రాధశ్రీ
రాధశ్రీ | |
---|---|
జననం | దిడుగు అనంత వేంకట రాధాకృష్ణ ప్రసాద్ అక్టోబరు 19, 1958 గుంటూరు జిల్లా పిడుగురాళ్ల |
ఉద్యోగం | ప్రభుత్వ రంగ బ్యాంక్ లో ఛీఫ్ మేనేజరు |
ప్రసిద్ధి | కవి, పద్య ప్రచారకుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | కరణం అమృతలక్ష్మి |
పిల్లలు | కావ్యభావన, కవితాచేతన |
తండ్రి | దిడుగు కోటయ్య |
తల్లి | దిడుగు వీరమ్మ |
రాధశ్రీ వర్తమాన పద్యకవులలో సుప్రసిద్ధుడు.
జీవిత విశేషాలు
[మార్చు]రాధశ్రీ అనే కలంపేరుతో సాహిత్యలోకానికి పరిచితుడైన ఇతని అసలు పేరు దిడుగు అనంత వేంకట రాధాకృష్ణ ప్రసాద్. ఇతడు 1958, అక్టోబర్ 19వ తేదీ దుర్గాష్టమి పర్వదినాన గుంటూరు జిల్లా, పిడుగురాళ్లలో కోటయ్య, వీరమ్మ దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించాడు. ఇతని బాల్యం పిడుగురాళ్ల, ఓబుళేసునిపల్లె,దుర్గి గ్రామాలలో గడిచింది. నరసారావుపేటలో బి.కాం., చీరాలలో ఎం.కాం. చదివాడు. ఇతడు ఎం.ఎ., ఎం.కాం ., చదివాడు. వాణిజ్యశాస్త్రంలో డాక్టరేటు సంపాదించాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంకర్స్లో సర్టిఫైడ్ అసోసియేట్గా ఎంపికయ్యాడు. సిండికేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం కర్నూలులోని సిండికేట్ బ్యాంక్ గ్రామీణ స్వయంఉపాధి శిక్షణా కేంద్రానికి డైరెక్టరుగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య కె.అమృత లక్ష్మి కూడా బ్యాంకు ఉద్యోగి. వీరికి కావ్యభావన, కవితాచేతన అనే కుమార్తెలు ఉన్నారు.[1]
సాహిత్యరంగం
[మార్చు]ఇతడు వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగి అయినా, చదివింది వాణిజ్య శాస్త్రమైనా సాహిత్యం పట్ల మక్కువతో 1975 నుండి సాహిత్యవాసంగం చేస్తునాడు. నన్నయ మొదలుకొని నారాయణరెడ్డి వరకు ప్రశస్తమైన కవిత్వాన్ని ధారాపాతంగా పఠిస్తూ కవితా ప్రవాహం పేరుతో అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. ఆశువుగా అనేక పద్యాలను చెప్పడం, పద్యాలతో సంభాషించడం ఇతని ప్రత్యేకత. ఇతడు అనేక కావ్యాలు, శతకాలు రచించాడు. పలు సంస్థలు ఇతడిని సన్మానించాయి. ఇతడు 2008, అక్టోబరు 19వ తేదీన 12 గంటలు నిర్విరామంగా పద్యధారణ చేసి రికార్డు సృష్టించాడు.
రచనలు
[మార్చు]ఇతని రచనలు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్, విశాలాంధ్ర, వార్త, మహోదయ, శుభోదయ, శివజ్యోతి, మధుమంజరి, భక్తి - ముక్తి, రామదర్శనం, ఉజ్వల, ఎక్స్రే, విశ్వసాహితి, సలహా, రెడ్డి జ్యోతి, సప్తగిరి, రెడ్డి పరివార్, విశ్వసాయి, సన్ఫ్లవర్, తెలుగు తేజం, కాలజ్ఞానసుధ, ప్రజాసాహితి, సువర్ణరేఖ, సాహిత్యకౌముది, సుజనవాణి, ఆదర్శవాణి, సాక్షి, ఆంధ్రభూమి, శ్రీకారం, పంచాయతీరాజ్యం, తెలుగు సీమ, వేదిక, ప్రమిద, మహాతి, మూసీ, యజ్ఞజ్యోతి, జాగృతి, స్వాతి, భారతీయమార్గం, యువభారతి, భక్తిరంజని, ధ్యానమాలిక, హిందూ వరల్డ్, సహస్రార, మల్లెతీగ, మోక్షం, ముందడుగు, గెలుపు, మనజ్యోతి, ప్రియజనని, చదువు, సౌందర్యభారతి, భావతరింగిణి, భావవీణ, చేతన, సూర్యశక్తి, సాహితీసుధ, తెలుగు విద్యార్థి, కళ - సత్కళ, తెలుగువెలుగు, శాలివాహన, సాహిత్యప్రస్థానం, బుద్ధభూమి, నేటినిజం, సూర్య, చైత్యన్యకవిత, వాసవీస్రవంతి, నెలవంక - నెమలీక, యోజన, లహరి, గురుపూజ, విశాలభారతి, ప్రణవవేది, ప్రజా అక్షరం, అంతర్వాణి, కళాదీపిక, జయప్రద తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతడు 42కు పైగా గ్రంథాలను రచించాడు. వాటిలో 27 గ్రంథాలు ప్రచురింపబడ్డాయి. ఇతడు అనేక మంది కవుల గ్రంథాలకు ముందుమాటలు రచించాడు. పెక్కు సావనీర్లలో పద్య ఖండికలను ప్రకటించాడు.
