్యమన్నారు. సీతను రామునకప్పగించడం మంచిదని తమకు తోచిందన్నారు. ప్రాసాదం పైకి తీసుకెళ్ళి వానరవీరుల సేనానాయకులలోని ముఖ్యులను చూపించారు -

వేనవేల సేనాధిపతులతో కలిసి సింహనాదం చేస్తున్నవాడు సకల వానర సైన్యాధిపతి నీలుడు. అంగదుడు తనతండ్రితో సమానుడైన వాడు, రాముని విజయంకోసం కృతనిశ్చయుడు. సముద్రం మీద సేతువును నిర్మించిన ఘనుడు నలుడు. త్రిలోకాలలోనూ ప్రఖ్యాతుడైన శ్వేతుడు వెండిలా మెరిసిపోతున్నాడు. యుద్ధం అంటే అతిప్రీతి కలిగిన కుముదుడు గోమతీతీరం నుండి వచ్చాడు. కపిలవర్ణుడై న రంభుడు వింధ్య పర్వతాలనుండి వచ్చాడు. చెవులు రిక్కించిన శరభుడు మృత్యుభీతి లేనివాడు. పర్వతంలాంటి పనసుడు పారియాత్రంనుండి, వినతుడు కృష్ణవేణీ తీరంనుండి లక్షలాది సేనతో వచ్చారు. అత్యంత బలశాలి క్రోధుడు 60 లక్షల సైన్యంతోను, గైరిక వర్ణంలో ఉన్న మహాదేహుడు గవయుడు 70 లక్షల సైన్యంతోను వచ్చారు. కోట్లాది అనుచరులతో వచ్చిన హరుడు అనే సేనానాయకుడు మహాఘోరంగా యుద్ధం చేస్తాడు.

సువేల పర్వతముపై రామునితో సమావేశమైన వానరులు

కాటుక కొండలలాంటి లెక్కలేనన్ని భల్లూకాలతో నర్మదా నదీతీరపు ఋక్షవంతం నుండి వచ్చిన నాయకుడు ధూమ్రుడు చాలా భయంకరుడు. ధూమ్రుని తమ్ముడు జాంబవంతుడు దేవాసుర యుద్ధంలో దేవేంద్రునకు సాయపడ్డాడు. వానర యోధులలో ప్రఖ్యాతుడు దంభుడు చాలా బలశాలి. కొండలాంటి రూపం కలిగిన వానర పితామహుడు సంనాదుడు కలియబడితే ఒకసారి దేవేంద్రుడే తగ్గిపోయాడు. పదికోట్ల వీరులతో హిమవద్గిరినుండి వచ్చిన క్రధనుడు పరాజయం ఎరుగనివాడు. ఏనుగులను దండించడం వినోదంగా భావించే ప్రమాధి, అతని అనుచరులు లంకపై పడడానికి ఉవ్విళ్ళురుతున్నారు. గవాక్షునివెంట ఇంకా కోట్లకొలది వానరులు సేతువును దాటి వస్తూనే ఉన్నారు. మేరుపర్వతం నుండి వచ్చిన వానరుల అధిపతి కేసరి. కాలసర్పాలలా ఘోర భీకరమైన వానరుల నాయకుడు శతబలి కాంచనపర్వత ప్రాంతంనుండి వచ్చాడు. గజుడు, గవాక్షుడు, గవయుడు, నలుడు, నీలుడు - వీరి వద్దనున్న వానరుల సంఖ్యాబలం చెప్పనలవి కానిది. సుగ్రీవుని ఆజ్ఞను జవదాటని వానరవీరులు మహా బలవంతులు, దుర్జయులు, కామరూపులు. మైందుడు, ద్వివిధుడు అనే సోదరులు బ్రహ్మ దేవుని అనుగ్రహం సంపాదించి అమృతపానం చేశారు. సుముఖుడు, దుర్ధరుడు అనే సోదరులు మృత్యుదేవత కొడుకులు.

కేసరి నందనుడు, వాతాత్మజుడు అనబడే హనుమంతునికి ముల్లోకాలలోను ఎదురులేదు. అతనికి కోపం వస్తే సముద్రాన్ని కలచివేయగలడు. వేదవేదాంగాలు నేర్చినవాడు, ధర్మం తప్పని వాడు, నీలమేఘ శ్యాముడు, పద్మనేత్రుడు అయిన రాముని క్రోధం మృత్యువుతో సమం. బుద్ధిమంతుడు, పట్టరాని కోపంగలవాడు, అన్నకోసం జీవితాన్ని విడిచిపెట్టేవాడు, గురి తప్పని బాణం కలవాడు లక్ష్మణుడు. రాముని ప్రక్కనున్న నీ తమ్ముడు విభీషణుని లంకాధిపతిగా రాముడు పట్టాభిషిక్తుని చేశాడు. సర్వశాఖామృగాధిపతి సుగ్రీవుడు కిష్కింధనేలుతున్నాడు. హిమవత్పర్వతంలా వానరులనందరినీ మించినవాడు. సీతారాములను కలపడానికి దీక్షాబద్ధుడు. ఇలా మహా బృందాలు, మహౌఘాల సంఖ్యలో వానరులు లంకపై దండెత్తి వచ్చారు.


రావణుడు పంపిన మరొక చారుడు శార్దూలుడు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాడు. వానర భల్లూక వీరుల పరాక్రమం గురించి మరిన్ని విషయాలు చెప్పాడు. ఋక్షరజసుని కొడుకు సుగ్రీవుడు - గద్గదుని కొడుకులు ధూమ్రుడు, జాంబవంతుడు - బృహస్పతి కొడుకు కేసరి - వరుణుని కొడుకు సుషేణుడు - చంద్రుని కొడుకు దధిముఖుడు - కృంతాంతుని అంశలలాంటి సుముఖుడు, దుర్ముఖుడు, వేగదర్శి - పావకుని పుత్రుడు నీలుడు - వాయుపుత్రుడు హనుమంతుడు - పురుహూతుని పౌత్రుడు అంగదుడు - అశ్వనీ దేవతల అంశలతో పుట్టినవారు మైందుడు, ద్వివిధుడు - సమవర్తి సుతులలాంటి గజుడు, గవాక్షుడు, గవయుడు, గంధమాదనుడు, శరభుడు - భాస్కర సుతులు శ్వేతుడు, జ్యోతిర్ముఖుడు - వరుణుని ఆత్మజుడు హేమకూటుడు - దేవశిల్పి కుమారుడు నలుడు - వసుపుత్రుడు దుర్ధరుడు - అందరూ దేవతాంశ సంభూతులు, యుద్ధం కోసం ఎదురు చూస్తున్నవారు. ఖరదూషణాది రాక్షసులను 14 వేలమందిని ఒక్కుమ్మడిగా చంపినవాడు రాముడు. అతనికి దీటైన తమ్ముడు లక్ష్మణుడు. రాక్షసులలో వివేకవంతుడు విభీషణుడు. - ఇలా మొహరించిన సేననెదుర్కొని విజయమో వీర స్వర్గమో పొదడం రావణుని చేతిలో ఉంది.

యుద్ధానికి ముందు[మార్చు]

రాముని పంపున దూతగా వెళ్ళి రావణునికి రాముని సందేశాన్ని వినిపిస్తున్న అంగదుడు

రావణుడు విద్యుజ్జిహ్వుడనే మాయలమారి రాక్షసుని పిలిపించి రాముని శిరస్సును పోలిన ఒక మాయా శిరస్సును, ధనుర్బాణాలను చేయించాడు. యుద్ధంలో రామలక్ష్మణులు, వానర సైన్యం నశించారని సీతతో చెప్పి ఆ మాయా శిరస్సును, ధనుర్బాణాలను చూపాడు. సీత కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. రావణుడు వెళ్ళిపోయాక విభీషణుని భార్య, సరమ అనే సాధ్వి సీతను ఓదార్చి అది మాయ అని, రహస్యంగా తాను అంతా విన్నానని చెప్పింది. యుద్ధానికి భల్లూక వానర సమేతంగా రాముడు సిద్ధంగా ఉన్నాడని, సీతకు శుభ సౌభాగ్య సమయం ఆసన్నమయందని అనునయించింది. రావణుని వినాశనం అనివార్యమంది.

