మురారి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మురారి
దర్శకత్వంకృష్ణవంశీ
రచనశోభన్
నిర్మాతనందిగం గోపి,
ఎన్. దేవీప్రసాద్,
రామలింగేశ్వరరావు
తారాగణంమహేష్ బాబు,
సోనాలి బింద్రే
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నందిగం గోపి, రామలింగేశ్వరరావు, ఎన్. దేవిప్రసాద్ సమ్యుక్తంగా నిర్మించిన చిత్రం "మురారి". కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు, సోనాలి బింద్రే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ద్వారా సోనాలి బింద్రే తెలుగు తెరకు పరిచయమయ్యింది. సుకుమారి, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, లక్ష్మి, రఘుబాబు, రవిబాబు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ, చిత్రానువాదంతో పాటు కూర్పు విభాగంలో కృష్ణవంశీ పనిచేసారు. శోభన్ సంభాషణలను రచించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతదర్శకత్వం వహించారు. భూపతి ఛాయాగ్రాహకుడిగా పనిచేసారు. పీటర్ హెయిన్ ఈ సినిమా ద్వారా ఫైట్ మాస్టరుగా తెలుగు సినిమాకి పరిచయమయ్యారు.

ఉసురు తగలడం వల్ల ఒక వ్యక్తి వంశం ఎలా దెబ్బతిందనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఒక జమీందారు 19వ శతాబ్దంలో చేసిన తప్పుకి ప్రతీ 48 ఏళ్ళకొకసారి అతని వంశస్తుల్లో ఒకరిని ఆ ఊరి దేవత బలితీసుకుంటున్న తరుణంలో ఈ సారి మరణించబోయే వ్యక్తి మరణం నుండి ఎలా తప్పించుకోగలిగాడు? అమ్మవారి శాపాన్ని ఎలా నివారించి తన వంశాన్ని కాపాడుకున్నాడన్నదు? అనేది ఈ సినిమా మూలకథ. అనుకున్నదానికంటే నెలన్నర ఆలస్యంగా ఫిబ్రవరి 17, 2001న విడుదలైన మురారి భారీ విజయాన్ని నమోదు చెయ్యడమే కాకుండా ఆ ఏడాది ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారంలో ఉత్తమ చిత్రానికి రజత నందితో పాటు మరో 2 అవార్డులను సొంతం చేసుకుంది.

కథ[మార్చు]

19వ శతాబ్దం మధ్యలో నలనామ సంవత్సరం ఆశ్వయిజ బహుళ అమావాస్య రాత్రి ఆంగ్లేయుల దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేని ఓ జమీందారు (ప్రకాష్ రాజ్) వాళ్ళ ప్రోద్బలంతో ఆ ఊళ్ళోని అమ్మవారి గుడిలో అతి ప్రాచీనమైన, శక్తివంతమైన దుర్గాదేవి విగ్రహాన్ని దొంగిలించేందుకు వాళ్ళని వెంటబెట్టుకు బయలుదేరతాడు. మద్యం సేవించిన జమీందారు తన గుమాస్తా (ఎం. ఎస్. నారాయణ) ఎంత హెచ్చరిస్తున్నా వినకుండా వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించాలనుకుంటాడు. కానీ ఇద్దరు ఆంగ్లేయులు నిప్పంటుకుని చనిపోగా జమీందారు అమ్మవారి చేతిలో చనిపోయి తన వంశానికి ఒక శాపాన్ని పొందుతాడు. ఆ శాపం ప్రకారం ప్రతీ 48 ఏళ్ళకొకసారి వచ్చే ఆశ్వయిజ బహుళ అమావాస్య నాడు అమ్మవారు ఆ ఇంట్లో ఒక మగాడిని బలితీసుకుంటుంది. ఇది జరిగిన 48 ఏళ్ళ తర్వాత క్రోధినామ సంవత్సరంలో ఆశ్వయిజ బహుళ అమావాస్య ఉదయం గుడి ముందు బ్రిటీష్ సైన్యం దాడిలో జమీందారు వంశస్థుడు (కొణిదల నాగేంద్రబాబు) చనిపోతాడు. 48 ఏళ్ళ తర్వాత నందననామ సంవత్సరంలో ఆశ్వయిజ బహుళ అమావాస్య ఉదయం మరొక జమీందారు వంశస్థుడు మురారి (అచ్యుత్) కారు ప్రమాదంలో గుడి ముందు మరణిస్తాడు. అతని భార్య శబరి అప్పటినుంచి శాపవిమోచనం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు, దానాలు చేయిస్తూ ఉంటుంది. నిత్యం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటుంది. మళ్ళీ 48 ఏళ్ళ తర్వాత విక్రమనామ సంవత్సరం వస్తుంది. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న శబరి (సుకుమారి), ఆలయ పూజారి శేషయ్య ఈ సారి అమ్మవారు ఎవరిని బలికోరుతుందోనని భయపడుతుంటారు.

