టైటానిక్ నౌక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టైటానిక్ నౌక

టైటానిక్ నౌక, "వైట్ స్టార్ లైన్" అనే సంస్థ కోసం "హర్లాండ్ అండ్ వోల్ఫ్" అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఒకటి. 1912లో దానిని మొదటిసారిగా ప్రవేశ పెట్టినపుడు ప్రపంచంలో కెల్లా అదే అతి పెద్ద ప్రయాణ నౌక. దాని మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 14, 1912 వ తేదీన ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. 1517 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. దీనివలన ఇది అపకీర్తిని మూటగట్టుకోవడమే కాకుండా, చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనలలో ఒకటిగా మిగిలిపోయింది.

టైటానిక్ డిజాస్టర్ – జెన్యూన్ ఫుటేజ్ (1911–1912)

దీని నిర్మాణంలో అప్పట్లో ఉండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన అది మునిగి పోవడం అసాధ్యం అని జనాలు నమ్మేవారు. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా, ఎంతమంది అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నా, అది అలా మునిగిపోయి అపార ప్రాణనష్టాన్ని కలిగించడం చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. టైటానిక్ బాధితుల గురించి మాధ్యమాల ప్రచారం, నౌకలో జరిగినట్లుగా చెబుతున్న ప్రధాన సంఘటనలు, ఈ సంఘటన పర్యవసానంగా కొత్తగా ప్రవేశపెట్టబడిన నౌకాయాన న్యాయ నియమాలు, 1985లో రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వంలో కనుగొనబడిన టైటానిక్ అవశేషాలు, ఈ నౌకకు అత్యంత ప్రాముఖ్యతను సంపాదించి పెట్టాయి.

నిర్మాణం[మార్చు]

టైటానిక్ లోపల గల విలాసవంతమైన మెట్లు

టైటానిక్ నౌక వైట్ స్టార్ లైన్ అనే సంస్థ కోసం ఐర్లాండు లోని బెల్‌ఫాస్ట్కు చెందిన హర్లాండ్ అండ్ వోల్ఫ్ అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఒకటి. వైట్ స్టార్ లైన్ ప్రధాన పోటీదారైన కునార్డ్ లైన్స్ లూసిటానియా, మౌరిటానియాకు పోటీగా తయారు చేయబడింది. టైటానిక్, దీని సోదర నౌకలైన ఒలంపిక్, త్వరలో నిర్మించబడే బ్రిటానిక్ నౌకలూ కలిపి ప్రపంచంలో అతి పెద్దవైన, విలాసవంతమైన నౌకలుగా పేరు తెచ్చుకోనున్నాయి.

టైటానిక్ నిర్మాణం మార్చి 31, 1909లో అమెరికాకు చెందిన జేపీ మోర్గన్, ఇంటర్నేషనల్ మర్చంటైల్ మెరైన్ కంపెనీ సమకూర్చిన నిధులతో ఆరంభమైంది. దీని ప్రధాన శరీరభాగం (hull) 1911, మే 31కి పూర్తయింది. ఇతర విడిభాగాల కూర్పు మార్చి 31, 1912కి పూర్తయింది. ఇది 882 అడుగుల 9 అంగుళాలు (269 మీటర్లు) పొడవు, 92 అడుగుల 6 అంగుళాల (28 మీటర్ల) వెడల్పు, నీటితలం నుంచి 60 అడుగులు (18 మీటర్లు) ఎత్తులోనూ ఉండేది. ప్రయాణికులు, నౌకా సిబ్బంది మొత్తం కలిపి ఇది 3547 మందిని మోయగలదు. దీని ద్వారా అప్పుడు ఉత్తరాల బట్వాడా జరుగుతుండటంతో దీనికి రాయల్ మెయిల్ స్టీమర్ అనే పేరును కూడా తగిలించారు. అప్పటి నియమాల ప్రకారం ఈ నౌకలో సరిపడా లైఫ్ బోట్లున్నా నౌకలోని ప్రయాణీకులందరికీ అవి సరిపోలేదు.