రావణుని తల్లికి పినతండ్రి అయిన మాల్యవంతుడనే వృద్ధుడు రావణునికి యుద్ధం మానమని హితవుపలుకబోయాడు. అతనిని రావణుడు కఠినంగా దూషించాడు. వానర సేనా, రామలక్ష్మణులూ అజేయులు, అసమానులు అని రావణుడు విన్నాడు కాని కాని ప్రహస్తుని నాయకత్వములోని రావణ సేనాబలం కూడా పరాజయం ఎరుగనిది. ముఖ్యంగా ప్రహస్తుడూ, ఇంద్రజిత్తూ, నికుంభుడూ - వీరిలో ఎవరైనా తప్పక రామలక్ష్మణులను కడతేర్చగలరనీ, కనుక ఇక ఇంద్రుని వజ్రాయుధాన్ని గడ్డిపోచలా తలిచే కుంభకర్ణుడూ, తనూ యుద్ధానికి రావలసిన అవుసరమే రాదనీ రావణుడి విశ్వాసం.

సైన్యాన్ని సమాయత్తపరచి అన్ని యెడలా రక్షణకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయించాడు రావణుడు. తూర్ప ద్వారంలో ప్రహస్తుడు, దక్షిణాన మహాపార్శ్వ మహోదరులు, పశ్చిమాన ఇంద్రజిత్తు, ఉత్తరాన శుక సారణులు అప్రమత్తులై యున్నారు. విరూపాక్షుడు లంకానగరం మధ్యనున్నాడు. రావణుడు స్వయంగా ఇతర స్థలాలతో పాటు ఉత్తర ద్వారాన్ని పర్యవేక్షిస్తానని చెప్పాడు. ఇవన్నీ విభీషణుని చారుల ద్వారా రాముడు తెలుసుకొన్నాడు. తూర్పు ద్వారం వైపు నీలుడు, దక్షిణానికి అంగదుడు, పశ్చిమం ప్రక్కకు హనుమంతుడు తమ సైన్యాలతో దండు వెళ్ళేలాగా నియమించాడు. తాను స్వయంగా ఉత్తర ద్వారం వైపు విజయం చేస్తానన్నాడు. సుగ్రీవుడూ, జాంబవంతుడూ, విభీషణుడూ సైన్యం మధ్యలో ఉండి అంతా చక్కబెడతారు. ఇలా నియమించి, సువేల శిఖరంపైకి ముఖ్య నాయకులతో వెళ్ళి రాముడు లంకానగరాన్ని పర్యవేక్షించాడు. దూరాన ఒక గోపురాగ్రాన రావణుడు కనిపించాడు. అతనిని చూడగానే క్రోధంతో సుగ్రీవుడు ఎగిరి వెళ్ళి భీకరమైన మల్లయుద్ధం చేశాడు. రావణుడు మాయలు ప్రయోగించడానికి సన్నద్ధమయ్యేసరికి ఒక్కగెంతున తిరిగి వచ్చేశాడు.

రాముని పంపున అంగదుడు దూతగా వెళ్ళి చివరిసారిగా రావణునికి రాముని సందేశాన్ని వినిపించాడు. సీతనిచ్చి శరణు కోరితే రాముడు క్షమించి వదిలి వేస్తాడని చెప్పాడు. అంగదుని రావణుడు తృణీకరించాడు. అంగదుడు రావణుని గోపుర శిఖరాన్ని కాలితో తన్ని పడగొట్టి తిరిగి వచ్చాడు.

రామ లక్ష్మణ సుగ్రీవులకు జయం[మార్చు]

లంకానగరం ముట్టడి- 1800 కాలం నాటి చిత్రం
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః

అంటూ వానరసేన లంకను ముట్టడించింది. ముందుగా మట్టితోను, బండరాళ్ళతోను, చెట్లతోను అగడ్తను పూడ్చివేసి ప్రాకరాలు ఆక్రమించారు. గోపురాలు, ప్రాకార తోరణాలు పడగొట్టేశారు. వీరబాహువు, సుబాహుడు, నలుడు ప్రాకారాలు భేదించ సాగారు. కుముద, ప్రఘన, పనసులు తూర్పున, శతవలి దక్షిణాన, సుషేణుడు పడమర, మహాకాయ గవాక్ష ధూమ్రులు ఉత్తరాన ద్వారాలు బ్రద్దలుకొట్టసాగారు. ప్రళయకాల సముద్రంలాగా కాల మేఘాల్లాంటి రాక్షససేన సింహనాదాలతో, దుందుభి ధ్వానాలతో వానరులను ఎదుర్కొంది. మహాయద్ధంతో భునభోంతరాళాలు కంపిస్తున్నాయి. ఒక్క క్షణంలో యుద్ధం భీకరం అయి భూమి అంతా రక్త మాంసాలతో నిండిపోయింది.

వానర రాక్షస ప్రముఖుల మధ్య ద్వంద్వ యుద్ధాలు ఆరంభమయ్యాయి. అంగదుడు ఇంద్రజిత్తుతోను - (విభీషణుని సచివుడు) సంపాతి ప్రజంఘునితోను - హనుమంతుడు జంబుమాలితోను - విభీషణుడు శత్రుఘ్నునితోను - గజుడు తపనునితోను - నీలుడు నికుంభునితోను - సుగ్రీవుడు ప్రఘసునితోను - లక్ష్మణుడు విరూపాక్షునితోను - మైందుడు వజ్రముష్ఠితోను - ద్వివిధుడు అశనిప్రభునితోను - నలుడు ప్రతపనునితోను - సుషేణుడు విద్యున్మాలితోను - తలపడ్డారు. అగ్నికేతువు, రశ్మికేతువు, సుప్తఘ్నుడు, మధ్యకోపుడు అనే రాక్షసులు రాముని చుట్టుముట్టి, అతని చేత మరణించారు. రాత్రి అయినా కొనసాగుతున్న యుద్ధం వల్ల రక్తం నదులుగా ప్రవహించింది. అది లోకక్షయమైన కాలరాత్రిగా మారింది.

నాగపాశ విమోచన[మార్చు]

రామ లక్ష్మణులపై నాగాస్త్రమును ప్రయోగిస్తున్న ఇంద్రజిత్తు

అంగదుని చేత పరాభవం పొందిన ఇంద్రజిత్తు ఒక్కసారిగా మాయమైపోయాడు. మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. రామలక్ష్మణుల దేహంపై ప్రతి అంగుళం బాణాలతో నిండిపోయింది. వానరసేన సిగ్గువిడిచి పరుగులు తీసింది. అందరు వానర సైన్యాధిపతులూ ఇంద్రజిత్తు బాణాలతో గాయపడినవారే. ఆ నాగాస్త్ర బంధాలనుండి తప్పుకోవడం ఎవరివల్లా కాదని విజయ గర్వంతో ఇంద్రజిత్తు తండ్రివద్దకు వెళ్ళి తాను రామలక్ష్మణులను చంపి వానరసేనను నిర్వీర్యం చేసేశానని చెప్పాడు. రావణుడు ఆనందించి, ఆ రాఘవుల మృతదేహాలను సీతకు చూపమని ఆదేశించాడు. పుష్పకంపై సీతను తెచ్చి ఆ దృశ్యం చూపగా ఆమె విలపించ సాగింది. రామలక్ష్మణులు కేవలం వివశులయ్యారని, త్వరలో కోలుకొంటారని చెప్పి, త్రిజట సీతను ఊరడించింది.

భయభీతులైన వానరులంతా రాఘవుల చుట్టూ కూర్చుని దుఃఖించసాగారు. మళ్ళీ రాక్షసులు వస్తారేమోనని కంగారుపడసాగారు. కొద్దిగా సృహ వచ్చిన రాముడు లక్ష్మణుని చూచి వ్యాకులపడి, తన ప్రతిజ్ఞలన్నీ మిధ్యలయ్యాయని వగచి, ప్రాయోపవేశానికి సిద్ధనయ్యాడు. తనకు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపి వానరులను తిరిగి వెళ్ళిపొమ్మన్నాడు. వారు శక్తి వంచన లేకుండా మిత్ర కార్యం నిర్వహించారని, అయినా ఈశ్వరాజ్ఞ ఉల్లంఘించరానిదని చెప్పాడు. వానరులందరూ కళ్ళనీళ్ళు పెట్టుకొన్నారు. శరతల్పగతులైన రామలక్ష్మణులను చూచి విభీషణుడు హతాశుడయ్యాడు. సుగ్రీవుడు మాత్రం విభీషణుడిని ఓదార్చి అతనికి లంకాధిపత్యం నిశ్చయమన్నాడు. రామలక్ష్మణులను తీసికొని కిష్కింధకు వెళ్ళమని తన మామ సుషేణుడికి ఆనతిచ్చాడు. తాను రావణుడిని సపుత్ర బాంధవంగా నాశనం చేసి సీతమ్మను తీసుకొని వస్తానన్నాడు. సంపాతి, పనసుడు, హనుమంతుడు వెళ్ళి దివ్యౌషధాలను తెస్తే ప్రయోజనం ఉంటుందని సుషేణుడన్నాడు.