మురారి కొడుకు సత్తిపండు (కైకాల సత్యనారాయణ) తన తండ్రి పేరుని తన చివరి కొడుకు(మహేష్ బాబు)కి పెట్టుకుంటాడు. శబరి ఆదేశం ప్రకారం అందరు మురారిని పేరుపెట్టి పిలవకూడదు, తలుచుకోకూడదు. మురారి అంటే ఆ ఇంట్లో అందరికీ ప్రాణం. అతని అన్నయ్యలు శ్రీనయ్య (ప్రసాద్ బాబు), బాచి (చిన్నా), సూరి (శివాజీ రాజా) అతనికి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. మురారిని ప్రసవించాక పురిట్లో సత్తిపండు భార్య చనిపోవడంతో శ్రీనయ్య, అతని భార్య గోపికృష్ణ మహేశ్వరి లేక గోపి (లక్ష్మి) అతన్ని పెంచుతారు. గోపికి మురారి ఆరవ ప్రాణం. తనకి పిల్లలు పుడితే ఎక్కడ మురారిపై ప్రేమ తగ్గిపోతుందోనని భయపడి శ్రీనయ్యకు కూడా చెప్పకుండా గోపి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చెయ్యించుకుంది. ఈ విషయం చంటి ఇంట్లో తెలిస్తే వాళ్ళెక్కడ గొడవ చేస్తారోనని ప్రతీ ఏడాది ఒక్కత్తే పుట్టింటికి వెళ్ళి పిల్లలు పుట్టడానికి నోములు, వ్రతాలు చేస్తూ ఆ వంకతో తనని పెంచిన కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఉంటుంది. ఈ విషయం ఆ దంపతులకి, ఒక రోజు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు కిటికీ దగ్గర నిలబడి విన్న మురారికి మాత్రమే తెలుసు. ఈ ఏడాది మురారి కూడా గోపికి తోడుగా గోపిని చేరదీసి పెంచిన చంటి (గొల్లపూడి మారుతీరావు) ఇంటికి వెళ్తాడు. అక్కడ హైదరాబాదు నుంచి సెలవులకు తిరిగొచ్చిన చంటి కూతురు వసుంధర(సొనాలి బింద్రే)ని ఆటపట్టిస్తూ తెలియకుండానే ఆమెతో ప్రేమలో పడతాడు.

మిగిలినవాళ్ళందరితో బాగా కలిసిపోయినా ఆ ఇంట్లో ఉండే బుల్లబ్బాయి(రవిబాబు)కి మాత్రం మురారి ఉనికి నచ్చదు. చెడు అలవాట్లు ఉన్నా స్వతహాగా అమాయకుడైన బుల్లబ్బాయికి తనకంటే వయసులో చిన్నవాడైన మురారి అంటే అసూయ. అందులోనూ మురారి ఊళ్ళో ఓ సారి ఏనుగు దొంగతనం చెయ్యబోయి మురారి చేతిలో తన్నులు కూడా తిన్నాడు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందోనని మురారిని చూసినప్పుడల్లా బెదిరిపోతుంటాడు. ఒకరోజు మురారికి కొంతమంది కూలీల ద్వారా బుల్లబ్బాయి చేసిన మోసం తెలుస్తుంది. గోపికి ఆ ఊళ్ళో ఒక చిన్న పొలం ఉంది. దానిపై వచ్చే ఆదాయంలో కొంత తన జేబులో వేసుకుంటూ కూలీలకి డబ్బులివ్వకుండా ఆ డబ్బుతో బుల్లబ్బాయి ఆరు నెలలు పేకాట ఆడుతుంటాడు. ఇది తెలుసుకున్న మురారి బుల్లబ్బాయితో గొడవపడి కూలీలకి చెందాల్సిన డబ్బులు వాళ్ళకిచ్చి ఆ పొలానికి వాళ్ళకి కౌలుకిచ్చి ఆదాయంలో సగం చెందేలా చేస్తాడు. కౌలు విషయం బుల్లబ్బాయి ద్వారా తెలుసుకున్న రాంబాబు (రఘుబాబు) ఇంటికొచ్చి గొడవ చెయ్యడంతో గోపి మురారిని తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటుంది. వ్రతం మొదలుపెట్టాక ఉద్యాపన పూర్తి చెయ్యాలి కాబట్టి మురారి వెళ్ళిపోయి గోపిని తర్వాత రమ్మంటాడు. రాంబాబుకు జరిగింది చెప్పి బుల్లబ్బాయిని ఇరికించేస్తాడు. వెళ్ళే ముందు గదిలో తనకోసం ఎదురుచూస్తున్న వసుంధరని గట్టిగా హత్తుకుని ఆమె కూడా హత్తుకోబోయే లోపే వదిలేసి వెళ్ళిపోతాడు. ఊరికి తిరిగొచ్చాక అమ్మవారి గుడి దగ్గర ఒక పసిబిడ్డని కాపాడిన మురారి జాతకచక్రం చనిపోయిన ఆ ముగ్గురి జాతకచక్రాలతో కలవడం చూసి చనిపోబోయేది మురారేనని తెలుసుకుని శేషయ్య కుమిలిపోతాడు.