ఇతని ముద్రిత గ్రంథాల వివరాలు:
- ఆర్య చాణక్య
- తారామతి - ప్రేమావతి
- చౌడేశ్వరీ శతకం
- కవితా కృష్ణవేణి
- రాధశ్రీ రత్నశతం
- పెరుమాళ్ల శతకం
- విజ్ఞానగీత
- నరసింహ శతకం
- చెన్నప్ప ద్విశతి
- చెన్నప్ప శతకం
- విశ్వనాథ శతకం
- ఇది నా తెలుగు నేల
- వర్గల్ వాణీ శతకం
- నాగలింగ శతకం
- సత్యసాయి శతవసంతము
- రాధశ్రీ రసరుక్కులు
- శశిమౌళి శతకం
- బాలభక్తులు
- కాళీమాత శతకం
- కలకత్తా సౌరభాలు
- కర్నాటి లింగయ్య జీవనరేఖలు
- గోవిందస్మృతి
- పూర్ణచంద్రమౌళి
- ఆత్మీయుడు
- సినారె శతకం[2],[3]
- సందేహాలు సమాధానాలు
- కామ్రేడ్ రెడ్డి
సన్మాన సత్కారాలు
[మార్చు]ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ భాషా సేవా పురస్కారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అందుకున్నాడు.[4] ఇతడిని ఆంధ్రరాష్ట్రాలలోని పలు సంస్థలు సత్కరించి గౌరవించాయి. వంశీ ఆర్ట్స్ (హైదరాబాద్), సాధన సాహితీసమితి (హైదరాబాద్), విశ్వశాంతి (ఒంగోలు), తేజా ఆర్ట్స్ (ఆలేరు), కలకత్తా ఆంధ్రసంఘం, పద్యసాహిత్య పరిషత్ (హైదరాబాద్), సాహితీ స్రవంతి (భద్రాచలం), వావిలాల సాహితీ సంస్థ (సత్తెనపల్లి), లలితకళాసమితి (కర్నూలు), శ్రీనాథ పీఠం (గుంటూరు), అభ్యుదయ భారతి (నరసరావుపేట), కర్నూలు జిల్లా తెలుగు రచయితల సంఘం, బాంబే ఆంధ్ర మహాసభ, రాయలసీమ విశ్వవిద్యాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయం తదితర సంస్థలు ఇతడికి పురస్కారాలు, బహుమతులతో సత్కరించాయి.
బిరుదులు
[మార్చు]- కందకవి సార్వభౌమ
- కవన కోకిల
- ధారణా భారతి
- ధారణావాచస్పతి
- పద్యధారణా ప్రహేళి
- పద్య ప్రచార పారావార పారీణ
- పద్యభాషి
- పద్యమౌళి
- భువన భారతీ భూషణ
- సాహితీ యువరత్న
రచనల నుండి ఉదాహరణ
[మార్చు]తన రచనా పథాన్ని, దృక్పథాన్ని గురించి తన మాటల (పద్యాల) లోనే:
పద్యమె నా పరమాన్నము
పద్యమె నా పసిడిమేడ - భాస్వంతంబౌ
పద్యమె నా పట్టువలువ
పద్యమె నా మానసంబు పరికింపంగన్
పలుకు పలుకున పద్యమే పల్లవింప
పలుకు పలుకున పద్యమే పరిమళింప
పలుకు పలుకున పద్యమే పరవశింప
పద్యమందున మాటాడు ప్రతిన నాది
పద్యములో మాట్లాడెద
పద్యమె నైవేద్య మనుచు భగవానుని - నే
హృద్యముగా పూజించెద
విద్యాధికులెల్ల మెచ్చ వినయాంజలినై
వాడుక భాషను నేనిక
వాడెద పద్యాలలోని వాడిని తెలుపన్
నేడే కవిపండితులను
వేడెద సంక్లిష్ట పథము వీడుటకొరకై
మూలాలు
[మార్చు]- ↑ జంధ్యాల, రఘుబాబు (9 May 2016). "కర్నూలు కవనం - అభ్యుదయ పథ కందశ్రీ డా.రాధశ్రీ". ప్రజాశక్తి దినపత్రిక కర్నూలు ఎడిషన్.
- ↑ "ఆంధ్రజ్యోతి దినపత్రికలో సినారె శతకం ఆవిష్కరణకు సంబంధించిన వార్త". Archived from the original on 2017-02-11. Retrieved 2017-02-11.
- ↑ "సాహితీ కెరటాలు - పద్యకవిత్వంలో అగ్రేసర కవి డా.రాధశ్రీ". నేటి నిజం దినపత్రిక. 11 December 2014.
- ↑ "ఏపీలో తెలుగు భాషా దినోత్సవం". Archived from the original on 2017-02-11. Retrieved 2017-02-11.