కేతు విశ్వనాథరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేతు విశ్వనాథరెడ్డి
జననం1939 జూలై 10
రంగశాయిపురం, కమలాపురం తాలూకా, వైఎస్ఆర్ జిల్లా
మరణం2023 మే 22(2023-05-22) (వయసు 83)
ఒంగోలు
మరణ కారణంగుండెపోటు
జాతీయతభారతీయుడు
వృత్తికథారచయిత, సాహితీవేత్త
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కేతు విశ్వనాథరెడ్డి కథలు

కేతు విశ్వనాథ రెడ్డి (1939, జూలై 10 - 2023, మే 22) ప్రసిద్ధ సాహితీవేత్త, విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

జూలై 10, 1939వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా రంగశాయిపురం గ్రామంలో జన్మించాడు.

విద్యాభ్యాసం, వృత్తి[మార్చు]

కడపజిల్లా గ్రామనామాలు అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ పొందాడు. పాత్రికేయుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి కడప, తిరుపతి, హైదరాబాదు లాంటి చోట్ల అధ్యాపకుడుగా పనిచేసి డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా పదవీవిరమణ చేశాడు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో SCERT సంపాదకుడుగా వ్యవహరించాడు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి దాకా అనేక పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించాడు. పాఠ్యప్రణాళికలను రూపొందించాడు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికాసిబ్బందికి శిక్షణ ఇచ్చాడు.

సాహిత్య రంగం[మార్చు]

ఈయన తొలి కథ అనాదివాళ్ళు 1963లో సవ్యసాచిలో ప్రచురితమైంది. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించాడు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షుడుగా ఉన్నాడు. కొన్నేళ్ళు అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈయన రాసిన సాహితీవ్యాసాలు "దృష్టి" అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి. ఆధునిక తెలుగు కథారచయితల్లో Torch bearers అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు. ప్రస్తుతం "ఈభూమి" పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తున్నాడు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటులు కూడా వెలువరించాడు. ఈయన కథలు అనేకం హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాష ల్లోకి అనువాదితమయ్యాయి. వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. వేర్లు రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీ లేయర్ మీద వెలువడిన మొట్టమొదటి నవల. విశ్వనాధరెడ్డి, పోలు సత్యనారాయణ ఇద్దరూ కలసి చదువుకథలు[1] అనే కథల సంపుటిని సంకలనం చేశారు.

పురస్కారాలు[మార్చు]

  • కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (న్యూ ఢిల్లీ),
  • భారతీయ భాషా పరిషత్తు (కలకత్తా),
  • తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాదు),
  • రావిశాస్త్రి అవార్డు,
  • రితంబరీ అవార్డు
  • ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.[2]

అధ్యాపకుడుగా[మార్చు]

  • విశ్వవిద్యాలయ అధ్యాపకులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అధ్యాపక పురస్కారం.

వివిధ పత్రికలలో ప్రచురితమైన వీరి కథలు కొన్ని...[మార్చు]

  • 1991 కేతు విశ్వనాథరెడ్డి కథలు....... ఆంధ్రజోతి వార పత్రిక.
  • 1975 ద్రోహం. విశాలాంధ్ర దిన పత్రిక.
  • 1977 ఆత్మ రక్షణ. వీచిక మాస పత్రిక.
  • 1977 మన ప్రేమకథలు. ఆంధ్ర జోతి మాస పత్రిక.
  • 1978 విశ్వరూపం స్వాతి మాస పత్రిక.
  • 1979 ఆరోజులొస్తే... నివేదిత మాస పత్రిక.
  • 1980 పీర్ల సావిడి. స్వాతి మాస పత్రిక.
  • 1991 ఎస్.2 బోగీలు. ఉదయం వార పత్రిక.
  • 1997 ఒక జీవుడి ఆవేదన. ఆదివారం ఆంధ్రభూమి.
  • 2001 కాంక్ష రచన మాస పత్రిక.
  • 2003 అమ్మవారి నవ్వు. ఇండియా టుడే.[3]

ఇతరుల మాటలు[మార్చు]

