పలివెల (కొత్తపేట మండలం)
పలివెల | |
— రెవిన్యూ గ్రామం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 16°43′00″N 81°54′00″E / 16.7167°N 81.9000°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ |
మండలం | కొత్తపేట) |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 7,897 |
- పురుషులు | 3,955 |
- స్త్రీలు | 3,942 |
- గృహాల సంఖ్య | 2,205 |
పిన్ కోడ్ | 533 229 |
ఎస్.టి.డి కోడ్ |
పలివెల, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామం.[1]
ఇది మండల కేంద్రమైన కొత్తపేట నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 29 కి. మీ. దూరంలోనూ ఉంది. పలివెల రాజమహేంద్రవరంకి 50 కి.మీ., కాకినాడకు 90 కి.మీ. అమలాపురానికి 25 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి దేవాలయం ఉంది.ఇక్కడ శివరాత్రి రోజున కళ్యాణ మహోత్సవం విశేషం.
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,082.[2] ఇందులో పురుషుల సంఖ్య 4,083, మహిళల సంఖ్య 3,999, గ్రామంలో నివాస గృహాలు 2,038 ఉన్నాయి.
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2205 ఇళ్లతో, 7897 జనాభాతో 1263 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3955, ఆడవారి సంఖ్య 3942. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2923 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 168. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587682[3].పిన్ కోడ్: 533229.
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
"పలివెల" అను పేరు ఈ గ్రామానికి రావడం గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
- పౌరాణిక గాథ
పౌరాణిక గాథ ననుసరించి, క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతలింగాన్ని రాక్షసులు ఒక 'పల్వలము' (గొయ్యి) లో దాచారు. అగస్త్యమహాముని ఆ అమృతలింగాన్ని పరమేశ్వరితో సహా అక్కడే ప్రతిష్ఠించాడు. ఆ పల్వలమే కాలక్రమేణా పలివెలగా మారింది.
- చారిత్రక గాథ.
ఈ ప్రాంతాన్ని పూర్వకాలములో పల్లవులు పాలించుట వలన "పల్లవ" నుండి "పలివెల" అయిందని అంటారు.
స్థల పురాణం[మార్చు]
ఇక్కడి శివలింగ ప్రతిష్థ అగస్త్య మహర్షి ద్వారా జరిగింది అని ప్రతీతి. ఈ దేవాలయములోని కళ్యాణ మండపాన్ని11 వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు జీర్ణోద్ధారణ చేశాడని చెబుతారు. ఈ ఆలయ కళ్యాణమండపములో వేదిని అల్లాదరెడ్డి సా.శ. 1416లో కట్టించి ఈ మండపమునకు కొత్త రూపాన్ని ఇచ్చినట్లు ఈ మండపములోనే శాసనము ఉంది. అగస్త్యమహర్షి శివ పార్వతుల కళ్యాణం చూడవలెనని కొరికతో కౌశిక నది ఒడ్డున శివలింగ ప్రతిష్థ చేశాడు. దక్ష యజ్ఞానికి పూర్వం ఇంద్రాది దేవతలు, హిమవంతుడు అగస్త్య మహర్షి పార్వతి కళ్యాణానికి వస్తే ప్రళయం వస్తుంది అని భావించి విశ్వంభరుడుని అగస్త్య మహర్షి వద్దకు పంపుతారు. అగస్త్య మహర్షి తన దివ్యదృష్టితో శివ పార్వతుల కళ్యాణం వీక్షించగా శివ పార్వతులు మధుపర్కాలలో కనిపిస్తారు. అగస్త్య మహర్షి శివుని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై వరాన్ని కొరుకోమనగా అగస్త్య మహర్షి శివపార్వతులను ఒకే పీఠంపై అనుగ్రహించమని కోరుతాడు. ఇదే ఇక్కడ విశేషం. వేరే ఎక్కడ శివ పార్వతులు ఒకే పీఠం మీద కనపడరు. మొదట ఈ క్షేత్రంలో శివుడు లోల అగస్త్య లింగేశ్వరునిగా తరువాత కొప్పులింగేశ్వర స్వామిగా పూజలందుకొంటున్నాడు.