విశేషాలు[మార్చు]

ఆ కాలంలో టైటానిక్ నౌక విలాసంలోనూ, సౌకర్యంలోనూ దాని ప్రత్యర్థి నౌకలన్నింటినీ తోసిరాజంది. నౌకలోనే ఈతకొలను, వ్యాయామశాల, టర్కిష్ బాత్, రెండు తరగతుల ప్రయాణీకులకు గ్రంధాలయాలు, స్క్వాష్ కోర్టును కలిగి ఉండేది.[1] మొదటి తరగతిలోని ఉమ్మడి గదులు, ఖరీదైన చెక్కతోనూ ఆకర్షణీయమైన అలంకరణలతోనూ, నిండి ఉండేది.[2] మొదటి తరగతి ప్రయాణీకులకు కెఫే పరీసియన్ (Café Parisien) శైలిలో వంటకాలు లభించేవి. ట్రెల్లిస్ అలంకరణలు చేయబడ్డ కొద్దిపాటి సూర్యరశ్మిని ప్రసరింపజేసే వరండా డైనింగ్ హాలులా ఉండేది.[3]

ఈ నౌకలో, ఆ కాలంలో అప్పుడే కొత్తగా అభివృద్ధి చెందిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం జరిగింది. విస్తృతమైన విద్యుదీకరణ వ్యవస్థ, నీటి ఆవిరితో నడిచే జనరేటర్లు ఉండేవి. రెండు శక్తివంతమైన మార్కోని రేడియో సెట్లు కూడా ఉండేవి. వీటిలో ఒకటి 1500 వాట్ల శక్తివంతమైనది. వంతుల వారీగా విధులు నిర్వర్తించే ఆపరేటర్లతో రేయింబవళ్ళు నడపబడుతుండటం మూలాన ఇది మిగతా ప్రపంచంతో ఎడతెరిపిలేని సంబంధాలు కలిగి ఉండేది.[4]

మొదటి ప్రయాణం[మార్చు]

టైటానిక్ నౌక మొట్టమొదటి, చిట్టచివరి ప్రయాణం ఇంగ్లాండులోని సౌథాంప్టన్ నుంచి న్యూయార్క్ నగరం వరకూ సాగవలసిఉంది. ఎడ్వర్డ్ జె స్మిత్ నావికుడిగా ఈ ప్రయాణం, 1912, ఏప్రిల్ 10 బుధవారం ఆరంభమైంది. టైటానిక్ దాని స్థానం నుండి బయలుదేరగానే దానీ శక్తివంతమైన ప్రొపెల్లర్లు విడుదల చేసిన శక్తి వలన దాని పక్కనే లంగరు వేసి ఉన్న న్యూయార్కు లైనర్ కట్లు తెంచుకుని టైటానిక్‌కు సుమారు నాలుగు అడుగుల దూరం వరకూ వచ్చింది. కానీ అప్రమత్తమైన సిబ్బంది ఈ ప్రమాదం నుంచి కాపాడగలిగారు. దీని వలన నౌక ప్రయాణం ఆరంభమవడం గంట పాటు ఆలస్యమైంది. ఇంగ్లీష్ ఛానల్ను దాటిన తరువాత ఫ్రాన్సు లోని చెర్‌బోర్గు వద్ద ఆగి, మరి కొంతమంది ప్రయాణికులను ఎక్కించుకుంది. తరువాత ఐర్లండులోని క్వీన్స్‌టౌన్ వద్ద కూడా ఆగి మొత్తం 2240 మంది ప్రయాణికులతో న్యూయార్కు వైపు ప్రయాణం మొదలు పెట్టింది.

ఘోర ప్రమాదం[మార్చు]

1912, ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. సముద్రం నిశ్చలంగా ఉంది. చంద్రుడు కనపడడం లేదు. ఆకాశం నిర్మలంగా ఉంది. గత కొద్ది రోజులుగా మంచు కొండల గురించి వైర్ లెస్ ద్వారా సమాచారం అందుకుంటున్న నౌక కెప్టెన్ స్మిత్ నౌకను కొద్దిగా దక్షిణం వైపుకు మళ్ళించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆరోజు మధ్యాహ్నం 1:45 సమయానికి అమెరికా అనే స్టీమరు టైటానిక్ నౌక వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. సాయంత్రం మెసాబా అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు కూడా నియంత్రణ గదికి చేరలేదు.

