వినయాశ్రమం

వికీపీడియా నుండి
(వినయాశ్రమము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వినయాశ్రమం
—  గుంటూరు జిల్లా, కావూరు గ్రామం  —
కావూరు వినయాశ్రమం
కావూరు వినయాశ్రమం
కావూరు వినయాశ్రమం
వ్యవస్థాపకులు గొల్లపూడి సీతారామశాస్త్రి, తుమ్మల బసవయ్య, తుమ్మల దుర్గాంబ

జాతి పునర్నిర్మాణ కార్యక్రమాలకు రూపకల్పనగా, దేశ స్వాతంత్ర్య సాధనకు ఆలంభనగా తుమ్మల బసవయ్య,దుర్గాంబ దంపతుల దాతృత్వానికి మారుపేరుగా గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు గ్రామం లోఈ వినయాశ్రమం 1933 లో స్థాపించబడింది. స్వాతంత్ర్య పోరాటంలో అనేకమందికి స్ఫూర్తిని ఇచ్చింది.

ఆశ్రమ స్ధాపన[మార్చు]

మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమం 1930 లో మొదలుపెట్టినపుడు, ఆంధ్రలో జాతీయోద్యమ స్ఫూర్తిని రగుల్కొలిపేందుకు శిబిరాలను నెలకొల్పదలచారు. ఆ విధంగా మూడు చోట్ల ఆశ్రమాలను ఏర్పాటు చేసారు. కృష్ణా జిల్లాలో కోమరవోలు లో యెర్నేని సుబ్రహ్మణ్యం గారిచే గాంధీ ఆశ్రమం, నెల్లూరు జిల్లాలో పల్లిపాడు వద్ద పినాకినీ సత్యాగ్రహాశ్రమం, గుంటూరు జిల్లాలో కావూరులో వినయాశ్రమం ఏర్పాటు చేసారు. ఈ ఆశ్రమాలు నిరాడంబరత్వానికి ప్రతీకగా,గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఉంటూ ప్రజల సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డాయి.

స్వాతంత్ర్య యోధులు గొల్లపూడి సీతారామశాస్త్రి గారి ప్రొద్బలంతో తుమ్మల బసవయ్య, తుమ్మల దుర్గాంబ దీనిని నిర్మించారు. తుమ్మల బసవయ్య, దుర్గాంబ దంపతులు తమ యావదాస్థినీ ఈ ఆశ్రమానికి అర్పించారు.సీతారామ శాస్త్రి గారు తనకున్న ఒక ఎకరం భూమిని, జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారు 26 ఎకరాల భూమిని ఈ ఆశ్రమానికి దానం ఇచ్చారు. 65 ఎకరాల స్థలంలో ఈ ఆశ్రమం నెలకొని ఉంది.

మహాత్మా గాంధీ సందర్శన[మార్చు]

మహాత్మాగాంధీజీ చేతులమీదుగా 1933 డిసెంబరు 23 తేదీన ఈ ఆశ్రమం ప్రారంభమైనది. స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా గాంధీజీ హరిజన యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ కల్లూరి చంద్రమౌళి వినతి మేరకు వినయాశ్రమంలో రెండురోజులు గడిపినారు. ఇక్కడ ఉండి ప్రజలలో స్వాతంత్ర్య ఉద్యమం గురించి ప్రేరణ కలిగించారు. ఆనాడు ఆయన నాటిన రావి మొక్క నేడు మహావృక్షమైనది. హరిజనులచేత దేవాలయ ప్రవేశం చేయించాడు.

బాపుజీ రెండవసారి 1937 జనవరి 23 న వినయాశ్రమం సందర్శించాడు. ఆ సంవత్సరం వచ్చిన తుపాను బీభత్సం తరువాత ప్రజలను పరామర్శించేందుకు గుంటూరు జిల్లాను సందర్శించాడు. తెల్లవారు ఝామున 4 గంటలకు కావూరు చేరుకుని వినయాశ్రమంలో తుపాను బాధితుల కోసం విరాళాలు సేకరించాడు. ఆ రోజున గుంటూరు, విజయవాడల్లో జరిగిన సభల్లో గాంధీజీ మాట్లాడుతూ "వినయాశ్రమంలో, చుట్టూ చీకట్లు ముసిరిన ఆ సమయంలో వందలమంది స్త్రీ పురుషులు నన్ను చూసేందుకు ఆతురతతో వేచి ఉన్నారు. నేను అక్కడ భిక్షాటన మొదలు పెట్టగానే, సొమ్ములు ఇవ్వని ఆడమనిషి గాని, మగమనిషి గానీ ఒక్కరు కూడా లేరక్కడ. కొందరు సోదరీమణులు తమ నగలు ఇచ్చేసారు"[1] అన్నారు.