మంచివాడు, పసివాడు, అమాయకుడు, జీవితంలో ఇంకా ఏమీ అనుభవించని మురారిని బలితీసుకోవడం తగదని, నీ కొడుకైన మురారిని నువ్వే కాపాడాలని అమ్మవారి విగ్రహం ముందు శేషయ్య వాపోతాడు. ఇటుపక్క తన ఇంట్లో మురారి వసుంధర జ్ఞాపకాల్లో, హైదరాబాదులోని హాస్టల్లో వసుంధర మురారి జ్ఞాపకాల్లో కాలం గడుపుతూ ఉంటారు. సత్తిపండు సలహా మేరన మురారి హైదరాబాదు వెళ్ళి వసుంధరని కలుస్తాడు. మురారిని చూసిన ఆనందంలో వసుంధర అతన్ని హత్తుకుని నన్ను పెళ్ళిచేసుకోమ్మంటుంది. మురారి అప్పుడు వసుంధరని తన ఇంటికి తీసుకెళ్తాడు. వ్యవసాయంపై పరిశోధన కోసం ఈ ఊరు వచ్చానని, అది పూర్తయ్యే దాకా ఇక్కడే ఉంటానని మురారి కన్నా 5 నిమిషాలు ముందే ఇంట్లోకొచ్చిన వసుంధర మురారి కుటుంబసభ్యులతో చెప్తుంది. శబరి ఊళ్ళో లేనప్పుడు మురారి మెల్లగా అందరినీ వసుంధరతో తన పెళ్ళికి ఒప్పిస్తాడు. సత్తిపండు స్వయంగా చంటి ఇంటికి వెళ్ళి పెళ్ళిసంబంధం ఖాయం చేసుకొస్తాడు. రెండు కుటుంబాలు మురారి ఇంట్లో ఉన్నప్పుడు శబరి తిరిగొస్తుంది. మురారి వసుంధరని పెళ్ళిచేసుకోబోతున్నాడని తెలుసుకుని చాలా సంతోషిస్తుంది. అప్పుడు శబరి పక్కనే ఉన్న శేషయ్య శబరి నిర్ణయం చెప్పేలోపే తనని పక్కకి తీసుకెళ్ళి చనిపోబోయేది మురారేనని చెప్తాడు. తన జీవితంలాగే వసుంధర జీవితం కూడా నాశనం కాకూడదని శబరి ఈ పెళ్ళికి ఒప్పుకోదు. వేరే దారి లేక మురారి వసుంధరని వదిలేస్తాడు. జరిగిన అవమానానికి రగిలిపోతున్న రాంబాబు వసుంధర ఇష్టానికి వ్యతిరేకంగా తన పెళ్ళిని బుల్లబ్బాయితో నిశ్చయం చేస్తాడు. ఈలోపు గుడిలో మురారిని కాపాడేందుకు ఏం చెయ్యాలని శేషయ్య, శబరి ఒక సిద్ధుడి(ధూళిపాళ సీతారామశాస్త్రి)ని కలిస్తే ఆయన రక్తాభిషేకం జరగాల్సిందేనని చెప్తాడు. పూజలు నిర్వహిస్తున్నప్పుడు మురారికి, మిగిలిన కుటుంబ సభ్యులకి శేషయ్య అమ్మవారి శాపం గురించి వివరిస్తాడు.