రాత్రి 11:40 సమయంలో టైటానిక్ న్యూఫౌండ్ లాండ్స్ (ఉత్తర అమెరికాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం) వద్దగల గ్రాండ్ బ్యాంక్స్ (సముద్రం లోపల ఉండే పీఠభూముల్లాంటి ప్రదేశాలు) లో ప్రయాణిస్తోంది. నౌకకు ముందుగా దాని దారిలో పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్ళే ఫ్రెడెరిక్ ఫ్లీట్, రెజినాల్డ్ లీ టైటానిక్ కు ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నారు. ఫ్లీట్ కుడి వైపు మంచుపర్వత ముందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్ళే గంటను మోగించాడు. నౌకాధికారి ముర్డోక్ నౌకను ఉన్నపళంగా ఎడమ వైపుకు మళ్ళించమని ఆదేశించాడు. ఇంజన్ ఒక్కసారి ఆగి పోయి మళ్ళీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. కానీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం అనివార్యమైంది. ఈ గుద్దుకోవడంలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్లను బయటపడేసింది.

సముద్రపు నీరు ముందు భాగపు గదులను నింపేస్తుండటంతో వాటి తలుపు వాటంతట అవే మూసుకుపోయాయి. నాలుగు కంపార్ట్ మెంట్లు నీటితో నిండిపోయినా టైటానిక్ తేలగలిగి ఉండేదే కానీ ఐదు కంపార్ట్ ‌మెంట్లూ నీటితో నిండిపోవడం ప్రారంభించాయి. ఈ విధంగా మునిగిపోవడం వలన నీరు పైన ఉండే కంపార్ట్ మెంట్లకు కూడా ఎగదన్నింది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని ఆదేశించాడు. ఏప్రిల్ 15 అర్థరాత్రి తరువాత థామస్ ఆండ్రూస్, ఇతర నౌకాధికారులు పరీక్షించి లైఫ్ బోట్లను సమాయత్త పరచమని పురమాయించారు.

మొదటి లైఫ్ బోటు ఏడవ నంబరు బోటు అందరూ నమ్ముతున్నట్లుగా 12:40 కి కాక 12:27 కి 12 మంది ప్రయాణికులతో క్రిందకు దించబడింది. ఐదవ నంబరు బోటు రెండు మూడు నిమిషముల తర్వాత దించబడింది. టైటానిక్‌లో మొత్తం 1178 మందిని కాపాడగలిగే ఇరవై లైఫ్ బోట్లు ఉండేవి. ఇవి నౌకలోని మొత్తం సిబ్బంది, ప్రయాణికులకు సరిపోకపోయినా అప్పటి బ్రిటీష్ నియమాల ప్రకారం కావల్సిన దానికన్నా ఎక్కువ బోట్లే ఉన్నాయి. అప్పట్లో నౌకలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దాని కన్నా, నౌక ఎంత బరువున్నదాన్ని బట్టి బోట్ల సంఖ్యను లెక్కించే వారు.

వైర్‌లెస్ ఆపరేటర్లయిన జాక్ ఫిలిప్స్, హరాల్డ్ బ్రైడ్ ప్రమాద సంకేతాలను నలుదిక్కులకు పంపించడం ప్రారంభించారు. "మౌంట్ టెంపుల్", "ఫ్రాంక్‌ఫర్ట్", టైటానిక్ సోదర నౌక "ఒలంపిక్", వంటి చాలా నౌకలు తిరిగి సమాధానం కూడా ఇచ్చాయి. కానీ ఏ నౌకా సమయానికి దగ్గర్లో లేక పోయింది. అన్నింటికన్నా దగ్గర్లో ఉన్న నౌక కునార్డ్ లైన్స్ కి చెందిన "కర్పతియా" (58 మైళ్ళ దూరంలో ఉన్నది). కానీ అది ప్రమాదస్థలికి చేరుకొనేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది. టైటానిక్ పంపించిన అపాయ సందేశాన్ని అందుకున్న ఏకైక భూతల వైర్‌లెస్ స్టేషను న్యూఫౌండ్‌ల్యాండ్లో గల క్యాప్ రేస్.

అవశేషాల కోసం అన్వేషణ[మార్చు]

టైటానిక్ మునిగిపోయిన కొద్ది కాలానికే దాని అవశేషాలను కనుగొనాలని, వీలైతే దానిని సముద్రగర్భం నుంచి బయటకు తీసుకురావాలని ఆలోచనలు చేశారు కానీ సెప్టెంబర్ 1, 1985 వరకూ అవి ఏవీ కార్యరూపం దాల్చలేదు. తరువాత వోడ్స్ హోల్ సముద్ర పరిశోధనా సంస్థకు చెందిన జీన్ లూయిస్ మైకేల్, రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వంలో సముద్రం అడుగు భాగంలో 2 మైళ్ళ లోతులో నౌక అవశేషాలను కనుగొనడం జరిగింది.