అంతా విషణ్ణులైన సమయానికి పెద్ద సుడిగాలి వీచి సముద్రం కల్లోలమయ్యింది. గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చాడు. అతని రాకతో శరరూపంలో రామ సౌమిత్రులను పట్టుకొని ఉన్న సర్పాలన్నీ పారిపోయాయి. గరుడుడు తన రెండు చేతులతోను రామలక్ష్మణుల సర్వావయవాలను నిమిరాడు. వెంటనే వారి గాయాలు మాయమై వారికి మునుపటికంటె ఎక్కువ తేజస్సు, బల వీర్య పరాక్రమాలు సమకూరాయి. వారిని కౌగలించుకొని గరుడుడు - "మీరు జాగరూకతతో ఉండండి. నేను మీకు స్నేహితుడనెలా అయ్యానో తరువాత తెలుస్తుంది. రామా! నువ్వు లంకను నాశనం చేసి రావణుని చంపి సీతను పొదడం తథ్యం" - అని చెప్పి, రామలక్ష్మణులకు ప్రదక్షిణం చేసి ఆకాశానికి ఎగిరి పోయాడు.

రాక్షస వీరుల మరణం[మార్చు]

దస్త్రం:Hanuman striking a demon.jpg.
రాక్షసులతో యుధ్ధమును చేస్తున్న హనుమంతుడు
ధూమ్రాక్షుడు

రామలక్ష్మణులు స్వస్థులవ్వడంతో వానరులు కుప్పిగంతులు వేస్తూ, సింహనాదాలు చేస్తూ, పరవళ్ళు తొక్కుతూ చెట్లు పీకి యుద్ధానికి సన్నద్ధులయ్యారు. తెల్లబోయిన రావణుడు ధూమ్రాక్షుని యుద్ధానికి పంపాడు. ధూమ్రాక్షుడు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని దక్షిణద్వారానికి వెళ్ళి వానరులను చెండాడసాగాడు. ప్రతి వానరవీరుడూ తన పేరు చెప్పుకొంటూ రాక్షసులను చావబాదసాగాడు. హనుమంతుడు విసిరి వేసిన పెద్ద గిరిశిఖరం క్రింద పడి ధూమ్రాక్షుడు పచ్చడి అయిపోయాడు.

వజ్ర దంష్ట్రుడు

ధూమ్రక్షుని మరణంతో నిట్టూర్చిన రావణుడు గొప్ప శూరుడు, వీరుడు, మాయావి అయిన వజ్ర దంష్ట్రుడిని యుద్ధానికి వెళ్ళమన్నాడు. వజ్ర దంష్ట్రుని సేన పర్వతాలే నడచి వచ్చినట్లు దక్షిణ ద్వారంవైపు నడచింది. అప్పుడు జరిగిన సంకుల సమరం వల్ల మృత కళేబరాలతోను, అవయవాలతోను, శస్త్రాస్త్రాలతోను, అవయవాలతోను, ఆభరణాలతోను యుద్ధభూమి నిండిపోయింది. రక్తంలో తేలుతున్న శరీరావయవాలను గ్రద్దలు, రాబందులు, నక్కలు పీక్కుతినసాగాయి. అంగదుని ధాటికి రాక్షసులు కంపించిపోయారు. అంగదుడు, వజ్రదంష్ట్రుడు ఘోరంగా ముష్టియుద్ధం చేశారు. చివరకు అంగదుడు వజ్రదంష్ట్రుని తల నరికేశాడు. రాక్షసులు లంకలోకి పరుగులు పెట్టారు.

అకంపనుడు

పిదప మహావీరుడైన అకంపనుడు యుద్ధోత్సాహంతో, సముద్రంలాంటి తన సేనను వెంటబెట్టుకొని బయలుదేరాడు. వానరులు, రాక్షసులు ఒకరికొకరు తీసిపోకుండా భీకరమైన పోరు సాగించారు. ముందుగా రేగిన దుమారంలాంటి దుమ్ము తరువాత రక్తపుటేరుల కారణంగా అణగిపోయింది. ఉత్సాహంగా రాక్షసులను చుట్టుముట్టిన వానరులను అకంపనుడు తన బాణవర్షంతో వాశనం చేయసాగాడు. హనుమంతుడు అతనిని నిలువరించాడు. హనుమ పాదతాడనంతో భూమి కంపించింది. ఒక మహావృక్షాన్ని పెరికి దానితో అకంపనుని చూర్ణం చేసేశాడు. రాక్షసులు ఒక్కుమ్మడిగా ఒకరినొకరు తోసుకుంటూ, తొక్కుకుంటూ నగరంలోకి పారిపోయారు.

ప్రహస్తుడు
వానర సేనాధిపతి నీలుడు ("బాలి" ద్వీపంలో చిత్రం)

ఇప్పుడేమి చేయాలని రావణుడు ప్రహస్తుని అడిగాడు. ప్రహస్తుడు రావణుని సేనానాయకుడు. శస్త్రాస్త్రవేది. మహావీరుడు. అంతకుముందు మంత్రాంగ సమయంలో సీతను ఇచ్చివేయడమే క్షేమమని హితవు చెప్పినవాడు. రావణుని ఆదరానికి బదులు తీర్చుకోవడమే తన బ్రతుకుకు లక్ష్యమని చెప్పి, ప్రహస్తుడు హోమాదికాలు పూర్తి చేసుకొని, సర్ప ధ్వజంతో కూడిన గొప్ప రథం పూన్చి, శత్రుభీకరమైన మహోన్నత సేనను సమకూర్చుకొని తూర్పు ద్వారంవైపు యుద్ధానికి బయలుదేరాడు. అతనివెంట నరాంతకుడు, కుంభహనువు, మహానాధుడు, సమున్నతుడు అనే సమర్ధులైన అనుచరులున్నారు. రాక్షస వానర వీరులు జబ్బలు చరిచి యుద్ధానికి తలపడ్డారు. ఇరుపక్షాల సింహనాదాలు, రోదనలతో నింగీ నేలా దద్దరిల్లాయి.

ద్వివిధుడు పర్వత శిఖరంతో కొట్టి నరాంతకుడిని చంపేశాడు. దుర్ముఖుడు పెద్ద చెట్టుతో బాది సమున్నతుడిని కూల్చేశాడు. జాంబవంతుడు పెద్దరాతితో మహావాదుడిని పచ్చడి చేసేశాడు. తారుడు పెద్ద చెట్టుతో బాది కుంభహనువును మట్టిలో కలిపాడు. ప్రహస్తుడు ఎందరో వానరవీరులను ఒకేసారి సంహరించాడు. వానరుల కళేబరాలతోను, రాక్షసుల కళేబరాలతోను యుద్ధభూమి ఎర్రని పర్వతాల మయమైపోయింది. వాటిమధ్య రక్తం నదులుగా పారుతోంది. మేఘంపైకి సుడిగాలిలాగా నీలుడు ప్రహస్తుని మీదకురికాడు. ఇద్దరూ మదపుటేనుగుల్లాగా కలియబడ్డారు. ఒక పెద్ద బండరాతితో నీలుడు ప్రహస్తుని తల బద్దలుకొట్టి చంపేశాడు. రాక్షససేన కట్టతెగిన నదీప్రవాహంలాగా లంకలోకి పారిపోయింది.

రావణునికి పరాభవం[మార్చు]

రామ రావణ యుద్ధము

ఇక లాభం లేదనుకొని రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని దివ్యరథంపై యుద్ధానికి వెడలాడు. అతనివెంట రాక్షససేన కదలి వచ్చే కాటుక కొండలలాగా ఉంది. ఆ సైన్యం అగ్ర భాగాన ముందు సూర్యబింబంలా ప్రజ్వలించే అకంపనుడు, గొప్ప ధనుసును ధరించిన ఇంద్రజిత్తు, వింధ్యపర్వత సదృశ దేహుడైన మహోదరుడు, పిడుగులాంటి పిశాచుడు, మెరుపులాంటి శూలం పట్టుకొన్న త్రిశిరుడు, సర్ప ధ్వజుడైన కుంభుడు, వజ్రాలు పొదిగిన పరిఘను పట్టుకొన్న నికుంభుడు, అగ్నిలాంటి రథం అధిరోహించిన నరాంతకుడు రణోత్సాహులై ఉన్నారు. వారి మధ్య శ్వేతఛత్ర ధారియై రావణుడు ప్రచండ భానునిలా మెరిసిపోతున్నాడు. రావణుని తేజస్సును చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. సీతను అపహరించిన పాపానికి రావణునికి అంత్యకాలం సమీపించిందని చెబుతూ రాముడు ధనుస్సు ఎక్కుపెట్టాడు.