- సాహిత్యాధారాలు
శ్రీనాథుడుని కాలంలో అగస్త్య లింగేశ్వరునిగా పూజలందుకొన్నట్లుశ్రీనాథుడు శ్లొకాన్ని వ్రాశాడు. ఈయన తన కాశీఖండము, భీమఖండము, శివరాత్రి మహాత్మ్యములలో ఈ స్వామిని కొప్పయ్య, కొప్పులింగడు అని గొప్పగా వర్ణిస్తూ, ఈస్వామే తన ఇంటి ఇలవేల్పని చెప్పాడు. ఈ కాలానికే చెందిన అజ్జరపు పేరయలింగ కవి కూడా తన "ఒడయనంబి విలాసం"లో ఈ స్వామిని గురించి వర్ణిస్తూ, ఇప్పటి ఈ చిన్న గ్రామాన్ని ఒక గొప్ప పట్టణముగా చెపుతూ ఇంద్రుడు ఒక్కసారి ఇక్కడికి వస్తే తన స్వర్గాన్ని మరిచిపోతాడని అన్నాడు. ఈ సాహిత్యాధారాల వలన సా.శ. 14వ శతాబ్దంనాటికే పలివెల గొప్ప పట్టణమని, ఇక్కడ వేంచేసి ఉన్న కొప్పులింగేశ్వరుని ఆలయము ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమని తెలుస్తోంది.
చారిత్రక ఆధారాలు: ఈ ఆలయములో అనేక శాసనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ లభించిన వానిలో పురాతనమైనది సా.శ. 1170 కి చెందింది. ఇది ఒక ప్రముఖ కవి యొక్క దాన శాసనము. ఇంకా కాకతీయ ప్రతాపరుద్రునికి చెందిన శాసనము, రెడ్డిరాజులకు చెందిన శాసనాలే కాక ముస్లిం రాజైన కుతుబ్-ఉల్-ముల్క్ కు చెందిన దానశాసనము ఉండడం విశేషం. ప్రస్తుతము సా.శ. 15వ శతాబ్దము వరకూ శాసనాలు లభించాయి. పిఠాపురం రాజావారి పాలనలో కూడా పలివెల ఒక ప్రత్యేకమైన ఠాణాగా ఉండేది. ఈ ఆధారాల వలన సా.శ.10వ శతాబ్దం నుండి కూడా రాజులు, ప్రముఖులు, సామాన్య ప్రజలు ఆలయపోషణ చేసినట్లు తెలుస్తోంది. ప్రతాపరుద్రుని కాలంలో ఆలయ జీర్ణొద్దారణ జరిగినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. ముస్లింల దండయాత్రల సమయంలో నంది తల విరిగి పడింది దానిని ఇప్పుడు అతికించడం జరిగింది.
కొప్పు లింగేశ్వరుడు ఆలయం.[మార్చు]
అక్కడి ప్రజల కథ ప్రకారం ఒకప్పుడు ఒక వెలనాటి పూజారి ఈ శివలింగారాధన శక్తి వంచన లేకుండా చేస్తూ ఉండెవాడు. కాని అ పూజారికి ఒక దురలవాటు ఉండేది. ఆయనకు ఒక వేశ్యతో సంబంధం ఉండేది. ఆ పూజారి మీద ఆరాజ్యపు రాజుకి చాలా పిర్యాదులు అందుటూ ఉండేవి. ఇది గమనించి ఒక రోజు ఆరాజ్యపు రాజు స్వామి దర్శనానికి రాగా ఆ పూజారి స్వామి ప్రసాదాన్ని రాజుకు ఇస్తాడు. ఆ ప్రసాదంలో ఒక వెంట్రుక కనిపిస్తుంది. రాజు ప్రశ్నించగా మా శివునకు జటాజూటం ఉన్నదని రాజుకి తెలిపుతాడు. రాజు పూజారిని జటాజుటం చూపించమనగా పూజారి ఆ రోజు స్వామికి ప్రత్యేక అలంకారంలో ఉన్నారు కాబట్టి మరుసటి రోజు వచ్చి చూస్తే స్వామివారి జటాజూటం కన్పిస్తుంది అని ఆ పూజారి చెప్పగా ఆ రాజు ఆ రోజుకి నిష్క్రమించి తరువాత రోజు రావడానికి అంగీకరిస్తాడు. కాని శివవింగం మీద జాటాజుటం కనిపించకపోతే ఆ పుజారి తల తీయించి వేస్తాను అని చెప్తాడు. ఆ రోజు రాత్రంతా శివలింగానికి పూజలు చేసి మహాదేవుడిని తనను కాపాడమని వేడుకోంటాడు. తరువాత రోజు రాజు దర్శనానికి వచ్చి చూస్తే శివలింగాన్ని చూస్తే జటాజూటం కనిపిస్తుంది. ఆఆరాజుకి ఆ జటాజుటం నిజమో కాదో అని సంశయం కలిగి జటాజుటాన్ని లాగి చుస్తాడు, శివ లింగం నుంచి నెత్తురు వస్తుంది, వెంటనే రాజుకు కంటి చూపు పోతుంది. అప్పుడు ఆ రాజు శివామహాదేవా అని వేడుకొనగా ఆరాజుకు కంటి చూపు వస్తుంది. ఆ రరాజు తన సామ్రాజ్యంలో జుటుగపాడు (ఇప్పటి రావులపాలెం మండలం లోని ఒక గ్రామం) అనే గ్రామాన్ని మాన్యంగా రాజు ప్రకటిస్తాడు. ఇప్పటికి కూడా శివలింగముకు జాటాజూటం ఉంది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ పవిత్రక్షేత్రంలో కొప్పులింగేశ్వరుడుగా పరమ శివుడు భక్తుల దర్శనం ఇచ్చి దర్శనం చేసుకొన్న వారిని మహాదేవుడు తరింపజేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ ఈ గుడిలో ఉన్న రాజగోపురం, స్వామిమందిరం, కొన్ని స్తంభాలు పై ఉన్న శిల్పాలను పరిరక్షిస్తోంది.