  • ఆ కథలో(జప్తు)భాష మా ప్రాంతానికి చెందింది కాదు. అందులో చిత్రితమైన గ్రామం మాసీమకు చెందిందికాదు. కాని ఆగ్రామీణ జీవితంలో అక్కడి రైతుల సమస్యలతో, స్వభావాలతో మా ప్రాంత జీవితానికీ, రైతు సమస్యలకూ దగ్గరతనం కనిపించింది. ఈ రచయిత ఎవరో కట్టుకథలు కాకుండా పుట్టుకథలు రాసే వారనిపించింది-కాళీపట్నం రామారావు(కారా)
  • 1960 నుంచి ఒకపాతిక, ముప్పైయేళ్ళ కాలవ్యవధిలో ఒక నిర్దిష్ట మానవ సమాజంలో వచ్చిన మార్పులన్నింటినీ ఆయన కథలు రికార్డు చేశాయి-మధురాంతకం రాజారాం
  • విశ్వనాథరెడ్దిగారి కథల్లో-కథౌండదు-కథనం ఉంటుంది. ఆవేశంవుండదు-ఆలోచనవుంటుంది. అలంకారాలుండవు-అనుభూతివుంటుంది; కృత్రిమత్వంవుందదు-క్లుప్తతవుంటుంది. కథకుడిగా తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం విశ్వనాథరెడ్దిగారిది-సింగమనేని నారాయణ
  • నీల్లు లేని రాయలసీమలో జీవన ప్రవాహంలో తనుమోసిన, అనుభవించిన ఉద్రిక్త సుఖదుఃఖాలను ప్రపంచంలో పంచుకోవడానికి విశ్వనాథరెడ్డి కథలు రాసారు-అల్లం రాజయ్య
  • ప్రజలనాడిని ప్రజలభాష ద్వారా పట్తుకున్న కథకుడు విశ్వనాథరెడ్డి. కథకుడిగా అతని చూపు అత్యంత రాక్షసమైనది. అంటే అంత కఠినమైనది. తెలుగుభాషపై అతనికున్న పట్టు కూడా చాలా గట్టిది.తెలుగు కథల్లో కవిత్వంకాని మంచి వచనం రాసిన కొద్దిమంది కథకుల్లో ఇతనొకడు.-చేకూరి రామారావు
  • ...సానుభూతితో, మానవతావాదంతో, వర్గచైతన్యంతో, స్త్రీపాత్రలను సృష్టించటం దగ్గర మొదలై లింగవివక్షనూ, స్త్రీల అణచివేతనూ అర్థం చేసుకొని ఆ దృష్టితో స్త్రీ పాత్రలను రూపొందించేంత వరకూ ఒక గుణాత్మక పరిణామ ప్రయాణం చేశారు-ఓల్గా
  • ఒకే ఒక్క సృజనాత్మక రచానా ప్రక్రియలో అనేక సామాజికాంశాలను దర్శించడం కష్టమేకాని అసాధ్యం కాదని నిరూపిస్తాయి కేతు విశ్వనాథరెడ్ది కథలు.-అఫ్సర్

మరణం[మార్చు]

కడపకు చెందిన 83 ఏళ్ల కేతు విశ్వనాథ్ రెడ్డి ఒంగోలులోని ఆయన కుమార్తె ఇంటిలో అస్వస్థతకు గురయ్యాడు. అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023 మే 22న గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచాడు.[4]

మూలాలు[మార్చు]

  1. విశ్వనాధ రెడ్డి, కేతు; సత్యనారాయణ, పోలు. చదువుకథలు.
  2. పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.
  3. "Rayalaseema Katha Sahityam Oka Pariseelana". shodhganga.inflibnet.ac.in. Retrieved 27 August 2016.
  4. "Kadapa: కథా రచయిత.. సాహితీవేత్త కేతు విశ్వనాథ్ రెడ్డి కన్నుమూత | story writer ketu vishwanath reddy passed away". web.archive.org. 2023-05-22. Archived from the original on 2023-05-22. Retrieved 2023-05-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

కేతు విశ్వనాథరెడ్డి ఇంటర్వ్యూ...[permanent dead link]

శీర్షిక పాఠ్యం[మార్చు]