లంకా నగర రక్షణార్ధమై తక్కిన రాక్షస నాయకులను రావణుడు వెనుకకు పంపేశాడు. కాలనాగులవంటి తన బణాలతో వానర సైన్యాన్ని చిందరవందర చేయసాగాడు. సుగ్రీవుడు మూర్ఛపోయాడు. గవాక్షుడు, ఋషభుడు, గవయుడు, జ్యోతిర్ముఖుడు, నలుడు వేసిన పర్వత శిఖరాలను రావణుడు పిండి పిండి చేసేశాడు. హనుమంతుని అరచేతి చరుపుకు రావణుడు, రావణుని పిడికిలి పోటుకు హనుమంతుడు కంపించిపోయారు. నీలుడు అంగుష్ఠమాతృడై రావణుని చికాకు పరచాడు. నీలుడు అగ్ని పుత్రుడు గనుక రావణుని ఆగ్నేయాస్త్రం నీలుని సంహరించలేకపోయింది. లక్ష్మణుడి బాణాలతో రావణుడి ధనుసు విరిగిపోయింది. రావణుడి శక్తితో లక్ష్మణుడు తెలివి తప్పాడు. అతనిని రావణుడు ఎత్తలేకపోయడు. హనుమంతుడు లక్ష్మణుని ఎత్తి రామునివద్ద పడుకోబెట్టాడు. హనుమంతుని గుద్దుకు రావణుడు నెత్తురు కక్కి మూర్ఛిల్లాడు. తెలివి తెచ్చుకొని మళ్ళీ శరాఘాతం ప్రాంభించాడు.

హనుమంతుని భుజాలపై అధిరోహించి రాముడు రావణునిపై పోరు సాగించాడు. రావణుని వాడి బాణాలకు ఆంజనేయుడు జంకలేదు. అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని రథం, గుర్రాలు, ఛత్రం, ధ్వజం ధ్వంసమయ్యాయి. కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణునికి చెప్పాడు. సిగ్గుతో రావణుడు లంకలోకి వెళ్ళిపోయాడు.

కుంభకర్ణుని మరణం[మార్చు]

కుంభకర్ణుని కొరికి తప్పించుకున్న సుగ్రీవుడు

అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపమని మంత్రులను పంపాడు. భేరీ భాంకారాలు చేసి, శూలాలతో పొడిచి, ముసలాలతో మోది, ఏనుగులతో త్రొక్కించి, ఏనుగులతో త్రొక్కించి వారు కుంభకర్ణుని నిదురనుండి లేపారు. లేవగానే కుంభకర్ణుడు మాంసరాసులను సుష్ఠుగా తిని, కుండలతో రక్తం త్రాగి, త్రేవ్చాడు. విషయం తెలుసుకొని, స్నానం చేసి, సర్వాభరణాలు ధరించి, బలకరమైన మద్యం భాండాలతో త్రాగి రావణుని చెంతకు వెళ్ళాడు. అతను నగరంలో నడుస్తుంటేనే భయంతో వానరసేనలు కకావికలమయ్యాయి. అంత వీరుడు రాక్షసులలో మరొకరు లేరని విభీషణుడు చెప్పాడు. అది ఒక యంత్రమని, రాక్షసుడు కాదని, వారు చెప్పి వానర సేనను స్థిమిత పరచారు.

రావణుడు కుంభకర్ణుడికి జరిగిన విషయం వివరించాడు. అనాలోచితంగా రావణుడు చేసిన చెడ్డపనులను సోదర ప్రేమతో నిందించాడు కుంభకర్ణుడు. కపటంతో సీతను మోసపుచ్చాలన్న మహోదరుని సూచన కూడా కుంభకర్ణునికి రుచించలేదు. తాను రామలక్ష్మణులను, సకల వానర సేనను భక్షించి పరిస్థితిని చక్కదిదద్దుతానని, రావణుడికి మాట యిచ్చి, అగ్నిలా వెలిగిపోతూ, కాలపాశ సదృశమైన పరిఘను పట్టుకొని, కోట గోడను ఒక్క అడుగులో దాటి యుద్ధానికి బయలుదేరాడు. ఆరు వందల ధనువుల యెత్తూ, వంద అడుగుల కైవారం ఉన్న ఆ మహాకాయుని చూస్తూనే వానర సేనలు పారిపోసాగాయి. ధైర్యం చెప్పి వారిని అతికష్టంమీద అంగదుడు నిలువరించాడు.

రామాయణ యుద్ధములో కుంభకర్ణునిపై బాణాలు ఎక్కుపెట్టిన రామలక్ష్మణులు (బాలాసాహెబ్ పండిత్ పంత్ ప్రతినిధి చిత్రం, 1916)

కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. అంగదుడు, ఋషభుడు, శరభుడు, మైందుడు, నీలుడు వంటివారు విసిరిన కొండలు కుంభకర్ణుని వంటికి తగిలి పొడి అయిపోయాయి. వందలాది వానరులను వాడు కరకర నమిలి మ్రింగ సాగాడు. హనుమంతుని దెబ్బకు కుంభకర్ణుడు రక్తం కక్కాడు. కుంభకర్ణుడి శూలం పోటుకు హనుమంతుడు రక్తం కక్కాడు. ఆ రాక్షసునికి ఎదురు పడిన అంగదాది వీరులు వాడి విదిలింపులకే సృహ తప్పి పడిపోయారు. సుగ్రీవుడు కుంభకర్ణుడి శూలాన్ని తన మోకాటికి అడ్డంగా పెట్టుకొని విరిచేశాడు. అప్పుడు కుంభకర్ణుడు విసిరిన పర్వత శిఖరం తగిలి సుగ్రీవుడు తెలివి తప్పాడు. మూర్ఛపోయిన సుగ్రీవుడిని పట్టుకొని లంకవైపు వెళ్ళాడు కుంభకర్ణుడు. తెలివి తెచ్చుకొన్న సుగ్రీవుడు ఒక్కసారి విదిలించుకొని, రాక్షసుని ముక్కు, చెవులు కొరికివేసి ఒక్కగెంతులో వానర సైన్యం మధ్యకు వచ్చిపడ్డాడు.

తిరిగి వచ్చిన కుంభకర్ణుడు మత్తిల్లినవాడై అందరినీ ఎడా పెడా మట్టుపెట్ట సాగాడు. వాలిని చంపిన రాముని బాణం కుంభకర్ణుని పట్ల నిష్ప్రయోజనమైంది. కడకు రామ లక్ష్మణుల బాణాలు కుంభకర్ణుని ఆయుధ విహీనుని చేశాయి. . రాముడు వాయువ్యాస్త్రంతోను, ఐంద్రాస్త్రంతోను వాడి చేతులు నరికేశాడు. రెండు మహిమాన్విత బాణాలతో తొడలు కూడా నరికేశాడు. ఐనా నోరు తెరుచుకొని రాహువులా వస్తున్న ఆ వీరుని ఐంద్రాస్త్రంతో చంపేశాడు. వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. వాడి క్రింద పడి ఎందరో వానరులు, రాక్షసులు కూడా నశించారు.

ఇంకా రాక్షస వీరుల మరణం[మార్చు]

వానర సైనికులతో పోరాడుతున్న అతికాయుడు

శోకిస్తున్న రావణుడిని ఊరడించి మరునాడు దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరులనే రావణ నందనులు, మత్తుడు ఉన్మత్తుడు అనే రావణ సోదరులు - అందరూ మహా శూరులు- యుద్ధానికి పయనమయ్యారు. వారికి తోడుగా మహోదరుడు, మహాపార్శ్వుడు కూడా వెళ్ళారు. వానర రాక్షస వీరుల మధ్య యుద్ధం మళ్ళీ భీకరంగా సాగింది. నరాంతకుని వీరవిహారానికి రణరంగం వానర కళేబరాలతో నిండిపోయింది. సుగ్రీవుని ఆజ్ఞపై అంగదుడు నరాంతకునిపైకురికాడు. అంగదుని పిడకిలిపోటుకు నరాంతకుడు నెత్తురు కక్కి విలవిల తన్నుకొని మరణించాడు.

నరాంతకుడి మరణంతో దేవాంతకుడు, త్రిశిరుడు, మహోదరుడు దుఃఖంతో అంగదుని మీదికి ఉరికారు. తగ్గకుండా అంగదుడూ ముగ్గురిపైనా పోరు సాగించాడు. అది చూసి హనుమంతుడు, నీలుడు అంగదునికి తోడు వచ్చారు. హనుమంతుడి పిడికిలి దెబ్బకు దేవాంతకుడి శిరస్సు వ్రక్కలై మరణించాడు. నీలుడు ఒక మహాపర్వతంతో కొట్టి మహోదరుని చంపేశాడు. త్రిశిరుడు వేసిన మహాశక్తిని హనుమంతుడు పెళ్ళున విరిచి వేశాడు. త్రిశిరుని మూడు తలలను వాడి కత్తితోనే ఒక్క వేటుతో నరికేశాడు. మహా పార్శ్వుడి గదను లాగుకొని వృషభుడు దానితోనే వాడి తలను పగులగొట్టాడు.

