గోగినేని భారతీదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోగినేని భారతీదేవి
జననం1908 ఆగష్టు 15
మరణం1972 సెప్టెంబరు 21
నిడుబ్రోలు (పొన్నూరు), గుంటూరు జిల్లా
వృత్తిసంఘసేవ
జీవిత భాగస్వామిఎన్.జి.రంగా

గోగినేని భారతీదేవి (1908 ఆగస్టు 15 - 1972 సెప్టెంబరు 21) స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సేవిక, రాజకీయ నాయకురాలు.

భారతీదేవి గుంటూరు జిల్లా, బాపట్ల తాలూకా, మాచవరం గ్రామంలో 1908 ఆగస్టు 15 న జన్మించింది. తండ్రి వెలగా సుబ్బయ్య. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి. రంగాను 1924 లో వివాహం చేసుకుంది. గుంటూరు శారదా నికేతన్ లోను, చెన్నైలోని విద్యోదయా పాఠశాల లోను విద్యాభ్యాసము చేసి, రంగాతో బాటు ఇంగ్లాండు వెళ్ళి ఆక్స్ ఫర్డ్ లో రస్కిన్ కళాశాలలో చదివింది.

స్వదేశం తిరిగి వచ్చిన తరువాత భర్తతో బాటు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని కారాగారవాసం అనుభవించింది. 1931లో విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమం సందర్భములో తెనాలిలో ఆరు నెలలు ఆందోళన చేసింది. సహాయ నిరాకరణోద్యమంలో పోరాడి రాయవెల్లూరు జైలులో ఒక సంవత్సరము నిర్బంధించబడింది. వెంకటగిరిలో జమీందారీ రైతుల ఆందోళనలో దెబ్బలు తిన్నది. హరిజనోద్యమము, దళితులతో సహభోజనాలు, కులాంతర వివాహాలు మొదలైన పలు కార్యక్రమాలు జరిపింది.

ఈమె 1936 లో గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలుగా ఎన్నికైంది.1940-42 మధ్య ఆంధ్ర కర్షక కాంగ్రెస్ కు అధ్యక్షురాలుగా పనిచేసింది. 1946-47లో మద్రాసు రాష్ట్ర విద్యాసలహా సంఘంలో సభ్యురాలుగా ఉంది. 1956లో కృష్ణా జిల్లా ఘంటసాలలో ఆంధ్ర మహిళా సంఘ అధ్యక్షురాలుగా పనిచేసింది. 1958-64 లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలుగా పనిచేసింది.

1952-53లో రాయలసీమ కరవు వచ్చినపుడు బాధితుల సహాయానికై శ్రమించింది. "అన్నపూర్ణ" అని కొనియాడబడింది.

1972 సెప్టెంబరు 21 న నిడుబ్రోలులో మరణించింది.

మూలాలు[మార్చు]