శబరి కోసం, తన కుటుంబం కోసం, వసుంధర కోసం, తన కోసం తను బ్రతికి తీరతానని సంకల్పించిన మురారి వసుంధరని కాపాడి తీసుకురావడానికి ఆ ఊరికి వెళ్తాడు. వసుంధరని కాపాడి తీసుకొస్తున్న క్రమంలో బుల్లబ్బాయి బల్లెంతో మురారిని కడుపులో పొడిచేస్తాడు. రక్తం ఆపడానికి మట్టి పూసి కండువాతో దెబ్బ కనిపించకుండా కండువా కట్టి ఇది చూసి మూర్ఛబోయిన వసుంధరని కారులో కూర్చున్నాక తన ఒళ్ళో పడుకోబెట్టుకుని మురారి గుడికి చేరుకుంటాడు. రాంబాబు గుడి దగ్గరికి చేరుకునే ముందు మురారి సూరిని అంబులెన్స్ పిలిపించమని చెప్పి గుడిలోకెళ్ళి పూజలు పూర్తిచేస్తాడు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తుండగా రాంబాబు మురారిని తలపై కర్రతో కొడతాడు. తలపగిలి రక్తం ధారగా ఉత్సవ విగ్రహంపై కారడం చూసి సిద్ధుడు చెప్పింది జరిగిందన్న ఆనందంతో రెట్టింపు ఉత్సాహంతో ఊరేగింపు పూర్తి చేస్తారు. అమ్మవారి విగ్రహాన్ని పురోహితులకు అప్పజెప్పగానే మురారి కూలిపోతాడు. విషమ పరిస్థితుల్లో మురారి ఉన్నప్పుడు తన ప్రాణం కాపాడడానికి శబరి నదిలో ముణిగి ప్రాణత్యాగం చేస్తుంది. అమ్మవారి శాపం తొలిగిపోయాక పెళ్ళిబట్టలతో మురారి, వసుంధర, రెండు కుటుంబాలు అమ్మవారి మూలవిరాట్టుని, ఆ పక్కనే ఉన్న శబరి ఫొటోని దర్శించుకుంటారు.

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

==పాటల జాబితా==

1: అలనాటి రామచంద్రుడు , రచన: సిరివెన్నెల , గానం.జిక్కి, సునీత, సంధ్య

2: ఎక్కడ ఎక్కడ , రచన: సిరివెన్నెల ,గానం. ఎస్ పి బి చరణ్ , హరిణి.

3: చెప్పమ్మా చెప్పమ్మా, రచన: సిరివెన్నెల, గానం , కె.ఎస్.చిత్ర

4: భామ భామ, రచన: సిరివెన్నెల , గానం.ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం , అనురాధ శ్రీరామ్.

5: బంగారు కళ్ళ , రచన: సుద్దాల అశోక్ తేజ , గానం.ఉదిత్ నారాయణ్

6: డుo డుo డుo , రచన: వేటూరి సుందర రామమూర్తి , గానం.శంకర్ మహదేవన్.

7: అందానికీ రచన: చంద్రబోస్ , గానం.శంకర్ మహదేవన్ .

నిర్మాణం[మార్చు]

జనానికి, ప్రపంచానికి మంచి చేసే దేవత కోపానికి కారణమైన వ్యక్తి దాన్నుంచి ఎలా బయట పడ్డాడు అనే అంశం ఆధారంగా కథ అల్లుకున్నాడు దర్శకుడు కృష్ణవంశీ.[1]

విడుదల[మార్చు]

ఈ చిత్రం 2001 ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. ఈ సినిమాకు ముందు మహేష్ బాబు నటించిన రెండు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దాంతో ఈ చిత్రం మీద అంచనాలు పెరిగాయి. దానికి తగ్గ విజయం సాధించిందీ చిత్రం.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "'మురారి' కథను అలా డెవలప్‌ చేశారు!". www.eenadu.net. Archived from the original on 2020-02-17. Retrieved 2020-02-17.