పినతండ్రులు, సోదరుల మరణం చూసి మహా తేశ్శాలి అయిన అతికాయుడు మరొక కుంభకర్ణుడిలా యుద్ధంలోకి దూకాడు. వానర నాయకులు విసిరిన చెట్లు, పర్వతాలు, బండరాళ్ళూ పిండి చేసేశాడు. లక్ష్మణుడు, అతికాయుడు ఒకరికి తీసిపోకుండా ఒకరు మెరుపులలాంటి శస్త్రాస్త్రాలతో యుద్ధం చేశారు. చివరకు వాయుదేవుని సలహాపై సౌమిత్రి బ్రహ్మాస్త్రాన్ని సంధించి అతికాయుని తల తెగనరికాడు. భయభ్రాంతులై రాక్షస సేన అంతా లంకలోకి పరుగులు తీశారు.

హనుమ ఓషధి పర్వతాన్ని తెచ్చుట[మార్చు]

ఇంద్రజిత్తు వేసిన బాణానికి గాయపడ్డ లక్ష్మణుడు

పుత్రుల, సోదరుల మరణానికి చింతాక్రాంతుడై యున్న రావణునికి ధైర్యం చెప్పి ఇంద్రజిత్తు యుద్ధరంగానికి వెళ్ళాడు. హోమం చేసి అస్త్రాలను అభిమంత్రించి అదృశ్యరూపుడై వానర సేనను నిశిత శరాలతో చీల్చి చెండాడ సాగాడు. వానర వీరులంతా సంజ్ఞా విహీనులై పోయారు. ఇక ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దానితో అందరూ మూర్ఛిల్లారు. రామ లక్ష్మణ హనుమంతులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నించక తప్పలేదు. అందరూ మరణించారనుకొని సింహనాదం చేసి ఇంద్రజిత్తు విజయోత్సాహంతో లంకలోకి వెళ్ళాడు.

మృత ప్రాయులై ఉన్నవారిలో బ్రతికినవారికోసం విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని హనుమను కోరాడు.

జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్నే సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. రామ లక్ష్మణులూ, వానరులూ సృహలోకి వచ్చారు. విగతులైన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. అయితే ఎప్పటికప్పుడు మరణించిన రాక్షసులను సముద్రంలో త్రోసివేయమని రావణుడు ఆజ్ఞనిచ్చినందువలన రాక్షసులకు ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.

సుగ్రీవాజ్ఞ ప్రకారం కొరకంచులు చేతబట్టి వానరులు లంకానగరంలోకి ప్రవేశించి నగరాన్ని తగులబెట్టారు.

కుంభ, నికుంభుల మరణం[మార్చు]

సుగ్రీవుని దెబ్బకి నేలపై పడిన కుంభుడు

మండిపడిన రావణుడు కుంభకర్ణుడి కొడుకులైన కుంభుణ్ణీ, నికుంభుణ్ణీ యుద్ధానికి బయలుదేరారు. వారివెంట యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంఘుడు, కంపనుడు కూడా వెళ్ళారు. వీరంతా మహాయోధులు. వారిని వానరసేన చుట్టుముట్టింది. అంగదుడు విసిరిన పర్వత శిఖరం క్రింద పడి కంపనుడు పిండి పిండి అయి చనిపోయాడు.

శోణితాక్షుడు, యూపాక్షుడూ, ప్రజంఘుడూ అంగదునిపైకి దుమికారు. అంగదునికి బాసటగా మైందుడు, ద్వివిధుడు నిలిచారు. వారి ఆరుగురి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ప్రజంఘుని కత్తితోనే అంగదుడు వాడి తల ఎగురగొట్టాడు. ద్వివిధుడు శోణితాక్షుడి మొహం అంతా రక్కేసి నేలబెట్టి రాసేశాడు. మైందుడు యూపాక్షుడిని నేలకు తొక్కిపట్టి పీక పిసికేశాడు.

కుంభుడు రెట్టించిన రోషంతో వాడి బాణాలు వేసి మైందుడిని, ద్వివిధుడిని మూర్ఛపోగొట్టాడు. తన మేనమామలు పడిపోవడం చూసి అంగదుడు కుంభునిపై లంఘించాడు. కుంభుని గుద్దుకు అంగదుడు కూడా సొమ్మసిల్లాడు. దానితో సుగ్రీవుడు యుద్ధానికి వచ్చి చాలాసేపు భీకరమైన బాహు యుద్ధం చేశారు. చివరకు సుగ్రీవుడి పిడిగుద్దులతో కుంభుడు మరణించాడు.

నికుంభుడు పెద్దపరిఘతో వానరులమీదికొచ్చాడు. హనుమంతుని వక్షస్థలానికి తగిలి ఆ పరిఘ ముక్కలయ్యింది. హనుమంతున గుద్దుకు నికుంభుని కవచం పగిలింది. ఇద్దరూ ఒకరినొకరు గుద్దుకున్నారు. చివరకు హనుమంతుడు నికుంభుని తల పట్టుకొని, మెడలు మెలిపెట్టి విరిచేశాడు. వానరులు సంతోషంతో గెంతులు వేశారు. రాక్షసులు భయభ్రాంతులయ్యారు.

కుంభ నికుంభుల మరణవార్త విని రావణుడు మూర్ఛితుడయ్యాడు. తేరుకొని, ఖరుని కొడుకైన మకరాక్షుని యుద్ధానికి పంపాడు. అతనితో కామరూపులైన అనేక రాక్షసుల సేన ఉంది. తన తండ్రిని దండకారణ్యంలో చాంపిన రామునిపై పగ తీర్చుకోవాలని మకరాక్షుని సంకల్పం. మళ్ళీ తరుచర నిశాచరులకు సంకుల సమరం ప్రారంభమయ్యింది. రాముడి పావకాస్త్రంతో మకరాక్షుడు భస్మమైపోయాడు.

ఇంద్రజిత్తు మరణం[మార్చు]

ఇంద్రజిత్తును చంపుతున్న లక్ష్మణుడు

కుంభ నికుంభులు, మకరాక్షుడు కూలిపోయారని వినగానే రావణుని శోక రోష భయాలు ముప్పిరిగొన్నాయి. ఆ నరవానరులను చంపివేసి తన మనస్తాపాన్ని తీర్చవలసిందిగా ఇంద్రజిత్తును ఆశీర్వదించి యుద్ధరంగానికి పంపాడు. హోమం చేసి, శస్త్రాస్త్రాలు ధరించి యుద్ధరంగానికి వచ్చి అదృశ్యరూపంలో వానరసేనను, రామలక్ష్మణులను కలచివేయసాగాడు. లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం వేయాలంటే రాముడు అతనిని వారించాడు. ఇంతలో దృశ్యరూపుడై మాయాసీత తలను అందరి యెదుటా తెగనరికాడు. అది చూసి అంతా శోకంలో మునిగిపోయారు. రావణుని తత్వం తెలిసిన విభీషణుడు అది కేవలం మాయ అని వారికి నచ్చచెప్పాడు. ఇంద్రజిత్తు నికుంభిలా యాగం చేయడానికి వెళ్ళాడు. అతని చుట్టూ రాక్షసులు వ్యూహం తీరి కవచంలా ఉన్నారు.

యాగం చేయడడానికి ఇంద్రజిత్తు నికుంభిలకు వెళ్ళకుండా ఎవరు ఆపగలరో వారిచేతులోనే ఇంద్రజిత్తు చావు రాసిపెట్టి ఉందని విభీషణుడు చెప్పాడు. రాముని అనుజ్ఞ తీసుకొని, లక్ష్మణుడు ఆయుధ ధారియై, హనుమంతుని భుజాలపై ఆసీనుడై, జాంబవంత, విభీషణ, అంగదాది వీరులతో కూడి నికుంభిలవైపు కదిలాడు. భయానక సంగ్రామానంతరం చుట్టూరా ఉన్న రాక్షసులను ఛేదించి ఇంద్రజిత్తును ఎదుర్కొన్నారు. హోమం ఆపి, బంధుద్రోహియైన విభీషణుని నిందిస్తూ, కాలాంతకరూపుడై ఇంద్రజిత్తు సౌమిత్రితో యుద్ధానికి తలపడ్డాడు. విశ్వామిత్రుని శిష్యుడు లక్ష్మణుడు తగువిధంగా సమాధానం చెప్పాడు. ఆ భీకర సమరంలో ఆకాశాన్ని బాణాలు కప్పివేశాయి. సౌమిత్రి మహేశ్వరాస్త్రాన్ని సంధించి "ఇక్ష్వాకు వంశీయుడు రాముడు ధర్మస్వరూపుడూ, సత్యవ్రతుడూ అయితే ఈ మహేశ్వరాస్త్రం ఇంద్రజిత్తును వధించుగాక" అని సమంత్రకంగా అస్త్రాన్ని విడచాడు. ఇంద్రజిత్తు తల తెగిపడింది. రాక్షసులు పారిపోయారు. వానరులు లక్ష్మణస్వామికి జయం పలుకుతూ చిందులు వేస్తూ రామునికడకు చేరుకొన్నారు.

