మేడపాటి వెంకటరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేడపాటి వెంకటరెడ్డి
మేడపాటి వెంకటరెడ్డి
జననం
మేడపాటి వెంకటరెడ్డి

(1947-12-18) 1947 డిసెంబరు 18 (వయసు 76)
విద్యఎం.ఎ (అంతర్జాతీయ న్యాయశాస్త్రం)
విద్యాసంస్థఆంధ్ర విశ్వవిద్యాలయం
వృత్తిహార్స్‌లీ హిల్స్ స్కూల్ లో యోగా ఉపాధ్యాయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
యోగా గురువులు, రచయిత
జీవిత భాగస్వామిమంగాయమ్మ
పిల్లలుముఖలింగేశ్వరరెడ్డి (కుమారుడు)
సుబ్బిరెడ్డి (కుమారుడు)
తల్లిదండ్రులుమేడపాటి సుబ్బిరెడ్డి
విరాయమ్మ

మేడపాటి వెంకటరెడ్డి యోగవిద్య లో నిష్ణాతులు. సికింద్రాబాదులోని ప్రభుత్వ వేమన యోగ పరిశోధనా సంస్థకు డైరెక్టర్‌గా, ఆరోగ్య వైద్యశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ యోగాధ్యయన పరిషత్తుకు కార్యదర్శిగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ గవర్నరు గారికి యోగచికిత్సా నిపుణుడిగా సేవలను అందిస్తున్నారు.

జీవిత విశేషాలు[మార్చు]

మేడపాటి వెంకట రెడ్డి తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం సమీపంలోని అర్తమూరు గ్రామంలో 18 డిసెంబరు 1947న జన్మించారు. ఈ గ్రామం వైష్ణవ మత ప్రభోధకుడు పరమహంస పరివ్రాజకులు అయిన త్రిదండి పెద్ద జీయర్ స్వామి జన్మించిన ఊరు. ఇతడు రాజకీయ నేపధ్యంలో కూడిన మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో మేడపాటి సుబ్బిరెడ్డి, వీరయమ్మ దంపతులకు గల ముగ్గురు మగ పిల్లలలో ఆఖరి సంతానంగా జన్మించారు. 5వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనూ, ఎస్.ఎస్.ఎల్.సి వరకు మండపేటలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో బి.ఎ పట్టాను, విశాఖపట్నం నందలి ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో ఎం.ఎ (అంతర్జాతీయ న్యాయశాస్త్రం) పట్టాను పొందారు. రాజమండ్రిలో ఉండగా హిందీ వ్యతిరేక ఉద్యమంలోనూ, ఉక్కు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రాష్ట్రంలో విద్యార్థి నాయకునిగా గుర్తింపు పొందారు.[1]

యోగా రంగం వైపు అడుగులు[మార్చు]

అతని తండ్రిగారి స్నేహితుడైన ప్రకృతివైద్య ప్రచారకులు సత్తి రాజు ప్రేరణ అతనిపై ఉన్నది. ప్రఖ్యాత వెయిట్ లిప్టర్ కామినేని ఈశ్వరరావు, హఠయోగి అప్పారావు గార్లతో కూడిన బృందం ఒకటి వారి ప్రాంతంలో ప్రకృతి వైద్యం - యోగాపై ప్రచారం నిర్వహించారు. 1960లో జరిగిన ఆనాటి ఘటన ఫలితంగా అతను యోగా రంగంవైపు ప్రభావితుడైనారు. ఏదైనా శాస్త్రీయంగా నేర్చుకోవాలనే తపనతో లోనావాలాలోని కైవల్యాధాం లోని సంస్థకు పీజీ డిప్లొమాకు దరఖాస్తు చేసారు. ప్రపంచంలోని తొలి యోగా సంస్థ అది. అతనికి అందులో ఇంటర్వ్యూకు అవకాశం వచ్చింది. అప్పట్లో యోగాపై ఉన్న అపోహలతో కుటుంబంవారు నిరుత్సాహపరిచినా భార్య మంగాయమ్మ ప్రోత్సాహంతో చేరారు. లోనావాలాలో పీజీ డిప్లొమా విజయవంతంగా పూర్తిచేసారు. తరువాత అతను రుషీకేశ్ చేరుకుని అక్కడి ప్రపంచ ప్రసిద్ధ మహర్షి మహీసుయోగి మెడిటేషన్ ఇనిస్టిట్యూట్ లో ట్రాన్స్‌డెంటల్ మెడిటేషన్, సైన్స్ ఆఫ్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ (ఎస్‌సిఐ) కోర్సులో తొలి బ్యాచ్ లో శిక్షణ పొందారు. ఆ విధంగా ప్రపంచ ప్రఖ్యాత యోగా సంస్థల్లో శిక్షణ పొందిన తొలి ఆంధ్రుడిగా గుర్తింపు పొందారు.[1] స్పోర్ట్స్ లో అన్.ఐ.ఎం. లక్ష్మీబాయి జాతీయ వ్యాయామ కళాశాల గ్వాలియర్ లో శిక్షణ పొందారు.

