సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ

సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి (మే 18, 1914 - ఆగష్టు 8, 2010) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు. అండమాన్‌ వెళ్ళి నేతాజీ విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధులు సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి [1].మహిళ ఉద్యమాలలో, ఖద్దరు ప్రచారంలో, మద్యపాన వ్యతిరేక ఉద్యమాలలో ఎంతో పాటుపడింది.

బాల్యం, విద్య[మార్చు]

ఈమె కృష్ణాజిల్లా నందిగామ తాలూకా వీరులపాడులో మే 18, 1914లో వాసిరెడ్డి సీతారామయ్య, సుబ్బమ్మ దంపతులకు కడసారి బిడ్డగా జన్మించారు. ఆమె గురువు జంగా హనుమయ్య చౌదరి. అతను కవి, పండితుడు కావడం వల్ల ఆమెకు ఉత్తమ కావ్యాలను బోధించి మంచి విద్వత్తు కలిగించారు.

వివాహం[మార్చు]

సూర్యదేవర నాగయ్యతో రాజ్యలక్ష్మీ దేవికి పదేళ్ళ వయస్సులో వివాహం జరిగింది. ఆమెకు 16 ఏళ్ళు వచ్చి అత్తవారింటికి వచ్చేవరకు విద్యావ్యాసంగాలు కొనసాగించారు. వీరులపాడులో అప్పట్లో ఒక గ్రంథాలయాన్ని స్థాపించి, తాపీధర్మారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి సంఘ సేవకులు, సంస్కారప్రియులు రచించిన గ్రంథాలను రాజ్యలక్ష్మీదేవి ప్రతి రోజూ తెచ్చుకుని చదివి అవగాహన చేసుకునేవారు. ఇవన్నీ ఆమెలో స్వతంత్య్రభావాలను, స్వేచ్ఛాభిలాషను పెంచాయి.

స్వాతంత్ర సంగ్రామం, జైలు జీవితం[మార్చు]

1920లో గాంధీజీ ఇచ్చిన పిలుపు విని దేశసేవకు పూనుకున్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనాలని ఆమె ప్రయత్నించారు. కానీ జెైలుశిక్ష అనుభవించటానికి, సత్యాగ్రహం చేయటానికి భర్త ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. 1932లో శాసనోల్లంఘనం నాటికి ఆమె అత్త వారింటికి చేబ్రోలు వచ్చారు.

రాట్నంపై నూలు వడకటం, హిందీ నేర్చుకోవటం, ఖాదీధారణ అక్కడ పరిపాటి. ఉద్యమం ప్రచారం చేస్తూ రాజ్యలక్ష్మీదేవి దగ్గర బంధువెైన అన్నపూర్ణమ్మతో శాసనోల్లంఘన చేయతల పెట్టారు. ఈ విషయం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరికీ తెలిసిపోయింది. వారిని చూడాలని వచ్చిన ప్రజలతో వీధులు కిక్కిరిసి పోయాయి. జాతీయగీతాన్ని ఆలపిస్తూ శాసనధిక్కార నినాదాలు చేస్తూ అందరూ ఊరేగింపుగా బయలుదేరారు. పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు.

శిక్ష గురించి న్యామూర్తుల ఇళ్ళలో సైతం స్త్రీలు వీరికి అండగా నిలవడంతో ఆ శిక్ష రద్దు చేసి నామమాత్రపు శిక్షను ముగ్గురికీ విడివిడిగా విధించారు. ఈ నేపథ్యంలో రాజ్యలక్ష్మీదేవిని రాయవేలూరు జెైలుకు తరలించారు. ఆ తరువాత రాజ్యలక్ష్మి ఖాదీ ప్రచారం, మహిళా ఉద్యమం, రాజకీయ కార్యకలాపాలు పరిపాటి అయినాయి. గ్రంథాలయంలో హిందీ తరగతులు నిర్వహించేవారు. తనుకూడా కష్టపడి చదివి రాష్ర్టభాష పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.