రామరావణ యుద్ధం ఆరంభం[మార్చు]

రావణునితో పోరాడుతున్న రామ లక్ష్మణులు - c.1910's నాటి చిత్రం

ఇంద్రజిత్తు మరణంతో రావణుడు తెలివితప్పి పడిపోయాడు. లేచి, కోపంతో సీతను చంప బోయాడు. సుపార్శ్వుడు అనే బుద్ధిమంతుడైన అమాత్యుడు అతనిని వారించి, వీరోచితంగా యుద్ధంచేసి విజయుడవు కమ్మని చెప్పాడు. ఇక రావణుడు అన్నింటికీ తెగించి మహోదరుడు, మహాపార్శ్వుడు, విరూపాక్షుడు వంటి మహావీరులతోను, సైన్యంతోను ఉత్తర ద్వారంగుండా యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. "శ్రీరామచంద్రునికి జయం", "లక్ష్మణునికి జయం", "సుగ్రీవునికి జయం", "ఆంజనేయునికి జయం", "అంగదునికి జయం", "జాంబవంతునికి జయం" అని పేరుపేరునా జయజయ ధ్వానాలు చేస్తూ, ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతూ వానర వీరులు రాక్షసులనెదుర్కోవడానికి ముందుకు దూకారు.

విరూపాక్ష, మహోదర, మహాపార్శ్వుల మరణం

రావణుని మహోగ్రశరధాటికివానర సైన్యము ఛిన్నాభిన్నమైంది. అతనికితోడు విరూపాక్షుడు కూడా విజృంభించాడు. రావణుడు రామునిపైకి ఉరికాడు. విరూపాక్షుడు వానరులను నాశనం చేయసాగాడు. సుగ్రీవుడు ప్రళయకాల ప్రభంజనంలా విజృంభించి, పర్వతాలకు పర్వతాలే విసిరేసి, అనేక రాక్షసవీరులను ఛిన్నాభిన్నం చేశాడు. అడ్డుకొన్న విరూపాక్షుని ముఖంపై సుగ్రీవుడు ఒక్క చరుపు చరిచేసరికి విరూపాక్షుడు రక్తంకక్కుకొని చచ్చిపోయాడు. దావితో మహోదరుడు అద్భుత పరాక్రమంతో వానరులను కూల్చసాగాడు. అతనిని నిలువరించిన సుగ్రీవునికి, మహోదరునికి దారుణమైన మల్లయుద్ధం జరిగింది. సుగ్రీవుడి దెబ్బకు మహోదరుని తల వ్రక్కలయ్యింది. మహాపార్శ్వుడు తన ఖడ్గంతో బీభత్సంగా వానరులను చీల్చేయసాగాడు. అతనిని అంగదుడు ఒక ఇనుప పరిఘతో ఎదుర్కొన్నాడు. జాంబవంతుడు, గవాక్షుడు కలిసి మహాపార్శ్వుని రథాన్ని విరిచేసి గుర్రాలను చంపేశారు. అంగదుడి దెబ్బకు మహాపార్శ్వుడు మరణించాడు.

లక్ష్మణ మూర్ఛ, మారుతి సేవ[మార్చు]

మూర్ఛనొందిన లక్ష్మణుని రక్షణ కోసం ఓషధీ పర్వతాన్ని తెస్తున్న హనుమంతుడు.

రావణుడు తన వాడి బాణాలతో రామలక్ష్మణాదులను వేధించ సాగాడు. లక్ష్మణుడు రావణుని సారథి తల యెగురగొట్టాడు. ధనస్సు విరిచేశాడు. మనుష్యశీర్షం చిత్రించి ఉన్న రావణ పతాకాన్ని ముక్కలు చేశాడు. విభీషణుడు రావణుని గుర్రాలను చావగొట్టాడు. విభీషణునిపై రావణుడు వేసిన అస్త్రాలను, శక్తిని లక్ష్మణుడు నిర్వీర్యం చేసేశాడు. వానరులు జయజయధ్వానాలు చేశారు.

రావణుడు విసిరేసిన శక్తి వక్షస్థలానికి తగిలి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. సోదరుని అవస్థకు పరితపిస్తూనే ప్రళయాగ్నిలా రాముడు రావణునిపై బాణవర్షం కరిపించసాగాడు. కొంత సేపటికి శక్తి లక్ష్మణుని విడచిపెట్టింది. అప్పుడు రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. జగత్తు అరావణం కానాలి" అన్నాడు. రామ రావణ సంగ్రామం చెలరేగింది. ఎంతో సమయం యుద్ధం చేసిన రావణుడు గాలిలోకి ఎగిరి మేఘంలోకి దూరిపోయి లంకలోకి వెళ్ళిపోయాడు.

యుద్ధభూమిలో అచేతనంగా పడిఉన్న లక్ష్మణుని చూసి రాముడు విలపించసాగాడు. లక్ష్మణుడు కేవలం మూర్ఛిల్లాడని ధైర్యం చెప్పి సుషేణుడు మరల హనుమను మరల గిరిశిఖరానికి వెళ్ళమన్నాడు. హనుమంతుడు గరుడగమనంతో వెళ్ళాడు. మూలికలను గుర్తించలేక పర్వతాన్నే పెకలించుకొని ఓషధులతో సహా తెచ్చేశాడు. సుషేణుడు మూలికలను ఏరి రసం తీసి లక్ష్మణుని నాలుకపై పోశాడు. తెలివి వచ్చిన లక్ష్మణుని కౌగలించుకొని రాముడు బావురుమన్నాడు. లక్ష్మణుడు లేచి నిలబడి, "అన్నా! ముందు నువ్వు ప్రతిజ్ఞ చెల్లించుకో. నీ కంట పడ్డాక శత్రువు బతికి ఉండగలడా? ఈ సాయంసంధ్యలో సూర్యుడు అస్తమించకుండానే రావణుడు కడతేరాలి" అన్నాడు.

రావణ సంహారం[మార్చు]

పోరాడుతున్న రామ రావణులు

అదే సమయంలో ఇంద్రుడు పంపగా మాతలి దివ్యమైన రథంతో సారథిగా వచ్చాడు. అగ్ని సమానమైన కవచం, ఐంద్రచాపం, సూర్య సంకాశాలైన శరాలు, తీక్ష్ణమైన శక్తి కూడా ఆ రథంలో ఉన్నాయి. రాముడు సంతోషించి ప్రదక్షిణం చేసి రథం యెక్కాడు. రావణుడు వజ్రసదృశమైన శూలాన్ని చేతబట్టి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. రావణుడు విసిరేసిన శూలం ఎదురుపడి రాముని బాణాలు కాలిపోయాయి. అప్పుడు రాముడు మాతలి తెచ్చిన ఇంద్రశక్తిని విసిరేశాడు. అది రావణుని శూలాన్ని నిర్మూలించింది. రావణుడు కూడా శరపరంపరతో రాముని ముంచెత్తాడు. రాముడు విడచిన తీవ్ర బాణాలతో రావణుడి శరీరం రక్తసిక్తమయ్యింది. చివరకు అస్త్రవిహీనుడైన రావణుని పరిస్థితి గమనించి అతని సారథి రథాన్ని దూరంగా తీసుకుపోయాడు.

అగస్త్యుడు అక్కడికి వచ్చి యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు సనాతనము, పరమ రహస్యము అయిన "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. సమస్త లోక సాక్షి అయిన సూర్యుని స్తుతించే ఆ మంత్రం జయావహం. అక్షయం. పరమ మంగళకరం. సర్వపాప ప్రణాశనం. చింతా శోకప్రశమనం. ఆయుర్వర్ధనం. సమస్త ఆపదాపహరణం. రాముడు ఆచమించి ఆ మంత్రరాజాన్ని మూడు మార్లు జపించాడు. జ్యోతిర్గణాధిపతి, దినకరుడు, జయభద్రుడు, సహస్రాంశుడు, తమోఘ్నుడు, శత్రుఘ్నుడు అయిన ఆదిత్యునకు నమస్కరించాడు. ధనుస్సు ధరించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. రావణ సంహారానికి దీక్ష పూనాడు.

