Jump to content

శ్రేయా ఘోషల్‌

వికీపీడియా నుండి
(శ్రేయా ఘోషాల్ నుండి దారిమార్పు చెందింది)
శ్రేయాఘోష‌ల్
జననం (1984-03-12) 1984 మార్చి 12 (వయసు: 41)[1]
దుర్గాపూర్‌, ముర్షిదాబాద్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
వృత్తి
  • గాయని
  • టాలెంట్ షో న్యాయనిర్ణేత
  • టెలివిజన్ వ్యాఖ్యాత
క్రియాశీలక సంవత్సరాలు1998 - ప్రస్తుతం
భాగస్వామి
షిలాదిత్య ముఖోపాధ్యాయ‌
(m. 2015)
పిల్లలు1
Musical career
Genres
  • సినిమా పాటలు
  • పాప్ సాంగ్స్
  • ఘజల్స్
  • భజనలు
  • హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం
Instrumentవోకల్స్

శ్రేయ ఘోషాల్ (Bengali: শ্রেয়া ঘোষাল; జననం : 1984 మార్చి 12) భారత గాయని. హిందీ చిత్రసీమయైన బాలీవుడ్లో ప్రముఖ నేపధ్య గాయని, హిందీ కాకుండా ఇతర భారతీయ భాషలైన అస్సామీ, కన్నడ, తమిళం, తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళంలో ఎన్నో పాటలు పాడారు.

శ్రేయ తన సంగీత ప్రస్థానాన్ని హిందీ చిత్రం "దేవదాస్"తో ప్రారంభించారు. ఆమెకు ఆ మొదటి చిత్రమే భారత జాతీయ చలనచిత్ర పురస్కారం తెచ్చిపెట్టింది. అలా ఇప్పటికి ఆమెకు 4 జాతీయ పురస్కారాలు, 5 ఉత్తరాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 4 దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి.

69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఇర్విన్ నిజాల్ (2021) సినిమాలోని మాయావా ఛాయావా పాటకు జాతీయ ఉత్తమ నేపథ్య గాయినిగా జాతీయ అవార్డుకు ఎంపికయింది.[2]

పుట్టు పూర్వోత్తరాలు

[మార్చు]

శ్రేయ ఘోషాల్ పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్లో ఒక హిందూ కుటుంబంలో జన్మించారు. తన బాల్యం రాజస్థాన్ రాష్ట్రం యందున్నకోట పట్టణానికి సమీపంలో కల రావత్ భాట అనే చిన్న పట్టణంలో సాగింది. ఆమె తండ్రి బిశ్వజీత్ ఘోషాల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (భారతీయ అణుధార్మిక శక్త్యుత్పాదక సంస్థ) లో ఇంజనీరుగా పని చేసేవారు. ఆమె తల్లి సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్.

తన నాల్గవ ఏట నుంచే శ్రేయ ఆమె తల్లి దగ్గరి హార్మోనియం పట్ల ఆసక్తి చూపించారు. ఆమె మహేష్ చంద్ర శర్మ దగ్గర హిందుస్థానీ సంగీతాన్ని అభ్యసించారు. ఆమె 1996 వ సంవత్సరంలో జీ టీవీలో ప్రసారమయ్యే "స రె గ మ" (ఇప్పటి స రెగా మ ప) 75 వ పిల్లల ప్రత్యేక సంచిక (Children's special episode) విజేత. ఆ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన కల్యాణ్ జీ వీర్ జీ షాహ్ ఆమె తల్లిదండ్రులను ముంబైకి రమ్మని ఒప్పించారు. 1997 వ సంవత్సరంలో ఆమె తండ్రికి ఉద్యోగరీత్యా బదిలీ అయ్యి కుటుంబమంతా ముంబైకి వచ్చింది. శ్రేయ కల్యాణ్ జీ దగ్గర 18 నెలలు శిక్షణ పొంది సాంప్రదాయ సంగీతాభ్యాసాన్ని ముక్తా భీదే దగ్గర కొనసాగించారు.

సంగీత ప్రస్థానం

[మార్చు]

ఆమె మరల "స రే గ మ ప"లో ప్రవేశించినపుడు సంజయ్ లీలా భంసాలీ (న్యాయనిర్ణేత, ప్రఖ్యాత దర్శకుడు) ని తన గాత్రంతో ఆకట్టుకున్నారు. 2000 లో భంసాలీ శ్రేయకు "దేవదాసు" చిత్రంలో కథానాయిక పాత్ర పారోకు గాత్ర దానం చేసే అవకాశం ఇచ్చారు. ఆమె ఆ చలన చిత్రంలో 5 పాటలను ఆలపించారు. ఆ చిత్రంలో "బైరీ పియా " పాటకు గాను ఆమెకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. అదే చిత్రానికి ఆమెకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఉత్తరాది ఫిల్మ్ ఫేర్ పురస్కారం లభించింది.

సంగీత రంగంలో పురోగతి

[మార్చు]

ఆమె హిందీ లోనే కాకుండా దక్షిణాది భాషలలో ఎన్నో పాటలు ఆలపించారు. ఆమె, తమిళ్ చిత్రం 'ఆల్బం' లోని "చెల్లామే చెల్లామ్" అనే పాటతో దక్షిణ భారత చలన చిత్ర సీమ లోకి రంగప్రవేశం చేశారు. 'ఒక్కడు' చిత్రంలో "నువ్వేం మాయ చేసావో గాని " ఆమె మొదటి తెలుగు పాట. 'బిగ్ బి' చిత్రంలో "విదా పరయుకాయనో " శ్రేయ పాడిన మొట్ట మొదటి మలయాళ పాట. ఆమెకు ఇప్పటిదాకా ఆమె పాడిన హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ పాటలకు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, మలయాళం, తమిళ్ రాష్ట్ర పురస్కారాలు లభించాయి. 2010 సంవత్సరంలో ఆంగ్ల చిత్రమైన వెన్ హేరీ ట్రైస్ టు మేరీ ('When Harry Tries to Marry') లో ఆమె పాడారు. ఆమె 2011 లో విడుదల అయిన తెలుగు చలనచిత్రం 'శ్రీ రామ రాజ్యం' చిత్రంలో పాడిన పాటలు చాలా ప్రఖ్యాతి పొంది వివిధ రకాల శ్రోతల మన్ననలను అందుకున్నాయి.

సోనీ టీవీలో ప్రసారమయ్యే "ఎక్స్ ఫ్యాక్టర్" అనే ఒక స్వర సంగ్రామానికి ప్రఖ్యాత నేపథ్య గాయకుడు సోనూ నిగమ్, సంజయ్ లీలా భంసాలీ లతో కలిసి న్యాయ నిర్ణేతగా శ్రేయ వ్యవహరించారు. అలాగే మ్యూజిక్ కా మహా మూకాబలా అనే పోటీలో ఆమె తన బృందానికి నాయకురాలిగా చాలా చక్కని పాత్ర పోషించారు.

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (12 March 2022). "శ్రేయాఘోష‌ల్ 'బ‌ర్త్‌డే' స్పెష‌ల్‌". Archived from the original on 12 March 2022. Retrieved 12 March 2022.
  2. "National Awards 2023: జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌.. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే". EENADU. 2023-08-24. Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.