సంఘ సేవలో[మార్చు]

అస్పృశ్యతా నివారణకై సూర్యదేవర రాజ్యలకీదేవి తన వంతు కృషి చేశారు. పేరంట సమయంలో సైతం హరిజన స్త్రీలను ఆహ్వానించి అందరితో పాటు గౌరవించేవారు. 1940లో వ్యక్తి సత్యాగ్రహం ఆరంభమైంది. గుంటూరు జిల్లాలో ఆ సత్యా గ్రహం చేయడానికి అనుమతి లభించిన తొలిస్త్రీ రాజ్యలక్ష్మి అని చెప్పవచ్చు. 1941 జనవరి 30లో బాపట్ల తాలూకాలోని బ్రాహ్మణకోడూరులో ఆమె సత్యాగ్రహం చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేసి, రెండు నెలల జెైలు శిక్ష, వందరూపాయల జరిమానా కూడా విధించారు.

ఆమె జెైల నుండి విడుదలెైన పిదప మద్రాసులోని ఆంధ్ర మహిళా సభకు చేరుకున్నారు. ఆ తరువాత తెనాలి వెళ్ళి ట్యుటోరియల్‌ కాలేజిలో చేరి బెనారస్‌ మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆమె చేబ్రోలు కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉండి మహిళాభ్యున్నతికి దేశాభ్యుదయానికి పాటుపడ్డారు. ఇంతలో క్విట్‌ఇండియా ఉద్యమం వచ్చింది. అందులో రాజ్యలక్ష్మీదేవిని శాసనధిక్కార శాఖ సభ్యురాలిగా నియమించారు. ఆమె రహస్యంగా జిల్లాలన్నీ తిరిగి ప్రజలచే శాసనధిక్కారం చేయించారు. పోలీసులు ఆమెను వెంటాడేవారు. కానీ దేశభక్తులు ఆమెను కాపాడేవారు. రాజ్యలక్ష్మీదేవి 1941లో చేబ్రోలులో జాతీయ మహిళా విద్యాలయాన్ని స్థాపించారు. ఆ తరువాత 2 అక్టోబరు 1945లో ఆంధ్రరాష్ర్ట మహిళా రాజకీయ పాఠశాలను ప్రారంభించారు.

హైదరాబాదు విముక్తి పోరాటం లో[మార్చు]

భారతదేశానికి 1947 ఆగష్టూ 15వ తేదీన స్వాతంత్ర్యం సిద్ధించింది. అయితే నెైజాము వాసులకు విముక్తి కలగలేదు. రాజ్యలక్ష్మీదేవి విరాళాలు, చందాలు పోగుచేసి నెైజాం వ్యతిరేక పోరాట నాయకులకు తమ సంఘీభావాన్ని తెలిపారు. ‘మాకు ధనసహాయం వద్దు అంగబలం కావాలి. మాతో నిలబడి ఉద్యమ ప్రచారానికి సహకరించండి’ అని నాయకులు కోరారు. టంగుటూరి సూర్యకుమారి పాట కచ్చేరీ ద్వారా వసూలెైన మొత్తాన్ని ధన సహాయంగా ఇవ్వటమేకాక రాజ్యలకీదేవి వ్యక్తి గతంగా నెైజాం వెళ్ళి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాదు సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమయ్యే వరకు ఆమె అక్కడి వారితో కలసి పోరాటం సాగించారు.1950లలో తెలుగు దేశం అనే పత్రిక నడిపింది.

మరణం[మార్చు]

మహిళాభ్యుదయ సంస్థలో మల్లాది సుబ్బమ్మ తదితరులతో కలిసి మద్యపానానికి వ్యతిరేకముగా పోరాడింది. రాజ్యలక్ష్మి ఆగష్టు 8, 2010 న మరణించింది.

మూలాలు[మార్చు]

  1. సూర్య పత్రికలో విశేషాలు[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]