ఇంటిపేర్లపై పరిశోధన[మార్చు]

అతను పురాతత్వ, శాసన, సాహిత్య, సంప్రదాయాలను సమన్వయ పర్చి తరతరాల ఆంధ్రుల ఇంటిపేర్లను క్రీస్తు పూర్వం నుండి నేటి వరకు చరిత్రను జాతికి కానుకగా అందిచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రుల ఇంటిపేర్లపై సుధీర్ఘ చరిత్ర ఉన్నా గాని ఒక్క మల్లంపల్లి సోమశేఖర శర్మ విశేష కృషి చేసారు. ఆ దిశగా వెంకటరెడ్డి ఒక గ్రంధాన్ని రచించి మల్లంపల్లి గారికి అంకితం ఇవ్వాలనే ఆలోచనతో కృషిని కొనసాగిస్తున్నారు.

యోగా రంగంలో సేవలు[మార్చు]

మద్రాసు నగరంలో కైవల్యథాం సంస్థవారు దక్షిణాధి శాఖ ఏర్పాటు చేసి హెల్త్ సెంటర్ పెట్టారు. అతని ప్రొఫెసర్ ఓం ప్రకాష్ తివారీ గారి కోరిక మేరకు అతను అక్కడ రెండు సంవత్సరాలు పనిచేసారు. ఇక తిరుపతిలో తిరుపతి తిరుమల దేవస్థానం అధ్వర్యంలో ఏర్పాటైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ అలైడ్ సైన్సెస్ లో కొద్ది కాలం పాటు పనిచేసారు. అంతే కాకుండా ప్రఖ్యాత తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన హార్స్‌లీ హిల్స్ స్కూల్ లో యోగా ఉపాధ్యాయునిగా పూర్తి ఉచితంగా తన సేవలనందించారు. ఆ తర్వాత సికింద్రాబాదులోని ప్రభుత్వ వేమన యోగ పరిశోధనా సంస్థకు 1978లో సి.రమానందయోగి పునాది రాయి వేసిన దగ్గర నుండి 27 సంవత్సరాల పాటు సేవలనందించారు. యోగా ఇనస్ట్రక్టర్‌గా, సూపర్ వైజరుగా, సెక్షను ఇన్‌ఛార్జ్‌గా. చివరికి డైరక్టరుగా అంకిత భావంతో సేవలందిస్తూ వచ్చారు. 2005 లో డైరక్టరుగా పదవీ విరమణ చేసారు. తరువాత రెండేళ్లకు 2007 లో అప్పటి ముఖ్యమంత్రి డా. వై.ఎస్.రాజశేఖరరెడ్డి యోగాధ్యయన పరిషత్ కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించారు. అంతకు ముందు 2005లో ఢిల్లీ లోని మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ గవర్నింగ్ కౌన్సిల్, స్టాండిగ్ ఫైనాన్స్ కమిటీ, జనరల్ బాడీ సభ్యునిగా నియమించబడ్డారు. 2010లో మరోసారి అదే కమిటీల సభ్యునిగా పనిచేసారు. దేశంలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి), సంస్కృత విద్యాపీఠ్ (తిరుపతి), ఆంధ్ర విశ్వవిద్యాలయం (విశాఖపట్నం), తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాదు), ఉస్మానియా విశ్వవిద్యాలయం (హైదరాబాదు), ఎన్.టి.ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం (విజయవాడ), సెంట్రల్ విశ్వవిద్యాలయం (హైదరాబాదు), మంగుళూరు విశ్వవిద్యాలయం (మంగుళూరు) మొదలైన ఎన్నో ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలలో దాదాపు మూడు దశాబ్దాలుగా యోగా సేవలనందిస్తూ వచ్చారు.[1]

