అయ్యగారి సాంబశివరావు
ఎ.యస్.రావు గా ప్రసిద్ధుడైన అయ్యగారి సాంబశివరావు(1914–2003) భారతదేశ అణు శాస్త్రవేత్త. హైదరాబాదు లోని ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు[1][2] మరియు పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. ఈయన పేరు మీదుగానే హైదరాబాదులో ఈ.సి.ఐ.ఎల్ ఉద్యోగులు నివసించే కాలనీకి ఎ.యస్.రావు నగర్ గా నామకరణం చేశారు.
విషయ సూచిక |
బాల్యం,విద్యాభ్యాసం [మార్చు]
ఎ.యస్.రావు సెప్టెంబర్ 20, 1914 న పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు లో జన్మించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము నుండి విజ్ఞానశాస్త్రములో మాస్టరు డిగ్రీ అందుకొని అక్కడే అధ్యాపకునిగా ఆరు సంవత్సరాల పాటు పరిశోధనలు చేశాడు. 1946లో సాంబశివరావు స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయము లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో మాస్టరు డిగ్రీ చేయటానికి ప్రతిష్ఠాత్మక టాటా ఉపకార వేతనాలకు ఎన్నికైనాడు. 1947లో స్టాన్ఫర్డ్ నుండి ఇంజనీరింగు పట్టాపుచ్చుకొని భారతదేశము తిరిగివచ్చిన తర్వాత భారతదేశ అణుశక్తి విభాగములో అణు శాస్త్రవేత్తగా చేరాడు. అక్కడ హోమీ బాబా వంటి ప్రముఖులతో కలసి పనిచేశాడు. ఈయన 2003, అక్టోబర్ 31న మరణించాడు.
విజయాలు [మార్చు]
సాంబశివరావు హోమీ భాభా మరియు విక్రం సారాభాయ్ లతో కలసి పనిచేశాడు. అతడు భారత దేశంలో గల యువ శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులు శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారనే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగించాడు. ఈ ముగ్గురు మరియు మరికొంతమంది ప్రతిభావంతులలో ఒకరైన సూరి భగవంతం లతో కలసి ఒక ఎలక్ట్రానిక్స్ కమిటీ యేర్పాటు చేయబడినది. దీనిని "భాభా కమిటీ" అని అంటారు. ఇది పరిశ్రమల అభివృద్ధికి ఎలక్ట్రానిక్స్ అధ్యయనం భారతదేశంలో ఎలా ఉండాలో పరిపూర్ణ నివేదికను, సూచనలను అందజేసింది.
భాభా కమిటీ నివేదిక భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల అభివృద్ధికి మొదటి నమూనా అయింది. ఇది రావుగారి నమ్మకానికి మరియు ప్రయోగాత్మక అనుభవాలకు గుర్తుగా ఉంది. ఈ నివేదిక ప్రాప్తికి భారత ప్రభుత్వం స్వంతంగా ECIL అనే సంస్థను ఏప్రిల్ 11, 1967 లో స్థాపించింది. దీనికి చైర్మన్ గా సారాభాయి, మొదటి బోర్డు డైరక్టర్ అయిన రావు మేనేజింగ్ డైరక్టర్ గా వ్యవహరించారు. మొదటి పది సంవత్సరాలలో రావు ECIL కు చుక్కానిగా ఉండి ఉత్పత్తి సామర్థ్యాన్ని, వ్యాపారాన్ని, సహాయాన్ని మరియు ఉపాథి సామర్థ్యాన్ని విశేషంగా పెంచారు. ఈ సంస్థలో రావు యొక్క అనుభవాల వలన భారత ప్రభుత్వం 1971 లో రావుగారిని ఎలక్ట్రానిక్స్ కమిషన్ లో ముఖ్య సభ్యునిగా నియమించింది.
డా. ఎ.ఎస్.రావు గారు ప్రతిభావంతుడైన శాస్త్రవేత్త, ఇంజనీరు,వ్యవస్థాపకుడు మరియు నాయకుడు. స్వదేశంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ స్థాపించడంలో మరియు భారత అణు రియాక్టర్ల ను నియంత్రించు వ్యవస్థలను అభివృద్ధిచేయుటకు కాస్మిక్ కిరణాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్త. ఆయన ప్రసిద్ధ మానవతా వాది మరియు సామ్యవాది. ఆయన మధ్య తరగతి ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాడు. ఆయన కాలంలో సామాన్య ప్రజలకు మరుగుదొడ్లు కట్టించుటకు విశేషకృషి చేయడం ఆయనకు ప్రజలపై ఉన్న అభిమానానికి గుర్తుగా చెప్పుకోవచ్చు.
డా.ఎ.ఎస్ రావు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసి భారత దేశ ఖ్యాతిని పెంపొందించిన వ్యక్తి. ఆయన 31 అక్టోబర్, 2003 న మరణించాడు.
పురస్కారాలు [మార్చు]
రావుగారు శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి మరియు యునైటెడ్ నేషన్స్ లోజరిగే అణు శక్తి ఉపయోగాల పై శాంతి సమావేశాల వంటి అనేక అంతర్జాతీయ సమావేశాలకు భారత దేశం తరపున పాల్గొన్నారు. ఆయన అనేక విజ్ఞాన పత్రికలకు సంపాదకునిగా, సలహా మండలి సభ్యునిగా పనిచేశారు. అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ కు కూడా సంపాదకునిగా పనిచేశారు.[2]
- పద్మశ్రీ పురస్కారం, 1960
- శాంతి స్వరూప్ భట్నగర్ పురస్కారం, 1965
- గౌరవ డాక్టరేటు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1969,
- పద్మ భూషణ్ పురస్కారం, 1972
- ఫెలో ఆఫ్ ఇండియన అకాడెమీ ఆఫ్ సైన్సెస్, 1974,
- ఫిక్కీ అవార్డ్ ఆఫ్ ఔట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇంజనీరింగ్, 1976,
- ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) వారి నేషనల్ డిజైన్ అవార్డు, 1977,
- ఆంధ్రప్రదేశ్ అకాడెమీ ఆఫ్ సైన్స్ యొక్క విశిష్ట శాస్త్రవేత్త అవార్డు 1988,
- డా.నాయుడమ్మ స్మారక బంగారు పతకం 1989.