ఈ ఆశ్రమంలో గాందీజీ అనుచరురాలు మీరా బెన్ చేత 1935లో స్వరాజ్య స్థూపం ఆవిష్కరింపజేశారు

వినయాశ్రమం తో అనుభంధం ఉన్న ప్రముఖులు[మార్చు]

స్వామి సీతారాం, తుమ్మల బసవయ్య, తుమ్మల దుర్గాంబ, జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి, ఆచార్య ఎన్,జి, రంగా, భారతి దేవి రంగా.

కల్లూరి చంద్రమౌళి, కల్లూరి తులశమ్మ, కొడాలి కమలాంబ,

వినయాశ్రమం రజితోత్సవలు 1959 లో జరిగినప్పుడు అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాదు గారు ముఖ్య అతిధిగా వచ్చారు.

ఎన్.జి.రంగా కృషి విజ్ఞాన కేంద్రం[మార్చు]

ఆశ్రమ స్థాపకులు నిర్వాహకులైనా స్వామి సీతారాం గారు 1960 ఏప్రియల్ 9న, తుమ్మల బసవయ్య గారు 1971 సెప్టెంబరు 17 న మరణిచారు. వీరి ధర్మపత్ని తుమ్మల దుర్గాంబ గారు 1984 నవంబరు 26 తేదీన మరణించారు. ఆ తరువాత ఆశ్రమం నిర్వహణ కుంటు పడింది.

1984లో ఆశ్రమ స్థలం నుండి కొంత భాగాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బాలికల గురుకుల పాఠశాలకు కేటాయించింది. ఆ తరువాత రైతుబాంధవుడు ఆచార్య ఎన్.జి.రంగా పేరుతో వినయాశ్రమంలో, కృషి విజ్ఞానకేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసికొన్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సహకారంతో 1992లో, "ఎన్.జి.రంగా కృషి విజ్ఞాన కేంద్రం" ఏర్పాటయినది.

ఈ కేంద్రంలో ప్రధానంగా వ్యవసాయ, వ్యవసాయేతర వృత్తివిద్యలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టినారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేర్చేటందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. మొదట్లో ఈ కేంద్రములో సాగుశిక్షణ కార్యక్రమాలు చేపట్టినారు. వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించటం, కిసాన్ మేళాలు, రైతు సదస్సులు, రైతు దినోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 2008 వరకు పకడ్బందీగా అమలుపరచిన పలు పథకాలకు పురస్కారాలు వరించినవి. ఉత్తమ పనితీరుతో దేశంలోనే మూడోదిగా గుర్తింపు తెచ్చుకున్నది. ఇక్కడ శిక్షణ తీసికున్న రైతులు జాతీయస్థాయిలో ఎన్నో ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. మహారాష్ట్ర నుండి వానపాములనుతెచ్చి, ఎరువును తయారుచేసిన మొదటి కేంద్రం ఇదే. పంజాబునుండి తెచ్చిన తేనెటీగలతో తేనెపరిశ్రమ, మల్బరీ ఆకులను పెంచడం ద్వారా పట్టుపరిశ్రమ అభివృద్ధికీ, బి.టి.ప్రత్తి విత్తన ప్రదర్శన, 2716 వరివంగడాల అభివృద్ధి, ఇక్కడే జరిగినవి.

ఇంతటి ప్రాధాన్యం ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం ఆధిపత్య పోరులో మూతబడింది. ఇక్కడ కార్యక్రమాలు నిలిచిపోవడంతో భవనాలు శిథిలమైనవి. నేడు ఇది ఆలనాపాలనకు దూరమైనది.[2]

మూలాలు[మార్చు]

  1. "Mahatma Gandhi collected works Vol-70" (PDF)" (PDF). p. 354. Retrieved 30 జూన్ 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. ఈనాడు గుంటూరు రూరల్ (అక్టోబరు 29, 2014). "వినయాశ్రం ధర్మ శాసనానికి పాతర".