రచనలు[మార్చు]

ఇతను తండ్రి మేడపాటి సుబ్బిరెడ్డి స్మారక యోగ ప్రచురణలు పేరుతో ప్రచురణ సంస్థను ఆర్తమూరు కేంద్ర స్థానంగా 1982లో స్థాపించారు. అముద్రిత - సంప్రదాయ, వైజ్ఞానిక యోగ ప్రచురణలు ఈ సంస్థ లక్ష్యం. ఈ సంస్థ ప్రచురించిన గ్రంథాలు:

మేడపాటి వెంకటరెడ్డి రచనలు
వరుస

సంఖ్య

గ్రంథం పేరు భాష సంవత్సరం
1 హఠరత్నావళి[2][3] - రాతప్రతులు సంస్కృత ఇంగ్లీష్ 1982-2011
2 వేమన యోగము తెలుగు 1984
3 తెలుగు యోగులు[4] తెలుగు 1987
4 స్వరశాస్త్ర మంజరి[5] - రాతప్రతి తెలుగు 1988
5 సైబర్ నిపుణులు - యోగ తెలుగు 2005
6 యోగిక్ థెరపీ[6] ఇంగ్లీషు 2005
7 యోగ ఫర్ సైబర్ వరల్డ్[7] ఇంగ్లీషు 2005
8 వేమన యోగి ధ్యానములు[8] తెలుగు 2008
9 యోగ తారావళి -ఆదిశంకరాచార్య, టీక ఇంగుల రామస్వామి పండిత వ్రాతప్రతి సంస్కృత,తెలుగు 2014
10 ఆర్తమూరు గ్రామ చరిత్ర [9] తెలుగు 2015

రాష్ట్రప్రభుత్వం ప్రచురించిన గ్రంథాలు[మార్చు]

  1. యోగాభ్యాసములు - తెలుగు - 1987
  2. యోగిక్ ప్రాక్టీసెస్ - ఇంగ్లీష్ - 1992
  3. సైంటిఫిక్ స్టడీస్ కండెక్టడ్ యట్ వేమన యోగ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (1978-2005)-ఇంగ్లీషు -2008
  4. సామాన్య యోగ విధాన క్రమం, ఆయుష్ శాఖ ఎ.పి, అమరావతి (2016)[10]

అమూల్యమైన వ్రాత ప్రతులు సేకరణ చేసి వెలుగులోకి తేవడం, కాకతీయుల కాలంలో రెండే యోగ గ్రంథాలుంటే - అందులో ఒకటి అయిన "స్వరశాస్త్ర మంజరి" ని ఇతను వెలుగులోకి తెచ్చారు. ఇతను రాసిన "హఠ రత్నావళి" కి కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వారిచే గుర్తించబడి దక్షిణ భారతదేశం నుండి మేథో హక్కులకు ఎంపిక అయినది. సాగర్ విశ్వవిద్యాలయం యం.పి, వ్యాస విద్యాలయం (డీమ్డ్) బెంగళూరు, ఆంధ్ర విశ్వవిద్యాలయం వాల్తేరు, మొరార్జీదేశాయ్ జాతీయ యోగ సంస్థ (న్యూఢిల్లీ) లలో, గ్రాడ్యుయేట్-పోస్టుగ్రాడ్యుయేట్, యు.జి.సి పి.హెచ్.డి తరగతులకు రిఫరెన్స్ గ్రంథంగా ఉంది.