రావణుని మరణం

రావణుని సారధి మళ్ళీ రధాన్ని రాముని ముందుకు తెచ్చాడు. సకలాయుధ సంపన్నమై, ఒక గంధర్వ నగరంలా ఉన్న ఆ రథం అప్రదక్షిణంగా వచ్చింది. ఇక రావణుని మరణం తప్పదని గ్రహించిన రాముడు తమ రధాన్ని ప్రదక్షిణ మార్గంలో పోనిమ్మని మాతలికి చెప్పాడు. సర్వ శక్తులనూ ఒడ్డి రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింప సాగారు. వారి బాణాలు ఆకాశాన్ని కప్పేశాయి. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. వారి రథాలు యుద్ధరంగమంతా కలియదిరిగాయి. రాముని బాణాలకు రావణుని పతాకం కూలింది. గుర్రాలు తొలగిపోయాయి.

మహా సర్పాలవంటి రాముని బాణాలకు రావణుని తల తెగిపడింది. కాని వెంటనే మరొకటి మొలిచి ఉంది. ఇలా నూటొక్కసార్లు రావణుని తలలు తెగగొట్టినా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు. అప్పుడు రాముడు తనకు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. అది బుసలు కొడుతున్న సర్పంలా ప్రకాశిస్తున్నది. దాని వేగ సాధనములైన రెక్కలలో వాయువు, ములికిలో అగ్ని సూర్యులు, బరువులో మేరు మందర పర్వతాలు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. దాని శరీరం బ్రహ్మమయం. రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రించి, ధనుస్సును బాగుగా లాగి సావధాన చిత్తుడై విడచాడు. వజ్ర సంకల్పంతో, రాముని వజ్ర హస్తాలనుండి విడువడిన వజ్రసమానమైన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, అతని రక్తంతో పూయబడినదై, ఉపశమనం కోసం భూమిలో ప్రవేశించి, సావధావంగా తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరుపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. సుగ్రీవ విభీషణ అంగదాదులు, లక్ష్మణుడు, ఇతర సహమిత్రులు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముని యధావిధిగా పూజించారు.

సీత అగ్ని ప్రవేశం[మార్చు]

దస్త్రం:A bazaar-art print, c.1910's.jpg
అగ్ని ప్రవేశము చేస్తున్న సీతా దేవి

భీకరంగా జరిగిన యుద్ధంలో రావణుడు కడతేరాడు. రాముని ఆనతిపై విభీషణుడు రావణునికి అంత్య క్రియలు చేశాడు. పిదప విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు. విభీషణుని అనుజ్ఞతో హనుమ లంకలోనికి వెళ్ళి, విజయవార్తను సీతకు నివేదించాడు. విభీషణుని అంతఃపుర పరివారం సీతకు మంగళ స్నానం చేయించి, పల్లకీలో రాముని వద్దకు తీసికొనివచ్చారు.

రాముడు "సీతా, ఇక్ష్వాకుకుల ప్రతిష్ఠకోసం నేనీ యుద్ధం చేశాను. రావణుడు నిన్ను దుష్టదృష్టితో చూశాడు గనుక నేను నిన్ను స్వీకరించలేను. కలక బారిన కనులకు దీపం వలె నీవు నాకు చాలా బాధాకరంగా కనుపిస్తున్నావు. నువ్వు యధేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళవచ్చును." అని కఠినంగా మాట్లాడాడు. సీత దుఃఖంతో బావురుమంది. "ఆర్యపుత్రా, వీరాధివీరా, నీవు పామరునివలె మాట్లాడుతున్నావు. రావణుడు నన్ను తాకిన దోషం నాది కాదు. దైవానిది. నా హృదయం నీమీదే లగ్నం అయి ఉన్నది. నేను జనకుని పెంపుడు కూతురిని. భూమి సుతను. నా భక్తినీ శీలాన్నీ విశ్వసించలేక పోతున్నావా?" అని విలపించింది.

సీత లక్ష్మణునివైపు తిరిగి "లక్ష్మణా, కళంకిని అనిపించుకొని నేనింక బ్రతుకలేను. నా సుగుణాలని కీర్తించని నా భర్త నలుగురిముందు నన్ననరాని మాటలన్నాడు. అగ్నిని ప్రజ్వలింపజేయి" అన్నది. సీత అవనత శిరస్కయై రామునకు, దేవతలకు, దిక్పాలురకు మ్రొక్కి "నా హృదయం సదా రామచంద్రుడినే పూజిస్తున్నట్లయితే సర్వభక్షకుడైన అగ్ని నన్ను పునీతురాలిని చేయాలి" అని పలికి మంటలలోనికి నడచింది. అందరూ హాహాకారాలు చేశారు. అప్పుడు బ్రహ్మ రాముని సమక్షంలో నిలిచి "రామా నువ్వు లోక కర్తవు. ఉత్తమ జ్ఞానివి. అలా చూస్తూ ఊరుకుంటావేం? ప్రాకృతునిలా సీతను ఉపేక్షిస్తావేమీ" అన్నాడు. నీవు విష్ణువు అవతారానివని చెప్పాడు.

అగ్ని సీతను వెంటబెట్టుకొని రాముని వద్దకు వచ్చాడు. సీత అప్పుడు ఉదయసూర్యబింబంలా ఉంది. "రామా! ఇదిగో నీ సీత. ఈమె పునీత. పాపహీన. నిన్నే కోరిన సాధ్వి. ఈమెను అవశ్యం పరిగ్రహించు. నాకడ్డు చెప్పవద్దు. నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను" అని చెప్పాడు. రాముడు "సీత పరమపవిత్రురాలని నేనెరుగుదును. కాని దశరధ పుత్రుడనైన నేను కామాతురుని వలె ప్రవర్తింప జాలను. ఈమె మహిమను లోకం గుర్తించాలని అగ్ని ప్రవేశాన్ని మౌనంగా వీక్షించాను. నా పట్ల వాత్సల్యం కలవారు గనుక మీరు చెప్పినట్లే చేస్తాను" అని తన దక్షిణ హస్తాన్ని చాచి సీత చేతినందుకొన్నాడు.

అయోధ్యకు పునరాగమనం[మార్చు]

రాముని ఆహ్వానిస్తున్న భరతుడు - రాజా రవివర్మ చిత్రం

రాముని కోరికపై ఇంద్రుడు చనిపోయిన వానరులందరినీ బ్రతికించాడు. సైన్యమంతా సంబరాలలో మునిగిపోయింది. అయోధ్య చేరాలన్న ఆతురతలో ఉన్న రాముడు విభీషణుని సత్కారాలను తిరస్కరించాడు. విభీషణుడు రాముని అనుజ్ఞతో వానరులను సత్కరించాడు. విభీషణుడు, వానరులు తోడు రాగా పుష్పక విమానంపై సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో తమ లంకా యుద్ధ, సీతాపహరణ, వనవాస ప్రదేశాలను చూసుకొంటూ కిష్కింధను, గోదావరిని, యమునను, గంగను దాటి భరద్వాజ ముని ఆశ్రమం చేరుకొన్నారు. వానరుల సంతోషం కోసం అకాలంలో కూడా వృక్షాలన్నీ తియ్యటి పళ్ళతో విరగబూసేటట్లుగా రాముని కోరికపై భరద్వాజ ముని వరమిచ్చాడు.

ముందుగా హనుమంతుడు నందిగ్రామం చేరుకొని హనుమంతుడు భరతునికి సీతారామలక్ష్మణుల పునరాగమన సందేశాన్ని అందించాడు. ఆనందంతో భరతుడు అయోధ్యను అలంకరింపమని ఆనతిచ్చాడు. రాముని పాదుకలు శిరస్సుపై ధరించి పరివారసహితుడై ఎదురేగి రామునికి, సీతకు, లక్ష్మణునికి ప్రణమిల్లాడు. సుగ్రీవాది వీరులను ఆలింగనం చేసుకొన్నాడు. సౌహార్దంవల్ల తమకు సుగ్రీవుడు ఐదవ సోదరుడని పలికాడు. రాముని పేరుతో తాను రాజ్య సంరక్షణ చేస్తున్నానని, రాజ్యభారాన్ని తిరిగి చేకొనమని శ్రీరాముని ప్రార్థించాడు. గోశాలలు, ధాన్యశాలలు, ధనాగారం, సైన్యాలను పరీక్షించుకోమని కోరాడు. భరతుడే సారథ్యం వహించగా, శత్రుఘ్నుడు శ్వేతచ్ఛత్రం పట్టగా, లక్ష్మణ విభీషణులు వింజామరలు వీయగా, వానరవీరులు వెంటరాగా సీతారాములు పరివార సమేతులై శంఖభేరీ భాంకారాలతోఅయోధ్యలోనికి ప్రవేశించారు. తల్లులకు, పెద్దలకు, గురువులకు మ్రొక్కారు. వనవాస విశేషాలు, సీతాపహరణం, కిష్కింధలో సుగ్రీవుని మైత్రి, హనుమంతుని అసమాన కార్య సాధన, విభీషణ శరణాగతి, లంకాయుద్ధాది వివరాలు విని అయోధ్యాపౌరులు అత్యాశ్చర్యభరితులయ్యారు.