ఆలయ విశేషాలు[మార్చు]
దేవాలయానికి కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి. మొదటిది – శివలింగంపై కొప్పు ఉండడం. రెండవది – అమ్మవారు స్వామివారి పక్కనే ఉండడం. శ్రీ పార్వతీపరమేశ్వరులు కలిసియున్న ఏకపీఠం ఇక్కడే ఉంది. మూడవది – నిజానికి శివలింగంపై కొప్పు మొదటినుండి ఉండినది కాదు; కాలాంతరంలో పుట్టుకొచ్చింది. ఈ ఆలయమును తూర్పున కౌసికి, దక్షిణమున సాంఖ్యాయని, పడమర వశిష్ఠ, ఉత్తరాన మాండవి, పల్వల అను అంతర్వాహినిగా ఉన్న ఐదు నదులు చుట్టి ఉన్న ప్రదేశములో నిర్మించినట్లు చెబుతారు. ఈనాడు కూడా కౌసికి, వసిష్ఠలతో పాటు గర్భగుడిలో వర్షాకాలములో నీరు నిండుటచే పల్వలను కూడా చూడవచ్చును. ఇటీవల గర్భ్గగ్రుహమును గ్రానైటు రాయి పరచి బాగు చేశారు.
ఈ ఆలయము పలివెల మధ్యలో నాలుగెకరాల సువిశాల ప్రాంగణములో, ఒక దానిలో ఒకటిగా ఉన్న రెండు ఎత్తైన ప్రాకారాలతో, చుట్టూ వీధులతో రాజసంగా ఉంటుంది. ఈ ప్రాంగణములో ప్రధానాలయము, ఎన్నో మండపాలు, పరివార దేవతాలయాలు ఉన్నాయి. ఈ మండపాలలో చాళుక్యుల, రెడ్డిరాజుల వాస్తు సంప్రదాయాలను చూడవచ్చును. ఈ ప్రాంగణములోని మండపాలు అందలి శిల్పాలలో సా.శ. 10వ శతాబ్దము నుండి సా.శ. 17వ శతాబ్దము మధ్యకాల వాస్తు-శిల్ప పరిణామమును చూడవచ్చును.
ఈ ఆలయములో వివిధ శిల్పాలు కనువిందు చేస్తాయి. ఇవి వేంగి (తూర్పు)చాళుక్యుల, రెడ్డిరాజుల కాలంనాటి శిల్పలక్షణాలు కలిగి ఉన్నాయి. గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన లింగమునకు ముందువైపున అగ్రభాగములో చతురస్రాకారములో ఒక పొడుచుకువచ్చిన భాగము ఉంది. దీనినే కొప్పు అంటారు. ఇందువలననే ఈ స్వామి కొప్పులింగేశ్వరుడుగా ప్రసిద్ధిగాంచాడు. ఈయనకు ప్రక్కనే పార్వతీదేవి (ఉమాదేవి) ప్రతిష్ఠించబడి ఉంది. ఈమెకు ఉన్న ప్రభామండలంనకు రెండు వైపులా గణపతి, కుమారస్వామి కూడా ఉన్నారు. సాధారణంగా శైవాలయాలలోని గర్భగుడిలో ప్రధానంగా లింగము ఉండి, అమ్మవారు ఒక ప్రక్కగా ఉంటుంది, లేక ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఇంక వినాయకుడు, కుమారస్వాములు వేరేగా పరివారదేవతాలయాలలో ఉంటారు. కానీ ఇక్కడ స్వామివారు, అమ్మవారు ప్రక్క ప్రక్కనే ఒకే పీఠంపై ఉన్నట్లుగా ఉన్నారు. అందువలననే ఈ స్వామిని ఉమాకొప్పులింగేశ్వరుడు అంటారు. ఈవిధముగా ఆది దంపతులు సకుటుంబ సమేతంగా గర్భగుడిలోనే ఒకే పీఠంపై వేంచేసి దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. ప్రాంగణములో వినాయకుడు, కుమారస్వామి, భైరవుడు, చండికేశ్వరస్వామి, పాపవిమోచన స్వాములు ప్రత్యేకముగా ప్రతిష్ఠించబడి భక్తుల పూజలందుకుంటున్నారు.