పత్రికా రంగం[మార్చు]

ఇతను పత్రికారంగంలో అనేక సామాజిక అంశాలపై, యోగ శాస్త్రంపై అనేక లేఖలు, ఆర్టికల్స్ రాసారు. వాటిలో కొన్ని:[11]

  • రామచంద్రపురం చెరకు రైతుల ఆందోళన (ఆంధ్రపత్రిక 6 డిసెంబరు 1963)
  • సమాజంపై సాహిత్య ప్రభావం (సమాచారం 15 జనవరి 1968)
  • గాంధీ దేశంలో మావోరాజ్యం (ప్రజారథం అక్టోబరు 1969)
  • తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ చైతన్యం (తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం - 1972)
  • రచయితలెలా ఉండాలి? (అఖిల భారతీయుల రచయితల కాన్ఫరెన్స్, బెంగుళూరు 1974)
  • సహకార రంగంలో ప్రజాస్వామ్య సోషలిజం (సహకార పత్రిక హైదరాబాదు 15 ఆగస్టు 1972)
  • రాజకీయ పటంలో బంగ్లాదేశ్ (ఆంధ్రప్రభ 18 ఏప్రిల్ 1971)
  • స్వరయోగం (ఆంధ్రపత్రిక 18 ఏప్రిల్ 1971)
  • స్వరయోగం (ఆంధ్రపత్రిక 9 మార్చి 1983, 6 నవంబరు 1983, 20 నవంబరు 1983)
  • ది యోగ సాధన ఆఫ్ బాపూజీ (ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2 అక్టోబరు 1985)
  • ది పయనీర్స్ ఇన్ యోగ రీసెర్చ్ (దక్కన్ క్రానికల్ 3 ఫిబ్రారి 1985)
  • యోగ థెరపి సీరియల్ (న్యూస్ టైమ్స్ 3 డిసెంబరు 1990 నుండి 22 జూలై 1991)
  • ప్రవాసాంధ్రలో ప్రసిద్ధ తెలుగు యోగులు (తెలుగు వెలుగు జనవరి 1982)
  • తెలుగు యోగులు - వారి సంప్రదాయాలు (తెలుగు వెలుగు - ప్రపంచ మహా సభలు మద్రాసు రీజన్ 1975)
  • భారతీయ యోగ తత్వము విశ్వహిందూ కాన్ఫరెనన్స్ తిరుపతి 1975
  • తెలుగు యోగులు - తెలుగు విశ్వవిద్యాలయం 1992
  • ప్రపంచీకరణ - తెలుగు యోగ సాహిత్యం - దశ దిశ - రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, తెలుగు పున్నమి - విజయవాడ 2011
  • తెలుగు నాట మరుగుపడిన స్వరయోగ కళ - నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు - తెలుగువాణి ప్రత్యేక సంచిక - తిరుపతి - పుట 554 - 558

ఆకాశవాణి కార్యక్రమాలు[మార్చు]

వెంకటరెడ్డికి ఆకాశవాణి - రేడియోలో తొలి ప్రవేశం 1984లో అమరవాణి కార్యక్రమం ద్వారా కలిగింది. అప్పటి నుండి ఆకాశవాణి హైదరాబాదు - కుటుంబ సంక్షేమ శాఖ కనీసం సంవత్సరమునకు రెండు కార్యక్రమాలకు పిలుస్తూ ఉంది. వాటిలో కొన్ని:[11]