శ్రీరామ పట్టాభిషేకం[మార్చు]

రాముని పట్టాభిషేకం

శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తం నిశ్చయమయ్యింది. సుగ్రీవాజ్ఞతో జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, ఋషభుడు సుషేణుడు, గవయుడు, నలుడు నదీనద సముద్ర జలాలు తెచ్చారు. వసిష్ఠ మహర్షి ఋత్విక్కులతో కలిసి సీతారాములను రత్న సింహాసనంపై కూర్చుండబెట్టారు. వసిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు, తరువాత ఋత్విక్కులు, బ్రాహ్నణులు, కన్యలు, యోధులు వారిని అభిషేకించారు. వారితోబాటే లోకపాలకులు, దేవతలు శ్రీరామచంద్రుడిని అభిషేకించారు. వాయుదేవుడు స్వయంగా బంగారు తామరపూల మాలికను రాముని మెడలో వేశాడు. ఆ సమయాన వసుధ సకల సస్యాలతోనూ రాణించింది. రాముడు బ్రాహ్మణులకు అనేక దానాలు చేశాడు. సుగ్రీవ, విభీషణ, జాంబవంతాది మహావీరులకు అనేక బహుమతులిచ్చి సత్కరించాడు. శ్రీరాముడు సీతకొక నవరత్నాలూ పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది. అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది. సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారంతో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు. రాముని సెలవు తీసికొని విభీషణుడు లంకకు, వానరులు కిష్కింధకు తరలిపోయారు.

యువరాజుగా ఉండడానికి లక్ష్మణుడు సమ్మతించలేదు. భరతునకు యౌవరాజ్యాభిషేకం చేశాడు రాముడు. తరువాత శ్రీరాముడు అశ్వమేధం, పౌండరీకం, మరెన్నో క్రతువులు చేశాడు. లక్ష్మణుడు తనకు సాయపడుతూ ఉండగా పదకొండువేల సంవత్సరాలు రాజ్యపాలవం చేశాడు. శ్రీరాముని రాజ్యంలో జనులు సుఖసంతోషాలతో ఉన్నారు. స్త్రీలు వైధవ్యం ఎరుగరు. వృద్ధులు జీవించియుండగా పిన్నవాళ్ళు మరణించలేదు. మేఘాలు కాలానుగుణంగా వర్షించేవి. ధరణి సస్యశ్యామలంగా ఉండేది. ప్రజలు కులవృత్తులను నిర్వహిస్తూ ధర్మపరాయణులై ఉండేవారు.

ఫలశ్రుతి[మార్చు]

పట్టాభిషిక్తులైన సీతారాములు, పరిజనసమేతంగా - జీలకర్రగూడెం గ్రామం ఆలయంలో శిల్పం

వాల్మీకి రచించిన ఈ రామకథను చదివినవారు, విన్నవారు కూడా పాపవిముక్తులై ధనధాన్యసంపదలను పొందుతారు. వారికి కీర్తి, విజయం, చిరాయువు లభిస్తాయి. కష్టాలను అధిగమిస్తారు. పరదేశాలపాలయినవాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకొంటారు. సత్సంతానాన్ని పొందుతారు. దీర్ఘాయుష్మంతులౌతారు. ఈ రామాయణం శ్రద్ధగా చదివేవారియందు, వినేవారియందు శ్రీరాముడు దయాపరుడై యుంటాడు. ఈ సీతా చరితాన్ని వింటే స్త్రీలు స్వకుటుంబ వృద్ధితోబాటు సకల శుభాలూ పొందుతారు.

కొన్ని శ్లోకాలు, పద్యాలు[మార్చు]

విభీషణునికి శరణు ఇచ్చేముందు రాముడు అన్న మాటలు

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ

యుద్ధం ఆరంభిస్తూ వానరసేన చేసిన జయఘోష

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః

రాముడు ధర్మపరుడూ, సత్యసంధుడూ, ఎదురులేని వీరుడూ అయితే ఈ బాణంతో ఇంద్రజిత్తు నేల కూలుతాడు - అంటూ లక్ష్మణుడు బాణం విడచాడు.

ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది
పౌరుషే చా అప్రతిద్వంద్వః తదైనం జహి రావణిమ్

"ఇవ్వాళ రాముడంటే ఏమిటో చూపిస్తాను" అని రాముడు రావణునితో యుద్ధానికి బయలుదేరాడు.

"అద్య పశ్యంతు రామస్య రామత్వం మయ సంయుగే"

ఆకాశాన్ని పోల్చడానికి ఆకాశమే సరి. సముద్రాన్ని సముద్రంతోనే పోల్చగలం. అలాగే రామ రావణుల యుద్ధాన్ని మరి దేనితోను పోల్చడానికి వీలు లేదట.

గగనం గగనాకారం సాగరం సాగరోపమం
రామ రావణయోర్యుద్ధం రామరావణయోరివ.

ఆధ్యాత్మ రామాయణంలో రావణ వధానంతరం శ్రీరాముని వర్ణన ఇలా ఉంది.

హత్వా యుద్ధే దశాననం త్రిభువన విషమం వామ హస్తేన చాపం
భూమౌ విష్ఠభ్య తిష్ఠన్నితర కరధృతం భ్రామయన్ బాణమేకం
ఆరక్తోపాంతః నేత్రః శరదళిత వపుః సూర్య కోటి ప్రకాశో
వీరశ్రీ బంధురాంగః త్రిదశ పతి నుతం పాతు మాం వీర రామః

మూడు లోకాలకు కంటకుడైన రావణుని సంహరించిన రాముడు ఎడమ చేత చాపము భూమిపై ఆనించి ఉన్నాడు. రెండవ చేత ఒక బాణాన్ని త్రిప్పుతున్నాడు. కనులు ఎర్రబడి ఉన్నాయి. శరీరం బాణాలతో గాయపడి కోటి సూర్యులవలె వెలుగుతున్నది. వీరశ్రీబంధురమై ఉంది. ముప్పది దిశల అధిపతులచే కీర్తింపబడుచున్న అట్టి శ్రీరాముడు నన్ను కాపాడుగాక.

ఆధ్యాత్మిక విశేషాలు[మార్చు]

ఈ కాండములో అనేక భాగాలు - ముఖ్యంగా నాగపాశ విమోచన, హనుమ ఓషధి పర్వతాన్ని తీసుకు రావడం, ఆదిత్య హృదయం, రావణ సంహారం, శ్రీరామ పట్టాభిషేకం వంటిభాగాలు పారాయణ చేస్తే సత్ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఉంది. సుందరకాండ పారాయణా క్రమంలో వీటిని కూడా పారాయణ చేస్తారు.

సాహితీ విశేషాలు[మార్చు]

మొత్తం యుద్ధ కాండ సర్గల జాబితా[మార్చు]

సర్గ 16శ్లోకం 10

తెలుగులో యుద్ధ కాండ రచనలు[మార్చు]

ఇతర విశేషాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వనరులు[మార్చు]

  • వాల్మీకి రామాయణం, సరళ సుందర వచనము – రచన: బ్రహ్మశ్రీ కొంపెల్ల వేంకటరామ శాస్త్రి - ప్రచురణ:రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి (2005)
  • సుందర కాడంము, పారాయణ గ్రంథం - రచన: శ్రీమాన్ ఎస్.టి.పి.వి.కోనప్పాచార్యులు - ప్రచురణ:రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి (2002)
  • ఉషశ్రీ రామాయణం – రచన: ఉషశ్రీ - ప్రచురణ: శ్రీ మహాలక్ష్మీ బుక్ కార్పొరేషన్, విజయవాడ (2005)
  • శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందర కాండము (శ్లోకములు, తాత్పర్యములు) - అనువాదకులు: డాక్టర్ ఎమ్.కృష్ణమాచార్యులు, డా.గోలి వేంకటరామయ్య - ప్రచురణ: గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ (2003)

బయటి లింకులు[మార్చు]