వివిధ మండపాలపై ఉన్న శిల్పాలు అతి మనోహరంగానూ ఆలోచింపజేసీవిగానూ ఉన్నాయి. ఈ మొత్తము శిల్పసంపదను నాలుగు ప్రధాన వర్గాలుగా వర్గీకరించవచ్చును. అవి శైవము, వైష్ణవము, సాంఘికము, ఇతరములు. శైవములో శివ-పార్వతుల వివిధ రూపాలు-వృషభారూఢమూర్తి, లింగోధ్భవమూర్తి, నటరాజు, అర్ధనారీశ్వరుడు మొదలైన అనేకరూపాలేకాక పురాణగాథలైన కిరాతార్జునీయం, మృగవ్యధ మొదలగు గాథలు కూడా ఉన్నాయి. వైష్ణవ శిల్పాలలో కృష్ణుడు, లక్ష్మీదేవి ఇంకా రామాయణ గాథలు ఉన్నాయి.
సాంఘికాలు, ఇతరాలలో ఆనాటి జీవనవిధానాన్ని ప్రతిబింబించే ఎన్నో శిల్పాలు, నర్తకీమణులు, లతలు, జంతువులు మొదలైన శిల్పాలు ఉన్నాయి. మొత్తంగా ఈ ఆలయశిల్పం అత్యంత విలువైంది. ఈ శిల్పాలు వాతావరణ ప్రభావానికి, దాడులకు గురి అవడం వలన చాలా నష్టం వాటిల్లింది. ఇక్కడ ఒక విష్ణాలయము ఉండేదనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ ఆలయము ఇప్పుడు లేదు. అది కాలక్రమేణా శిథిలమైనా అయి ఉండాలి లేదా ఆలయవాస్తు-శిల్పానికి జరిగిన నష్టంలో ఇదీ ఒకటైనా అయి ఉండాలి. అదే కనుక అయితే ఈ ఆలయానికి అధిక శాతంలోనే నష్టం జరిగిందని చెప్పవచ్చును.
ఆలయానికి ఈ మధ్యకాలములో జరిగిన జీర్ణోద్ధరణ కార్యక్రమాల వలన పడిపోవడానికి సిధంగా ఉన్న కట్టడాలను గట్టిపరచడం, కొన్ని కొత్తకట్టడాలు చోటు చేసుకోవడంతో ఆలయము కొత్త శోభలను సంతరించుకుంది. ఇప్పుడు ఈ ఆలయము ఆధునికత అనే మేలిముసుగులో దాగిన అపురూపమైన పురాతనాలయము.
పండుగలు, విశేషాలు[మార్చు]
- గణపతి నవరాత్రులు
- దేవీ నవరాత్రులు
- కార్తీక మాసం
- సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్య షష్ఠి
- ధనుర్మాసం
- కొప్పు లింగేశ్వర స్వామి కళ్యాణం
విద్యా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. గ్రామంలో ఒక ప్రైవేటు మేనేజిమెంటు కళాశాల ఉంది. సమీప మాధ్యమిక పాఠశాల కొత్తపేటలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కొత్తపేటలోను, ఇంజనీరింగ్ కళాశాల అమలాపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల అమలాపురంలోను, పాలీటెక్నిక్ రావులపాలెంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం కొత్తపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజమహేంద్రవరం లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం[మార్చు]
ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]
పలివెలలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]
గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు[మార్చు]
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం[మార్చు]
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.
చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]
పలివెలలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]
గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు[మార్చు]
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం[మార్చు]
పలివెలలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 147 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 4 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 1112 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 4 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1108 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]
పలివెలలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 847 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 256 హెక్టార్లు
- ఇతర వనరుల ద్వారా: 4 హెక్టార్లు
ఉత్పత్తి[మార్చు]
పలివెలలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు[మార్చు]
ప్రముఖులు[మార్చు]
- కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి (జ: 2-2-1863 - మ: 29-10-1940) ప్రముఖ తెలుగు రచయిత ఇక్కడే జన్మించారు.
- ప్రత్యక్ష బాహాట పాంకాల శయ్యల చదివింప నేర్తునే చదువ నేర్తు అని ప్రకటించుకున్న బులుసు రామగోవింద శాస్త్రి పెద్దాపుర సంస్థానం మహారాజ రాజా వత్సవాయ తిమ్మజగపతి బహద్దరు గారి ఆస్థాన పౌరాణికులు - తిమ్మజగపతి కుమారుడైన రాజా రాయ జగపతి హరిభక్తి సుధోదయం అనే కృతిని సమర్పించడం జరిగింది.[4]
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-09.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-09.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ ఆంధ్ర సంస్థానాలు - ముఖ్య సంస్థానాలు - పేజీ నెం - 269