  • అమరవాణి - 20 నవంబరు 1984
  • గృహవైద్యం - 21 అక్టొబరు 1985, 14 జూన్ 1987
  • సామాన్య మానవునికి యోగాభ్యాసం - 26 జూన్ 1987, 27 జూన్ 1987.
  • ఆరోగ్యానికి - యోగ - 24 ఆగస్టు 1987.
  • యోగ-వ్యాయామానికి పోలిక - 18 సెప్టెంబరు 1987.
  • గురుదేవోభవ - 7,8,9 సెప్టెంబరు 1987
  • సంస్థ కార్యకలాపములు - 2 నవంబరు 1987
  • యోగాభ్యాసం - 3 ఫిబ్రవరి 1988
  • యోగాభ్యాసం వల్ల ఉపయోగాలు - 10 అక్టోబరు 1986.
  • యోగ పుట్టుక - 4 జూలై 1989
  • యోగ ద్వారా మానసిక ఆరోగ్యం - 25 జూలై 1989
  • యోగ చికిత్స - 25 జూలై 1990
  • ఆరోగ్యానికి పేటెంటు హక్కులకుసంబంధం ఇంటర్వ్యూ - 11 నవంబరు 2010
  • మన ఆరోగ్యం, యోగతో ఆరోగ్యం-యోగభ్యాసం-నియమాలు - 1 జూలై 2011
  • పిల్లలకు యోగభ్యాసం ఆవశ్యకత ఇంటర్వ్యూ - 7 ఆగస్టు 2012
  • తెలుగునాట మరుగు పడుతున్న స్వరయోగ కళ ఇంటర్వ్యూ 6 మార్చి 2013

బుల్లి తెర కార్యక్రమాలు[మార్చు]

వెంకట రెడ్డి యోగాభ్యాసములు, ఆరోగ్యం వంటి అంశాలపై వివిధ టెలివిజన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వాటిలో కొన్ని:[11]

  • యోగ పుట్టుక - యోగాభ్యాసములు (26 డిసెంబరు 1982), సంస్థ కార్యక్రమాలు-దూరదర్శన్ (27 ఆగస్టు 1984), ఇంటర్వ్యూ యోగ (19 అక్టోబరు 1987), ప్రపంచ ఆరోగ్య సంస్థ (6 ఏప్రిల్ 1988), సామాజిక కవులు-వేమన (28 డిసెంబరు 1988) కార్యక్రమాలు దూరదర్శన్ లో ప్రసారమైనాయి.
  • ఈ-టీవీ లో తొలి ప్రసారం 1995లో సాధన-యోగానందం పేరుతో ప్రసారమయింది. ఈ కార్యక్రమంలో మేడపాటి ముఖలింగేశ్వరరెడ్డి, సుబ్బిరెడ్డి పాల్గొన్నరు. 16 నవంబరు 1995 నుండి 2000 వరకు సుమారు 150 ఎపిసోడ్స్ అందిచారు. ఈ టీవీ లో సుఖీభవ కార్యక్రమాలలొ 2001 నుండి 2009 వరకు 100 ఎపిసోడ్స్ నిర్వహించారు.
  • శ్రీ సుభాష్ పత్రి-పిరమిడ్ ధ్యానంపై జన విజ్ఞాన వేదిక వారితో లైవ్ లో 31 డిసెంబరు 2012 ఉదయం 9 గంటలకు పాల్గొని వాస్తవాలు యోగ ప్రపంచానికి చెప్పారు. టి.వి.9 వారే పిరమిడ్ ధ్యానంపైనే 3 జూన్ 2013 న ఇంటర్వ్యూ నిర్వహించారు.

