నిడమర్తి అశ్వనీ కుమారదత్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిడమర్తి అశ్వనీ కుమారదత్తు (జూలై 22, 1916 - నవంబరు 23, 1977) ప్రముఖ కార్మిక నాయకులు, పత్రికా నిర్వాహకులు. సోవియట్ లో చిరకాలం తెలుగు ప్రచురణల విభాగం నిర్వహించిన నిడమర్తి ఉమా రాజేశ్వరరావు గారు వీరి సోదరులు.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

వీరు పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామంలో 1916, జూలై 22 తేదీన నిడమర్తి లక్ష్మీనారాయణ, వెంకమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఉండి గ్రామంలో ఉన్నత పాఠశాల చదువి, గుంటూరు లో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు.

1934-36 మధ్యలో నిడమర్రు కేంద్రంగా యువజన, రైతు సంఘాలలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగానూ, గ్రంథాలయోద్యమం, గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో కృషి చేశారు. తర్వాత ఉన్నత విద్యకోసం 1937లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో చేరారు. అదే ఏడాది ఎం.ఎన్.రాయ్ దంపతులు విశాఖపట్నం వచ్చినప్పుడు జరిగిన సభలో పాల్గొన్నారు. విద్యార్ధిగా ఉన్నప్పుడు ఆనాటి వైస్ చాన్స్‌లర్ సి.ఆర్. రెడ్డి గ్రంథాలయంలోని కమ్యూనిష్టు ఉద్యమ గ్రంథాలను తొలగించారు. అందుకు నిరసనగా వీరి నాయకత్వంలో సమ్మె జరిగింది. ఫలితంగా వీరు యూనివర్సిటీ నుండి బహిష్కరించబడ్డారు.

1937లో నిడమర్రు తిరిగివచ్చి స్వతంత్ర భారత్ అనే రహస్య పత్రికను నడిపారు. క్లాన్యూ క్రాంజ్ ను అన్నా అనే పేరుతో అనువదించారు. రాజగోపాలాచారి ప్రభుత్వం ఈ నవలను నిషేధించింది. వీరు తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో బి.ఎస్సీ. చదివారు. అక్కడ కమ్యూనిష్టు ప్రముఖులు నీలం రాజశేఖరరెడ్డి గారిని కలిశారు. అక్కడే ఫాంటమారా ను అనువదించారు[1].

సొంతవురు వచ్చి మల్లీ రైతు, వ్యవసాయ కార్మిక విప్లవాలలో పాల్గొన్నారు. ప్రగతి ప్రచురణాలయం స్థాపించి ప్రధానంగా కమ్యూనిష్టు ఉద్యమ సాహిత్యాన్ని ప్రచురించారు. 1945లో మద్రాసు ప్రభుత్వ పరిశ్రమల శాఖలో డెవలప్‌మెంట్ ఆఫీసరుగా చేరారు. అక్కడ రెండు సంవత్సరాలు పనిచేసి, గూడూరులో ఇండస్ట్రియల్ కెమిష్టుగా చేరారు. అక్కడ నుండి బేతంచర్లకు బదిలీ అయ్యారు.

మరణం[మార్చు]

వీరు 1977, నవంబరు 23 తేదీన అనారోగ్యంతో బేతంచర్లలోనే పరమపదించారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]