ఈ పరిశోధనలో బయటపడిన ప్రధానమైన అంశాలు: నౌక రెండుగా విడిపోయిందని కనుగొనడం. ముందు భాగం, వెనుక భాగం విడిపడిపోయి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో 600 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి. ఈ అన్వేషణలకు మునుపు అమెరికన్, బ్రిటీష్ విచారణలు కూడా నౌక రెండుగా విడిపోలేదని తేల్చాయి. అంతేకాక ఇది రెండుగా విడిపోయిందా? లేదా అన్న విషయంపై విభిన్న కథనాలు వినిపించేవి.

నవలలు, సినిమాలు[మార్చు]

టైటానిక్ ఇతివృత్తంగా అనేక కాల్పనిక నవలలు, సినిమాలు విడుదలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన కొన్ని నెలల తర్వాత దీన్ని గురించి కొన్ని మూల గ్రంథాలు కూడా రాయడం జరిగింది. ప్రమాదం నుంచి బయటపడిన లైటోలర్, జాక్ థయర్ వంటి వారు తమ అనుభవాలను గ్రంథస్తం చేశారు. వాల్టర్ లార్డ్ అనే రచయిత స్వయంగా టైటానిక్‌లో ప్రయాణించిన వ్యక్తులను కలిసి, పరిశోధన చేసి, అసలు నౌకలో ఏం జరిగిందో వర్ణించాడు.

టైటానిక్ ఆధారంగా తీసిన కొన్ని సినిమాలు

వీటిలో బాగా ప్రాచుర్యం పొందిన సినిమా 1997లో విడుదలైంది. దీనికి జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించాడు. కేట్ విన్‌స్లెట్, లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలు ధరించారు. ఇది చలన చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగానే కాక 14 ఆస్కార్ పురస్కారాలలో 11ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అంతకు ముందు ఈ ఘనత సాధించిన చిత్రం బెన్‌హర్ (1959). తరువాత ఈ ఘనత 2003లో నిర్మించిన ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే సినిమా సాధించింది.

అవీ-ఇవీ[మార్చు]

  • టైటానిక్‌లో భారతదేశం నుండి ప్రయాణించిన ఒకే ఒక అమెరికన్ కుటుంబం గుంటూరుకు చెందింది. వీరు గుంటూరు నుండి అమెరికాకు తిరిగి వెళుతూ ఇంగ్లాడులో టైటానిక్ ఎక్కారు. అయితే ఈ దుర్ఘటనలో వీరు రక్షింపబడ్డారు.[5][6]

గణాంకాలు[మార్చు]

నౌకలో ప్రయాణిస్తున్న వారి గణంకాలు విధంగా ఉన్నాయి.[7]

ప్రయాణిస్తున్నది బయటపడ్డది
మొదటి తరగతి ప్రయాణికులు 324 201
రెండవ తరగతి ప్రయాణికులు 277 118
మూడవ తరగతి ప్రయాణికులు 708 181
సిబ్బంది 885 212
పోస్టుమ్యాన్లు, సంగీత కళాకారులు 13 0

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "టైటానిక్ గురించిన నిజాలు". Archived from the original on 2016-07-11. Retrieved 2008-05-01.
  2. "టైటానిక్: ఎ వాయేజ్ ఆఫ్ డిస్కవరీ".
  3. "టైటానిక్ నిర్మాణము". Archived from the original on 2009-04-15. Retrieved 2008-05-01.
  4. "టైటానిక్ నౌకలో వైర్ లెస్ సౌకర్యాలు".
  5. గుంటూరు కుటుంబము: http://www.encyclopedia-titanica.org/titanic-biography/nellie-becker.html
  6. టైటానిక్ లో గుంటూరు వారు: http://www.hinduonnet.com/2004/04/15/stories/2004041502012400.htm Archived 2010-08-26 at the Wayback Machine
  7. http://www.encyclopedia-titanica.org/

వెలుపలి లంకెలు[మార్చు]