రాష్ట్ర దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రంలో[మార్చు]

విద్యాశాఖలో ఒక భాగమైన ఈ సంస్థ రామాంతపూర్ కేంద్రంగా పనిచేస్తుంది. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విద్యలో యోగ విద్యను ప్రవేశపెట్టారు. రాష్ట్రమునకు ఒక యోగ సిలబస్ సంఘం ఏర్పరిచారు. అందులో వెంకట రెడ్డి సభ్యుడు. టెలీస్కూల్ ప్రోగ్రాం క్రింద 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు యోగ సిలబస్ ను పిల్లల చేతనే తీయించారు. వీటిని దూరదర్శన్ ద్వారా 1987 నుండి 1990 వరకు ప్రసారం చేసారు. ఈ కార్యక్రమాలలొ వెంకట రెడ్డితో పాటు మేడపాటి ముఖలింగేశ్వరరెడ్డి, మేడపాటి సుబ్బిరెడ్డి కూడా పాల్గొన్నారు. టెలిస్కూలు కార్యక్రమాలకు బాపు, ముళ్ళపూడి వెంకటరమణలు సహకారం ఇచ్చారు.[11]

యు.జి.సి ప్రోగ్రాం[మార్చు]

ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి యు.జి.సి దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం యోగపై ఒక ఎపిసోడ్ నిర్మించారు. దీని పేరు "మీ ఆరోగ్యం -మీ చేతుల్లో". ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డితో పాటు సుబ్బిరెడ్డి కూడా పాల్గొన్నారు. [11]

అంతర్జాలంలో[మార్చు]

అంతర్జాలానికి యోగముపై డాక్టర్, సాఫ్టువేర్ నిపుణులైన రావు.యన్.నండూరితో కలిపి 9 వ్యాసాలను వెంకటరెడ్డి అందించారు.

పురస్కారాలు, గౌరవాలు[మార్చు]

  • 1982 మార్చి 23 : యోగములో అత్యంత ప్రతిభావంతమైన యువకుల అవార్డు: సికింద్రాబాద్ జైసీస్ సంస్థ.
  • 1982 అక్టోబరు 23: యోగములో అత్యంత ప్రతిభావంతమైన యువకుల అవార్డు: విశాఖపట్నం జైసీస్ సంస్థ.
  • 1987 జనవరి 25 : యోగరత్న బిరుదు - ఆంధ్రప్రదేశ్ ఆకల్డ్ స్కారర్స్ అసోసియేషన్, చిక్కడపల్లి, హైదరాబాదు.
  • యోగాచార్య: విశిష్ట యోగాచార్య సమితి-పాడిచ్ఛేరి సంసద్ గజిట్ నెం.87, తే1987 అక్టోబరు 4.
  • యోగమహారత్న : విశిష్ట యోగాచార్య సమితి-పాడిచ్ఛేరి సంసద్ గజిట్ నెం.87, తే1987 అక్టోబరు 4.
  • ఎఫ్.ఐ.సి.ఎ (ఫెలోషిప్ ఇన్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆయుర్వేద) లాంచెస్టర్, అమెరికా, 1990 సెప్టెంబరు 15.
  • యోగశిరోమణి : స్టార్ ఆస్ట్రొలాజికల్ రీసెర్చ్ సెంటర్, జ్యోతిష పరిషత్, హైదరాబాదు - 1996 జనవరి 1.
  • ఆంధ్రప్రదేశ్ గవర్నరుకి యోగచికిత్సా నిపుణునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వు (జి.ఓ.ఆర్.టి నెం.3910, సాధారణ పరిపాలనాశాఖ తే.08.09.0992 దీ) ప్రకారం నియమితులైనారు. భారతదేశ యోగరంగ చరిత్రలో ఇదే తొలి నియామకం.

విదేశీ పర్యటనలు[మార్చు]

  • 3వ ప్రపంచ యోగ, ఆయుర్వేద, సంప్రదాయ విజ్ఞాన సదస్సు ఇటలీ దేశంలోని మిలాన్ వద్ద 1989 మే నెల 27 నుండి 30 వరకు జరిగింది. ఆంధ్రప్రదేశ్ యోగాధ్యయన పరిషత్ ప్రతినిధిగా అతను సంచాలకులు, ప్రభుత్వ వేమన యోగ పరిశోధనా సంస్థ ద్వారా ప్రభుత్వంచే పంపబడ్డారు. ప్రసిద్ధ హఠయోగ గ్రంథం " హఠ ప్రదీపికలో ఆయుర్వేదాంశములు" పరిశోధనా పత్రం చదివారు. 10 రోజుల పర్యటనలో వాటికన్ సిటీని సందర్శించారు.
  • ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రెలిజియన్, పారా సైకాలజీ 18వ సమావేశం టోక్యో నగరంలో 1990 సెప్టెంబరు 15న జరిగింది. ఈ సమావేశానికి ప్రముఖ పారాసైకాలజిస్టు డా.హిరోషి మెటోయామా ఆహ్వానంపై ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ "చక్ర ది బ్రిడ్జ్ తొ ఫ్రీడం అండ్ లిబరేషన్" పై ఉపన్యాసం చేసారు. దీనిని జపాన్ భాషలోనికి అనువాదం చేసారు. డా.హిరోషీ మొటోయామా తను కనిపెట్టిన ఎ.ఎం.ఐ, చక్రా మెషీన్ లలో వెంకటరెడ్డి మణిఫూరక చక్రంపై పరిశోధన చేసి నివేదిక ఇచ్చారు. (జర్నల్ ఆఫ్ రిలిజియన్ అండ్ సైకాలజీ , టోక్యో వాల్యూం నెం. 16-2,నెం.40, 1992 పుట-18)

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Yoga Legend Prof.Venkatareddy(Success Story). విజయవాడ: Paramedix mundadugu magazine. 2016-06-01. p. 16.
  2. Śrinivasabhaṭṭa; Reddy, Medapati Venkata (1982). Haṭharatnāvalī (in ఇంగ్లీష్). M. Ramakrishna Reddy-అర్తమూరు-తూర్పుగోదావరి జిల్లా.
  3. "BULLETIN OF THE INDIAN INSTITUTE OF HISTORY OF MEDICINE (BIIHM) | Central Council for Research in Ayurvedic Sciences, Ministry of AYUSH, Government of India". www.ccras.nic.in. Retrieved 2019-01-06.
  4. Venkata Reddy, M (1987). Telugu yōgulu (in Telugu). Artamūru, Tūrpu Gōdāvari Jillā: Mēḍapāṭi Rāmakr̥ṣṇāreḍḍi.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  5. Gaṇapanārādhya; Venkata Reddy, M (1988). Svaraśāstramañjari: dvipada kāvyamu (in Telugu). Ārtamūru, Tūrpugōdāvarijillā: Mēḍapāṭi Rāmakr̥ṣṇāreḍḍi.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  6. "Yogic Therapy by M. Venkata Reddy, ISBN 8190104306 at Mlbd Books". www.mlbd.com. Retrieved 2019-01-06.[permanent dead link]
  7. Veṅkaṭareḍḍi, Mēḍapāṭi; Nanduri, Rao G; Waters, Harry (2005). Yoga for cyber world. Arthamuru, East Godavari Dist., A.P., India: M.S.R. Memorial Yoga Series. ISBN 9788190104319.
  8. Reddy, Medapati Venkata (2008). Vēmanayōgi dhyānamulu. M.S.RSmāraka Yōga Sirīs. ISBN 9788190104333.
  9. అర్తమూరు గ్రామ చరిత్ర (free) (Arthamuru Grama Charitra - free ) By M Venkata Reddy - తెలుగు పుస్తకాలు Telugu books. Archived from the original on 2018-12-22. Retrieved 2019-01-06.
  10. samanya yoga vidhanakramaM (PDF). Amaravathi: commissioner, AYUSH. 2016. p. 52. Archived from the original (PDF) on 2018-12-20. Retrieved 2019-01-06.
  11. 11.0 11.1 11.2 11.3 11.4 అర్తమూరు గ్రామ చరిత్ర - ఎం.వెంకటరెడ్డి. అర్తమూరు: ఎం.ఎస్.ఆర్ మెమోరియల్ యోగా సిరీస్. 2015. p. 327. ISBN 81-9010435-7.

బయటి లంకెలు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.